Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 18


                            ఇతర దినాలు
    
    ఈ వివాహపుతంతునందేమి విచిత్రమున్నదో కాని, యా మూడుముళ్లు పడునప్పటికి సముద్రపుటుప్పు నడవి యుసిరిక వంటి రెండు జీవితాలు మిళితమైపోవును. ఏ కొండలలో పుట్టినవో ఏ లోయలలో ప్రవహించి వచ్చినవో, ఏ మెట్ట లెక్కినవో, ఏ పల్లముల నింపినవో, రెండు జీవిత ప్రవాహాలు చెరియొక దారి నరుదెంచి, యీ పుణ్య వివాహవేదికకడ సంగమించి ప్రయాగ తీర్థమై పరిణమించునుకదా యనుకొని నారాయణరావు అక్కజపడెను.
    తన్ను పెండ్లికుమారుని చేసినప్పుడు తాను స్నాతకపు బీటలపై తల్లిదండ్రులతో గూర్చుండిన యప్పుడు మంగళ స్నానము లాచరించి, పట్టుపీతాంబరముల ధరించి, వివాహ వేదికపై పెండ్లిపీటపై నధివసించినప్పుడు, మంగళసూత్రద్వయము శారద కంఠమున మూడుముళ్లు వేసినప్పుడు వర్ణింపరాణి భావవేగములో దేలిపోయినాడు. మంగళసూత్రధారణమైన పిమ్మట ఎదురుగా గూర్చుండినంతనే శారద యనిన నంతప్రేమ తన్నేల యావరించినది? తాను మాతృమూర్తియు, శారద చిన్నబిడ్డయువలె నతనికి గోచరించినది. శారదయు తాను వేలకొలది జన్మముల స్నేహితులై, గాఢానురాగమున గలసి సంచరించినట్లు తోచినది. శారదాదేవి మహారాజ్ఞియై రాజ్యమేలుచున్నట్లు తాను సేవకుడై యామెకు బరిచర్య చేయుచున్నట్లు భావము జనించినది. శారదయు దాను నక్కచెల్లెండ్రయి యుగాల వెనుక నొక్క మేఘశకలములో నుండి విడివడిన కవలపిల్లలై యాడుకున్నట్లూహావేశము కలిగినది. తాను పురుషుడట, శారద ప్రకృతియట, తాను పురుషోత్తముడట, శారద మహాసృష్టియట.    
    అతని కన్నులు చెమర్చినవి. తనివితీర నా బాలికను జూడవలెననుకొనినాడు కాని, యక్కడ ఈ వింతజూడ జేరిన ఈ ప్రజాలోక మేమనుకొనునో యని సిగ్గుపడిపోయినాడు. అతని హృదయము ద్రవించిపోయినది. అతని బ్రతుకును బుష్పసౌరభము లావరించుకొనినవి. ఆ బాలికను దనకడకు జేర్చుకొని తన హృదయమున హత్తుకొను కోర్కె పొలిమేరలు దాటినది.
    'ఒరే పరం! ఆ భావాల కంతులేకపోయినదిరా! నాకేనా, లేక ప్రతి పెండ్లికొడుక్కూ అటువంటి యావేశము కలుగునా? ఆ పిల్లకూ నాకూ మానవుడు విడబర్చజాలని బంధము ఏర్పడ్డట్టేనా? ఆ మంత్రములలో నెట్టి మహత్మ్యమున్నదోరా! కొంచెం కొంచెం అర్థమయ్యాయి. ఆ మంత్రోచ్చారణ విడివడి ఉన్నట్టి రెండు జీవితాలను ఏకం చేస్తున్నట్లు తోచింది. ఆ బ్రాహ్మణులు ఋషులైనట్టు, జటావల్కలాజినధారులైనట్లు నాకు కనిపించినదిరా, మా జీవితాలు రెంటికి అంటుగట్టి ఏకవృక్షం చేస్తున్న తోటమాలి లనిపించిందిరా.' 'ఔనురా! ప్రేమోదయమైన తర్వాత వివాహం చేసుకోగానే యూరోపియను దాంపత్యం కంటే, మన దాంపత్యాలే ప్రేమసౌఖ్యాల కెక్కువ నిలయంగా వుంటివి. ఎవరిమాటో ఎందుకు? వివాహం నాటికి నేను వయసువచ్చినవాణ్ణే అయిన వివాహాత్పూర్యం నేను నా భార్యను చూచుకోలేదు. అదివరకెంతోమంది బాలికలను నాకు ఇస్తామని వచ్చినారు. సరే అని నేను చూచుకోడానికి వెళ్ళేవాణ్ణి. చూడగా చూడగా ఒక అమ్మాయి నాకు నచ్చింది. ఆ పిల్ల చక్కని చుక్క. ఆ రూపసంపద అలౌకికమనుకో. అందం సంగతలా వుండగా ఆ పిల్ల సంగీతం పాడింది. ఓరీ! రాలు కరిగిపోయి నాకు కన్నుల నీరు తిరిగిందంటేనమ్ము. ఈ అమ్మాయి నా భార్య అయితే న జన్మ సార్థకం అవుతుందనుకున్నా. తీరా వారు కట్నం తక్కువ ఇస్తామన్నారు. మా తండ్రి గారు ఎక్కువ ఇమ్మన్నారు. దానితో అది చెడిపోయింది. నేను మా అమ్మ చేత, మా నాన్నగారి స్నేహితుల చేత మా నాన్నగారికి చెప్పించినా లాభం లేకపోయింది. నా గుండె ముక్కలయింది. నేను నిర్మించుకున్న ఆనందధామం కుప్పకూలిపోయింది. తర్వాత వచ్చిన సంబంధాలలో ఇంకో పిల్లకూడా ఆ అమ్మాయి అంత అందం కాదుగాని మొత్తంమీద చక్కదనం, సంగీతం అదీ వున్నపిల్లే. వాళ్లు గొప్ప సంబంధం కోసం వలపన్నుకొని, ఆ చేప వలలో పడితే మా సంబంధం వదిలివేద్దామనీ, లేకపోతే రెండోరకం క్రింద మాబేరానికి వద్దామనీ అనుకున్నారు. ఆ పిల్ల నా గుండెలో రాగాలు పాడింది. నా నేత్రాలు నిమీలితాలయ్యాయి. కాని వారికా సంబంధం దొరికింది. నాకా బాలిక దూరమయింది. ఆ దెబ్బతో నేనింక ఏ పెళ్ళికూతుర్నీ చూడనని ఒట్టు పెట్టుకున్నా. చివరకు చూడకుండానే సంబంధము నిశ్చయమయింది. మంగళసూత్రం కట్టేటప్పుడు పిల్ల అంత బాగుండలేదని గ్రహించి చిన్నబుచ్చుకున్నాను. ఆనాటి ఇద్దరు బాలికలూ అప్పుడు జ్ఞాపకం వచ్చారు. నిట్టూర్పు వదిలా. కాని ఒరే నువ్వు చెప్పినట్లు మంగళసూత్రధారణంలో ఏమి మహిమ వుందో, అది మొదలు నా భార్య అంటే పరమ ప్రేమ జనించిందిరా!'  
    పరమేశ్వరుడు చెమర్చే కన్నులతో నారాయణుని కనుగొని అతని వీపు నిమిరినాడు. నారాయణుడు విషయం మార్చుటకు నుద్దేశించి 'మన పెళ్ళిళ్ళకు, మహమ్మదీయుల వివాహాలకు చాలా తేడా వుందిరా!' అనినాడు.
    'మహమ్మదీయుల వివాహాలు మత సంబంధం ఏమీలేని కంట్రాక్టులు కావడం చేతనేమో, వాటిని రద్దు చేసుకోవడం సులభంగా భావిస్తారు మహమ్మదీయ సోదరులు.'
    'అవును. మహమ్మదీయ వివాహం సంపూర్ణంగా కాంట్రాక్టు. క్రిస్టియను చర్చి పెళ్ళి సగము మత సంబంధం. మన సంఘంలో మాత్రం వివాహం పూర్తిగా ధర్మసాధనమైన కర్మ. స్త్రీ, పురుష సంబంధం ఇంత పవిత్రం కావడానికి యెన్ని యుగాలు పట్టిందో! మానవుడు వట్టి జంతువులా, ఆ అతిపురాతన కాలంలో జీవితం ప్రారంభించి అడవుల్లో సంచరించే రోజుల్నుంచీ మానవ జీవితం ఎంత విచిత్రంగా మారిపోయింది యీ పవిత్ర వివాహ సంస్థ వల్ల!'
    'నిజం. భర్త ఏ రకం వాడయితే భార్య కూడా ఆ రకంలో కలిసిపోతుంది గదా. వకీలు భార్య అయిందనుకో 'లా' మాటలు వింటూ వుంటుంది. క్లయింటు రావటం, భర్త కేసుల్లో వాదించడం, గెలవడం, ఓడటం అనే భావాలలో ఐక్యం అవుతుంది. అదే డాక్టరు భార్య అయితే రోగులు, రోగాలు, మందులు, ఇంజెక్షన్లు రాత్రీ పగలూ పని ఉండడం అనే ప్రపంచానికి రాణీ అవుతుంది. అలాగే ఉద్యోగస్తుని భార్య అయితే ఆవిడకు ఉద్యోగ ఫాయాలన్నీ అలవాటవుతాయి. అవును గాని, నాకు మొదటి నుంచీ ఒక్క ప్రశ్నకు సరైన జవాబు దొరకడం లేదురా! ఏమిటంటే, మగవాడి జీవితం వల్ల ఆడదాని జీవితం ఎక్కువ మార్పు చెందుతుందా లేక ఆడదాని జీవితం వల్ల మగవాడి జీవితమా?'
    'అది మంచి ప్రశ్నే! నా అభిప్రాయం ఏమిటంటే, ఆడదాని జీవితం దర్హం మీద స్వచ్చమైంది. మగవాడి జీవితపు రంగు తనమీద పడగానే, దానితో ఆమె నిండిపోతుంది. గృహ నిర్వహణానికి సంబంధించిన సంసార విషయాల్లో మాత్రం ఆడదాని వ్యక్తిత్వమే అధికంగా గోచరిస్తుంది. కాబట్టే ఇల్లు చూచి ఇల్లాలిని చూడమన్నారు. మగవాడు మృదుస్వభావం కలవాడైతే ఒక్కొక్కప్పుడు ఆడదాని స్వభావం పైచేయి కావడం, వాడి జీవితంలో ఆ ఛాయలు విశేషించి కనిపించడం కూడా తటస్థిస్తుంది.
    సుబ్బారాయుడుగారు తన రెండవ కుమారుని వివాహమును గూర్చి ఎన్నియో విచిత్రాలోచనలలో తేలిపోయినాడు. ఆయన నలుగురు కుమార్తెలకు, పెద్ద కుమారునకు మంచి గౌరవముగల కుటుంబములుగా జూచి వారితో వియ్యమందినాడు. సంబంధములన్నియు ధన ధాన్య సంపదలతో తులతూగుచున్నవే. చుట్టములలో ననేక వివాహములకు దను బెద్దరికముదాల్చి చక్కగా జరిపించినాడు. అవియన్నియు నొక యెత్తు. నేడు నారాయణ వివాహమొక యెత్తు. ధనము చాలా వ్యయమైనది. వ్యయమైనదని కాదు. అంతకు మూడు రెట్లయినను ఆయన లెక్కచేయడు. ఆవల వియ్యంకులకు కూడ వివాహ వ్యయమొక లకారము దాటి యుండును. ఆయన జమిందారు గావున ఆయనకు లెక్కలేదు. జమీందారు గదాయని తన యెడల ప్రపత్తులలో నేమైన లోటు చేసినారా? ఒక పెద్ద మహారాజును గౌరవించినట్లు గౌరవించినారు. ఇంతకు ధన వియ్యంకుడు నిషధ యోగ్యుడు. కాని వియ్యపురాలు సరైన మర్యాదతో సంచరించలేదని ఆడవాళ్ళు ఒకటే గోల. అది ఆమె స్వహావము కాబోలు. క్రొత్తలో నించుకంత పొరపున్నను, గాలక్రమమున వియ్యపురాళ్ళిద్దరకు నెయ్యము కుదురవచ్చును.

 Previous Page Next Page