Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 18


    తల్లి కూడా అసలా కొన్నాళ్ళకి.


    అతనికి భయమేసింది.

    
    రాత్రంతా నిద్ర పట్టలేదు.


    ఉదయం తల్లేం చేస్తోందో అనిచూడటానికి వెళ్ళేసరికి ఆమె సిరంజితో తొడమిద గ్రుచ్చుకుంటూ వుండటం కనిపించింది. అతన్ని గమనించలేదు.ఆదృశ్యం చూడలేక వెనక్కి వచ్చేశాడు.


    మనసంతా కకావికలమైపోయింది. ఇంట్లో వుండలేక వెంటనే కారేసుకుని బయటకు వెళ్ళిపోయాడు.


    ఈ లోకంలో తనకు స్నేహితులంటూ ఎవరూ లేరు. తల్లి చెప్పిన్లు ఎవర్ని చూసినా ఏదో ఓ లోపం కనిపిస్తోంది.


    కారేసుకుని ఒక్కడే ఊరంతా పిచ్చిగా తిరిగాడు. నాలుగు గంటలవేళ యింటికి  తిరిగి వస్తోంటే పాప కనిపించింది.ఆమె నెక్కించుకుని తిరిగి బయటకు వెళ్ళిపోయాడు.


    కిటికీ దగ్గర నిలబడి యీ సన్నివేశాన్ని సునందనాదేవి చూస్తోందన్న సంగతి అతనికి తెలీదు.


                         *    *    *    *

    
    సూర్యచంద్ర ఖాందారీ హోటల్  ముందు కారాపాడు.


    లోపలకు వెడుతూండగా, లాంజ్ లో కూచున్నవాళ్లు చాలా పెద్ద ఫ్యామిలీకి చెందినట్లు కనబడుతోన్న అతన్నీ, అందంగానే వున్నా అతని అంతస్థుకి ఏ మాత్రం తగనట్లుమాసిపోయిన బట్టల్లో వున్న ఆ అమ్మాయినీ విచిత్రంగా చూశారు. అతను లెక్క చెయ్యలేదు. ఆమె బెదురుతూన్నట్లు కనిపిస్తే చెయ్యి పట్టుకొని చొరవగా లోపలకు తీసుకెళ్లాడు.


    " బాబుగారూ" అంది పాప . " నా కుభయమేస్తోంది."


    " దేనికి?" అన్నాడు. కేవలం డిమ్ లైట్లు వెలుగుతున్న ఎ.స్. హాల్లో ఒక టేబిల్ ముందు ఆమెను కూచోబెట్టి తాను కూడా ప్రక్కనే కూచుంటూ.


    ఆమెకి ఏం చెప్పాలో తోచలేదు. "బాబుగారూ!పువ్వు" అంటూ గులాబీ ని అతని కందివ్వటమే గానీ ఇంతర త్రాఏ పరిచయమూ, యింకేవిధమైన సంభాషణా జరగటమూ సంభవించలేదు. ఎంత చనువున్నట్లు యిలాంటి చోట్లకి రావటం....


     " మితో యిలా రావటం...."


    " ఏం వస్తే?"


    " అది కాదు..."


    అతను ఒక నిమిషం  ఆలోచించాడు. "నాతో యిలా తీసుకురావటంవల్ల నీకు యిబ్బంది అని తెలుసు కాని రాత్రి నుంచి నా మనసేం బాగాలేదు. ఎందుకో... ఎందుకో మరి... నీకంపెనీలో కొంత ఊరట కలుగుతూందనిపించింది. అందుకని చొరవచేసి తీసుకొచ్చాను.


    సంతోషంతో ఆమె ముఖం వికసించింది ప్రొద్దుట్నుంచీ అనుభవించిన బడలిక అంతా ఒక్క మాటతో ఎగిరిపోయినట్లయింది.


    నోరు తెరిచి నీతో చెప్పబోతూండగా బేరర్ వచ్చాడు.


    " ఏం తీసుకుంటావు?" అనడిగాడు.


    " ఏమి వొద్దండి"


    "ఇక్కడిదాకా వచ్చి ఏమి తీసుకోకపోతే ఎలా? నాకు అకలేస్తోంది."


    "మి యిష్టం."    


    అతనే  తనకు తోచింది యిద్దరికీ ఆర్డర్ చేశాడు.


    "మికు..." అంది ఓ నిమిషం నిశ్శబ్దం గా గడిచాక.


    " ఊ?"


    ఎలా చెప్పాలో తెలియటంలేదు. " నా...తో, ఊరట, పోనీ కొంత ఊరట లకలుగుతూందనిపించిందా?"


    "అవును... నిజంగా."


    మనసు ఏ వేవో భానాలతో స్పందిచింది. శరీరం పులకించింది.


    " అలా .... ఎందుకు?"


    "ఏమో మరి. అనిపించిన మాట మాత్రం నిజం."


    అతని మనసు చాలా నిర్మలంగా వుండి తాను అనుకున్నది అనుకున్నట్లు   చెబుతున్నాడు.అంతకన్న ఎక్కువ ఆలోచనలు, లోతు ఆతన్లో లేవు. కాని ఆ మాటలు ఒక ఆడపిల్ల మనసులో ప్రఛండమైన తియ్యని తుఫాను రేపుతుందని,  ఆ మాటల విలువ అనుక్షణం గ్రుచ్చుకునే శతకోటి రత్నాలనీ అతను  గ్రహించలేకపోయాడు.


    ఇద్దరికీ ఆకలిగా వుంది. ఇద్దరికీ నీరసంగా వుంది. అందుకని  వొద్దు వొద్దనుకుంటూనే యిద్దరూ  టిఫెన్ తినేశాడు.


    బేరర్ వచ్చాడు.


    " ఐస్ క్రీంతీసుకో" అన్నాడు సూర్యచంద్ర.


    పాప మొహమాటపడుతూ ఒప్పుకుంది.


    సూర్యచంద్ర యిద్దరికీ ఐస్ క్రీం తెప్పించాడు.


    పాపకి అతని ప్రక్కన కూర్చుని ,అలా తింటూంటే చాలా గొప్పగా వుంది.


    "  ఐసే క్రీం ఎప్పుడయినా తిన్నావా?" అనడిగాడు.


    "బళ్ళమిదకొచ్చే చిన్న చిన్న కేండెల్స్ , ప్యాకెట్లలో వున్నవి తిన్నాను"


    పాపలో ఓ విశేషం కనిపెట్టాడు . ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ కు రావటం మొదటిసారే అయినా చాలా హుందాగా , నట్ గా ప్రవర్తిస్తోంది. ఆ మాటకొస్తే యీ సభ్యతా ప్రపంచంలో ఎంతమంది హుందాకా ప్రవర్తిస్తున్నారు. నాగరికత పేరుతో గుట్టుగా చేయవలసినవన్నీ ప్యాషన్ గా పరిగణించబడుతున్నాయి. ఎగ్జిబిషన్ లో ఇంతింత వెడల్పాటి అప్పడాలు, పచ్చిమిరపకాయ బజ్జీలు,  మొక్క జొన్న కండెలు, మాంసంతో వండిన సమోసాలు చేతుల్లో పట్టుకొని నడుస్తూ, కెరింతలుకొడ్తూ తినటం, చిన్నపిల్లల్లా రంగులరాట్నాలూ అవీ ఎక్కటం ఢిల్లీ, బొంబాయివంటినగరాల్లో గప్ చిప్ లూ మొదలయినవి రోడ్డుమిద బళ్లప్రక్కన నిలహబడే తినేస్తూ వుండటం, రెస్టారెంట్ లోకి బాయ్ ఫ్రండ్స్ తో వెళ్ళిన ఆడపిల్లలు మూడేసి ఐస్ క్రీమ్స్ కి తక్కువ కాకుండా తినెయ్యటం, అడిగి అడిగి తినటం...


    ఏది నాగరికత? చూస్తూ చూస్తూండగానే మనిషి వేగాన్ని బట్టీ, పరిస్థుతులనబట్టీ దాని స్వరూప స్వాభావాలు త్వర త్వరగా మారిపోతున్నాయి. ఒకప్పుడు, చాలా కొద్ది సంవత్సరాల క్రితం దాకా  పెళ్ళిళ్ళు, వాటి రూపాలు ఒక విధంగా వుండేవి. అతిధి వర్యాదలకూ ,భోజనాలకు దగ్గర వాతావరణానికీ నిర్దుష్టత వుండేది వచ్చిన వాళ్ళందర్నీ ఆప్యాయంగా పలకరించటం, భోజనం చేసారా? అనిపేరు వేరుగా అడగటం- ఇవన్నీ  వుండేవి ,ఇప్పుడా లాంఛనాలూ, మర్యాదలూ పోయాయి. పెళ్ళికి యీ మూలనుంచీ ఆ మూలదాకా  లైట్లతో డెకరేషన్... ' సుబ్బమ్మ వెడ్స్ విత్ వెంకయ్య'అని  పెళ్ళికూతురి, పెళ్ళికొడుకు పేర్లని బల్బులతో అక్షరాలు కూర్చటం, పెళ్ళికి ఎన్ని వందలమంది, లేక వేలమంది వచ్చారా అని చూసుకొని బుజాలెగ రెయ్యటం తప్ప- వచ్చిన వాళ్ళని పలకరించే దిక్కే లేదు. నగరమేయరో, ఎమ్.ఎల్. ఏ.నో. ఎస్ .పి.నో, కలక్టరో, కమిషనరోవస్తే-వాళ్ళకి మాత్రం స్పెషల్ గా మర్యాదలు జరుగుతాయి మిగతా   వాళ్ళని గురించి కనిపిస్తే ఓ చిరునవ్వు విసరటం తప్ప పట్టించుకొనే ప్రసక్తేలేదు. వచ్చిన అతిధులే ఓ సారి అటెండెన్స్ వేసుకున్నట్లు వేసుకొని, పెళ్ళి పెద్ద తాను వచ్చినట్లు చూశాడా లేదా అని జాగ్రత్తపడి, వీడియెలో పడ్డాడా లేదా అనితాపత్రయపడి. తర్వాత జభోనాలెక్కడ పెడుతున్నారా అని  చూసుకొని అటువైపు  వీరవిహారం చెయ్యాలి. జనంచూస్తే రెండువేలమంది పై చిలుకుంది. భోజనాల దగ్గర సీట్లు మూడు నాలుగొందల కంటే ఎక్కువ వుండవు. అక్కడి దృశ్యం ఎలా వుటుందంటే ఎవరిమట్టుకు వాడు తనకో సీటు దొరికితే చాలు అని ఎగబడుతూ వుంటాడు. జబర్దస్తీగా సాగగలిగిన వాడు విజయం సాధిస్తాడు. మొహమాట పడ్డావాడు వెనకపడి పోతుంటాడు. ఇది యీరోజు నాగరికతలో ఒక భాగం.


                           *    *    *    *      

 Previous Page Next Page