రెడ్ల ఆధిపత్యానికి చెక్ పెడుతున్న సోనియా?
Publish Date:Apr 30, 2012
Advertisement
త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న 18 నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకే సామాజికవర్గానికి చెందిన వారినే ఎక్కువమందిని ఎంపిక చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ రోజు కొత్తగా జరుగుతున్న వ్యవహారం కాదు, ఆరు దశాబ్దాలుగా జరుగుతున్నది. రాష్ట్ర జనాభాలో 7శాతం కూడా లేని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు శాసన సభ్యులుగానే కాకుండా ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఈ సామాజికవర్గ ఆధిపత్యాన్ని అధిగమించడం కోసం రాష్ట్రంలో మరో ముఖ్యమైన కమ్మ సామాజికవర్గం చేసిన ప్రయత్నాలు విఫలమై చివరకు తామే ఒక పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం వున్నా ద్వితీయశ్రేణి నాయకత్వానికే పరిమితం కావడంవల్ల విసుగుచెందిన కాపు సామాజికవర్గం కూడా చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగినా తెలుగుదేశంపార్టీలా విజయం సాధించ లేకపోయింది. అయితే వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణాంతర పరిణామాలలో చిరంజీవిని, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడంతోపాటు కాపు సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. ఇక వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులకు కాంగ్రెస్ పార్టీలో కనీసం ద్వితీయ ప్రాధాన్యత కూడాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన పార్టీగా భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం ప్రాధాన్యత తగ్గిపోవడాన్ని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు భరించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే బాధతో వీలున్న మేరకు రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో కూడా రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వగా, ప్రస్తుతం ఉపఎన్నికలు జరగబోయే 18 నియోజకవర్గాలకు కూడా మెజారిటీ అభ్యర్థులను రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారినే ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రతిపాదించిన అభ్యర్థులలో మెజారిటీ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు వున్నారని, బిసి అభ్యర్థులు లేరా? అంటూ సోనియా వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో కనీసం నేతికైనా కాంగ్రెస్ పార్టీలో ఇతర సామాజికవర్గాల గురించి ఆలోచించడం పట్ల ఆ పార్టీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/check-to-reddy-community-in-politics-by-sonia-gandhi-24-13717.html





