గుంటూరు కాంగ్రెస్ లో గందరగోళం
Publish Date:May 5, 2012
Advertisement
గుంటూరు జిల్లాలో ఒకవైపు ఉప ఎన్నికలు ముంచుకు వస్తున్నా కాంగ్రెస్ పార్టీలో తగాదాలు సద్దుమణగలేదు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఇంకా తీవ్ర గందరగోళం కొనసాగు తోంది. ప్రత్తిపాడు అభ్యర్థిగా సుధాకరబాబును నిలబెడతారనే ప్రచారం జరుగుతుండగా ఆయనకు వ్యతిరేకంగా అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. బిసి-డి గా ఉన్న సుధాకర్ బాబు ఎస్సీ రిజర్వ్ డ్ స్థానంలో పోటీ చేయటానికి అనర్హుడని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పంపించారు దీంతో సుధాకర్ కు బదులుగా మరో వ్యక్తిని రంగంలోకి దింపే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఢిల్లీ లాబీయింగ్ లో బిజీగా ఉన్న ఎడి శీలం ప్రత్తిపాడు అభార్తిగా తన సతీమణిని నిలిపే యోచనలో ఉన్నారు. మరోవైపు గతంలో పి.ఆర్.పి. నుంచి పోటీ చేసిన కె.వి కుమార్ చిరంజీవి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక మాచర్ల నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే కె.పొన్నారెడ్డి, టి.లక్ష్మారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవటంతో కార్యకర్తలు కొంత అసహనానికి గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఇంచుమించి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రత్తిపాడు అభ్యర్థిగా కందుకూరి వీరయ్యను నిలబెట్టాలనుకున్నారు. అయితే ఈయన ఎస్సీ కాదు బిసి అంటూ ఆ పార్టీ నేతలే కులధ్రువీకరణ పత్రాలను బహిరంగపర్చటంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. మాచర్లలో సామాజిక కోణం నేపథ్యంలో తిరుమామిళ్ళ మధును అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై కూడా నియోజకవర్గంలోని కొందరు టిడిపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/confusion-in-guntur-district-24-13872.html





