Read more!

శనికి సమర్పించవలసిన ద్రవ్యాలేమిటి ? (Shaniki Samarpinchavalasina Dravyalu)

 

శనికి సమర్పించవలసిన ద్రవ్యాలేమిటి ?

(Shaniki Samarpinchavalasina Dravyalu)

 

శనైశ్వర స్తుతి

నమః కృష్ణాయ నీలాయ

శిశిఖండ నిభాయచః

నమో నీల మధూకాయ

నీలోత్పల నిభాయచ!!

కృష్ణ స్వరూపుడు నీలవర్ణుడు, నిప్పు తునకతో సమానుడు నల్లని ఇప్పపూవువంటివాడైన శనీశ్వరునికి మనస్కారం. త్వష్ట ప్రజాపతి తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేయగా, సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రివద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఛాయాదేవి, సూర్యు భగవానుల కుమారుడే శనీశ్వరుడు. ఈయన విభవ నామ సంవత్సరం, మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథియందు ధనిష్టా నక్షత్రంలో జన్మించాడు. ఈయన కుడిచేతిలో దండం, ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి.

హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్పుడు, పురూరవుడు, సాగరుడు, కార్త్య వీర్యార్జునుడు వీరంతా శని మహిమ వల్ల అనేక కష్టనష్టాలను పొంది చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందారు. శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు, సూర్యుని కుమారుడు, యమధర్మ రాజుకి, యమునా నదికి సోదరుడు. గ్రహాలకు యువరాజు వంటివాడు. ఆంధ్రప్రదేశ్ లోని మందపల్లి, మహారాష్ట్రలో శని శింగనాపూర్, తమిళనాడులో తిరునళ్ళార్ శని క్షేత్రములు. అయితే పూర్తి వాస్తుతో అతిశక్తివంతమైన 7వ శతాబ్దం నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరువళ్ళార్ లో వుంది. శని ప్రభావం వల్ల నల మహారాజు వస్త్రాలను పక్షి ఎగురవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కన్పిస్తాయి. నలమహారాజు శని విముక్తి చేసే చిత్రాలు అక్కడ కన్పిస్తాయి. భక్తులు నూనెతో స్నానం చేసి ఆ తర్వాత అక్కడి చెరువులో స్నానం చేస్తే చాలు ఎంతమాత్రం జిడ్డు కనిపించదు. లక్షలాదిమంది స్నానం చేసే ఆ చెరువులో జిడ్డు కనిపించకపోవడమే అక్కడి విశేషం.

ఈ పవిత్ర క్షేత్రంలో బంగారు కాకిపై శనీశ్వర దేవునికి ఊరేగింపును చేస్తారు. ఈ స్వామి వారి భార్యల పేర్లు నీలాదేవి, మంగాదేవి. ఈ స్వామి పడమర దిక్కుగా వుంటాడు. శంగణాపూర్, మందవల్లి, నర్సింగ్ ల్ , విజయవాడ, జాల్నా, పాపగడ్, వైదీశ్వరన్ కోయిల్లలోని దేవాలయాలన్నీ శనీశ్వర దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచినవి. శని త్రయోదశి పర్వదినాలలో మండవల్లిలోని శ్రీమందేశ్వర స్వామివారికి శని దోష పరిహారార్ధం తైలాభిషేకాలు చేసుకుంటే శని దేవుని వలన కలిగే సమస్త దోషాలు నివారించబడతాయని స్కంద పురాణంలో లిఖితమై ఉంది.

శనికి ఏం సమర్పించాలి ?

నల్ల వస్త్రం. నూనెదీపం, అగరవత్తులు, నువ్వులనూనె, స్వీట్లు, పండ్లు, దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపు నాడా, చిన్న దిష్టిబొమ్మ. ఇవి సమర్పించలేనివారు పావు లేదా అరలీటరు నూనెతో తైలాభిషేకం చేయొచ్చు.

శని శింగణాపూర్:

జీవితంలో కష్టనష్టాలకు లోనై మరే దేవుడు రక్షించని తరుణంలో చివరగా గుర్తుకు వచ్చేది శని శింగణాపూర్ లోని శనీశ్వరుడు. ఇటీవల కాలంలో తిరుపతి వెళ్ళేవారు ఏ విధంగా కాణిపాకం విఘ్నేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారో అదేవిధంగా షిర్డీ సాయి బాబాను దర్శించుకోవడానికి వెళ్ళినవారు శని శింగణాపూర్ క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా నెవాసా తాలూకాకు చెందిన ఆ గ్రామం గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఏ ఇంటికీ గుమ్మాలు లేకపోవడం ఆ గ్రామం ప్రత్యేకత. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామ జనాభా 3000 కాగా ఇళ్ళు దాదాపు 450 వరకూ ఉంటాయి, గ్రామ కట్టుబాటు, పూర్వపు ఆచారం నూతన గృహాలకు కూడా తలుపులు ఉండవు. గ్రామంలో పోలీస్ స్టేషన్ లేదు. పోలీసులకు దొంగతనాలు, ఇతర నేరాల గురించి ఫిర్యాదులు ఉండవు. ఇంటువంటి సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారమవుతాయి. అందుకే వారు ‘మాకు దేవుడు ఉన్నాడు కానీ మా దేవుడికి గుడిలేదు. ఎండకు ఎండుతాడు వానకు తడుస్తాడు. మాకు ఇళ్ళు ఉన్నాయి కాని వాటికి గుమ్మాలు, తలుపులు లేవు. మా సూర్యపుత్రుడు శనీశ్వరుడే మా ఇళ్ళకు రక్షగా ఉంటాడు’ అంటారు. సాధారణంగా అందరూ శని పేరు ఎత్తటానికి భయపడుతుంటారు. కాని ఆ గ్రామస్థులు శనీశ్వరుణ్ణి తమ ఆప్తదేవుడుగా నిత్యం కొలుస్తారు. అన్ని కార్యక్రమాలకు ఆయన్నే నమ్ముకుంటారు. ప్రతీదానికి వినాయకునితోపాటు శనీశ్వరుణ్ణి తలచుకుంటారు. ప్రతీ నెలా అమావాస్య మర్నాడు చంద్రోదయం రోజున లక్షలాదిమంది భక్తులు శనిదేవుని దర్శిస్తారు. శని త్రయోదశి సోమవారాలనాడు అధికసంఖ్యలో భక్తులు వస్తారు. సాధారణ రోజులలో కూడా భక్తుల సంఖ్య గణనీయంగానే ఉంటుంది. దేవాలయంలోకి అందరికీ ప్రవేశం ఉన్నా మగవారు మాత్రమే శనిదేవుని పూజాకార్యక్రమం నిర్వహించాలి. వారు విధిగా తలస్నానం చేసి కాషాయరంగు లుంగీ లేదా పంచె మాత్రమే ధరించాలి, ఈ వస్త్రాలు ఇక్కడ లభ్యమవుతాయి. పూజ తర్వాత వదిలివేయాలి. ముఖ్యమైన రోజులలో కాషాయవస్త్రధారులతో శని శింగణాపూర్ శోభాయమనంగా ఉంటుంది. ఆరోజు దృశ్యం చూడముచ్చటగా, ఆలయప్రాంగణం సుందరంగా ఉంటుంది. సదుపాయాలు. పెద్ద ఎత్తున విసృతపరుస్తున్నారు. ఇది కేవలం విరాళాలవల్లే సాధ్యపడుతోంది. గ్రామప్రవేశానికి రెండు రూపాయల పంచాయితీ ప్రత్యేక టోల్ ఫీజు మాత్రం వసూలు చేస్తున్నారు. ఈ దేవాలయానికి అనుబంధంగా మరొక పాఠశాలను, గోసంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వసతి ఏర్పాట్లు ఉన్నాయి. లగ్జరీ గదులతోపాటు సాధారణ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆలయ నిర్వహణ ఆహ్లాదకరంగా ఉంది.

శని విగ్రహ ప్రత్యేకత

ఇక్కడ శని విగ్రహాన్ని 16 అడుగుల 16 అంగుళాల పొడవు, వెడల్పు గల 3 అడుగుల ఎత్తుగల సమచతుర్భుజ ప్లాట్ ఫాంపై ప్రతిష్టించారు. విగ్రహం శివలింగం ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇనుములా తలపించే నల్లరాతి విగ్రహం ఎత్తు ఐదున్నర అడుగులు, వెడల్పు ఒకటిన్నర అడుగులు. శనిపీడితులు కాషాయ వస్త్రధారులై అర్చకుని సహాయంతో ఈ విగ్రహంపైనే తైలాభిషేకం చేసి దోషనివారణ పొందుతారు. ఈ ప్లాట్ ఫాంపై గల శనీశ్వరుణ్ణి అందరూ వీక్షీంచవచ్చు. అయితే ప్లాట్ ఫారాన్ని ఆడవాళ్ళు తాకరాదనే నియమం వుంది.

నవ శని క్షేత్రాలు

మనం చెప్పుకుంటున్న శనిశింగణాపూర్ తో పాటు మరో ఎనిమిది క్షేత్రాలు ఉన్నాయి. వాటినే నవ శనిక్షేత్రాలు అంటారు.

1. మహారాష్ట్రలోని నాసిక్ సమీపానగల నందగావ్.

2. మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ దగ్గర శనిబాధేశ్వర్

3. మధ్యప్రదేశ్ లో జబల్పూర్ దగ్గర పిపాల్ గావ్.

4. తమిళనాడులోని తరునల్లార్.

5. ఉత్తరప్రదేశ్ లోని మధుర సమీపాన కొకిల్వన్.

6. ఉత్తరప్రదేశ్ లోని నిర్లాపూర్ సమీపాన శనితీర్థ.

7. మహారాష్ట్రలోని ఔరంగబాద్ జిల్లాలో శనిభగవాన్ తీర్థం.

8. చత్తీస్ ఘట్ రాష్ట్రంలోని థమ్ ప్రాంతంలో శనిదేవక్షేత్రం. భరతఖండంలో గుజరాత్, సౌరాష్ట్రల్లో శని ఆవిర్భవించాడనే నమ్మకం ఉంది. ఇదీ శని కుటుంబం:

తండ్రి: సూర్యభగవానుడు

తల్లి: ఛాయాదేవి

సోదరుడు: యమధర్మరాజు

సోదరి: యమున

స్నేహితులు: హనుమాన్, కాలభైరవుడు

ఇతర పేర్లు: కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర

గోత్రం: కాశ్యపన.