RELATED NEWS
NEWS
అమెరికాలో బాలమురళి జయంతోత్సవం జరిపిన సిలికానాంధ్ర సంపద


అమెరికాలో బాలమురళి జయంతోత్సవం జరిపిన సిలికానాంధ్ర సంపద




అమెరికాలోని కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ "సంపద" ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సామ్రాట్ తెలుగువారు గర్వించదగిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 91వ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు ఈ నెల జులై 4వ తారీఖున అంతర్జాల మాధ్యమాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది లబ్దప్రతిష్టులైన కళాకారులు హాజరై బాల మురళి కృష్ణ గారితో తమకున్న అనుభవాన్ని మరియు అనుబంధాలని వీక్షకులతో పంచుకున్నారు.

ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి గారు మాట్లాడుతూ సంపద వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అని, డాక్టర్ బాల మురళి కృష్ణ గారు కారణజన్ములు అని వారికి సమకాలీకునిగా వారితో కలిసి శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర విద్య నేర్చుకోవడం తమకు భగవంతుడిచ్చిన గొప్ప వరంగా పేర్కొన్నారు. బాల మురళి కృష్ణ గారు సంగీతం లోనే కాకుండా లోనే కాకుండా వయోలిన్, వయోలా మరియు మృదంగం, కంజీర వంటి వాద్యాలలో కూడా చక్కటి ప్రతిభను కనపరిచేవారు అని పేర్కొన్నారు.

ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అని తాను భావిస్తానని వారు రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందని ఆ తర్వాత వారి కుటుంబంతో 50 సంవత్సరాలు పైగా అనుబంధ ఉందని ఇలాంటి కార్యక్రమాన్ని సంపద ద్వారా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలియజేశారు.

ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధ రఘునాథన్ మాట్లాడుతూ బాల మురళి కృష్ణ గారి జీవించి ఉన్న సమయంలో తను జీవించడం గొప్ప అదృష్టంగా భావిస్తానని ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు చిరునామా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వయసుతో నిమిత్తం లేకుండా అందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రోత్సహిస్తూ ఉండేవారని వారితో వేదిక పంచుకున్నటువంటి సందర్భాలు తన జీవితాంతం గుర్తుండిపోతాయి అని పేర్కొన్నారు. ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి గారు మాట్లాడుతూ బాల మురళి కృష్ణ గారు తెలుగు జాతికి గర్వకారణమని వారి జయంతి సందర్భంగా సంపద ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని వారితో వేదికను పంచుకున్న ఎటువంటి ఎన్నో సందర్భాలు మరపురాని సంఘటనలుగా గుర్తుండిపోతాయి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్రం నుంచి మంగళంపల్లి వారి శిష్యులు ప్రిన్స్ రామ వర్మ, హైదరాబాద్ నుంచి DV మోహన కృష్ణ పాల్గొని గురువు గారితో వారికున్న అనుభవాలని పంచుకుని, బాలమురళి గారు రచించి, స్వరపరచిన కీర్తనలను పాడి నివాళి అర్పించారు.



ఈ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బి ఎం సుందరం మరియు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్ గారు మరియు సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం గారు, మోదుమూడి సుధాకర్ గారు, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్ గారు, GV ప్రభాకర్ గారు, మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్ గారు, డాక్టర్ మంగళంపల్లి వంశీ గారు, కస్తూరి గోపాల రావు గారు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ గారి సీనియర్ శిష్యురాలు శ్వేత ప్రచండె, బాలమురళి గారి థిల్లానాలకు తన అద్భుతమైన నాట్య ప్రదర్శనతో వీక్షకులను అలరించింది. బాలమురళి గారి ప్రశిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి గారి కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు.

సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవన విశేషాల పై ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. దీనికి స్క్రిప్ట్ మరియు వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి(ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు . ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షులు దీనబాబు గారికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారి శిష్యులు, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ మరియు మమత కూచిభొట్ల బాలమురళి గారి అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు. 

TeluguOne For Your Business
About TeluguOne
;