political-news-img

బెయిల్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఎస్సై

హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే అదే చట్టాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించి చివరకు ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నాడు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వి. నరసింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు, భవిష్యత్తులో ఆ కేసు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానంటూ ఎస్సై నరసింహులు ఫిర్యాదిదారుడి వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అంత మొత్తం ఇవ్వలేనని ఫిర్యాదిదారుడు చెప్పడంతో ఇద్దరి మధ్య బేరసారాలు జరిగాయి. చివరకు తొలి విడతగా రూ.50 వేల చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. అయితే ఎస్సై అవినీతికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న ఫిర్యాదిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, మంగళవారం సాయంత్రం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లోనే డబ్బులు అందజేసేలా ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదిదారుడి నుంచి ఎస్సై నరసింహులు రూ.50 వేల లంచం తీసుకుంటుండగానే హైదరాబాద్ సిటీ రేంజ్-1 ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం ఆయన సూచించిన ప్రదేశం నుంచి కలుషితమైన రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుంది. తర్వాత గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లోని ఎస్సై కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించి సంబంధిత పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. విధి నిర్వహణలో నిజాయితీ పాటించాల్సిన బాధ్యతను విస్మరించి, అక్రమ ప్రయోజనం కోసం లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఎస్సై నరసింహులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏసీబీ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే 94404 46106 వాట్సాప్ నంబర్ ద్వారా లేదా ఏసీబీ సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Publish Date: Jun 23, 2026 8:26PM

political-news-img

సీఎం విజయ్‌ వ్యక్తిగత జీవితంపై ఉదయనిధి షాకింగ్ కామెంట్స్

తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మాట్లాడుతూ, గత డీఎంకే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు. పరిపాలనా దక్షత అంటే ఒకదాని తర్వాత ఒకటి అవినీతికి పాల్పడి, ఆ తర్వాత జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడం కాదంటూ సీఎం విజయ్ ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో టాస్మాక్ (TASMAC) మద్యం విక్రయాల ద్వారా 'పార్టీ నిధుల' పేరిట భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఆ విధంగా దోచుకున్న ప్రతి పైసాను తాము తిరిగి ప్రభుత్వ ఖజానాకు మళ్ళిస్తున్నామని విజయ్ సంచలన ప్రకటన చేశారు. గత ప్రభుత్వం తమిళనాడును ఏకంగా రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిందని, ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ఆయన లెక్కలతో సహా ధ్వజమెత్తారు. సీఎం విజయ్ చేసిన ఈ 'పార్టీ ఫండ్స్' లూటీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరియు డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరపెడుతూ, ధైర్యముంటే ఆ పార్టీ పేరును స్పష్టంగా చెప్పాలని, ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని ఉదయనిధి స్టాలిన్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఉదయనిధి డిమాండ్ చేయగా, సభాపతి జె.సి.డి. ప్రభాకర్ ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన తర్వాతే అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు. ఈ క్రమంలో సీఎం విజయ్ తన దూకుడును మరింత పెంచారు. కేవలం టాస్మాక్ మాత్రమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో పార్టీ నిధుల పేరిట దోచుకున్న సొమ్మును ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభుత్వ ఖజానాకు రాబడతామని ఉద్ఘాటించారు. ప్రజల సొమ్ము నుండి ఒక్క పైసా కూడా తాము తాకబోమని, వేరే ఎవరినీ తాకనివ్వబోమని, ఒకవేళ గతంలో ఎవరైనా దుర్వినియోగం చేసి ఉంటే వారిని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని విజయ్ గట్టిగా హెచ్చరించారు. డీఎంకే నేతలు తమపై విమర్శలు చేయడానికి ఒక కొత్త అస్త్రాన్ని వాడుతున్నారని, తమ పూర్వ మిత్రపక్షాల దయ వల్లే ఈ ప్రభుత్వం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారని విజయ్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రజల బలమైన తీర్పు (మాండేట్) మరియు మనస్సాక్షి ప్రకారం పనిచేసే మిత్రపక్షాల మద్దతుతోనే నడుస్తోందని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు తమకు స్వతంత్రంగానే మద్దతు ప్రకటించాయని, అలాంటప్పుడు డీఎంకే నేతలకు ఎందుకు అంత కోపం, ఆవేదన అని విజయ్ ప్రశ్నించారు. ఈ విధంగా తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా సీఎం విజయ్ మరియు ఉదయనిధి స్టాలిన్ మధ్య జరిగిన ఈ పోరు రాబోయే రోజుల్లో తమిళ పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.

Publish Date: Jun 23, 2026 8:14PM

political-news-img

పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కేటీ థామస్‌ పద్మవిభూషణ్‌ అందుకోగా.. సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్‌తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. కళారంగంలో విశేష సేవలు అందించిన టాలీవుడ్ సీనియర్ నటులు 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్, ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరిద్దరూ ఈ అత్యున్నత పౌర పురస్కారాలను స్వీకరించారు.. అలాగే, వీరితో పాటు సినీనటుడు మాధవన్‌, క్రికెటర్‌ రోహిత్‌ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ అట్టహాసమైన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, దేశవ్యాప్త ప్రముఖులు విచ్చేశారు. వివిధ రంగాలలో సమాజానికి అసమాన సేవలు అందించిన మొత్తం 47 మంది వీరులకు ఈ విడతలో పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో తెలుగు చిత్రసీమకు చెందిన ఇద్దరు అగ్ర నటులు ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు, సినీ అభిమానులకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించి, తనదైన హాస్య చతురతతో, వైవిధ్యమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన రాజేంద్రప్రసాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో గౌరవించింది. ఆయన పద్మశ్రీ పురస్కారం స్వీకరిస్తున్న సమయంలో రాష్ట్రపతి భవన్ సభామండపం చప్పట్లతో మారుమోగింది. తెలుగు తెరపై హాస్యానికి సరికొత్త అర్థం చెప్పిన నటుడిగా ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మరోవైపు నటుడిగా, జయభేరి బ్యానర్‌పై ఎన్నో సందేశాత్మక చిత్రాలను నిర్మించిన నిర్మాతగా, అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడిగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మురళీమోహన్‌కు సైతం పద్మశ్రీ దక్కింది. సమాజ సేవలోనూ, వ్యాపార రంగంలోనూ రాణిస్తూనే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఆయనకు ఈ పురస్కారం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పురస్కారాల పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ వంటి సీనియర్లకు ఈ గౌరవం దక్కడం చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభ పరిణామమని, ఇది టాలీవుడ్ ప్రతిష్టను జాతీయ స్థాయిలో మరింత పెంచిందని పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా రంగం నుంచి మరింత మంది అర్హులైన ప్రతిభావంతులకు రాబోయే రోజుల్లోనూ ఇటువంటి జాతీయ గౌరవాలు దక్కాలని తెలుగు ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు. నటనలోనే కాకుండా సమాజ హితం కోసం పాటుపడే కళాకారులకు ఈ అవార్డులు మరింత స్ఫూర్తినిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Publish Date: Jun 23, 2026 7:13PM

political-news-img

భరత్‌ తివారీ ఎన్‌కౌంటర్... బీహార్‌లో రాజకీయ దుమారం

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం, రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. భరత్ లొంగిపోయినా, నిరాయుధుడైన తర్వాతే పోలీసులు కాల్చి చంపారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తుండగా, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. జూన్ 17, 2026న భోజ్‌పూర్ జిల్లాలోని బిలౌటి గ్రామంలో పోలీసులు, భరత్ తివారీ మధ్య జరిగిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో మరణించారు. భరత్ తివారీ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని, అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై అతనే ముందుగా కాల్పులు జరిపినట్లు పోలీసులు అంటున్నారు. భరత్ తివారీ లొంగిపోయి, తన వద్ద ఉన్న ఆయుధాన్ని పక్కన పడేసిన తర్వాతే పోలీసులు కాల్పులు జరిపారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూపిస్తూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భరత్‌తివారీ ఎన్‌కౌంటర్‌తో పెరుగుతున్న ప్రజా ఆగ్రహంతో బీహార్ ప్రభుత్వం నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర దర్యాప్తు జరపాలని మరియు దోషులైన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భరత్ తివారీ స్థానిక సమస్యల కోసం నిలబడే కార్యకర్త అని స్థానికులు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం, పోలీసు సిబ్బందిని సోషల్‌మీడియాలో బెదిరించేవాడన్న ఆరోపణలున్నాయి. 2026 జూన్ 15న, భరత్ తివారీ తాను ఈ దేశంలో ఒక విప్లవ యుద్ధం ప్రారంభించబోతున్నట్లు ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు పెట్టాడు. అలాగే జగదీష్‌పూర్ ఎస్‌డిఎమ్‌ను చంపుతానని బెదిరించాడన్న ఆరోపణలున్నాయి. అప్పుడే పోలీసు శాఖకు చెందిన ఇద్దరు అధికారులు తివారీ నివాసానికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో అతను ఇంట్లో లేడు. ఆ రోజు అతను పోలీసుల ఎదుట కూడా హాజరు కాలేదు. ఆ క్రమంలో జూన్ 16న ఒక వ్యక్తి ఆయుధాలు కలిగి ఉండి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడని షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. బిలౌతి గ్రామంలో నివసించే భరత్ భూషణ్ తివారీని సదరు అనుమానితుడిగా గుర్తించారు. భరత్‌ను ప్రశ్నించడానికి పోలీసులు అతని నివాసానికి చేరుకున్నప్పుడు, అతని వద్ద తుపాకీ ఉంది. అతను ఫేస్‌బుక్ లైవ్‌లోకి వెళ్లి అధికారులతో మాట్లాడాడు. ఆ ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో, దానికి సంబంధించిన పోస్టులలో, ఎన్‌కౌంటర్ ద్వారా తనను చంపడానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భరత్ ఆరోపించాడు. అధికారులు తనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని పేర్కొంటూ, వ్యవస్థకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు విస్తృతంగా షేర్ అవుతున్న నేపథ్యంలో, భరత్‌ మానసికస్థితిపై అనుమానంతో, మానసిక ఆరోగ్య నిపుణుడి వద్దకు తరలించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని, భోజ్‌పూర్ పోలీసులు సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. అతని వద్ద ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో భరత్ మళ్లీ ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి, తనని తాను భగత్‌సింగ్‌తో పోల్చుకుంటూ, పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపధ్యంలో భరత్‌ ఉన్న చోటుకు చేరుకుని, లొంగిపోమని కోరినప్పటికీ భరత్ కాల్పులు కొనసాగించాడని బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా పోలీసులు నివేదించారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపటడంతో గాయపడ్డాడు.. పాట్నాలో ఉన్న పి.ఎం.సి.హెచ్‌లో చికిత్స పొందుతూ అతను మరణించాడు. భరత్ తివారీ మరణంతో బీహార్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ భరత్ తివారీ కుటుంబాన్ని పరామర్శించి క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని డిమాండ్ చేస్తున్నారు.

Publish Date: Jun 23, 2026 6:50PM

political-news-img

హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్-కిషన్ రెడ్డి డ్రామాలు : కేటీఆర్

హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లిలో నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏదో సాధించినట్లు చూపిస్తూ ఢిల్లీలో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. హైదరాబాద్‌లో పరస్పరం విమర్శలు చేసుకుంటూ, ఢిల్లీలో మాత్రం కలిసి కనిపించడం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు. హైదరాబాద్ మెట్రో పరిధిలోని సుమారు 250 ఎకరాల భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను కుటుంబ సభ్యులు, అనుచరులకు అప్పగించే భారీ కుంభకోణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు. ఈ ఉద్దేశంతోనే మెట్రో సంస్థ ఎల్‌అండ్‌టిని బ్లాక్‌మెయిల్ చేసి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థ అయిన ఎల్‌అండ్‌టి తీసుకున్న రూ.14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కేటీఆర్ విమర్శించారు. మెట్రోపై ప్రేమ ఉన్నట్లు చూపిస్తున్న రేవంత్ రెడ్డి చర్యల వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. మెట్రో విస్తరణ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్–పటాన్‌చెరు మెట్రో కారిడార్‌కు ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చిన్న నగరాలకు కూడా మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపిందని ఆరోపించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి విమానాశ్రయం వరకు భూసేకరణ అవసరం లేకుండా చేపట్టిన ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఇప్పటికి పూర్తై లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభించేదని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, దాన్ని 70 శాతానికి పైగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని కేటీఆర్ గుర్తుచేశారు. నగరంలో మెట్రో విస్తరణ మళ్లీ వేగం అందుకోవాలంటే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనకు తుగ్లక్, హిట్లర్ స్ఫూర్తిగా మారారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయడం తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది మందిపై ప్రభావం చూపే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలుకు మాత్రం నిధులు లేవని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని, గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిధులు తీసుకొచ్చిందో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరాలంటే కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే రోజుకోసం ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Publish Date: Jun 23, 2026 6:41PM

political-news-img

సైబరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు

సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. పుప్పాలగూడలోని కంచి కేఫ్, నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, ఆహార నిల్వ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. తనిఖీల సందర్భంగా పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో కిచెన్, స్టోర్‌రూమ్ మధ్య ఓపెన్ డస్ట్‌బిన్లు ఉండటంతో దుర్వాసనతో పాటు ఈగల సమస్య కనిపించింది. స్టోర్‌రూమ్ సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోవడం, కూరగాయలు కట్ చేసే ప్రాంతాలు, గ్రైండింగ్ విభాగాల్లో నీరు నిల్వ ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కాలీఫ్లవర్‌పై ఫంగస్ పెరిగి ఉండటం, డ్రెయిన్ల వద్ద దుర్వాసన రావడం, ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన పిండిపై సరైన లేబులింగ్ లేకపోవడం కూడా బయటపడింది. కిచెన్, స్టోర్‌రూమ్‌లో ఈగలు, బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్‌కు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవని వెల్లడించారు. ఆహార పదార్థాల లేబులింగ్, హౌస్‌కీపింగ్ ప్రమాణాలను మెరుగుపరచాలని సూచిస్తూ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఇక నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్‌లో కూడా పలు లోపాలు బయటపడ్డాయి. చికెన్, డెజర్ట్స్ వంటి ఆహార పదార్థాలపై సరైన లేబుల్స్ లేకపోవడంతో వాటిని అధికారులు వెంటనే తొలగించారు. గ్రైండింగ్ ఏరియా సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోవడం, సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్‌కు సంబంధించిన రికార్డులు లేకపోవడం గుర్తించారు. జిడ్డుగా మారిన కిచెన్ సీలింగ్‌ను తక్షణమే శుభ్రం చేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. ఆహార తయారీ, నిల్వ, విక్రయాల్లో నిర్దేశిత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని రెస్టారెంట్ యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Publish Date: Jun 23, 2026 5:47PM

MOVIE NEWS