political-news-img

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రత, న్యాయ రక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక బిల్లులకు ఆమోదం తెలిపారు. 1. హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్ బిల్లు 2026 విద్వేషపూరిత ప్రసంగాలు, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను అరికట్టేందుకు “తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు-2026”కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సోషల్ మీడియా పోస్టులు, అల్లర్లు ప్రేరేపించే ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు రూపొందించారు. 2. గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు “తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్-2026”కు ఆమోదం లభించింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 4.2 లక్షల గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు, సామాజిక భద్రత కల్పించనున్నారు. వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో బిల్లును ఆమోదించారు. 3. హైదరాబాద్ మెట్రో స్వాధీనం హైదరాబాద్‌లోని 69 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. సుమారు రూ.15 వేల కోట్లతో ఫేజ్-1 ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. లావాదేవీల నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)కు అప్పగిస్తూ, దానిని నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 4. అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు “తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు”కు ఆమోదం లభించింది. వామనరావు దంపతుల హత్య ఘటనల నేపథ్యంలో న్యాయవాదులకు భద్రత కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 5. కులగణన నివేదికకు ఆమోదం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సమర్పించిన కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక సిద్ధమైంది. నివేదికను మరింత పరిశీలించేందుకు కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. 6. రోహిత్ వేముల చట్టం విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. 7. తల్లిదండ్రుల మద్దతు బిల్లు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా రూ.10 వేల వరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించే బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది.

Publish Date: Mar 23, 2026 10:40PM

political-news-img

అసెంబ్లీపై నుంచి అమరావతి మొత్తం కనిపించేలా చర్యలు : మంత్రి నారాయణ

అమరావతిలో 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచస్థాయి అసెంబ్లీని నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం, హడ్కో నుంచి నిధుల సమీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న ఐకానిక్ కట్టడాల విశిష్టతను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై రాష్ట్ర మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం(23-3-26) కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలుగా నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల విశిష్టతను, నిధుల సమీకరణను మంత్రి నారాయణ వివరించారు. అమరావతి అసెంబ్లీ భవనాన్ని 250 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనంపైకి ప్రజలు వెళ్లి మొత్తం అమరావతి నగరాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని ఉత్తమ అసెంబ్లీ భవనాల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, హైకోర్టుతో పాటు మరో ఐదు ఐకానిక్ టవర్లను అత్యద్భుతంగా నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఐకానిక్ భవనాలు కాబట్టి సాధారణ భవనాల కంటే వీటికి ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని ఐకానిక్ భవనాల రేట్లతో పోల్చి వీటిని చూస్తున్నామని, ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజధాని పనుల కోసం భారీ ఎత్తున నిధులను ప్రభుత్వం సమకూర్చుకుంటోందని మంత్రి నారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో ద్వారా మరో రూ. 11 వేల కోట్లు సమకూర్చుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రస్తుతం అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల కోసం నిర్మిస్తున్న సుమారు 3,500 ఫ్లాట్లు ఈ మార్చి నెలాఖరు కల్లా పూర్తి కానున్నాయని చెప్పారు. సెక్రటేరియట్, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ కోసం ఇప్పటికే రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు.

Publish Date: Mar 23, 2026 10:27PM

political-news-img

ఐర్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియా.. కెప్టెన్‌గా సంజు శాంసన్‌కు ఛాన్స్?

2026 టీ20 ప్రపంచ కప్‌లో ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న భారత క్రికెట్ జట్టు, త్వరలో మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్ నెలలో టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా జరగబోయే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా వెల్లడించింది. ముఖ్యంగా ఈ సిరీస్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు ఈ పర్యటనలో జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజుకు, తన అనుభవంతో యువ ఆటగాళ్లను నడిపించే అరుదైన అవకాశం దక్కవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐర్లాండ్ పర్యటనలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, యువ ప్రతిభను ప్రోత్సహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మలకు విశ్రాంతినిచ్చే పక్షంలో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లేదా యశస్వి జైస్వాల్‌లకు అవకాశం దక్కే వీలుంది. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షెడ్యూల్ ప్రకారం, జూన్ 26న మొదటి టీ20 మ్యాచ్, జూన్ 28న రెండో టీ20 మ్యాచ్ జరగనున్నాయి. విశేషమేమిటంటే, గత ఎనిమిదేళ్లలో మూడుసార్లు ఐర్లాండ్‌లో పర్యటించిన భారత్, ఈసారి బెల్ ఫాస్ట్‌ వేదికగా తలపడనుంది. 2007 తర్వాత భారత జట్టు బెల్ ఫాస్ట్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు బిజీ షెడ్యూల్‌ను గడపనుంది. ఐర్లాండ్ టూర్‌కు ముందు అఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ పాల్గొంటుంది. ఆ తర్వాత ఐర్లాండ్ సిరీస్ ముగించుకుని, జూలై 1 నుంచి 19 వరకు ఇంగ్లాండ్‌తో జరిగే భారీ వైట్ బాల్ సిరీస్ కోసం టీమిండియా బయలుదేరుతుంది. ఈ ఐర్లాండ్ పర్యటన యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునేందుకు ఒక వేదికగా నిలవనుంది. ముఖ్యంగా సీనియర్లు అందుబాటులో లేని సమయంలో సంజు శాంసన్ నాయకత్వంలో జట్టు ఎలా రాణిస్తుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ పర్యటనకు సంబంధించి అధికారిక జట్టు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Publish Date: Mar 23, 2026 10:16PM

political-news-img

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం...కెన్యా తీరంలో వేలాది లగ్జరీ కార్లు నిలిపివేత

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ మరియు ఇతర దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సముద్ర రవాణా మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ భద్రతా కారణాల దృష్ట్యా జపాన్ నుంచి దుబాయ్‌కు వెళ్లాల్సిన వేలాది లగ్జరీ కార్లు గమ్యస్థానానికి చేరలేక మధ్యలోనే నిలిచిపోయాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం, సుమారు 4,000కు పైగా ఖరీదైన వాహనాలను కెన్యాలోని లాము ఓడరేవుకు దారి మళ్లించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నౌకల రాకపోకలపై ఆంక్షలు మరియు దాడుల భయంతో షిప్పింగ్ కంపెనీలు తమ మార్గాలను మార్చుకుంటున్నాయి. గత నెలలో జపాన్‌లోని యోకోహామా పోర్టు నుంచి బయలుదేరిన నౌకలు వాస్తవానికి దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే మార్చి ప్రారంభంలో ఆ ప్రాంతంలో చోటుచేసుకున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, సిబ్బంది మరియు సరుకు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెన్యాలోని లాము పోర్టుకు ఇప్పటికే చేరిన వాహనాల్లో 'పోర్షే' వంటి అత్యంత ఖరీదైన బ్రాండ్లకు చెందిన కార్లు ఉన్నాయి. మరో 5,000 వాహనాలు కూడా అతి త్వరలో ఇదే ఓడరేవుకు వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు ధృవీకరించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడే వరకు ఈ వాహనాలను కెన్యాలోనే సురక్షితంగా ఉంచాలని షిప్పింగ్ సంస్థలు భావిస్తున్నాయి. అప్పటివరకు ఈ కార్లు కెన్యా పోర్టులోని గోడౌన్లలోనే మగ్గాల్సి ఉంటుంది. ఈ అకస్మాత్తు పరిణామం కెన్యాకు ఆర్థికంగా కలిసి వచ్చే అంశమైనప్పటికీ, అంతర్జాతీయంగా మాత్రం ఆందోళన కలిగిస్తోంది. లాము పోర్టు మేనేజర్ అబ్దుల్ అజీజ్ మజీ మాట్లాడుతూ.. సముద్ర మార్గాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా అనేక నౌకలు గమ్యం తెలియక సముద్రం మధ్యలోనే వేచి చూస్తున్నాయని తెలిపారు. ఇది వాణిజ్యపరంగా తమకు లాభదాయకమైనా, యుద్ధం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు విచారకరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఈ డెలివరీల ఆలస్యం కారణంగా ఆటోమొబైల్ మార్కెట్‌లో లగ్జరీ కార్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు పెరగడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప ఈ సరఫరా గొలుసు మళ్లీ గాడిన పడేలా కనిపించడం లేదు.

Publish Date: Mar 23, 2026 9:46PM

political-news-img

అనుమానం…అమానుష హత్యకు దారి

ప్రేమతో మొదలైన ఒక కుటుంబ కథ… అనుమానం, మద్యం వ్యసనం, హింసతో భయానక ముగింపుకు చేరింది. ఓ వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త… చివరికి ఆమెనే కిరాతకంగా హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో కలకలం రేపింది.మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన నర్సింలు (31), అదే ప్రాంతానికి చెందిన శోభ అలియాస్ శోభారాణి (33)ను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి పుట్టింది. మొదట్లో సాఫీగా సాగిన సంసారం… కాలక్రమేణా మలుపు తిప్పింది. నర్సింలు మద్యానికి బానిస కావడం, భార్యపై అనుమానం పెంచుకోవడం వల్ల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ వేధింపులు భరించలేక శోభ తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లి నివసిస్తోంది. అయితే, భార్యపై అనుమానం పెంచుకున్న నర్సింలు ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. ఈ నెల 21న “నీ కుమారుడికి సైకిల్ కొనిపెడతాను” అంటూ మాయ మాటలతో శోభను షాద్‌నగర్‌కు పిలిపించాడు. గదిలోకి తీసుకెళ్లిన అనంతరం మద్యం సేవించిన నర్సింలు మళ్లీ గొడవకు దిగాడు. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో… ముందుగానే సిద్ధం చేసుకున్న గ్రానైట్ రాయితో శోభ తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం గదిలోని రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేసి, అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని మూటకట్టి బైక్‌పై తీసుకెళ్లాడు.అయితే ఈ ఘటనలో అత్యంత హృదయ విదారక అంశం… అదే బైక్‌పై మృతదేహంపై తన మూడేళ్ల కుమార్తెను కూర్చోబెట్టి వెళ్లడం. రంగారెడ్డిగూడ శివారులోని ఓ పొలంలో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను ట్రాక్ చేసి, కొన్ని గంటల్లోనే లింగంపల్లిలో నర్సింలును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన రాయి, రక్తపు మరకలున్న దుస్తులు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా… ఈ ఘటనలో మరొక విషాదకర దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాత్రంతా చలిలో, చీకట్లో ఆ చిన్నారి తన తల్లి మృతదేహం పక్కనే కూర్చొని ఏడుస్తూ గడిపింది. ఎంత పిలిచినా అమ్మ స్పందించకపోవడంతో… ఆ పసిప్రాణం చేసిన రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.ఉదయం గ్రామస్థులు చిన్నారి ఏడుపు విని దగ్గరకు వెళ్లి చూడగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ప్రేమతో ప్రారంభమైన బంధం… అనుమానంతో విషాదాంతానికి చేరిన ఈ ఘటన… సమాజాన్ని కుదిపేస్తోంది.

Publish Date: Mar 23, 2026 9:34PM

political-news-img

దేశంలో పరిశ్రమలకు ఏపీనే బెస్ట్ ప్లేస్ : సీఎం చంద్రబాబు

అనకాపల్లిలో జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే కాదని... స్టీల్ సిటీ నిర్మాణం కోసమని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం చాలా మంచి పరిణామమని.. అనకాపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెట్టడానికి ఈ స్టీల్ ప్లాంట్ ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు అనే నేను చెబుతున్నా... పరిశ్రమలకు ఏపీనే బెస్ట్ ప్లేస్ అంటూ సీఎం ప్రకటించారు. సోమవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు శంకుస్థాపన ఘనంగా జరిగింది. కేంద్రమంత్రి హెచ్‌డి కుమార స్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ సంస్థకు చెందిన ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుపస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘‘20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును శంకుస్థాపన చేసుకున్నాం. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షమంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాజెక్టు రావడానికి కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్‌ను అభినందిస్తున్నా. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు. రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సంస్థకు జాతీయ స్థాయిలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచి పేరుంది. ఇలాంటి సంస్థ ఏపీకి రావడం చాలా మంచి పరిణామం. అందుకే చెబుతున్నాను... ఇవాళ జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే కాదు... స్టీల్ సిటీకి జరిగిన శంకుస్థాపన. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతుంది. 2028 నాటికి ప్లాంట్‌లో మొదటి దశ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్సెన్, డిసెంబరు నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేస్తారు. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారి కూడా పూర్తి అవుతుంది. పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ కూడా వేయబోతున్నారు. ఈ ప్లాంట్ కోసం పైప్ లైన్ వేయాలని ప్రధానిని కోరితే వెంటనే అంగీకరించారు. ఉక్కు ఉత్పత్తి ఒక్కటే కాదు ఆర్ధిక లావాదేవీలతో విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయి” అని సీఎం చంద్రబాబు చెప్పారు. అనుమతులు వేగంగా ఇస్తాం... అదే వేగంతో అభివృద్ధి చేయండి “ఈ పరిశ్రమకు ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులను ఒక్క ఏపీలోనే ఇచ్చాం. చంద్రబాబు అను నేను చెబుతున్నాను... దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం, రాష్ట్రం ఉంది. నిపుణులు, మానవ వనరులు ఏపీకి మాత్రమే సొంతం. టూరిజం నుంచి డేటా సెంటర్ వరకూ, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకూ అన్నింటికీ ఏపీలో మెండైన అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలతో వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే నినాదాన్ని విజయవంతం చేస్తాం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావటం దేశంలో ఇదే తొలిసారి. బీపీసీఎల్ సహా పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లోనే రాష్ట్రానికి 20.35 లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. విశాఖ ఎకనామిక్ రీజియన్ నాలెడ్జి ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ సెంటర్లు ఇలా కీలకమైన కేంద్రంగా విశాఖ మారుతోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి. రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారుతుంది. పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ద్వారా అందిస్తాం. కొత్తగా పోర్టులు, ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తాం. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకునేందుకు సహకారం ఇస్తాం. ఈ పరిశ్రమ నిర్మాణంలో రైతులు తమ భూములను త్యాగం చేశారు. వారికి సహకారం అందించాలి. ఉక్కు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మొదటిగా అనకాపల్లి జిల్లా యువతకు ఈ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలి. ఆవిష్కరణల కోసం మెటలర్జీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు” అని ముఖ్యమంత్రి అన్నారు. అభివృద్ధి చేస్తామని చెప్పాం... చేసి చూపిస్తున్నాం “ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైంది. రాష్ట్రంపై ప్రధాని చూపిస్తున్న అభిమానానికి ఈ వేదిక పైనుంచి మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రధాని మోదీ చెప్పిన Chip to Ship తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో నేడు ఈ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్ విజయం ఇది. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తామని... నేను, పవన్ కళ్యాణ్ చెప్పాం. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన చేసి చూపిస్తున్నాం. ఏ పని తలపెట్టినా సంపూర్ణ మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తున్నా. మంత్రి లోకేష్ పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.”అని సీఎం చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఒప్పందం యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో రెండు వేర్వేరు ఒప్పందాలను ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ సంస్థ చేసుకున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు నైపుణ్యాలు కల్పించేలా ఒక ఒప్పందం, ఆధునిక ఉత్పత్తి సామర్ధ్యాలపై సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు మరో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అత్యాధునిక మెటలర్జికల్ ఇనిస్టిట్యూట్ ద్వారా యువతకు మెరుగైన నైపుణ్యం, తయారీ సామర్ధ్యాలను కల్పిస్తామని ఆర్సెలార్ మిట్టల్ -నిప్పన్ స్టీల్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ ప్రకటించారు. ఎక్స్ పీరియన్స్ జోన్ సందర్శన శంకుస్థాపన కార్యక్రమానికి ముందు అదే ప్రాగంణంలో ఏర్పాటు చేసిన ఎక్స్ పీరియన్స్ జోన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎక్స్ పీరియన్స్ జోన్ ను సందర్శించారు. AM-NS ఇండియా ప్లాంట్ కు సంబంధించిన వివరాలు, ఉక్కు రంగంలో AM-NS ఇండియా సంస్థ ప్రగతి వంటి అంశాలపై ప్రదర్శించిన వీడియోలను తిలకించారు. దశల వారీగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ మీనియేచర్ ను సీఎం, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎం, మంత్రులు తిలకించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి జిల్లా ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆర్సెలార్ మిట్టర్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఆర్సెలార్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రతినిధులు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Publish Date: Mar 23, 2026 9:11PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img