political-news-img

ప్రియుడి కోసం పాముతో కరిపించి భర్తను హతమార్చిన భార్య..!

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..! ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో మానవ సంబంధాలను మంటగలిపేలా ఒక భయంకరమైన హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే కక్షతో ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మృతుడిని హస్తినాపూర్ పరిధిలో నివసించే అతుల్ పన్వార్‌గా పోలీసులు గుర్తించారు. అతడు తన భార్య దామినితో కలిసి ఒక ప్లే స్కూల్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే, ఇదే స్కూల్‌లో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అనే వ్యక్తితో దామినికి వివాహేతర సంబంధం ఏర్పడటమే ఈ ఘాతుకానికి దారితీసింది. తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో పాటు, అతుల్ పేరుపై ఉన్న రూ. 20 లక్షల బీమా సొమ్మును సొంతం చేసుకోవాలని వీరిద్దరూ పథకం వేశారు. మొదట అతడిని రోడ్డు ప్రమాదం రూపంలో చంపాలని ప్రయత్నించినప్పటికీ, ఆ ప్లాన్ ఫలించలేదు. దీంతో వారు మరింత భయంకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. పథకం ప్రకారం గురువారం రాత్రి దామిని తన భర్త తాగే పాలలో నిద్రమాత్రలను కలిపి ఇచ్చింది. ఆ పాలు తాగిన అతుల్ తీవ్రమైన నిద్రలోకి జారుకున్నాడు. ఆ వెంటనే ఆమె తన ప్రియుడు తుషార్ సహాయంతో ముందే సిద్ధం చేసుకున్న ఒక విషసర్పాన్ని బెడ్‌పైకి వదిలి, అతుల్‌ను కరిపించి కడతేర్చింది. మరుసటి రోజు ఉదయం అతుల్ ఎంతకీ లేవకపోవడంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఒంటిపై పాముకాటు గుర్తులు ఉండటంతో ఇదొక సాధారణ ప్రమాదంగా అంతా భావించినప్పటికీ, పోలీసులకు మాత్రం కొన్ని అనుమానాలు వచ్చాయి. రూరల్ ఎస్పీ అభిజీత్ కుమార్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. నిందితులైన దామిని, తుషార్‌ల మొబైల్ ఫోన్ కాల్ డేటా మరియు లొకేషన్ వివరాలను పరిశీలించగా పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. హత్య జరిగిన సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితులు ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. తుషార్‌కు కూడా ఇదివరకే వివాహమైందని, భార్యకు విడాకులు ఇచ్చి దామినితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘోరంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కోర్టు ద్వారా కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి నేరాలు సమాజానికి ప్రమాదకరమని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. Meerut Crime News, Wife Killed Husband With Snake, Uttar Pradesh Crime, Extramarital Affair Murder, Insurance Fraud Murder Case.

Publish Date: Jul 19, 2026 1:15PM

political-news-img

పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం.. విపక్షా పార్టీల వాకౌట్..!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సెషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఒక ప్రత్యేక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ అనెక్సీ భవనంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో సీట్ల కేటాయింపు వ్యవహారం పెద్ద వివాదానికి దారితీసింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీలకు కేంద్రం ప్రత్యేకంగా ఆసనాలు కేటాయించడమే కాకుండా, వారిని విడిగా ఆహ్వానించడంపై ప్రతిపక్షాల ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన సుమారు 20 మంది రెబల్ ఎంపీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఇండియా (NCPI) అనే కొత్త పార్టీలో విలీనమయ్యారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ 20 మంది తిరుగుబాటు ఎంపీల గ్రూపునకు ప్రత్యేకంగా ఒక టేబుల్‌ను, ప్రత్యేక సీట్లను కేటాయించడం వివాదానికి కేంద్ర బిందువైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ తిరుగుబాటు ఎంపీల కొత్త పార్టీని ఇంకా అధికారికంగా గుర్తించలేదని, గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండానే వారిని అఖిలపక్ష సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని ప్రతిపక్ష నేతలు నిలదీశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు ఒక్కసారిగా సమావేశం నుంచి బయటకు నడిచి వాకౌట్ చేశారు. ఈ నాటకీయ పరిణామంతో పార్లమెంట్ అనెక్సీ భవనం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వాకౌట్ రాజకీయంలో సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన (యూబీటీ) తో పాటు వామపక్ష పార్టీలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. ఒకే మాటపై నిలబడిన ఈ విపక్షాలు సభ వెలుపల తమ నిరసనను గట్టిగా వినిపించాయి. అయితే కొంతసేపటి తర్వాత ఉద్రిక్తతలు కాస్త సర్దుమణగడంతో, ప్రతిపక్ష కూటమి నేతలు తిరిగి వచ్చి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. వర్షాకాల సమావేశాల్లో తాము లేవనెత్తనున్న ప్రజా సమస్యలు, ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చలు కొనసాగించారు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఆకస్మిక రాజకీయ ప్రకంపనలు, రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎంత రసవత్తరంగా జరగనున్నాయో అనేదానికి స్పష్టమైన సంకేతంగా నిలిచాయి. All Party Meeting, India Bloc Walkout, Rebel TMC MPs Seating, Parliament Monsoon Session, Kiren Rijiju, NCPI Party, Mallikarjun kharge

Publish Date: Jul 19, 2026 12:56PM

political-news-img

"నా దగ్గర గన్ ఉంది" ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుడి హల్‌చల్..!

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. హుబ్లీకి వెళ్లాల్సిన 591 ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన వ్యక్తి, బోర్డింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రయాణికులను విమానం వద్దకు తీసుకెళ్తున్న బస్సులో ఎక్కాడు. ఈ సమయంలో ఏదో విషయంపై ఎయిర్‌వేస్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. వాగ్వివాదం జరుగుతుండగానే ఒక్కసారిగా "నా దగ్గర గన్ ఉంది... జాగ్రత్త" అంటూ వ్యాఖ్యానించడంతో అక్కడున్న సిబ్బంది, ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విమానాశ్రయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఎయిర్‌వేస్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమై వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. అతడు చేసిన వ్యాఖ్య నిజమేనా? అతని వద్ద నిజంగా ఏదైనా ఆయుధం ఉందా? లేక కోపోద్రిక్తతలో అలాంటి మాటలు మాట్లాడాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రయాణికుడి చర్యలపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశముంది. Passenger hustle and bustle at Shamshabad Airport, Rajiv Gandhi International Airport, Hubli.airways

Publish Date: Jul 19, 2026 12:36PM

political-news-img

తెలంగాణ బీజేపీలో ఆపరేషన్ సయోధ్య.. సక్సెస్ అవుతుందా..?

తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను తొలగించి, నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి హైకమాండ్ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ హైదరాబాద్‌ వేదికగా "ఆపరేషన్ సయోధ్య"ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అభయ్ పాటిల్ తెలంగాణ కమలం పార్టీ అగ్ర నేతలతో వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నారు. హైకమాండ్ నుంచి అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు తెలంగాణకు వచ్చిన పాటిల్, పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన ప్రత్యేకంగా బ్రేక్‌‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఉదయపు అల్పాహార సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నేతల మధ్య సమన్వయం మరియు రాబోయే పొలిటికల్ యాక్షన్ ప్లాన్ గురించి వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. హైకమాండ్ పంపిన ప్రధాన సందేశాన్ని రాష్ట్ర నాయకత్వానికి అభయ్ పాటిల్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క సమావేశంతోనే కాకుండా, గత 24 నుండి 48 గంటలుగా అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీకి చెందిన కీలకమైన ముగ్గురు అగ్ర నేతలతో విడివిడిగా సమావేశమై సుదీర్ఘ మంతనాలు జరిపారు. నిన్ననే ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ ఈటల రాజేందర్‌లతో కీలక భేటీలు పూర్తి చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయడం వంటి అంశాలపై వీరి మధ్య లోతైన చర్చ జరిగింది. ఈ ఇద్దరు కీలక నేతలతో భేటీ అనంతరం, అభయ్ పాటిల్ వెంటనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కూడా సమావేశమయ్యారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో జరిగిన భేటీలో అభయ్ పాటిల్ కొన్ని కీలక సూచనలు చేశారు. పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే అధికారిక సమావేశాలు, ప్రజా పోరాట కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి, ప్రజాక్షేత్రంలో బీజేపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే పరమావధిగా పనిచేయాలని హైకమాండ్ ఆదేశాలను నొక్కి చెప్పారు. ఈ వరుస భేటీలు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. త్వరలోనే తెలంగాణలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల యాక్షన్ ప్లాన్‌పై కూడా ఈ సమావేశంలో లోతుగా విశ్లేషించారు. ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ బూత్ స్థాయి నుంచి ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే వ్యూహాలను ఇరు నేతలు పంచుకున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లే అంశాలు ఈ చర్చల్లో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ భేటీ అనంతరం కాషాయ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేంద్ర పెద్దల మార్గదర్శకత్వంలో తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని, తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ అంతర్గత చర్చల ఫలితంగా త్వరలోనే పార్టీ పరంగా మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం కేవలం సాధారణ మర్యాదపూర్వక భేటీగానే బయటకు కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం గట్టి పొలిటికల్ స్కెచ్‌లు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ త్వరలోనే విసృత స్థాయి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. Telangana BJP, Abhay Patil, Bandi Sanjay, MP Eatala Rajender, Dharmapuri Arvind, BJP Political News, Ramchandra Rao, GHMC elections

Publish Date: Jul 19, 2026 12:14PM

political-news-img

జమ్మూకశ్మీర్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్..నలుగురు మృతి..!

ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..! జమ్మూకశ్మీర్ లో ప్రకృతి మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్ బరస్ట్‌లు (మేఘమథనం) అక్కడ పెను విధ్వంసానికి దారితీశాయి. కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన ఆకస్మిక వరదలు పల్లెలను, పట్టణాలను ముంచెత్తుతున్నాయి. ఈ ప్రకృతి ఉద్ధృతికి పూంచ్, రాజౌరి, అనంతనాగ్, దోడా జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. ఈ ఘోర ఆకస్మిక వరదల కారణంగా పూంచ్ జిల్లాలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. జిల్లాలోని సురంకోట్ ప్రాంతంలో వరద ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందంటే, చూస్తుండగానే నలుగురు వ్యక్తులు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉండటం మరింత కలచివేస్తోంది. రాత్రంతా కురిసిన కుండపోత వర్షాల వల్ల రాజౌరి పట్టణంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడి ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. వాహనాలు కొట్టుకుపోయేలా ప్రవహిస్తున్న నీటితో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పహల్గామ్, అనంతనాగ్ పరిసరాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్‌లు సంభవించడంతో కొండలపై నుంచి భారీగా వరద నీరు దిగువకు దూసుకొచ్చింది. దోడా జిల్లాలోని థాత్రి పట్టణంలో వరద బీభత్సం సృష్టించింది. కేవలం వరద నీరు మాత్రమే కాకుండా, కొండల పైనుంచి విరిగిపడిన భారీ బండరాళ్లు, మట్టి ఉద్ధృతంగా కొట్టుకువచ్చి స్థానిక ఇళ్లలోకి, వ్యాపార దుకాణాల్లోకి దూసుకెళ్లాయి. దీంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అకస్మాత్తు ముత్రాఘాతంలో పలువురు స్థానికులు వరద నీటిలో గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం పూంచ్ జిల్లా సూరన్‌కోట్ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడటంతో కశ్మీర్ లోని పలు ప్రధాన రవాణా మార్గాలు స్తంభించిపోయాయి. రోడ్లపై భారీగా పేరుకుపోయిన బండరాళ్లను, మట్టిని తొలగించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. Jammu and Kashmir flash floods, Cloud burst in Kashmir, Poonch Surankote floods, Doda district floods, J&K heavy rains news, Kashmir natural disaster

Publish Date: Jul 19, 2026 11:37AM

political-news-img

యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య..!

భయంతో యువకుడి సుసైడ్..! నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సమాజానికి సేవ చేయాలనే ఉన్నత ఆశయాలతో, ఎన్నో అవధులు లేని ఆశలతో డాక్టర్ చదువుతున్న ఇరవై ఏళ్ల ఎంబీబీఎస్ వైద్య విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న ప్రేమోన్మాదానికి బలవ్వగా, ఆమె మృతికి కారణమైన ఇరవై రెండు ఏళ్ల చిలుముల రామ్ చరణ్ అనే యువకుడు కూడా భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కన్నవారి కలలను నిజం చేస్తూ సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న లక్ష్మీ ప్రసన్న ప్రిపరేషన్ హాలిడేస్ నిమిత్తం తన స్వగ్రామమైన మునుకుంట్లకు వచ్చింది. అయితే, అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ గత కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు పలుమార్లు రామ్ చరణ్‌ను మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో దూలానికి ఉరివేసుకుని కనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె సోదరి ఈ ఘోరాన్ని గమనించి కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు సమాచారం అందించింది. శనివారం ఉదయానికి నిందితుడు రామ్ చరణ్ కూడా గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న తన తండ్రి నర్సింహ సమాధిపై తన రక్తంతో లక్ష్మీ ప్రసన్న నిక్ నేమ్ అయిన 'చిన్నారి' అనే పేరును రాసి, పక్కనే ఉన్న తాటిచెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం రామ్ చరణ్ మరో వ్యక్తితో కలిసి లక్ష్మీ ప్రసన్న ఇంటికి వెళ్లినట్లు స్థానికులు చెప్తుండటంతో, యువతి మృతి వెనుక హత్య కోణం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వగ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. ఈ ఘటనపై శాలిగౌరారం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. Nalgonda MBBS student suicide, Lakshmi Prasanna medical student death, Kattangur Munukuntla news, Ram Charan suicide Nalgonda, Suryapet medical college student, Telangana crime updates, CM Revanth reddy, Telangana goverment

Publish Date: Jul 19, 2026 11:14AM

MOVIE NEWS