TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

రెండేళ్లుగా బంగ్లా జైల్లోనే హిందూ సాధువు.. తల్లి అంత్యక్రియలకు సైతం అనుమతించకుండా వేధింపులు.!

బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ కోసం నిలబడిన ఇస్కాన్ సన్యాసి, హిందూ సాధువు చిన్మయ కృష్ణదాస్ దాదాపు రెండేళ్లుగా అక్రమంగా నిర్బంధంలో ఉన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ప్రశ్నించిన కారణంగానే ఆయనపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారు. మొహమ్మద్ యూనస్ పరిపాలనా కాలంలో 2024లో ఆయనను అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఆయనపై అరడజనుకు పైగాద తప్పుడు కేసులు మోపి, విడుదల కాకుండా అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. కొన్ని కేసులలో బెయిల్ లభించినప్పటికీ, మరి కొన్ని కేసుల్లో ఉద్దేశపూర్వకంగా బెయిల్ రాకుండా అడ్డుకుంటూ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. న్యాయస్థానాల్లో ఎన్నిసార్లు ప్రయత్నించినా బంగ్లాదేశ్ ప్రభుత్వం, పోలీసులు ఆయన్ని బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మానసిక వేదనకు గురిచేస్తూ జైలులో దయనీయమైన పరిస్థితుల్లో బంగ్లా పాలకులు జైల్లో ఆయనను రాచిరంపాన పెడుతున్నారు. ఒక హిందూ సాధువు ఇన్ని రోజులుగా కటకటాల వెనుక మగ్గుతున్నాఇటు ఇండియా నుంచి కానీ, అటు అంతర్జాతీయ సమాజం నుంచి కానీ గట్టిగా ఖండనలేకపోవడం, సరైన స్పందన లేకపోవడం గమనార్హం. చిన్మయ కృష్ణదాస్‌ తల్లి సంధ్యారాణి ధర్ సెప్టెంబర్ 10న కన్నుమూశారు. కొడుకు జైలులో ఉండగానే తల్లి మరణించడం, కనీసం తల్లి అంత్యక్రియలకు కూడా చిన్మయ కృష్ణాదాస్ ను అనుమతించకపోవడం, నిస్సహాయ స్థితిలో చిన్మయకృష్ణదాస్ జైల్లో భోరున విలపిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ దృశ్యాలు చూసిన అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. తల్లినికడసారి చూసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చిన్మయ కృష్ణదాస్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం వేధించిన తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో స్పందించి, చిన్మయ కృష్ణదాస్‌పై మోపిన తప్పుడు కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని హిందూ సంఘాలు, మానవ హక్కుల వాదులు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై, వారికి మద్దతుగా గళమెత్తుతున్న వారిపై అణచివేతకు చిన్మయ కృష్ణాదాస్ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు స్పందించి బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గుతున్న హిందూ సాధువుల రక్షణకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు అంటున్నారు. [Chinmoy Krishna Das, Bangladesh Hindu monk, Iskcon monk jailed, Bangladesh crisis, Mohammad Yunus government. Telugu One]

Published on: Sun Sep 13, 2026 9:57AM

political-news-img

కాగ్నిజెంట్ ఫ్రాడ్ నిజమేనా?.. అసలు జరిగిందేంటి?

ఒకప్పుడు ప్రపంచం ఒక గ్లోబాల్ విలేజ్ ఐపోయిందని జనం చెప్పుకుంటూ ఉండేవారు. ఈనానుడి రావటానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొదటిది అంతర్జాలం. ఇంటర్నెట్ పుణ్యమా అని సమాచారం ఎక్కడి నుండి ఎక్కడికైనా మెరుపు వేగంతో చేరుతోంది. ఒకప్పుడు అంటే ఆరు దశాబ్దాల కిందట మన దేశంలోని చాలా ఊళ్ళుకు రోజూ ఉదయమే వార్తాపత్రిక వచ్చే సదుపాయమే లేదు. ఇంటింటికీ కాదుకదా వాడ కొక రేడియో ఐనా అబ్బురమే. ఊళ్ళకు ఊళ్ళే ఒక్క టెలిఫోనూ లేనివి ఉండేవి. అత్యవసరంగా టెలిగ్రాం అని వార్త పంపినా మరునాటికే చేరే ఊళ్ళూ బోలెడు. ఇప్పుడు అచ్ఛుపత్రికల అవసరమే తరిగిపోయింది. మనిషిమనిషికీ అరచేతి వైకుంఠంలా మొబైల్ ఉంది. అందులో ప్రతిక్షణం తాజా వార్తలు ప్రత్యక్షం. ప్రపంచంలో ఎవరితోనైనా ఉచితంగా మాట్లాడే సౌకర్యం ఉంది. అప్పట్లో దేశంలోనే వేరే ప్రాంతాలను దూరం అనుకొనే మానసిక పరిస్థితి. నేడు పిల్లలు దేశదేశాలూ తిరిగి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడియోకాల్ లేని రోజులు పోయి రోజూ పెద్దలు విదేశాల్లోని పిల్లలతో వీడియోకాల్స్ చేసి మాట్లాడుతున్నారు. ఈసమాచార విప్లవం ప్రపంచాన్ని గ్లోబాల్ విలేజీని చేసిన మొదటి కారణం. ఇక రెండో కారణం కూడా బలమైనదే ముఖ్యమైనదే. రెండవ ప్రపంచ యుధ్ధం తరువాత కొన్ని దశాబ్దాల పాటు అమెరికా రష్యాల మధ్య వేడివేడిగా జరిగిన కోల్డ్ వార్ వలన వివిధదేశాల మధ్యన ప్రజలు స్వేఛ్ఛగా తిగగలిగే వాతావరణం ఉండేదికాదు. కాని సోవియట్ రష్యా పతనం తరువాత పరిస్థితి అనూహ్యంగా మారింది. అన్నిదేశాలూ విదేశీయులకు తలుపులు తెరిచేసాయి. దేశదేశాల కరెన్సీలకూ అమెరికన్ డాలర్లు కామన్ ఎక్చేంజ్ కావటంతో ఆర్ధిక ప్రయోజనం కనిపించి అన్ని దేశాల పౌరులూ అమెరికా బాటపట్టారు సంపాదనకోసం. అక్కడే చదివి అక్కడే ఉద్యోగం చేయడం విద్యార్ధులకు కలగా మారిపోయింది. ఈ పరిస్థితికి అమెరికన్ సమాజమూ ఒక కారణమే. దశాబ్దాలుగా తమ ఆయుధాలను భారీ రలకు విదేశాలకు అంటగడుతూ అమెరికా మరింత సంపన్న దేశంగా మారుతూ ఉండటం.. ఆఫాల్స్ మనీతో అమెరికాలో ఉద్యోగస్థుల జీతాలు భారీగా పెరిగాయి. మారిన అంతర్జాతీయ పరిస్థితులూ, సమాచార విప్లవమూ అమెరికన్ కంపెనీలకు ఒక కొత్త అవకాశం కల్పించింది. వారు తమ ఉత్పత్తుల నుండి లాభాల శాతం పెంచుకుందుకు గాను అమఖ్యమైన ఉద్యోగాలను ఇతరదేశాలకు తరలించటం మొదలుపెట్టారు. పనిలో పనిగా అమెరికన్ ఉద్యోగులకు బదులు వలసవచ్చిన విదేశీయులకు తమ కంపెనీలలో ఉద్యోగాలను తక్కువ జీతాలకు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆరంభంలో ఈ కార్యకలాపాల జోరు కారణంగా ప్రపంచం పూర్తిగా గ్లోబాల్ విలేజ్ ఐపోయింది. దీని వల్ల అమెరికన్ ప్రజలకూ తమ ఉత్పత్తులు కాస్త చవక ధరలకు దొరకసాగాయి. అమెరికన్ కంపెనీలకూ లాభాలు ఇబ్బడిముబ్బడి అయ్యాయి. అమెరికన్ ఉత్పత్తులు మంచి గ్లోబాల్ మార్కెట్ సాధించాయి. అందరూ హేపీ. ముఖ్యంగా మన విద్యార్ధులు. వాళ్ళకు అమెరికా చదువూ అమెరికా ఉద్యోగం అమెరికన్ డాలర్లపంట. ఇంకేం కావాలి? మన దేశవాళీ కంపెనీలూ కొత్త లాభసాటి వ్యాపారం కనిపెట్టాయి. అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే కంపెనీలు వెలిసాయి. అమెరికాలో తమ ఉద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించి వాళ్ళిచ్చే సొమ్ములో సింహభాగం తామే బొక్కేసి మ నదేశవాళీ కంపెనీలు వ్యాపారమోసం చేసినా అలా ఐనా చేతికి దొరికే జీతమే బోలెడంత అని మనవాళ్ళూ అమెరికాకు పరుగెత్తటం జోరయ్యింది. ఈ వ్యవహారంలో మన దేశానికి చెందిన ఛోటా కంపెనీలే కాదు మంచి పేరున్న కంపెనీలూ ఉన్నాయి. వందలూ వేలూ జనాన్ని అమెరికాలో ఉద్యోగాల్లో పెట్టి బాగా వ్యాపారం చేస్తున్నాయి. కాలక్రమేణా అమెరికన్ పౌరసమాజం అసలు విషయం గ్రహించింది. కొన్ని ఉత్పత్తుల ధర తగ్గటం అటుంచి తమ పౌరుల ఉద్యోగాలను విదేశీ కంపెనీలు లూటీ చేస్తున్నాయని గ్రహించింది. దీంతో అమెరికాలో ఆందోళనలు మొదలయ్యాయి. . ఇందులో సత్యం లేకపోలేదు. అమెరికా ఒక విధానంగా విదేశీయుల్లోని మేధావులకే తమ దేశంలో ఉద్యోగ వసతి కల్పించి లాభపడాలని యోచించించి. కాని ఆచరణలో అర్హులైన తమ పౌరుల ఉద్యోగాలను విదేశీయులు కాజేయటం కనబడుతోంది. దానితో మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అనే జాతీయవాద ఉద్యమ్యం మొదలైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ వారు ఈఉద్యమానికి రాజకీయంగాబలమైన మద్దతుదారులు. అందుచేత విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వటంపై కఠిన నిబంధనలను విధించటం ద్వారానూ విదేశీ విద్యార్ధులను పరిమితం చేయటం ద్వారాను వారు అమెరికన్ పౌరులకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని చూ‌స్తున్నారు. దానని తప్పుపట్టలేం కానీ, విదేశీ విద్యార్ధులపై విదేశీ ఉద్యోగులపై వారు మానసిక హింసకూ భౌతిక దాడులకూ పాల్పడుతూ పరిస్థితిని భీతావహంగా మార్చటం ఇసుమంతైనా సమర్థనీయం కాదు. లాభార్జన కోసం అనైతిక విధానాల ద్వారానూ మోసపూరితచర్యల ద్వారానూ వీసాలను సంపాదిస్తున్నారనీ, తమ ఉద్యోగులకు శాశ్వత నివాసపత్రాలకు దరఖాస్తు చేస్తున్నారనీ కొన్ని కంపెనీలపై అమెరికన్ ప్రభుత్వం కొరడా విసురుతోంది. ఆ కొరడా దెబ్బ తాజాగా కాగ్నిజెంట్ కంపెనీకి తగిలింది. మరోకంపెనీకీ తగిలింది. సరే. కాగ్నిజెంట్ ఏ పాపం చేసందనిఆ దెబ్బతగిలింది? కాగ్నిజెంట్ కంపెనీ 1994లో చెన్నైలో పుట్టి అమెరికాలో స్థిరపడింది. పేరుకు పూర్తిగా అమెరికన్ కంపెనీయే కాని నిజానికి వారికి గల వేలాది మంది ఉద్యోగులలో అత్యధిక శాతం మంది చెన్నై, పుణే, బెంగుళూరు, హైదరాబాదు వంటి ఇండియన్ సిటీలకు చెందిన వారే. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం 21 బిలియన్ డాలర్ల చిల్లర. ఇప్పటిదాకా అమెరికన్ ఉద్యోగ వీసాలూ శాశ్వని వాసపత్రాలు (గ్రీన్ కార్డు) వంటివి కేవలం మానవ వనరుల వ్వవహారం కిందే భావించబడుతూ వస్తోంది. క్రమంగా ఆ భావన స్థానంలో విదేశీయుల రాకడా నివాసమూ అమెరికన్ జాతీయ భద్రతా వ్యవహారంగా లెక్కించటం మొదలైంది. అందువలన ఈ విషయాలపై అభ్యర్ధనలు సాధారణ పరిశీలనతో బయటపడటానికి లోతైన విచారణలకు గురికావటం తప్పనిసరి అవుతున్నది. ఇలా ఉద్యోగ వీసాలు, గ్రీన్ కార్డు అభ్యర్ధనలను పంపే వ్యక్తుల గురించీ, కంపెనీల గురించీ ప్రతి చిన్న విషయాన్ని అమెరికా భూతదద్దం పెట్టి శోధించడం మొదలెట్టంది. ఇబ్బడి ముబ్బడిగా అభ్యర్ధనలు పంపే కంపెనీలు నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాయా? ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ అభ్యర్ధులను ప్రక్కన బెట్టి విదేశీయులను ముందుకు తోస్తున్నారా? అంతా సజావుగానే ఉందని చూపటానికి అక్రమమార్గాలు తొక్కతున్నారా? అమెరికన్ ప్రభుత్వ వ్వస్థలను ఏవిధంగానైనా మోసగిస్తున్నారా? ఇటువంటివన్నీ క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు. అసలు ఈ కంపెనీల బిజినెస్ మోడళ్ళు నిజంగా ఎలా నడుస్తున్నాయా అని ఆరాలు. తీస్తున్నారు. తమాషా ఏమిటంటే 15వందల మంది అమెరికన్ కాలేజీ కుర్రాళ్ళను ఉద్యోగులుగా త్వరలో నియమిస్తున్నాం అని కాగ్నిజెంట్ ప్రకటించిన మరునాడే కొరడా మీద పడింది. అంటే ఆప్రకటన కేవలం ఒక డ్రామా అని ప్రభుత్వం భావించిందనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో పనిచేసే కంపెనీలు తమ ఆదాయ స్థాయికి అనుగుణంగానూ తమ వృత్తిరంగం పరిస్థితికి అనుగుణంగానూ ఉద్యోగకల్పన చేయాలి. అలా చేసే ఉద్యోగ కల్పనలో అమెరికన్ పౌరులకు పెద్దపీట వేయాలి. స్థానికంగా అమెరికన్ పౌరులెవరూ దొరకని సందర్భాలలో మాత్రమే విదేశీయులకు అవకాశం ఇవ్వాలి. ఏవైనా మతలబులు చేసి అమెరికన్ పౌరులను తొక్కవేసి విదేశీయులనే ముఖ్యంగా తెస్తూ ఉంటే అది శిక్షార్హ నేరమే. ఏవేవో గోల్ మాల్ వ్యవహారాలను కొన్ని కంపెనీలు నడిపిస్తూ ఉంటే వాటిని పసిగట్టి ప్రభుత్వ వ్వవస్థలను హెచ్చరించే వారూ ఉంటారక్కడ. అట్టి నిఘాను హర్షణీయం కాదన లేము. అందువలన కాగ్నిజెంట్ పైన హెచ్-1బి వీసాలు, గ్రీన కార్డ్ కోసం ఫైలింగులకూ నిషేధం విధించింది అగ్రరాజ్యం. ఇదే నిషేధం క్లౌడ్-ఎరా కంపెనీపైనా విధించింది.ఆస్ట్రేలియాలో కూడా ఇటువంటి వాతావరణమే పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో భారతవిద్యార్ధుల వీసాల తిరస్కరణ బాగా పెరిగింది. అక్కడా భారతీయులు తమ ఉద్యోగాలను దురాక్రమణ చేస్తున్నారన్న భావన బాగా పెరిగింది. గ్లోబాల్ విలేజ్ అని ప్రపంచాన్ని అనటం ఇక కష్టం. ప్రపంచంలో అనేక దేశాలలో వలసదారులు ఉద్యోగావకాశాలను ఇతోధికంగా పొందటం అక్కడి ప్రజలకు ఆమోదయోగ్యం కావటు లేదు. దానికి తోడు కొన్ని కంపెనీలు ముసుగు వ్యాపారాల ద్వారా స్థానికుల అవకాశాలకు గండికొడుతూ ఉండటం తీవ్రమౌతోంది. మనదేశంలో వ్యాపారం చేసే కంపెనీ ఏదైనా ముప్పాతిక మువ్వీసం ఉద్యోగాలను తమ దేశపు అభ్యర్థులతో నింపుతూ ఉంటే మన దేశపు పౌరులూ చట్టసభలూ ఆ కంపెనీని కట్టడి చేసే చర్యల గురించి మాట్లాడటం జర గదా? మన ప్రభుత్వాలు కార్యరంగంలోనికి దిగి కఠినచర్యలకు దిగవా? ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న చర్యలూ అవేనని అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. [Is Cognizant Fraud real, What actually happened, Cognizant PERM suspension, US Visa fraud probe, Cloudera labour certification, Green card applications US,Telugu One]

Published on: Sat Sep 12, 2026 2:42PM

political-news-img

ఒకదాని వెంట మరొకటి.. డాలర్ డ్రీమ్స్ కలలు ఆవిరి.!

అమెరికాలో సొంతింటి కల నెరవేర్చుకోవాలని.. గ్రీన్‌కార్డ్‌తో తమ జీవితాల్లో స్థిరత్వం లభిస్తుందని ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై మళ్ళీ నల్లటి మేఘాలు అలుముకున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి కంపెనీల పురోగతికి ప్రాణం పెట్టే టెక్కీలకు.. అమెరికా డ్రీమ్ అంత తేలికగా నెరవేరేలా కనిపించడం లేదు. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు అమెరికా కార్మిక శాఖ (యూఎస్.డీఓఎల్) తీసుకున్న తాజా నిర్ణయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాగ్నిజెంట్‌కు చెందిన కొత్త పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (పీఈఆర్ఎం) దరఖాస్తుల ప్రాసెసింగ్‌పై ఆంక్షలు విధించడంతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంపెనీకి చెందిన హెచ్1బీ, పీఈఆర్ఎం నియామక ప్రక్రియలపై విచారణ పూర్తయ్యే వరకు కొత్త పీఈఆర్ఎం ఫైలింగ్స్ ముందుకు సాగవని తెలుస్తోంది. గ్రీన్‌కార్డ్ వైపు పడే మొదటి అడుగు 'పీఈఆర్ఎం'. ఆ తొలి అడుగే పడకుండా ఆగిపోతే తాము అమెరికాలో మరిన్ని ఏళ్లు అనిశ్చితి మధ్య గడపాల్సి వస్తుందని టెక్కీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ పన్నులు చెల్లిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ శ్రమను ధారపోస్తున్నప్పటికీ.. ప్రతి చిన్న మార్పుకూ తమ భవిష్యత్తు తలకిందులవుతుండటంపై టెక్కీల కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థల సరసన నిలిచే కాగ్నిజెంట్ నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలోనే వేలాది మందికి హెచ్1బీ అనుమతులు లభించాయి. అందులో మెజారిటీ నిపుణులు భారతీయులే కావడం వల్ల ఈ తాజా పరిణామం నేరుగా వారి జీవితాలపైనే తీవ్ర ప్రభావం చూపనుంది. [H1B Visa Fees, IT Sector, India US Tech Pipeline, Tech Professionals, US Immigration Policy, Cognigentfraud]

Published on: Sat Sep 12, 2026 2:02PM

political-news-img

ఇరాన్ తో యుద్ధం ఇప్పుడే ఆగదు.. చర్చలకు నో.. ట్రంపరి వ్యాఖ్యలు.!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగదంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగబోయే అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసేంత వరకూ ఇరాన్ తో యుద్ధం సాగుతుందన్నారు. డల్లాస్‌లో జరగనున్న రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి బయలుదేరే ముందు వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ దేశంలో రాజకీయ అధికారంలో మార్పు వస్తుందనే ఆశతో ఇరానే ఈ యుద్ధాన్ని సాగదీస్తోందని ఆరోపించారు. అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించిన ట్రంప్.. అమెరికా ఓటర్లను భయాందోళనలకు గురి చేసి దేశంలో ఒక బలహీనమైన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇరాన్ వ్యవహరిస్తోందన్నారు. అమెరికాలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే.. తాము సులువుగా అణ్వాయుధాలు సమకూర్చుకోవచ్చన్నది ఇరాన్ ఉద్దేశమన్న ట్రంప్.. ఆ దేశం వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉంటే మొత్తం ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఆ పరిస్థితిని తాను రానివ్వనని ట్రంప్ చెప్పారు. పరిస్థితి ఇంత వరకూ వచ్చిన తరువాత ఇక ఇరాన్ తో చర్చల ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టిన ట్రంప్.. ఒకప్పుడు తాము ఒప్పందానికి సిద్ధపడ్డామని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో చర్చలు జరిగినా, అది అణు ఒప్పందానికి మాత్రమే పరిమితం కాకుండా, గతంలో ఎన్నడూ లేని అనేక కఠిన నిబంధనలను ఇరాన్ ముందు ఉంచుతామన్నారు. ఇదలాఉండగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దళాల దాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్‌కు చెందిన చమురు రవాణా నౌకలు, ఇంధన నెట్‌వర్క్‌లు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ధృవీకరించారు. గల్ఫ్ జలాల్లో ఇరాన్‌కు చెందిన దాదాపు తొమ్మిది చమురు ట్యాంకర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసిందన్నారు. ఈ దాడులు రానున్న రోజుల్లో మరింత ఉధృతమౌతాయని హెచ్చరించారు. [War With Iran Wont End Now, Donald Trump, Iran War, US Midterm Elections, US Iran Tensions, Telugu One]

Published on: Thu Sep 10, 2026 7:54AM

political-news-img

ట్రంప్ చొరవతో రష్యా, ఉక్రెయిన్ వార్ కు ఎండ్ కార్డ్.!?

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్ పడిందా? అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ దౌత్యం, చొరవ కారణంగా ఇది సాధ్యపడిందా? అంటే అంతర్జాతీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇక ముగిసినట్లేనని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య దాదాపు గంటకు పైగా సాగిన ఫోన్ భేటీలో ఉక్రెయిన్ సంక్షోభం, శాంతి స్థాపన, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల వంటి పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చలు జరిపారు. ఈ ఫోన్ సంభాషణలోనే ఉక్రెయిన్ తో యుద్ధం ఎండ్ కు సంబంధించి పూర్తి అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. యుద్ధం ముగింపునకు పుతిన్ దాదాపుగా అంగీకరించినట్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు, భద్రతాపరమైన ఆందోళనలను ప్రస్తావిస్తూ, సత్వర శాంతికి మార్గం సుగమం చేయాలని ట్రంప్ ఈ సందర్భంగా పుతిన్ ను కోరారు. ఉక్రెయిన్ సంక్షోభం సమసిపోతే వాషింగ్టన్, మాస్కో మధ్య ఆర్థిక, వాణిజ్య బంధాలు మరింత బలోపేతం కావడానికి మార్గం సుగమమౌతుందని ట్రంప్ చెప్పినట్లు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రతిపాదనలకు పుతిన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ఉన్నత స్థాయి సంభాషణకు ముందు, అమెరికా దౌత్య బృందం రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి ఉన్నతాధికారులతో భేటీ అయింది. అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్ తదితరులు రష్యా అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ దౌత్యపరమైన ముందడుగుల నేపథ్యంలోనే పుతిన్, ట్రంప్ నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. [Russia Ukreain War End, Putin, Trump, Phone, Talk, Telugu One]

Published on: Wed Sep 9, 2026 3:26PM

political-news-img

అమెరికా వర్సిటీకి రూ.189 కోట్ల విరాళమిచ్చిన ఇండియన్ దంపతులు.!

అమెరికాలో స్థిరపడిన భారత సంతతి దంపతులు వికాస్ సిన్హా, అనురాధ సిన్హా తమ గొప్ప మనసును చాటుకున్నారు. విదేశాల్లో ఉంటూ కూడా భారతదేశం గర్వపడేలా చేసిన ఈ దంపతులు, నార్త్ టెక్సాస్ యూనివర్సిటీకి ఏకంగా 20 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 189 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. విదేశీ గడ్డపై తెలుగు, భారతీయ సంస్కృతికి, దాతృత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విరాళం ద్వారా ఆ యూనివర్సిటీ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. వీరి ఉదారతకు గుర్తింపుగా, నార్త్ టెక్సాస్ యూనివర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజీకి ది అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా నామకరణం చేయనున్నారు. దీనివల్ల ఇకపై అమెరికాలో అగ్రగామిగా వెలుగొందే ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థపై తెలుగు వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఏఐ ( విద్యను మరింత మందికి చేరువ చేయడంలో ఈ కాలేజీ ప్రముఖ పాత్ర పోషించనుంది. విద్య ద్వారానే తమ జీవితాలు మారాయని, ఆనాడు తమకు అందిన అదృష్టాలు, అవకాశాల వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే ఉన్నత విద్య అందించే అవకాశాన్ని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ విరాళం ఇచ్చినట్లు సిన్హా దంపతులు పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఎంతోమంది విద్యార్థులు ఈ ఏఐ కాలేజీ ద్వారా తమ కలలను సాకారం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. [indian Origin Couple Donation, Vikas Sinha Anuradha Sinha , North Texas University, Ai College US, 20 Million Dollars Donation, Telugu Diaspora Success, Telugu One]

Published on: Wed Sep 9, 2026 2:28PM

political-news-img

ఢిల్లీ మాజీ సీఎస్ ఆత్మహత్య.!

ఢిల్లీ మాజీ సీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ మెహతా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. సీనియర్ ఐఏఎస్ అధికారి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అధికారవర్గాలలో సంచలనం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 82 పరిధిలో ఉన్న కేంద్రీయ విహార్ 2 సొసైటీలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 1975 బ్యాచ్‌కు చెందిన రాకేష్ మెహతా గత ఐదేళ్లుగా ఈ ఫ్లాట్‌లో ఒంటరిగా జీవిస్తున్నారు. ఆయన భార్య సైతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి కాగా.. ఆమె ప్రస్తుతం డెహ్రాడూన్‌లో నివసిస్తున్నారు. అలాగే వారి కుమార్తె లండన్‌లో స్థిరపడ్డారు. కుటుంబ సభ్యులు ఎంత ఫోన్ చేసినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారికి అనుమానం వచ్చి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది వెళ్లి చూడగా లోపల రాకేశ్ మెహతా విగతజీవుడిగా వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ఆధారంగా ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో ఆయన సీఎస్ గా పని చేశారు. 2007 నుంచి దాదాపు మూడేళ్లకు పైగా ఆయన ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా కూడా సేవలందించారు. 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ రవాణా రంగం, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలోనూ, పాలనా పరమైన సంస్కరణలను అమలు చేయడంలోనూ ఆయన ప్రతిభ చాటారు. నిత్యం ఎంతో బిజీగా, సమర్థవంతమైన అధికారితో గుర్తింపు తెచ్చుకున్న ఒక సీనియర్ రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడటం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. [Delhi Former CS Sucide, Rakesh Mehta suicide, Delhi Former Chief Secretary, IAS officer Rakesh Mehta, Telugu One]

Published on: Wed Sep 9, 2026 1:25PM

political-news-img

ఇరాన్ అధీనంలో అమెరికా సబ్ మెరైన్.!

ఇరాన్ తో యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు భారీ షాక్ తగిలింది. ఆ దేశ నౌకాదళానికి చెందిన మానవ రహిత అండర్‌ వాటర్ సబ్‌మెరైన్ ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) అధికారికంగా ప్రకటించింది. బుధవారం (సెప్టెంబర్ 9) తెల్లవారుజామున అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ద్వారా అమెరికన్ మానవ రహిత సబ్ మెరేన్ ను తమ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ఈ జలసంధిలో జరిగిన ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో కలకలం రేపింది. ఇరాన్ సమాచారం ప్రకారం, ఈ సబ్ మెరైన్ అమెరికా రక్షణ సంస్థ అండూరిల్ ఇండస్ట్రీస్ తయారు చేసిన డైవ్-ఎల్డీ రకానికి చెందిన లార్జ్ డిస్‌ప్లేస్‌మెంట్ అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (ఏయూవీ)గా గుర్తించారు. దాదాపు 3 టన్నుల బరువు, సుమారు 5.8 మీటర్లు అంటే 19 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగిన ఈ సబ్ మెరైన్ అద్భుత సామర్థ్యాలను కలిగి ఉంది. ఏకంగా 6వేల మీటర్ల లోతు వరకు వెళ్లి పనిచేయగల ఈ సబ్ మెరైన్.. మానవ ప్రమేయం లేకుండా దాదాపు 10 రోజుల పాటు స్వయంప్రతిపత్తితో సముద్రం అడుగున సాగగలదు. 2025లో అమెరికా నౌకాదళం అమ్ములపొదిలోకి చేరిన ఈ సబ్ మెరైన్ నీటిగర్భ నిఘా, ఇంటెలిజెన్స్ సేకరణ, సముద్రపు గర్భ మ్యాపింగ్, మైన్ కౌంటర్ మెషర్స్ వంటి మిషన్ల కోసం ఉపయోగించబడుతోంది. అయితే, ఈ ఘటనపై అమెరికా వైపు నుంచి భిన్నమైన వాదన వినిపిస్తోంది. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో సాధారణ కార్యకలాపాలకు మద్దతుగా సంచరిస్తున్న ఒక సబ్ మెరైన్ సాంకేతిక లోపంతో మొరాయించిందని చెబుతోంది. ఎలాంటి సున్నితమైన లేదా క్లాసిఫైడ్ సోనార్, రాడార్ పరికరాలు లేని పాత మోడల్ సబ్ మెరైన్ అది అని పేర్కొన్న అమెరికా.. ఆ సబ్ మెరైన్ ఎలాంటి సమాచారాన్ని సేకరించలేదని చెబుతోంది. అయితే, ఇరాన్ మాత్రం దీనిని ఒక యుద్ధ ట్రోఫీగా భావిస్తూ, దీనికి సంబంధించిన ఫోటోలు వీడియో క్లిప్‌లను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. [Iran Seized America Submarine, Strait of Hormuz, US unmanned underwater vehicle, Anduril Dive LD, IRGC Navy, Middle East tension, Telugu One]

Published on: Wed Sep 9, 2026 10:33AM

political-news-img

టిబెట్ లో కంపించిన భూమి.. నేపాల్ లో ప్రకంపనలు.!

టిబెట్ లో బుధవారం (సెప్టెంబర్ 9) ఉదయం భూమి కంపించింది. ఈ భూకంపం ప్రభావంతో నేపాల్ లో కూడా ప్రకంపనలు కనిపించాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైంది. భూకంప కేంద్రం భూ అంతర్భాగంలో స 5 కిలోమీటర్ల లోతులో ఉంది. టిబెట్ లో సంభవించిన భూకంప ప్రభావం నేపాల్ పై అధికంగా చూపింది. నేపాల్ లో ప్రకంపనల కారణంగా భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందన్నహెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక వారం రోజుల వ్యవధిలోనే భూమి కంపించడంతో తో తీవ్రభయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. టిబెట్ లో గత గురువారం భూకంపం సంభవించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని, హిమాలయ, టిబెట్ పర్వత ప్రాంతాలు సిస్మిక్ జోన్ లో ఉన్నాయి. ఇండియన్ ప్లేట్ మరియు యురేసియన్ ప్లేట్ల మధ్య జరిగే రాపిడి వల్లే ఇలాంటి విపత్తులు సంభవిస్తుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఎంత తీవ్రతతో భూమి కంపిస్తుందో అంచనా వేయడం సాధ్యం కాదు. ప్రస్తుతానికైతే నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు వ్యవహరిస్తున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి ప్రభుత్వ విభాగాలు సిద్ధంగా ఉన్నాయి. [Tibet earthquake today, Nepal earth tremors, EMSC 5.3 magnitude, NCS India seismology, Himalayan seismic zone, USGS recent earthquake]

Published on: Wed Sep 9, 2026 9:55AM

political-news-img

అమెరికా, ఇరాన్ పోరు భీకరం.. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర.!

అమెరికా, ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి ప్రతిగా అమెరికా అమెరికా ఇరాన్‌కు చెందిన ఐదు భారీ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేశాయి. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్.. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడులు-ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతం దద్దరిల్లింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ కథనం ప్రకారం.. మంగళవారం ఒమన్ గల్ఫ్‌లో కావిజ్, చార్మినార్, హొరైజన్ 1, రీస్కో అనే నాలుగు ట్యాంకర్లతో పాటు, ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపం సమీపంలోని దర్యా అనే మరో ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు జరిపింది. ఈ దాడులకు ముందు ట్యాంకర్లలోని సిబ్బందిని నౌకలను విడిచి వెళ్లాలని ఆదేశించామని, ఆ తర్వాతే వాటిని ధ్వంసం చేశామని అమెరికా పేర్కొంది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, దాని అనుబంధ సంస్థలకు నిధులు సమకూర్చేందుకు ఈ ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారని అమెరికా ఆరోపించింది. ఈ ఘటనలో తమ సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని, ఇరాన్ క్షిపణి దాడుల నుంచి తమ యుద్ధనౌక సురక్షితంగా బయటపడిందని వెల్లడించింది. అమెరికా చర్యకు ప్రతిగా ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. జోర్డాన్‌లోని అల్ అజ్రాక్ వైమానిక స్థావరంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ స్థావరంలోని ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ, సంసిద్ధత ప్రాంతాలను, షెల్టర్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. అయితే, ఇరాన్ ప్రయోగించిన 20 బాలిస్టిక్ క్షిపణులలో 18 క్షిపణులను తమ వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని జోర్డాన్ సైన్యం వెల్లడించింది. మిగిలిన రెండు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడ్డాయని, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేసింది. మరోవైపు, కువైట్, బహ్రెయిన్ ఓడరేవుల సమీపంలోని ఆయిల్ ట్యాంకర్ల సిబ్బందికి ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే నౌకలను విడిచి వెళ్లాలని, లేదంటే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఈ వరుస పరిణామాలతో హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఆందోళనలు మిన్నంటాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌ 100 డాలర్లకు చేరువైంది. [US Iran Conflict Seviour, oil tankers destroyed, Iran missile retaliation, Strait of Hormuz, Jordan US base, CENTCOM strikes, Telugu One]

Published on: Wed Sep 9, 2026 9:01AM