Read more!

సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది రెండవ రోజు పారాయణము

 

సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఇరువది రెండవ రోజు పారాయణము

 

 

త్రయోదశాధ్యాయము

నారద ఉవాచ:- ఓ  పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడయిన జలంధరుడు శివుని మీద రణ భేరీ వేయించాడు. కోట్లాది సేనలతో - కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా - జలంధరునికి అగ్రభాగాన వున్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్పలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది. రాక్షససేనా విమానాలతో క్రిక్కిరిసిన ఆకాశం -  వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఈ  రణోద్యోగాన్నెరిగిన దేవతలు ఇంద్రుణ్ని ముందర వుంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్లి - యుద్ధవార్తల్ని విన్నవించారు. 'ఓ దేవాదిదేవా! ఇన్నినాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియును. ఈ వేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రీ! అని ప్రార్ధించారు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు- విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడాయనను చూచి 'కేశవా ! గత జగడంలోనే ఆ జలంధరుడిని జమునిపాలు చేయకపోయావా? పై పెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండట మేమిటి?' అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు 'పరమేశ్వరా! ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేతా, లక్ష్మికి సోదరుడు కావడం చేతా -  యుద్దంతో నా చేత వధింపబడలేదు. కాబట్టి, నువ్వే వానిని జయించు' అని చెప్పాడు. అందు మీదట శివుడు - 'ఓ దేవతలారా! వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాస్త్రాలవల్లగాని, నా చేతగాని మరణించేవాడు గాదు. కాబట్టి, మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను సయితం ప్రకాశింప చేయాలి' అని ఆజ్ఞాపించటంతో, విష్ణ్వాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని  కలిపి -  మహొత్తమామూ, భీషణజ్వాలాస్యము వేగసంపన్నమూ, అత్యంత భయంకరమూ అయిన 'సుదర్శన'మనే చక్రాన్ని వినిర్శించాడు.

 

 

 


అప్పటికే - ఒక కోటి ఏనుగులు, ఒక కోటి గుర్రాలు, ఒకకోటి కాల్బలగముతో కైలాసభూములకు చేరిన జలంధరుని దేవతలూ ప్రమాధగణాలూ ఒక్కుమ్మడిగా ఎదుర్కోన్నాయి. నందీశ్వర, నిఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా - జలంధరునిని మార్కోన్నారు. రెండు తెగల మధ్యనా భయంకరమయిన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచీ వచ్చే వీర రస ప్రేరకాలయిన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేమి ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ - భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది. పరస్పర ప్రయోజితాలైన - శూల , పట్టిస, తోమర, బాణ శక్తి, గదాద్యాయుధ భరితమైన ఆకాశం - పగలే చుక్కలు పొడిచినట్లుగా వుంది. యుద్ధభూమిలో నేలకూలిన రధగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా వున్నాయి. ఆ మహాహవంలో ప్రమాధబాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవనీ విద్యతో పునర్జీవింప చేయసాగాడు.

 

 

 


ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం మంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భావించింది. అది, అత్యంత భయంకరమైన తాలు జంఘోదర వక్త్రస్తనాలతో మహావృక్షాలను సైతం కూలగోడుతూ రణస్థలిని చేరింది.

శ్లో !!సా యుద్ధభూమి మాసాద్య భక్షయంతీ మహాసురాన్
భార్గవం స్వభాగేధృత్యా జగా మాంతర్హితా నభః !!


రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది. ఆ వూపు ఊపు శుక్రుణ్ని సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్థానమై పోయింది. మరణించిన వాళ్లను మళ్లా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన - ప్రమథగణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలవలె చెల్లా చెదరయి పోసాగింది. అందుకు కినిసిన శుంభనిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగణిత శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగేరు. చక్కటి పంట మీద మిడుతల దండులాగా - తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై, అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారయిన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన -  నందీశ్వర, విఘ్నేశ్వర,  సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై - రాక్షససేనల మీదకు విజృంభించారు.
 


త్రయోదశోధ్యాయ స్సమాప్తః (పదమూడవ అధ్యాయము సమాప్తము)

చతుర్ధశాధ్యాయము

 

 

 

నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి  నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్దాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య (కుమార) స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలనూ, జెండానూ , ధనుస్సునూ,  సారథినీ నాశనం చేసేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుని వహనమైన ఎలుకని బాణంతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో, వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి - కాలినడకను శుంభుని చేరి వాని వక్షస్థలాన్నీ గాడనేశాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి -  నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు.  వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూశ్మాండ-భైర - బేతాళ- పిశాచ- యోగినీ గణాలన్నియు ఆయననున అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్చదేరిన నందీశ్వర, కుమారస్వాములిద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు. వాళ్లందరి విజృంభణతో నూ వీగిపోతూన్న తన బలాన్ని చూసిన జలంధరుడు 'అతి' అనే పతాకం గల రథం పై వచ్చి ఈ సమస్త గణాలనూ ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంత మంతా నిండిపోయింది. అయిదు బాణాలతో విఘ్నేశ్వరుడినీ, తొమ్మిది బాణాలతో నందీశ్వరుడినీ, ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్చ పోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు, ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలనీ, పతాకాన్నీ గొడుగునూ నరికేసాడు. మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు 'పరిఘ' అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్లు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో - వీరభద్రుడు స్పృహా తప్పి పడిపోయెను.
చివరికి దేవతల  ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో  హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణు మాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్లి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది.

పదమూడు, పదునాలుగు అధ్యాయములు

 

 


22 వ రోజు

నిషిద్ధములు :- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి

దానములు :- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు

పూజించాల్సిన దైవము :- సూర్యుడు

జపించాల్సిన మంత్రము :- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా

ఫలితము :- ఆయురారోగ్య తేజో బుద్ధులు

 

ఇరువది రెండవ (బహుళ సప్తమి) రోజు పారాయణము సమాప్తము