కాషాయ పార్టీకి వార్నింగ్ బెల్స్.!
Publish Date:Aug 4, 2026
Advertisement
బీజేపీకి వార్నింగ్ బెల్స్ మోగాయి. సోమవారం (ఆగస్టు 3) వెలువడిన మూడు ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ మూడు ఉప ఎన్నికలలో రెండింటిలో బీజేపీ పరాజయం పాలైంది. మరీ ముఖ్యంగా బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలలో ఆ పార్టీ చతికిల పడటంతో మోడీ, షా మ్యాజిక్ పని చేయడం లేదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన 8 నెలలకే, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన సీటును నిలబెట్టుకోవడంలో కమలం పార్టీ విఫలమైంది. ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు తలొగ్గి మెట్టు దిగిన రోజుల వ్యవధిలో.. కమలం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గాలు బద్దలు కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమని అంటున్నారు. నీట్ పేపర్ లీక్ కు జవాబుదారీతనం కోరుతూ జరిగిన విస్తృత నిరసనలు, రామ మందిర నిధుల దుర్వినియోగం, , ఈ20 ఇంధనంపై పెరుగుతున్న ఆగ్రహం వంటి సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ సమస్యలకు తోడు, అవినీతి కారణంగా పార్టీలోని కొందరు నాయకులు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటుండటంతో పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ ఉప ఎన్నికలలో ఓటమికి పార్టీ దృక్కోణం నుండి వివిధ రాజకీయ కారణాలను చెప్పుకోవచ్చు కానీ.. పార్టీలకు అతీతంగా.. వివిధ వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న పలు సున్నితమైన సమస్యలను పట్టించుకోని ఫలితమే ఈ ఫలితాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కచ్చితంగా కమలం పార్టీకి డేంజర్ బెల్స్ గానే పరిగణించాల్సి ఉంటుంది. Warning bells to BJP, By Poll, Results, Defeat, Two Seats, Bihar, Madhya Pradesh
http://www.teluguone.com/news/content/warning-bells-to-bjp-45-227946.html




