Read more!

హనుమంతుని వేదాంతం

 

హనుమంతుని వేదాంతం

 

 

ఒక రోజు శ్రీ రాముడు హనుమంతుని దగ్గరికి పిలిచి ''హనుమా! నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా. దేహ, జీవ, పరమాత్మలకు సమన్వయము చేస్తూ చెప్పు'' అని కోరాడు. అదే శిరోధార్యంగా భావించిన పరమభక్త శిఖామణి మారుతి ''శ్రీ రామా! వేదాంత రహస్యము తెలిసిన తరువాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని, జీవుణ్ణి, పరమాత్మను వేరు వేరుగానే భావించాలి. దేహ దృష్టితో పరమేశ్వరుని ధ్యానిస్తూ, సేవించాలి. అన్ని భావాలను త్యజించి, శరణాగతి పొందాలి. ఇతరులకు ఉపకారం చేస్తూ, వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి, సేవించాలి. ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని భావిస్తూ, భగవంతుని స్మరిస్తూ, భగవంతుని పూజలు చేస్తూ, భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండటానికి ద్వైతం అంటారు. జీవుడు, పరమాత్మ ఒక్కరే. ఎందులోను భేదం అనేది లేదు అనే భావనలో, ఆచరణలో చూపించటం జ్ఞాన లేక, విజ్ఞాన లక్షణం అంటారు.ఇదే అద్వైత భావన'' దేహ బుధ్యాతు దాసోహం, జీవ బుద్ధ్యాతు త్వదంశః  ... ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతిమే నిశ్చితా మతిహ్ ''రామా! దేహ దృష్టిలో నేను నీకు దాసుడిని. జీవ దృష్టిలో నీవు పరమాత్మవు. నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను. పరమాత్మ దృష్టి లో 'నీవే నేను -నేనే నీవు' ఈ మూడు లక్షణాలు నాలోనూ, నీలోనూ ఉన్నాయి. ఇంక భేదానికి అవకాశమే లేదు'' అని స్పష్ట పరచాడు హనుమ. అంజనానందనుడి సమాధానం విని పరమానంద భరితుడయ్యాడు దాశరధి ''త్వమేవాహం, త్వమేవాహం'' అని చాలా సార్లు హనుమను అభినందించాడు.

 

 

''యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః
యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః 
శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం
భోగశ్చ, మోక్షశ్చ, కరస్త యేవ''

అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు. కాని శ్రీహనుమ సేవాతత్పరులైన వారికి భోగమూ, మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ''వరం'' అను గ్రహించాడు. దానికి వెంటనే ఆంజనేయుడు ''నువ్వు శివుడవు, నేను భద్రుడను, నీకూ నాకు భేదమే లేదు'' అని చెప్పాడు.