Read more!

తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?

 

తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?

 

హిందువులకు ఉన్న పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ప్రతి హిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. తిరుమలకు చేరుకోవాలంటే కొందరు భక్తులు బస్సుల్లోనూ,టాక్సీలలోనూ,  నడుచుకుంటూ వెళ్తుంటారు.

అందరికీ తెలిసిన నడక దారి ఒక్కటే అదే అలిపిరి. కాని ఎంతమందికి తెలుసు తిరుమల చేరుకోవాలంటే ఇంకా కొన్ని దారులు ఉన్నాయని? మనం ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం. తిరుమల ఆలయానికి ఏడుకొండలు నలువైపులనుండి ఏడు నడకదారులు ఉన్నాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు  గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. తాళ్ళపాక అన్నమాచార్య మొదటిసారి అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కాడు. క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీ.శ. 1550లో విజయనగర సామంతులు అలిపిరి-గాలి గోపురం మార్గం నిర్మించారు.

 


మునుపటి రోజుల్లో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి, కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడి మల్లం నీలిసాని పేట, గాజులమండ్యం, కల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణపురం, నాగాలపురానికి మరోకదారి వుండేది. ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాహరాజు కాలంలో రాజధాని. ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది. నాగులాపురంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. అంటే ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేసిన దారులు ఉండేవి. అయితే అవి నేడు కనుమరుగైపోయాయి. మొదటినుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. అయితే ఈ దారికన్నా తక్కువ సమయంలో కొండకు వెళ్ళగలిగే శ్రీవారి మెట్టు దారి గుండా యాత్రికులు వెళ్ళలేక పోతున్నారు, కారణం శ్రీవారి మెట్టుకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే.  శ్రీవారి ఆలయం చేరుకోవడానికి దాదాపు ఏడెనిమిది నడక దారులున్నాయి. అందులో ప్రధానమైనది అలిపిరి మెట్లదారి. అలిపిరి అంటే 'ఆదిపడి' అంటే మొదటి మెట్టు అని అర్థం .. ఇదే కాలక్రమంలో అలిపిరి అయింది. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. క్రీ.శ. 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుడి గాలిగోపురం వరకు సోపాన మార్గం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి.

 

 

 

అలిపిరి నుండి మెట్లు దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు. అలిపిరి దారిలో ఉండే మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీ.శ, 1387లో ఏర్పాటు చేసినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. శాసనాల్లో కనిపించేది అలిపిరి దారి ఒక్కటే. ఈ దారి గుండా బయలుదేరుతూనే మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కన్పిస్తుంది రెండు అడుగులు వేయగానే పాదాల మండపం, లక్ష్మీనారాయనస్వామి ఆలయం వస్తుంది. పడి మెట్లు ఎక్కగానే పిడుగుపడి పునర్ నిర్మింపబడిన పెద్ద గోపురం వస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే గజేంద్ర మోక్షం, చిట్టెక్కుడు, పెద్దక్కుడు వస్తాయి. ఆ పాకి వెళ్తూనే గాలిగోపురం వస్తుంది. అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీ,..1628లో నిర్మించారు. గాలిగోపురం నుండి క్రిందకు చూస్తే తిరుపతి పరిసరాలు, గోవిందరాజు స్వామి, అలిమేలు మంగమ్మ గుళ్ళు గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి.

 


గాలి గోపురంలోపలికి వెళ్తూనే మహంతులు పూజించే సీతారామలక్ష్మణుల ఆలయం వస్తుంది. అక్కడే పెద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాతో ఉన్న విగ్రహం ఉంది. అటునుంచి దక్షిణం వైపు అడవిలోకి వెళ్తూ ఘంటా మండపం, నామాలగవిలను చేరుకోవచ్చు.  అవ్వాచారి కోననుండి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది. మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడనుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వతుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది. తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడినుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్లు ఉంది. ఈ దారినుంది మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్ల దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు. చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది.

 

 

 


చంద్రగిరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్టుంది చంద్రగిరి రాజులూ ఈ దారిలోనే తిరుమలకు వెళ్ళేవారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనంకోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే దారిలో అప్పటినుంచి నేటివరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుంటారు. ఈ దారి స్థానికులకు తప్ప బయటి ఊర్లో వారికీ అంతగా తెలియదు. ఈ రెండు దారుల తరువాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపున కాలినడకన వచ్చే మామండూరు దారికి మించిన దారి లేదు. పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది. ఆనాడు విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల రేనాడు వారు ఈ దారి మీదుగానే తురుమల చేరుకునేవారు. మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్ళతో మెట్లను ఏర్పాటు చేశారు. మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆ తర్వాత పాల సత్రం వస్తుంది.

 

 


ఇంకొంచెం దూరం పొతే ఈతకాయల మండపం తరువాత పడమర వైపు కొంతదూరం వెళ్తే తిరిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది. 1940లో తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మించాలనుకున్నప్పుడు మామండూరు దారే సులువైన దారి అని ఆనాటి ఇంజనీర్లు చెప్పారు. తిరుమలకు ఘాట్ రోడ్లు నిర్మించాలనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి మూడు దారులను ఎంపిక చేశారు. అలిపిరి నుండి తూర్పు వేపుకు వెళ్ళే మదటి ఘాట్ రోడ్డు, పడమటి దిక్కు నుండి చంద్రగిరి వైపు నుండి వెళ్ళే రెండో ఘాట్ రోడ్డుతో పాటు మామండూరు దారిలో మరో ఘాట్ రోడ్డును నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆనాటి టిటిడి బోర్డు సభ్యుడు టికెటి రాఘవాచార్యులు మామండూరు ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ఒప్పుకోలేదు. తిరుమల నుండి మామండూరు వెళ్ళే నడక దారిలో పాలసత్రం నుండి దక్షిణం వైపు వెళ్తే కాకుల కొండ వస్తుంది. ఈ కాకుల కొండ మీదుగా వెళ్ళినా మామండూరు చేరుకోవచ్చు.

 

 


తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాంకి అవతలి వైపున్న కొండను ఆనుకొని శ్యామల కోన ఉంది. ఇక్కడి నుండి వెళ్ళే నడకదారికి శ్యామలకోన దారి అనే పేరుంది. అదే కాకుండా దీనికి అనుంకోన దారి అనే పేరు కూడా ఉంది. కల్యాణి డ్యాం నుండి ఈ దారి గుండా తిరుమల వెళ్ళాలంటే సుమారు పదిహేను కిలోమీటర్లు నడవాలి. కల్యాణి డ్యాం నుండి పులి బోను వరకు ఉండే నడక దారిలో అటవీశాఖ వారు తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు వేశారు. ఈ రోడ్డులో సుమారు మూడు కిలోమీటర్లు దూరం వెళ్తే అనుంకోన మలుపు వస్తుంది. ఈ మలుపు నుండి తూర్పు వైపు తిరుమలకు వెళ్ళే దారి వస్తుంది. అనుంకోన మలుపు నుండి కొంత దూరం వెళితే తొలివంక తరువాక మలివంక వస్తాయి. ఆపైన ఉడ్డల చింతల మాను వస్తుంది. అటు తర్వాత వెడల్పుగా ఉండే గెద్దలబండ వస్తుంది. ఆ తరువాత చిట్టికోన వంపు వస్తుంది. అక్కడినుండి సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు వెళితే తిరుమలలోని ఎత్తైన నారాయణ గిరి వస్తుంది. రంగంపేట, భీమవరం నుండి భక్తులు ఈ దారి నుండే తిరుమలకు వెళుతుంటారు.

 


కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలా దొడ్డి నుండి తుంబురు తీర్థం నుండి పాపవినాశానానికి, అక్కడినుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాపవినాశనం డ్యాం నీళ్ళు లోయలో ప్రవహిస్తూ తుంబురు తీర్థం మీదుగా కుక్కలా దొడ్డి వైపు ప్రవహిస్తాయి. కుక్కలా దొడ్డి నుండి సెలయేటి గట్టు మీద ఎగుడుదిగుడులు లేకుండా నడిచి వస్తే తుంబుర తీర్థం ఎంతో సునాయాసంగా చేరుకోవచ్చు. తుంబుర లోయను నిట్టనిలువుగా అధిరోహించి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాపవినాశనం వస్తుంది. పాపవినాశనం నుండి తుంబుర తీర్థానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అవ్వాచారి కొండ నుండి కూడా ఒక దారి ఉంది. దీన్నే అవ్వాచారి కోనదారి అని అంటారు. ఈ అవ్వాచారి కొండమీద మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడి నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వస్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది.

 

 

 


ఇవేకాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుండి అవ్వాచారి కోనవరకూ ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగులద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. తలకోన నుండి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గరనుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టే దీనికి తలకోన అని పేరు వచ్చింది. నెరభైలు, ఉదాద్య మాణిక్యం, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు. ఇప్పటివరకూ మనం చాలా సార్లు తిరుమలకు వెళ్ళి ఉంటాము. కానీ చూశారా మీలో ఎవరికైనా ఈ నడక దారుల గురించి తెలుసా?