Top Stories

political-news-img

సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్‌ తయారీ కేంద్రం గుట్టురట్టు

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం పీచేర్యాగడి తండాలో అక్రమంగా డ్రగ్స్‌ తయారీ చేస్తున్న ముఠా గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో రహస్యంగా మెఫెడ్రోన్‌ (ఎండీ) అనే మాదక ద్రవ్యాన్ని తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో సుమారు 3 కిలోల మెఫెడ్రోన్‌తో పాటు డ్రగ్స్‌ తయారీకి ఉపయోగించే రసాయన ముడి పదార్థాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌, రసాయనాల విలువ సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రాథమిక విచారణలో డ్రగ్స్‌ తయారీకి అవసరమైన రసాయనాలను ముంబై నుంచి తీసుకువచ్చి ఫామ్‌హౌస్‌లో నిల్వ చేసి.. అక్కడే తయారీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తయారీలో పాల్గొంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తదుపరి విచారణ నిమిత్తం మహారాష్ట్రకు తరలించారు. ఈ డ్రగ్స్‌ తయారీ కేంద్రం వెనుక మరెవరైనా ఉన్నారా? తయారైన డ్రగ్స్‌ను ఏ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు? ఇతర రాష్ట్రాలతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 4న ముంబై సమీపంలోని మీరా రోడ్‌లో 1.324 కిలోల మెఫెడ్రోన్‌ స్వాధీనం చేసుకున్న కేసుతో దర్యాప్తు ప్రారంభమైంది. ఆ కేసులో అరెస్టైన నిందితుల విచారణలో మరికొందరు వ్యక్తుల ప్రమేయం బయటపడింది. వారిని విచారించగా, జహీరాబాద్‌ పరిధిలోని పీచేర్యాగడి తండాలో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తయారీ కేంద్రం నడుస్తున్నట్లు సమాచారం లభించింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి 3 కిలోల డ్రగ్స్‌, రసాయనాలు, తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై డ్రగ్స్‌ కేసుతో ప్రారంభమైన దర్యాప్తు చివరకు సంగారెడ్డి జిల్లాలోని ఈ భారీ డ్రగ్స్‌ తయారీ కేంద్రాన్ని వెలుగులోకి తెచ్చింది

Publish Date: Jun 3, 2026 10:41AM

political-news-img

యాప్ లకు కాలం చెల్లింది.. సత్య నాదేళ్ల

సాంకేతిక ప్రపంచంలో త్వరలోనే ఊహించని భారీ మార్పు రాబోతోంది. మనం ప్రతిరోజూ స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్‌లు, రకరకాల యాప్‌ల ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోనుంది. వాటి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ ఏజెంట్లు భర్తీ చేయనున్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిల్డ్ 2026 కాన్ఫరెన్స్‌లో ఆ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ఈ సంగతి చెప్పారు. ఇకపై మానవులకు, కంప్యూటర్లకు మధ్య ఏఐ ఏజెంట్లే ప్రధాన వారధిగా మారతాయన్నారు. ఈ సరికొత్త సాంకేతిక విప్లవం డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయబోతోందని చెప్పారు. ఈ అద్భుతమైన మార్పు కోసం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేగంగా ముందుకు సాగుతోందన్న సత్య నాదేళ్ల.. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ సొలారా అనే సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను మైక్రోసాఫ్ట్ సిద్ధం చేసిందని చెప్పారు. ఇది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, క్లౌడ్ సేవలను ఒకే చోట అనుసంధానిస్తుంది. దీనివల్ల కంప్యూటర్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం రానుంది. ఇప్పటివరకు మనం ఏదైనా పని చేయాలంటే దానికి సంబంధించిన ప్రత్యేకమైన యాప్స్ ఓపెన్ చేయాల్సి వచ్చేది. కానీ భవిష్యత్తులో అలాంటి యాప్స్ ఓపెన్ చేసే అవసరం లేకుండా.. నేరుగా ఏఐ ఏజెంట్ల ద్వారానే మన పనులన్నీ క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఒక రైలు టికెట్ బుక్ చేయాలన్నా, ఆహారాన్ని ఆర్డర్ చేయాలన్నా, సమాచారాన్ని వెతకాలన్నా వేర్వేరు యాప్‌లపై ఆధారపడుతున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఏఐ ఏజెంట్లు మన తరఫున ఆయా పనులను పూర్తి చేస్తాయి. ఇవి కేవలం ఏదో ఒక యాప్‌కే పరిమితం కాకుండా.. వేర్వేరు సాఫ్ట్‌వేర్లు, డివైజ్‌ల మధ్య అద్భుతమైన సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాయి. మనం ఇచ్చే వాయిస్ కమాండ్స్ లేదా చిన్న టెక్స్ట్ మెసేజ్ ఆధారంగా ఇవి క్షణాల్లో స్పందించి, కావలసిన పనిని సులువుగా ముగించేస్తాయి. ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్‌లో 'జస్ట్ ఇన్ టైమ్ యూఐ' అనే ఒక ప్రత్యేకమైన ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. దీనివల్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ప్రతి డివైజ్ కోసం విడివిడిగా యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్ చేయాల్సిన శ్రమ తప్పుతుంది. డివైజ్ స్క్రీన్ సైజు, యూజర్ ఇచ్చే వాయిస్ లేదా టచ్ వంటి ఆప్షన్లకు తగ్గట్లుగా ఏఐ ఏజెంట్లే స్వయంగా స్క్రీన్ డిజైన్‌ను మార్చేస్తాయి. ఈ సాంకేతికత వల్ల భవిష్యత్తులో సరికొత్త గ్యాడ్జెట్ల తయారీ ఖర్చు, వాటిని రూపొందించే శ్రమ డెవలపర్లకు చాలా వరకు తగ్గిపోతుంది. రాబోయే కాలంలో ప్రపంచం మొత్తం ఒకే ఒక్క ఏఐ అసిస్టెంట్‌తో నడవదని సత్య నాదెళ్ల వివరించారు. వేర్వేరు ప్రత్యేకమైన పనుల కోసం విభిన్న రంగాలకు చెందిన ప్రత్యేక ఏఐ ఏజెంట్లు అందుబాటులోకి వస్తాయన్న ఆయన.. ఈ విభిన్న ఏజెంట్లను కంట్రోల్ చేయడానికి, పర్యవేక్షించడానికి మైక్రోసాఫ్ట్ సరికొత్త టెక్నాలజీని తీసుకువస్తోందని వివరించారు. ఏ పనిని ఏ ఏఐ ఏజెంట్‌కు అప్పగించాలో ఏజెంట్ టాస్క్ మేనేజర్ స్వయంగా నిర్ణయిస్తుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో తమ సొంత ఏఐ ఏజెంట్లను సులువుగా వాడుకోవడానికి మైక్రోసాఫ్ట్ అవకాశం కల్పిస్తోంది. సాంకేతిక రంగంలో రాబోతున్న ఈ సరికొత్త మార్పు డిజిటల్ యూజర్ల అనుభవాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లనుందనడంలో సందేహం లేదు.

Publish Date: Jun 3, 2026 10:16AM

political-news-img

వైభవ్ సూర్యవంశీ ఇన్ బ్లూ జెర్సీ.. స్పష్టమైన సంకేతాలిచ్చిన బీసీసీఐ

ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఓ 15 ఏళ్ల కుర్రాడు సృష్టించిన సునామీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ముంగిటకు చేరుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి, ప్రపంచ మేటి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియా తరఫున ఆడనున్నాడు. కేవలం 15 సంవత్సరాల వయస్సులోనే అత్యున్నత స్థాయి క్రికెట్‌లో అసాధారణ ప్రతిభను కనబరిచిన వైభవ్‌ను జాతీయ జట్టులోకి వేగంగా తీసుకురావాలని బీసీసీఐ సెలక్టర్లకు బలమైన సంకేతాలు పంపింది. వైభవ్ బ్యాటింగ్ శైలి, అతని మైండ్ సెట్ చూసిన బోర్డు పెద్దలు, అతనికి ఏది అవసరమో అది చేయాలని సెలక్షన్ కమిటీకి స్పష్టం చేయడంతో వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ నమోదు చేసిన గణాంకాలు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. టోర్నీలో ఆడిన 16 మ్యాచ్‌లలో నమ్మశక్యం కాని విధంగా 237.31 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి, ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన బ్యాటింగ్‌తో బీభత్సం సృష్టించిన ఈ బేబీ బాస్.. ఏకంగా 72 భారీ సిక్సర్లు బాదాడు. మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. ఐపీఎల్ 2026లో 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ మెరుపు ప్రదర్శనే ఇప్పుడు అతడిని నేరుగా సీనియర్ జాతీయ జట్టుకు ప్రమోట్ అయ్యేలా చేస్తోంది. ఈ యువ కెరటం భవిష్యత్తుపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని కొనియాడిన ఆయన, రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ఎంపిక సమావేశాల్లో సెలక్టర్లు అతని ప్రదర్శనను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకుంటారన్నారు. వైభవ్ కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు బీసీసీఐ నుంచి అన్ని విధాలా పూర్తి సహకారం ఉంటుందన్న ఆయన ఈ నెలాఖరులో భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో వైభవ్‌కు తొలిసారిగా టీమిండియా నుంచి అధికారిక పిలుపు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీని వయసుతో సంబంధం లేకుండా వెంటనే భారత జట్టుకు ఎంపిక చేయాలని ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ను బహిరంగంగానే కోరారు. ప్రస్తుతం ఇండియా ఏ జట్టులో కొనసాగుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను, ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా సీనియర్ జట్టులోకి ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. ఒకవేళ ఇంగ్లండ్ లేదా ఐర్లాండ్ టూర్‌లో వైభవ్ అరంగేట్రం చేస్తే, అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రికార్డులను తిరగరాయడం ఖాయం. భారత క్రికెట్‌లో సరికొత్త శకానికి నాంది పలుకుతూ ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ బ్లూ జెర్సీలో అడుగుపెట్టే క్షణం కోసం దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Publish Date: Jun 3, 2026 10:04AM

political-news-img

ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న ఎల్ నినో

ప్రపంచ దేశాలను ఎల్ నినో బెంబేలెత్తిస్తున్నది. ఈ ఏడాది ఎల్ నినో పభావం ఊహించిన దానికంటే భయంకరంగా, బలంగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా వేగంగా పెరుగుతున్నాయని.. ఇది రాబోయే విపత్తుకు విస్పష్ట సంకేతమని ఐక్యరాజ్యసమితికి చెందిన ఈ ఏజెన్సీ పేర్కొంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డబ్ల్యూఎంఓ విడుదల చేసిన తాజా గణాంకాలు, అంచనాల మేరకు ఈ జూన్ నుండి ఆగస్టు మధ్య కాలంలో ఎల్ నినో ఏర్పడేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆ తరువాత నవంబర్ నెల నాటికి ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి రెండు నుండి ఏడేళ్లకోసారి వచ్చే ఈ సహజసిద్ధమైన వాతావరణ ప్రక్రియ, ఈసారి మానవ తప్పిదాల వల్ల పెరిగిన భూతాపంతో జతకట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్త వర్షపాత సరళిని తలకిందులు చేయనుంది. ఈ ఎల్ నినో ప్రభావం వల్ల భూగోళంపై కొన్ని ప్రాంతాలు తీవ్రమైన కరవు కాటకాలతో అల్లాడిపోతుంటే, మరికొన్ని ప్రాంతాలు అకాల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం కానున్నాయి. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిపోయిన భూమికి, రాబోయే ఎల్ నినో తోడైతే వాతావరణ మార్పుల తీవ్రత అనూహ్యంగా ఉంటుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎల్ నినో ప్రభావంతో వచ్చే ఏడాది చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా (హాటెస్ట్ ఇయర్ ఇన్ హిస్టరీ) రికార్డు సృష్టించే ప్రమాదం ఉందని డబ్ల్యూఎంఓ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Publish Date: Jun 3, 2026 9:49AM

political-news-img

చరిత్రలో నిలిచిపోయేలా గోదావరి పుష్కరాలు

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే గోదావరి పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలని చంద్రబాబు సంకల్పించారు. వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా క్రతువును రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాలపై మంగళవారం (జూన్ 2) సచివాలయంలో మంత్రులు, అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ ప్రతిష్టాత్మక ఉత్సవాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ పుష్కరాలు కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుకగా మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే ఒక అద్భుతమైన అవకాశంగా మార్చాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఏక తాటిపైకి వచ్చి, సమన్వయంతో పనిచేసినప్పుడే ఇంతటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమన్నారు. ఈ సారి జరగబోయే గోదావరి పుష్కరాలకు ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత తోడుకానుంది. పుష్కరాల నాటికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, దానిని జాతికి అంకితం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పవిత్ర గోదావరి నది తీరానికి వచ్చే కోట్లాది మంది భక్తులకు, పర్యాటకులకు పోలవరం ప్రాజెక్టు ఒక అదనపు ఆధ్యాత్మిక, వినోదాత్మక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన వివరించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుండి పోలవరం ప్రాజెక్టు వరకు విస్తరించి ఉన్న సుదీర్ఘమైన సుందర ప్రాంతాన్ని అఖండ గోదావరి కారిడార్ గా అద్భుతంగా అభివృద్ధి చేయాలని ఆయన ఒక సరికొత్త విజన్‌ను అధికారుల ముందుంచారు. ఈ కారిడార్ కేవలం పుష్కరాల కోసమే కాకుండా, భవిష్యత్తులో శాశ్వత పర్యాటక కేంద్రంగా విరాసిల్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పుష్కరాల కోసం ప్రభుత్వం కేటాయించే నిధులు, నిర్మించే మౌలిక సదుపాయాలు తాత్కాలికంగా కాకుండా, గోదావరి బేసిన్ ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. రహదారుల విస్తరణ, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఘాట్ల శాశ్వత నిర్మాణాలు వంటి పనుల ద్వారా ఈ ప్రాంత రూపురేకలు మారిపోనున్నాయి. ముఖ్యంగా, సాంస్కృతిక రాజధానిగా పిలవబడే రాజమహేంద్రవరం నగరం, ఈ పుష్కరాల తదుపరి మౌలిక సదుపాయాల అభివృద్ధితో ఒక ప్రధాన అంతర్జాతీయ మహానగరంగా రూపాంతరం చెందుతుందని ఆయన చెప్పారు. భక్తుల రద్దీని తట్టుకునేలా నగరంలో శాశ్వత ప్రాతిపదికన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించాలని ఆదేశించారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ వంటి 6 ప్రధాన జిల్లాల పరిధిలో మొత్తం 525 పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి పుష్కరాల మహోత్సవంలో దాదాపు పది కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ భారీ జనాభా ప్రవాహాన్ని నియంత్రించడానికి, భక్తుల భద్రత, సౌకర్యార్థం రోడ్డు, రైల్వే ట్రాఫిక్ యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు. గందరగోళం లేకుండా ఉండేందుకు ప్రతి పుష్కర ఘాట్‌కు క్రమపద్ధతిలో నిర్దిష్టమైన నంబర్లను కేటాయించాలని ఆదేశించారు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరుతూ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేకంగా లేఖ రాయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన సిఫార్సులు, సూచనలను ఈ మాస్టర్ ప్లాన్‌లో చేర్చాలని సీఎం స్పష్టం చేశారు. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి జూన్ 24 కల్లా పూర్తి స్థాయి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తన ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే రోజు ప్రణాళికను ఆమోదించి, 2027 గోదావరి పుష్కరాలకు అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Publish Date: Jun 3, 2026 9:19AM

political-news-img

ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయం గుప్పిట చిక్కుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. బుధవారం (మే 3) తెల్లవారుజామున ఇరాన్ సాయుధ దళాలు కువైట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలే ప్రధాన లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ దాడిని కువైట్ వాయు రక్షణ వ్యవస్థ (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను కువైట్ సైన్యం గాల్లోనే విజయవంతంగా పేల్చివేసింది. తమ సైనిక సిబ్బందిని రక్షించుకోవడంలో వాయు రక్షణ దళాలు కీలక పాత్ర పోషించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్ )స్పష్టం చేసింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నామని, ఈ ఘటనలో అమెరికా దళాలకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదనీ సెంట్కామ్ అధికారిక ప్రకటనలో ధ్రువీకరించింది.ఈ దాడి నేపథ్యంలో కువైట్ సైన్యం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. కువైట్ ఆకాశంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శిథిలాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, ఆకాశం నుంచి కూలిపోయిన వస్తువులు లేదా క్షిపణి అవశేషాల వద్దకు ఎవరూ వెళ్లవద్దని కువైట్ రక్షణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, ఇటీవల తమ దేశానికి చెందిన కీలకమైన రాడార్ వ్యవస్థలు, డ్రోన్ సైట్లపై అమెరికా మిలిటరీ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడులకు పాల్పడ్డామని ఇరాన్ ప్రభుత్వ మీడియాపేర్కొంది. కువైట్‌లో మోహరించిన అమెరికాకు చెందిన ఐదో ఫ్లీట్ , ప్రధాన ఎయిర్ బేస్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించామని ఇరాన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో గల్ఫ్ రీజియన్‌లో ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయి యుద్ధం సంభవించవచ్చనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇరాన్ క్షిపణి దాడులు జరిగిన సమయంలోనే, హర్మూజ్ జలసంధిలోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవి ప్రాంతంలోనూ భారీ పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. ఇరాన్ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో వరుసగా భారీ శబ్దాలు వినిపించినట్లు మీడియా పేర్కొంది. అయితే ఈ అంతర్గత పేలుళ్లకు గల అసలు కారణాలు ఏమిటనే దానిపై స్పష్టత లేదు. ఇరాన్ దాడుల ప్రకంపనలతో పొరుగునే ఉన్న బహ్రెయిన్ దేశంలోనూ అర్ధరాత్రి యుద్ధ సైరన్లు మోగాయి. బహ్రెయిన్ సైన్యం కూడా తమ రక్షణ వలయాలను అప్రమత్తం చేసింది.ఇరాన్ అనాలోచిత చర్యలను కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రాంతీయ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఇరాన్ వ్యవహరిస్తోందని మండిపడింది. ఈ తాజా సైనిక ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి చర్చలకు ఆటంకం ఏర్పడింది.

Publish Date: Jun 3, 2026 9:07AM

MOVIE NEWS