అమెరికా, ఇరాన్ పోరు భీకరం.. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర.!
అమెరికా, ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి ప్రతిగా అమెరికా అమెరికా ఇరాన్కు చెందిన ఐదు భారీ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేశాయి. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్.. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడులు-ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతం దద్దరిల్లింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ కథనం ప్రకారం.. మంగళవారం ఒమన్ గల్ఫ్లో కావిజ్, చార్మినార్, హొరైజన్ 1, రీస్కో అనే నాలుగు ట్యాంకర్లతో పాటు, ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపం సమీపంలోని దర్యా అనే మరో ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు జరిపింది. ఈ దాడులకు ముందు ట్యాంకర్లలోని సిబ్బందిని నౌకలను విడిచి వెళ్లాలని ఆదేశించామని, ఆ తర్వాతే వాటిని ధ్వంసం చేశామని అమెరికా పేర్కొంది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, దాని అనుబంధ సంస్థలకు నిధులు సమకూర్చేందుకు ఈ ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారని అమెరికా ఆరోపించింది. ఈ ఘటనలో తమ సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని, ఇరాన్ క్షిపణి దాడుల నుంచి తమ యుద్ధనౌక సురక్షితంగా బయటపడిందని వెల్లడించింది. అమెరికా చర్యకు ప్రతిగా ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. జోర్డాన్లోని అల్ అజ్రాక్ వైమానిక స్థావరంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ స్థావరంలోని ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ నిర్వహణ, సంసిద్ధత ప్రాంతాలను, షెల్టర్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. అయితే, ఇరాన్ ప్రయోగించిన 20 బాలిస్టిక్ క్షిపణులలో 18 క్షిపణులను తమ వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని జోర్డాన్ సైన్యం వెల్లడించింది. మిగిలిన రెండు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడ్డాయని, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేసింది. మరోవైపు, కువైట్, బహ్రెయిన్ ఓడరేవుల సమీపంలోని ఆయిల్ ట్యాంకర్ల సిబ్బందికి ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే నౌకలను విడిచి వెళ్లాలని, లేదంటే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఈ వరుస పరిణామాలతో హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఆందోళనలు మిన్నంటాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా పెరిగి బ్యారెల్ 100 డాలర్లకు చేరువైంది. [US Iran Conflict Seviour, oil tankers destroyed, Iran missile retaliation, Strait of Hormuz, Jordan US base, CENTCOM strikes, Telugu One]
Published on: Wed Sep 9, 2026 9:01AM