Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 21

   
    "నాపేరు అనంగ్. ఏదో కొద్దిగా బిజినెస్ వుంది. నవలలు కూడా రాస్తూంటాను."
    "ఏమిటేమిటి ప్రఖ్యాత నవలా రచయిత అనంగ్ గారు మీరేనా?" మీ నవలలు నాలుగైదు సినిమాలు కూడా వచ్చాయి కదూ!"
    ఇంత మారుమూల అడవిలో సహితం రచయితగా తన్ని గౌరవించే వ్యక్తి- అదీ ఖరీదైన వ్యక్తి దొరికినందుకు చాలా సంతోషించాడు అనంగ్.
    "అవునండీ! ఇంకో అయిదారు నవలలు సినిమాలుగా రాబోతున్నాయి." యధాలాపంగా అన్నట్లు చెప్పాడు.
    "గ్లాడ్ టు మీట్ యు, నాపేరు రాజభూషణం, ఫారెస్టు కంట్రాక్టరుని, మా బంధువర్గంలో చాలా మంది గవర్నమెంటులో వున్నారు." గొప్పగా చెపుతూ చెయ్యి జాపాడు. ఆప్యాయంగా ఆ చెయ్యి అందుకున్నాడు అనంగ్.
    "ఇంతకీ మీరీపల్లెటూరికి ఎందుకొస్తున్నారో చెప్పనేలేదు."
    "ట్రైబల్ లైఫ్ మీద నవలొకటి ప్లాన్ చేసాను. ఏదో ఆషామాషీగా వ్రాయడం నాకిష్టంలేదు. ఏ విషయమైనా సరే క్షుణ్ణంగా పరిశోధించి- మరీ రాస్తాను. అందుకే ఈ అడవిలోకి వచ్చాను. అదృష్టం బాగుండి మీరు కలిశారు."
    "ఆహ్హహ్హ" అని ఉల్లాసంగా నవ్వాడు రాజభూషణం. ఈ ట్రైబల్స్ గురించి రాయడానికే ముంటుందండీ! మన్నూ - మశాసమునూ! కొన్ని రకాల ఇంగ్లీషు మేగజైన్సులో ఆఫ్రికా అడవుల్లోని ట్రైబల్స్ గురించి వాళ్ళ వింత వింత ఆచారాల గురించి అద్భుతమైన విషయాలు రాస్తారు. అవి సేకరించి రాయండి. పాఠకులు పరమానందంగా చదువుతారు."
    "ఆఫ్రికన్ అడవుల్లో ట్రైబల్స్ జీవితాలతో మన ట్రైబల్స్ జీవితాలు కలుస్తాయంటారా?"
    "ఏ లైఫ్ ఎలా వుంటుందో- తెలుగు పాఠకుల్లో ఎంతమందికి తెలుసు? తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ఎంత మందికి? ఏదేనా అద్భుతంగా- వింతగా- గమ్మత్తుగా వుంటే పాఠకులు మెచ్చుకుంటారు. సాదాసీదాగా రాస్తే ఎవడిక్కావాలి?"
    "ఈ సలహా బాగుంది. అలాంటి మేగజైన్స్ ఎక్కడ దొరుకుతాయో ప్రయత్నిస్తాను."
    "మేగజైన్స్ దొరక్కపోయినా ఫరవాలేదు. ఆఫ్రికన్ ట్రైబల్ లైఫ్ మీద అద్భుతమైన నవలలు కొన్ని వచ్చాయి ఇంగ్లీషులో, అవి చూడండి పోనీ"
    "ఈ అయిడియా కూడా బాగుంది. అయితే అలాంటి వాటిల్లో చాలా సీన్స్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్ లు ఉపయోగించేసుకున్నారనుకుంటాను. అయినా ఫరవాలేదు. ఎప్పటికప్పుడు ఈ రకమైనవి కొత్త కొత్తగా వస్తూనే వుంటాయి. ఇంతకీ ఆ రైటర్స్ అయినా నిజం చెప్తున్నారో లేదో మనకి తెలియదు. నిజమైతేనేం- అబద్దమైతేనేం- థ్రిల్లింగ్ గా వుంటే చాలు."
    "బాగా చెప్పారు పగలంతా మీ స్టడీస్ ఏవో పూర్తిచేసుకుని సాయంకాలానికి రెడీగా వుండండి. మా జీప్ పంపిస్తాను. రాత్రి మా గెస్ట్ హవుస్ లో పడుకుందురుగాని."
    "థాంక్యూ."
    "ఈ రోజుల్లో ఈ ట్రైబల్స్ లో ఎవరూ వెనకటి రోజుల్లోలాగ అమాయకంగా లేరండీ. అందరూ తెలివి మీరిపోయారు. పనిదగ్గిర మొరా యిస్తారు. దొంగతనాలకి లెక్కేలేదు. బయటనుంచి కూలీలని తెప్పించుకోకుండా నానాగొడవా చేస్తారు. ఏమిటో కొందరు రచయితలు మేమే వీళ్ళనేదో బాధలు పెట్టేస్తున్నట్టుగా రాసేస్తారు. చూస్తారుగా మీకే అర్ధమౌతుంది."
    జీప్ కనుకునూర్ దగ్గిర ఆగింది. "అవిగో! ఆ కనపడే గుడిసెలే మీరు చూడాలనుకుంటున్న పల్లెటూరు" చెప్పాడు రాజభూషణం.
    థాంక్స్ చెప్పి జీప్ దిగాడు అనంగ్.
    "సాయంత్రానికి రెడీగా వుంటారుగా," అడిగాడు రాజభూషణం.
    "ఓకే." అనంగ్ ఊళ్ళో కొచ్చేసరికి మృదుల, ఆమె స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. ఊళ్ళో జనం ఆడ-మగ అందరూ వాళ్ళచుట్టూ ఉన్నారు వీళ్ళూ, వాళ్ళలో ఒకరన్నట్టు కలిసిపోయి మాట్లాడుతున్నారు. కథల్లో వర్ణించినట్లు మగవాళ్ళల్లో ఎవరూ ఒట్టి గోచీలలో లేరు. యువకులంతా పాంట్స్ షర్ట్స్ లోనే వున్నారు. పెద్దవాళ్ళలో మాత్రం బాగా ముసలివాళ్ళు అతికొద్దిమంది పాత ధోవతులు. మోకాళ్ళవరకూ కట్టుకుని తిరుగుతున్నారు. వేషంలో నాగరికత ఉన్నంత మాత్రాన వాళ్ళు సుఖంగా వున్నారని చెప్పడానికి వీల్లేదు. ఆ పరిసరాల్లో దారిద్రదేవత భీకరంగా నృత్యం చేస్తూనే వుంది. మట్టి గుడిసెలు, తాటాకుల కప్పులు. ఈ గుడిసెలకి కాస్త దూరంలో ఏనాడో ఎవరో మంత్రిగారు వీళ్ళకి వేరే ఇళ్ళు కట్టించి ఇవ్వడం కోసము చేసిన శంఖుస్థాపన తాలూకురాయి గుడిసెల్ని జాలిగా చూస్తోంది. జొన్నరొట్టెలు, కొన్ని ఇళ్ళల్లో అవీలేవు. చోడీ అంబలి ఇదే ప్రధానమైన ఆహారం. అప్పుడప్పుడు అడవుల్లోంచి దొంగతనంగా పట్టితెచ్చిన జంతువుల మాంసం వాళ్ళకి మంచి విందు. అయితే ఆ విందు తరచుగా దొరకదు. అలా దొంగతనంగా జంతువుని చంపి వాటి మాంసం ఇళ్ళకి తెచ్చుకోవడానికి వీళ్ళు చాలా యాతన పడవలసి వస్తుంది. గార్డులు మొదలుకొని మేస్త్రీలవరకు ఎవరికంట పడ్డా ఆ మాంసం లాగేసుకుంటారు. పడిన శ్రమకి వాళ్ళు తిట్టే బండబూతులే బహుమానము. ఇప్పటికీ మగవాళ్ళల్లో చాలామంది తాగుడు మానలేకపోతున్నారు. ఈ వ్యసనం అతి భయంకరంగా ఈ కుటుంబాల జవసత్వాలన్నిటినీ పీల్చి పిప్పిచేస్తోంది. ఇంత నిరాశలోనూ ఆశాకిరణం చిన్నపిల్లల్లో సగానికి పైగా చుట్టుప్రక్కల టౌన్సులో స్కూల్స్ లో జాయినయ్యి చదువుకోవడం. ఆ వూళ్ళో ఇదివరలో ఆడవాళ్ళుకూడా తాగేవారట. ఇప్పుడిప్పుడు యువతరంలో ఆడవాళ్ళు తాగడంలేదు. ముసలి వాళ్ళయినా మృదుల లాంటి వాళ్ళు వచ్చినప్పుడు తాగడం మానుకుంటున్నారు.
    "హల్లో!" అని పలకరించాడు అనంగ్.
    "హల్లో! శోవమ్మేది?"
    జరిగింది సగర్వంగా వివరించాడు. అది వింటూండగానే మృదుల ఆమె స్నేహితులు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. గ్రామవాసులంతా అనంగ్ ని వెలివేసినట్లు అతనికి ఎడంగా పోయి నిలబడ్డారు.
    "రండి! భోం చేద్దాము. ఆకలి దంచేస్తున్నా మీకోసమే ఆగాము" అంది మృదుల.
    "భోజనమా! వీళ్ళతోనా!" కంపరంగా అన్నాడు అనంగ్.
    మృదులచుట్టూ వున్న గిరిజనుల్లో చాలామంది రోషంగా చూసారు.
    మృదులమాత్రం నవ్వుతూ, "మేమంతా వీళ్ళతోనే తింటాం. మీ ఇష్టం మరి" అంది. బయట ఎండగావున్నా దట్టమైన చెట్లకింద చాలా చల్లగా వుంది. అక్కడ ఈతాకుల చాపలు పరుచుకుని భోజనాలకి కూర్చున్నారు. మృదుల, ఆమె స్నేహితులు వేరుగా ఒకేచోట కలిసి కూర్చోకుండా గిరిజనులతో కలిసిపోయి వాళ్ళల్లో ఒకరన్నట్టుగా కూర్చున్నారు.
    అనంగ్ ఒక్కడూ దూరంగా చెట్టుకింద రాతిమీద కూర్చున్నాడు. మృదులా వాళ్ళు వాళ్ళతోపాటు బ్రెడ్ జామ్- బిస్కెట్స్- టిన్డ్ ఫిష్ మొదలైనవి తీసుకొచ్చారు. అవి మిగిలినవాళ్ళందరికీ పంచి వాళ్ళు ఆఫర్ చేసిన జొన్న రొట్టెలు ఒద్దనకుండా తీసుకున్నారు. మృదుల స్నేహితురాలు ఒక జొన్నరొట్టి, బ్రెడ్ జామ్- బిస్కెట్స్ పేపర్ ప్లేట్ లో పెట్టి అనంగ్ కి అందిచ్చింది. జొన్నరొట్టి ఒదిలేసి మిగిలినవి తిన్నాడతను. భోజనాలు పూర్తయ్యాక తన డైరీ తెరిచి పెన్ చేత్తో పట్టుకుని, "ఇప్పుడు మీరు ఎదుర్కొంటూన్న సమస్యలేమిటో చెప్పండి" అన్నాడు. గిరిజనులు ఏ సమాధానమూ చెప్పకుండా మిఱ్ఱి మిఱ్ఱి చూసారు. మృదుల ఫక్కున నవ్వి, "అయ్యా! రచయిత గారూ! తమ సమస్యలేమిటో తెలుసుకోగలిగే దశలో వీళ్ళుంటే సమస్యలు లేకుండానే చేసుకోగలిగేవాళ్ళు. నిజంగా వీళ్ళ సమస్యలను తెలుసుకోవాలని మీకుంటే కనీసం వారం రోజులు వీళ్ళతో కలిసి జీవించండి, అంతకంటే వేరుమార్గం లేదు" అంది. టక్కున డైరీ మూసేసి. చెట్టుకింద రాతిమీద కూర్చున్నాడు. త్వరగా సాయంత్రమై భూషణంగారి జీప్ వస్తే బాగుండుననిపిస్తోందతనికి. మృదుల- ఆమె స్నేహితులు గిరిజన స్త్రీలలోంచి తెలివైనవాళ్ళని కొందర్ని సెలక్టు చేసి వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ యిప్పించి, మిగిలిన వాళ్ళకి చదువు చెప్పే బాధ్యత వాళ్ళకప్పగించారు. లాయర్ యశోధరాదేవి సహకారంతో ఈ రకమైన ప్రాజెక్టు చేపట్టి రెండేళ్ళు దాటింది. కొంత అభివృద్ధి సాధించారు కూడా. మృదుల- ఆమె స్నేహితులు ప్రత్యేకించి శిక్షణ పొందిన స్త్రీలతో మిగిలిన గిరిజనులకు చదువు చెప్పడంలోని సాధక బాధకాల్ని చర్చిస్తున్నారు. ఆ చర్చలలో యేమాత్రం ఆసక్తి కలగలేదు అనంగ్ కి. వీళ్ళల్లో ఆడవాళ్ళు- మగవాళ్ళు కలిసి ఒకరి చేతులొకరు పట్టుకుని డాన్స్ లు చేస్తారని విన్నాడు. అలాంటి డాన్స్ ప్రోగ్రామైనా వుంటే బాగుండుననుకొన్నాడు. సాయంత్రం నాలుగు గంటలకి మృదులావాళ్ళు తెచ్చిన పాలపొడి- టీ పొడి- పంచదారలతో టీలు తయారు చేసుకున్నారు. మృదుల ఆమె స్నేహితులు గిరిజనులలో ఒక భాగంగా కలిసిపోయి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అనంగ్ కి చాలా విసుగ్గా వుంది. చీకటి పడుతూంటే రాజభూషణం జీప్ వచ్చింది. జీప్ చప్పుడు వినగానే మంత్రం వేసినట్లు గిరిజనులందరూ మాటలు టక్కున ఆపేసారు.

    "రాజభూషణంగారు నన్ను తన ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి ఆహ్వానించారు. రాత్రి అక్కడ పడుకుని పొద్దున్నే వస్తాను" అన్నాడు అనంగ్. మృదులతో సహా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అనంగ్ వెళ్ళి జీప్ లో కూర్చున్నాడు.
    ఆ నిశ్శబ్దానికి అర్ధం ఆ రాత్రే తెలిసిపోయింది అనంగ్ కి. పాతికమంది యువకులు మొహానికి ఒంటికి నల్లగా ఏదో ద్రవం పూసుకుని గెస్ట్ హౌస్ మీద కొచ్చిపడ్డారు. గార్డ్ ని చావబాది గెస్ట్ హౌస్ లో జొరబడి, రాజభూషణాన్ని, అతడి ఇంకో ఇద్దరు స్నేహితుల్ని, అనంగ్ ని పడుకున్న మంచాలమీంచి కిందకిలాగి చావ చితగొట్టేసి వెళ్ళిపోయారు. అప్పటివరకు స్కాచ్, విస్కీ, విందులు, ఆనందించి మత్తుగా పడివున్న ఆ పెద్ద మనుష్యుల్లో ఎవరూ గట్టిగా ప్రతిఘటించలేకపోయారు. వాళ్ళదగ్గిర పిస్టల్స్ ఉన్నా ఉపయోగించలేకపోయారు. తెల్లవారేక పనిలోకి వచ్చిన ఫారిస్ట్ గార్డ్స్ ఒంటిమీద తెలివి లేకుండా ఉన్న పెద్ద మనుష్యులందరినీ జీప్ లో వేసుకుని కరీంనగర్ హాస్పిటల్ లో చేర్పించాడు. రాజభూషణం తండ్రి శేషాచలపతి వెంటనే పోలీస్ రిపోర్టు ఇచ్చాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కనుకునూర్ లో వున్న గిరిజనవాసులనందర్నీ ఆడ-మగ తేడా లేకుండా అరెస్టు చేశారు. శోవమ్మ, ఆమె స్నేహితులు మృదుల అరెస్టు వార్త వెంటనే కరదీపిక కార్యాలయానికి అందజేసారు. బొంబాయిలో వున్న లాయర్ యశోధరాదేవి వెంటనే ఆంద్రప్రదేశ్ రక్షణ మంత్రికి ట్రంక్ కాల్ చేసి మృదులని తక్షణం విడిపించమని, లేకపోతే విషయం చాలా దూరం వెళుతుందని హెచ్చరించింది. లాయర్ యశోధరాదేవి పేరు ప్రతిష్ఠలు భారతదేశంలో అందరికీ తెలుసు. మృదులలాంటి వ్యక్తిని అరెస్టు చేస్తే ఎంత గందరగోళం జరగడానికి అవకాశం వుందో రక్షణమంత్రి తేలిగ్గా ఊహించగలిగాడు. వెంటనే ఎస్.పి.కి ఫోన్ చేసి మృదులని విడిపించమని- తగిన రక్షణలో ఇంటికి పంపమని ఆర్డర్స్ ఇచ్చాడు. ఎస్.పి. ఖంగారుపడుతూ ఆ ఆర్డర్స్ ఎస్.ఐ.కి పాస్ చేసాడు. అయితే మృదుల మిగిలిన గిరిజనులందర్నీ విడిపిస్తే తప్ప లాకప్ రూమ్ లోంచి అడుగు బయటకు పెట్టనని మొండికేసి కూర్చుంది. మృదుల ఆమె స్నేహితులు ఏ థియేటర్ లోనో కూర్చున్నంత సంబరంగా పోలీసు జులుండౌన్, డౌన్" అనే నినాదాలు చేస్తూ చప్పట్లుకొట్టారు హుషారుగా. మళ్ళీ ఎస్.ఐ. నుంచి s.p. నుండి మినిష్టర్ కి ఫోన్స్ వెళ్ళాయి. అప్పటికే వ్యవహారం శృతిమించి రాగాన పడిందని అర్ధమైంది రక్షణమంత్రికి. "మిగిలిన విషయాలన్నీ నెమ్మదిగా విచారించుకోవచ్చు. మొట్టమొదట లాకప్ రూమ్ లో ఉన్న వాళ్ళందర్నీ విడిపించేయండి" అని ఆజ్ఞాపించాడు మినిష్టర్. మృదుల, ఆమె స్నేహితులతో బాటు గిరిజనులందరూ విడుదలై మృదులకి జేజేలు పల్కారు. జరిగిందేమిటో లోకానికి తెలిసింది. ఒక గిరిజన యువతి అడవుల్లోంచి పుల్లలేరుకు రావడానికి వెళ్ళింది. రాజభూషణం ఆమెను చూసి, "రాత్రి నా గది కొస్తావా? ఇరవై రూపాయలిస్తాను" అన్నాడు. ఆ అమ్మాయి మాట్లాడకుండా గ్రామానికొచ్చేసి తన వాళ్ళతో జరిగింది చెప్పింది. వాళ్ళంతా సమయం చూసుకుని రాజభూషణానికి బుద్ధి చెప్పారు. దురదృష్టంకొద్దీ అనంగ్ కూడా అందులో చిక్కుకున్నాడు. 

 Previous Page Next Page