ఇక జగన్ మైక్ ని ఎవరూ కట్ చేయలేరు!
Publish Date:Mar 21, 2015
Advertisement
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికు శాసనసభలో మొన్న గంటసేపు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చేరు. ఆ తరువాత కూడా ఆయన ఇంకా తన పిర్యాదుల పంచాంగం అనర్గళంగా చదివే ప్రయత్నం చేసినప్పుడు ఇక ముగించమని స్పీకర్ చెపుతున్నా వినకపోవడంతో స్పీకర్ ఆయన మైక్ కట్ చేసారు. దానితో జగన్ ఇగో దెబ్బతింది. అది చూసి వైకాపా సభ్యుల ఇగో దెబ్బతింది. అప్పుడు వారందరూ స్పీకర్ మీద విరుచుకుపడ్డారు. స్పీకర్ వారిని సభ నుండి 3 రోజులపాటు స్పస్పెండ్ చేసారు. అప్పుడు జగన్ ‘మీకో దణ్ణం!’ అంటూ స్పీకర్ అనుమతి తీసుకోకుండానే, సభ నుండి వాక్ అవుట్ చేస్తున్నట్లు ప్రకటించకుండానే వాకవుట్ చేసేసారు. పోతూపోతూ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నామంటూ అసెంబ్లీ కార్యదర్శి చేతిలో ఒక లేఖ పెట్టి చక్కాపోయారు. ఆ తరువాత తన లోటస్ పాండ్ లో సిద్దంగా ఉన్న తన మీడియా సాక్షిగా తను శాసనసభలో మళ్ళీ అడుగుపెట్టనని భీకర శపథం చేసేసారు. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును సభలో చర్చకు అనుమతిస్తామని చెప్పినప్పుడే తిరిగి సభలో కాలుపెడతానని శపథం చేశారు. ఆ తరువాత దాదాపు రెండు గంటలసేపు మీడియా ముందు తన ఆవేదనంతా ఒలకబోసుకొన్నారు. ఇంకా ఒలకబోసేవారేనేమో గానీ ఇంక ఓపికలేకపోవడంతో ముగించినట్లున్నారు. బడ్జెట్ సమావేశాలకి తను హాజరు కానప్పటికీ దానిపై తన అమూల్యమయిన అభిప్రాయాలు తెలుసుకోగోరే ప్రజలు మీడియాలో చూసుకోమని ఒక ఉచితసలహా ఇచ్చేరు. అసెంబ్లీలో స్పీకర్ అధికార పార్టీకి చెందినవారు కనుక తనకు తృప్తిగా మాట్లాడనివ్వకుండా మైక్ కేట్ చేసేవారు. కానీ ఇప్పుడు తన స్వంత ఇంట్లో స్వంత మీడియా ముందు కూర్చొని ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు నిరభ్యంతరంగా, అనర్ఘళంగా నచ్చినట్లు మాట్లాడుకోవచ్చును. అసెంబ్లీని ఇడుపులపాయో, లోటస్ పాండో అన్నట్లు సభలో వ్యవహరిస్తే కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకు ఒకసారి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఆయన హెచ్చరికలో అసలు అర్ధం గ్రహించలేకపోయినా, దానిలో నుండి మంచి ‘క్లూ’ మాత్రం పొందినట్లున్నారు. అందుకే లోటస్ పాండ్ నుండే తన ప్రసార కార్యక్రమాలు మొదలుపెట్టేసారు. ఇప్పుడు ఎవరూ కూడా ఆయన మైక్ కట్ చేయలేరు. కనుక ఎన్ని గంటలు ఓపిక ఉంటే అన్ని గంటలూ మాట్లాడుకోవచ్చును. చూసేవాళ్ళు చూస్తారు, లేని వాళ్ళులేదు.
http://www.teluguone.com/news/content/jagan-mohan-reddy-45-44329.html





