రూ. 300 కోట్ల పన్ను ఎగ్గొట్టిన ఆ నలుగురు సినీనిర్మాతలు
Publish Date:May 10, 2012
Advertisement
తెలుగుచలన చిత్ర రంగానికి చెందిన నలుగురు ప్రముఖ నిర్మాతలు సుమారు 300 కోట్ల రూపాయల మేర ఆదాయపన్నుతో పాటు సేవాపన్ను, వినోదపన్ను కూడా ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. చలన చిత్ర రంగాన్ని ఏలుతున్న ఆ నలుగురు నిర్మాతలు భారీ హిట్ చిత్రాలతో పాటు కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా నిర్మించారు. వీరిలో ఇద్దరు మాఫియా రంగం నుంచి వస్తున్న నిధులతో సినిమాలు తీసినట్లు తెలుస్తోంది. ఆ నలుగురు నిర్మాతలు ఆదాయపన్ను శాఖకే సుమారు 220 కోట్ల రూపాయల మేరకు టోకరా పెట్టినట్లు తెలుస్తోంది. ఆదాయపన్నుశాఖ వీరికి నోటీసులు ఇచ్చినప్పుడు తాము తీసిన దాదాపు అన్ని చితాల్లోనూ తమకు భారీనష్టాలే వచ్చాయని వీరు తమ ఆడిటర్ల ద్వారా సమాధాన మిచ్చినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన వారంరోజులకే అన్ని దినపత్రికలలో తమ చిత్రం కోట్లాది రూపాయల వసూళ్ళతో రికార్డు సృష్టించిందంటూ ప్రకటనలు ఇచ్చారు. ఆ ప్రకటనల ఆధారంగానే ఐటీశాఖ వీరికి నోటీసులు ఇచ్చింది. అయితే సినీనిర్మాటలు కోట్లాది ఆర్జనలకు బదులు తమ రిటర్న్స్ లో నష్టాలు చూపించటం ఆదాయపన్ను శాఖ అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిపై వారు మరింత కూలంకుషంగా అధ్యయనం చేసి రూ. 220 కోట్లకు పన్నులు చెల్లించాల్సిందేనంటూ మరోసారి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/300-crores-due-to-incometax-department-24-13941.html





