2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా.. ఎర్రకోట బురుజులపై నుంచి మోడీ ప్రతిన.!
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అత్యంత వైభవంగా జరిగాయి. ఈ చారిత్రాత్మక వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్ తీర్చిదిద్దుతామని ప్రతిజ్ణ చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన మహాత్మా గాంధీతో సహా ఎందరో మహానుభావులకు నివాళులర్పిస్తూ సాగిన ఈ ప్రసంగం, దేశ ప్రజలలో నూతనోత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా సాగింది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని ప్రధాని మోడీ.. గతం, వర్తమానాలను పోలుస్తూ గణాంకాలతో వివరించారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ఫ్రాజైల్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్.. కేవలం పుష్కర కాలంలోనే అంటే 12 ఏళ్లలోనే.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా సగర్వంగా నిలిచిందని ప్రధాని వివరించారు. గడిచిన 12 ఏళ్లుగా దేశ ప్రజలు, శ్రామికులు, యువత రాత్రింబవళ్లు పడ్డ కష్టం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 140 కోట్ల భారతీయుల ఐక్యత, సంకల్ప బలాన్ని ఏ శక్తీ ఆపలేదని ప్రధాని ఉద్ఘాటించారు. భవిష్యత్ గమ్యాలను నిర్దేశిస్తూ.. మన లక్ష్యాలు, ఆలోచనలు ఎంత పెద్దవిగా ఉంటే, మన సామర్థ్యాలు అంత ఉన్నత శిఖరాలను చేరుకుంటాయన్నారు. . ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన భారత్ 2047 నాటికి వందవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందనీ, ఆ సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా మారితుందనీ మోడీ అన్నారు. కేవలం విజన్ మాత్రమే కాకుండా, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి రంగంలోనూ ఆవిష్కరణలు, నూతన వ్యూహాలు అవసరమన్నారు. మోడీ తన ప్రసంగంలో ఇటీవల దేశంలోని పలు ప్రాంతాలలో సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తులు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ యావత్ భారతావణి అండగా నిలుస్తుందన్నారు. పునరావాస చర్యల్లో ప్రభుత్వం సహాయమందిస్తుందని భరోసా ఇచ్చారు. నవ భారత్ దిశగా వేగంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. PM Narendra Modi, Red Fort Speech, Independence Day 2047, Viksit Bharat Goal, Indian Economy Growth, Fragile Five to Top Economy
Publish Date: Aug 15, 2026 8:43AM