TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.!

మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు మనిషే. ఔను నిజంగా మానవుడు మహనీయుడే. దివి నుంచి గంగను భువికి దించిన భగీరథుడూ మానవుడే. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనిషి మరో మహాద్భుత ఆవిష్కరణకు చేరువ అవుతున్నాడు. ఔను.. ఇండియన్ సైన్స్ కంగంలో శాస్త్ర రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. భవిష్యత్ తరాల అవసరాల కోసం అపరిమితమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించే కృత్రిమ సూర్యుడు.. అదే ఆర్ఠిఫిషియల్ సన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. నూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీని అందుకునే ప్రయోగాలలో ఇండియన్ సైంటిస్టులు సక్సెస్ ఫుల్ గా ముందడుగు వేశారు. . సహజంగా సూర్యుడిలో జరిగే శక్తి ఉత్పత్తి ప్రక్రియను భూమిపైనే కృత్రిమంగా పునఃసృష్టించే ఈ బృహత్తర ప్రయోగంలో భారత్ సుస్థిర స్థానం దిశగా సక్సెస్ ఫుల్ గా మందుకు సాగుతోంది. ఈ పరిశోధనల్లో భాగంగా గుజరాత్‌లోని ప్రముఖ పరిశోధనా కేంద్రంలోని ఎస్ఎస్టి1 టోకామాక్ రియాక్టర్‌లో సరికొత్త పరికరాలను అమర్చారు. ఇందులో భాగంగా శక్తివంతమైన 82.6 జీహెచ్ జడ్, 400 కిలోవాట్ల గైరోట్రాన్‌ను విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసి కమిషన్ చేశారు. ఈ సాంకేతికత నూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియకు అత్యంత కీలకమైన అల్ట్రా హాట్ ప్లాస్మాను నియంత్రించడం, ఎక్కువ కాలం స్థిరంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. టోకామాక్ రియాక్టర్ల లోపల సూర్యుడి కేంద్ర భాగం కంటే వేల రెట్లు అధిక ఉష్ణోగ్రతలను సృష్టించి.. దాన్ని అదుపులో ఉంచడం ఈ ప్రయోగం యొక్క ప్రధాన లక్ష్యం. భూమి మీద పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తట్టుకోవడానికి, బొగ్గు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ పరిశోధన ఎంతగానో దోహదం చేస్తుంది. నూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా ఎటువంటి ప్రమాదకర వ్యర్థాలు వెలువడకుండా.. పర్యావరణానికి ఇసుమంతైనా హాని కలగకుండా అధిక మొత్తంలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే మానవాళికి ఇంధన కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారమౌతుందని అంచనా. ఇప్పటికే ప్రపంచంలోని పలు అగ్రరాజ్యాలు ఈ తరహా కృత్రిమ సూర్య ప్రయోగాలపై దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఇండియా కూడా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. ఇండియాలోని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ ప్రాజెక్టు విజయవంతం చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అతి క్లిష్టమైన అయస్కాంత క్షేత్రాల ద్వారా మిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ప్లాస్మాను రియాక్టర్ గోడలకు తగలకుండా గాలిలో తేలేలా నియంత్రించడం ఈ ప్రయోగంలో అసలుసిసలు సవాల్. సైంటిస్టులు ఈ సవాల్‌నుసక్సెస్ ఫుల్ గా అధిగమిస్తూ.. ప్రయోగాన్ని ముందుకు తీసుకువెడుతున్నారు. తాజాగా అమర్చిన గైరోట్రాన్ పరికరం ద్వారా ప్లాస్మా స్థిరత్వం మరింత మెరుగుపడి, భవిష్యత్ ప్రయోగాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని సైంటిస్టులు ధీమాగా చెబుతున్నారు. ఇండియా ఇటు అంతరిక్ష రంగంలోనూ, అటు సాంకేతిక రంగంలోనూ ఇప్పటికే కీలక పురోగమనాలను సాధించింది. తాజాగా ఆర్ఠిఫిషియల్ సన్ ప్రయోగం ద్వారా ఇంధన రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతోంది. ప్రయోగశాలల్లో సాధించిన ఈ విజయాలు రానున్న కాలంలో పారిశ్రామిక అవసరాలకు అవసరమైన వాణిజ్య విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో దేశ ఆర్థిక అభివృద్ధికి, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల లక్ష్యాల సాధనకు ఈ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలుస్తుందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు ఈ ప్రాజెక్టుకు ఇస్తున్న ప్రాధాన్యత.. రానున్న దశాబ్ద కాలంలో నూక్లియర్ ఫ్యూజన్ శక్తి వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఇది కేవలం ఇండియాకే కాకుండా యావత్ ప్రపంచానికి ఇంధన భద్రతను చేకూరుస్తుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతీయకుండా భవిష్యత్ తరాలకు సురక్షితమైన ప్రపంచాన్ని అందించడంలో ఈ ఆర్టిఫిషియల్ సన్ ప్రయోగం నిస్సందేహంగా సైంటిఫిక్ ఫీల్డ్ లో ఒక రివల్యూషన్. [India Crucial Step, Towards Artificial Sun, Limitless, Clean Energy, Nuclear Fusion]

Published on: Tue Sep 15, 2026 12:35PM

political-news-img

కోర్టు తీర్పులపై విమర్శలు చేయవచ్చు కానీ..!

సాధారణంగా కోర్టులు, కోర్టు తీర్పులపై విమర్శించాలన్నా, బాహాటంగా అసంతృప్తి, అసమ్మతిని వ్యక్తం చేయాలన్నా.. సామాన్యుల నుంచి మాన్యుల వరకూ, న్యాయవాదుల నుంచీ రాజకీయనాయకుల వరకూ అందరూ భయపడతారు. ఈ నేపథ్యంలోనే దేశంలో కోర్టులు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన తీర్పులను విమర్శించడంపై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు కూడా సాధారణ మనుషులేననీ, వ్యవస్థపై విమర్శలు అవసరమే అయినప్పటికీ, మొత్తం వ్యవస్థే అవినీతిమయంగా మారిందని చెప్పడం సరికాదని సర్వోన్నత ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కోర్టుల తీర్పులను లేదా న్యాయ వ్యవస్థను విమర్శించాలంటే ప్రజలు, రాజకీయ నాయకులు భయపడేవారు. కోర్టు ధిక్కరణ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందన్నదే ఆ భయం. అయితే కాలక్రమేణా రాజకీయ పరిస్థితులు మారుతున్న కొద్దీ కోర్టు తీర్పులపై బహిరంగ చర్చలు, విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విమర్శల సరిహద్దులపై క్లారిటీ ఇచ్చింది. న్యాయ వ్యవస్థలో తప్పులను ఎత్తిచూపడం, విమర్శించడం తప్పు కాదు కానీ, కానీ కోర్టులు పూర్తిగా అవినీతిమయమయ్యాయని భావి తరాలకు, విద్యార్థులకు బోధించడం సరైనది కాదని ధర్మాసనం పేర్కొంది. జడ్జీలు ఎవరూ సాధువులు కారని, అయితే వ్యవస్థలోని లోపాలను, వ్యక్తుల తప్పులను వేరు వేరుగా చూడాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఒక వ్యవస్థలో లోపాలు ఉండవచ్చు, అది వివక్షపూరితంగా లేదా అసమానంగా అనిపించవచ్చు అంత మాత్రాన ఆ వ్యవస్థ మొత్తం'అవినీతిమయమైనది అని అనడం ఎంతమాత్రం సమజసం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవినీతి అనేది పూర్తిగా వ్యక్తిగత లక్షణమే తప్ప వ్యవస్థది కాదని అంటున్నారు. కొంతమంది వ్యక్తుల తప్పులను మొత్తం వ్యవస్థకు ఆపాదించడం అనేది కేటగిరీ ఆఫ్ ఎర్రర్ కిందకు వస్తుందంటున్నారు. ఈ తరహా ఆలోచనా విధానాన్ని కేవలం న్యాయ వ్యవస్థకే కాకుండా పోలీస్ శాఖ సహా అన్ని ప్రభుత్వ విభాగాలకూ వర్తిస్తుందని అంటున్నారు. వ్యక్తుల తప్పులను బట్టి మొత్తం వ్యవస్థపై ముద్ర వేయకుండా నివారించడమే దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు సారాంశం అని చెప్పాలి. . వ్యవస్థలో ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దాలని కోరే హక్కు ఉంటుందే తప్ప.. మొత్తం వ్యవస్థ మూలాలను దెబ్బతినేలా నిరాధార ఆరోపణలు చేయడం ఎంత మాత్రం సరికాదు. [Supreme Court on Corruption, CJI Surya Kant, Criticism of Judiciary,Supreme Court, Teluguone]

Published on: Tue Sep 15, 2026 9:53AM

political-news-img

తక్కువ ఖర్చుతో ఇంట్లో లగ్జరీ బ్యూటిఫికేషన్.. ఎలాగంటే?

ఇళ్ల అలంకరణ కోసం రకరకాల ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం కంటే.. సృజనాత్మకతను జోడించి ఇంట్లోనే నిరుపయోగంగా ఉన్న వస్తువులు, అంటే వ్యర్థ పదార్థాలతో ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలాంటి వ్యర్థ వస్తువులలో అరిగిపోయిన పాత టైర్లు కచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఆ పాత టైర్లను చెత్తగా భావించి వదిలేయకుండా, బయటపారేయకుండా వాటితో సుందరమైన గృహాలంకరణ వస్తువులను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని లేకుండా వాటిని ఇంటి బ్యూటిఫికేషన్ కు ఉపయోగించుకోవచ్చు. రంగులు, తాడు గుడ్డను ఉపయోగించి పాత టైర్లను ఇంటికి అందాన్ని తెచ్చిపెట్టే కళాఖండాలుగా ఉపయోగకరమైన సామాగ్రిగా మార్చుకోవచ్చు. సాధారణంగా ప్రతి ఇంట్లో లేదా గ్యారేజీలలో పనికిరాని పాత టైర్లు ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. అవి అలా మూలనపడి ఉండటం వల్ల వాటిని అలాగే వదిలేయడం వల్ల దుమ్ము పట్టి దోమలు ఎక్కువ అవుతాయి. అవి కుట్టి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఆ పాతబడిన, పనికిరాని టైర్లను దుమ్ముకూ ధూళికీ వదిలేయకుండా.. వాటిని శుభ్రం చేసి రంగులు వేసి ఇంటి లోపలా, బయటా కూడా అలంకరణ కోసం ఉపయోగించుకుంటే ఉభయతారకంగా ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు పెంచే వారికి పాత టైర్లు ఒక అద్భుతమైన వరంలాంటివి అని చెప్పవచ్చు. పాత టైరుకు ఆకర్షణీయమైన రంగులు అద్ది, దానిని అడ్డంగా ఉంచి మధ్యలో మట్టిని నింపి మొక్కలు నాటడం వల్ల అది ఒక చక్కని ప్లాంటర్‌లా మారుతుంది. బాల్కనీలు, టెర్రస్‌లు లేదా తోటల్లో అందమైన పూల మొక్కలను పెంచడానికి రెండు మూడు టైర్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఎత్తైన తొట్టెల్లా అమర్చుకోవచ్చు. ఇది తోటలకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. కేవలం మొక్కల పెంపకానికే కాకుండా, పాత టైర్లతో గదికి సరిపడే స్టైలిష్ ఫర్నిచర్‌ను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒకటి లేదా రెండు టైర్లను ఒకదానిపై ఒకటి అమర్చి, వాటిపై గుండ్రని చెక్క లేదా గాజు పలకను ఉంచడం ద్వారా ఆకర్షణీయమైన కాఫీ టేబుల్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఈ టైర్ల చుట్టూ జనపనార తాడును చుట్టడం లేదా ఇంటి ఇంటీరియర్‌కు సరిపోయేలా రంగులు వేయడం వల్ల ఇవి మరింత అందంగా కనిపిస్తాయి. అంతేకాకుండా, టైరు మధ్యలో ఉండే ఖాళీ స్థలాన్ని చిన్నపాటి వస్తువులను లేదా పుస్తకాలను దాచుకోవడానికి నిల్వ కేంద్రంగా కూడా వినియోగించుకోవచ్చు. దీనివల్ల స్థలం ఆదా అవ్వడంతో పాటు గదికి ఒక ఆధునిక రూపు వస్తుంది. ఇంటికి మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడానికి పాత టైర్లతో కూడిన కుర్చీలు లేదా పౌఫ్‌లను తయారు చేయడం మరొక మంచి మార్గం. టైరును ఫోమ్ మరియు అందమైన వస్త్రంతో కప్పి, కూర్చోవడానికి వీలుగా పైభాగంలో కుషన్లను అమర్చడం ద్వారా ఆకర్షణీయమైన ఒట్టోమన్‌లను తయారు చేయవచ్చు. దీనిని లివింగ్ రూమ్‌లో లేదా బాల్కనీలో కూర్చునే స్థలంగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, ఈ టైర్ల లోపల ఖాళీ ప్రదేశం ఉండేలా మూతలను ఏర్పాటు చేసి, దుప్పట్లు లేదా చిన్న పిల్లల ఆటబొమ్మలను భద్రపరుచుకునే స్టోరేజ్ బాక్సులుగా కూడా వీటిని మార్చుకోవచ్చు. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాకుండా రోజువారీ అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇంటి వెలుపలి ప్రాంతాలు లేదా తోటల అలంకరణలో పాత టైర్ల పాత్ర చాలా కీలకం. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా పాత టైరును బలమైన తాడులతో గట్టి చెట్లకు లేదా ఇళ్ల ముందు భాగంలో వేలాడదీసి ఊయలగా మార్చవచ్చు. ఇది పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ఇంటికి ఒక విభిన్నమైన రూపాన్ని తెస్తుంది. అలాగే, కొద్దిగా పెద్ద టైర్లను ఉపయోగించి తోటలలో చిన్నపాటి కృత్రిమ చెరువులను, వాటర్ ఫౌంటైన్ల స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. టైరును నేలలో పాక్షికంగా దింపి, వాటర్ ప్రూఫ్ కవర్లతో అమర్చి చుట్టూ రాళ్లు, మొక్కలతో అలంకరిస్తే అది తోటలోని ప్రధాన ఆకర్షణగా మారుతుంది. ఇంటి గోడలను లేదా కంచెలను అలంకరించడానికి కూడా పాత టైర్లను గోడ ప్లాంటర్లుగా ఉపయోగించవచ్చు. టైరును గోడకు పటిష్టంగా బిగించి, అందులో తీగ జాతి మొక్కలను నాటితే, ఆకులు టైరు అంచుల గుండా కిందికి జారుతూ చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే అనేక టైర్లను ఒకదానిపై ఒకటి అమర్చి, పైన చెక్క పలకను ఉంచి తోటలలో కూర్చునే బెంచ్‌లుగా ఉపయోగించుకోవచ్చు. ఈ రకమైన రీసైక్లింగ్ పద్ధతులు పర్యావరణ రక్షణకు తోడ్పడటమే కాకుండా, ఇంట్లోని వృథా వస్తువులతోనే అందమైన డిజైన్లను సృష్టించుకోవచ్చు. ఆధునిక కాలంలో గృహాలంకరణ కోసం కృత్రిమ వస్తువులను కొనుగోలు చేయడం కంటే, ఇటువంటి పర్యావరణ హితమైన, సృజనాత్మకమైన పద్ధతులను అవలంబించడానికే చాలా మంది ఇష్టపడుతున్నారు. సాధారణంగా చెత్తగా పారేసే వస్తువులను సరైన ఆలోచనతో మలిస్తే అవి ఇంట్లోని వాతావరణాన్నే పూర్తిగా మార్చివేయగలవు. పాత టైర్లతో గృహాలంకరణ చేయడం కేవలం డబ్బును ఆదా చేయడమే కాకుండా, మన సృజనాత్మకతను నలుగురికి చూపించడానికి ఒక చక్కని వేదికగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి DIY ప్రాజెక్ట్‌లు మరింత ప్రాచుర్యం పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, అందమైన మరియు పర్యావరణ హితమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరం. [Repurposing old tires, home decor ideas, DIY home decor, tire planters, stylish furniture]

Published on: Tue Sep 15, 2026 6:40AM

political-news-img

త్రిష ఎంట్రీ.. ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీజే విజయ్, ప్రముఖ నటి త్రిషల కలయికకు సంబంధించిన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది. బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో జరిగిన మిచెలిన్ లే మాన్స్ కప్ మోటార్ రేసింగ్ ఈవెంట్ వేదికగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అధికారిక పర్యటనలో భాగంగా యూకే వెళ్లిన సీఎం విజయ్, అక్కడ రేసింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ 44-కార్ల ప్రతిష్టాత్మక గ్రిడ్ రేస్‌ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా గ్రీన్ ఫ్లాగ్ ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు దిగ్గజ నటులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం కోలీవుడ్ వర్గాల్లో అభిమానులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. గత 34 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న తమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అజిత్ కుమార్ స్వయంగా సీఎం విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే సమయంలో లండన్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ నటి త్రిష కూడా సరిగ్గా ఇదే సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్ ప్రాంతంలో ప్రత్యక్షమవడం సర్వత్ర చర్చనీయాంశమైంది. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ త్రిషతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేక్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రేసింగ్ ఈవెంట్ జరిగే వేదిక వద్ద విజయ్, త్రిష ఒకే ప్రాంతంలో ఉండటం, వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడం వేగంగా జరిగిపోయాయి. ముఖ్యంగా కెమెరా కంట పడగానే ఇద్దరూ అప్రమత్తమై రైలింగ్ పక్కనుంచి కాస్త పక్కకు తప్పుకున్న క్లిప్స్ సోషల్ మీడియాలో రికార్డుస్థాయిలో వ్యూస్‌ను రాబడుతున్నాయి. ఇప్పటికే విజయ్-త్రిషల మధ్య వ్యక్తిగత సంబంధాలపై రకరకాల రూమర్లు, ఊహాగానాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సీఎం విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ, చెన్నైలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఈ చర్చలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు ఏకంగా వేరే దేశంలో, ఒకే అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ వేదికపై వీరిద్దరూ కనిపించడంతో ఈ పుకార్లు మరోసారి ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేకపోయినప్పటికీ, అభిమానులు రాజకీయ ప్రత్యర్థులు సై దీనిపై విభిన్న కోణాల్లో చర్చించుకుంటున్నారు. చెన్నై వేదికగా ఇలాంటి అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించే ప్రణాళికలపై సీఎం విజయ్ కసరత్తు చేస్తుండగా, ఈ యూకే పర్యటన మాత్రం రాజకీయంగానూ, సినిమా పరంగానూ ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. [ CM Vijay UK tour, Ajith Kumar racing, Silverstone Circuit, Trisha London shoot, Thalapathy Vijay news, Vijay and Ajith, Le Mans Cup Silverstone, Tamil cinema news, Vijay Ajith friendship, Tamil Nadu politics and cinema ]

Published on: Sun Sep 13, 2026 6:08PM

political-news-img

ఏఐ నుంచి స్మార్ట్ ఫ్యాక్టరీల వరకు.. బ్రిక్స్ వేదికగా జిన్‌పింగ్ మాస్టర్ ప్లాన్..!

బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంచలన ప్రసంగం..! అంతర్జాతీయ రాజకీయాలు, దౌత్య సంబంధాల వేదికగా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సులో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్రిక్స్ సదస్సులో భాగంగా రెండో రోజైన ఆదివారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్ సౌత్ దేశాల మధ్య పరస్పర సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసికట్టుగా అడుగులు వేస్తేనే భవిష్యత్తులో ఆర్థికంగా, సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కోసం ఐదు ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టమైన ప్రతిపాదనలు చేశారు.ఈ ప్రతిపాదనల్లో భాగంగా తొలి అంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి పెద్దపీట వేయాలని జిన్‌పింగ్ సూచించారు. ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన ఆయన, ఈ బృహత్తర బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించారు. దీని ద్వారా వివిధ దేశాల మధ్య ఏఐ సాంకేతిక అభివృద్ధి, బహుభాషా మోడళ్లకు సంబంధించిన నూతన అప్లికేషన్ల రూపకల్పన, నిపుణుల కోసం ప్రత్యేక సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని ఆయన భరోసా కల్పించారు. ఇక రెండవ ముఖ్యమైన అంశంగా బ్రిక్స్ దేశాల మధ్య స్పెషల్ ఎకనామిక్ జోన్ భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఆయా దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతమై పరస్పర ఆర్థిక వృద్ధికి బలమైన పునాది పడుతుందని ఆయన వివరించారు. ఇదే కోవలో మూడో అంశంగా డిజిటల్ ఎకో సిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక ప్రత్యేక క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవాలని జిన్‌పింగ్ సలహా ఇచ్చారు. దీని ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యం దక్కుతుందని, యువతకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణతో పాటు సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి సజావుగా సాగుతుందని ఆయన తెలిపారు. ఇక నాల్గవ అంశంగా మారుతున్న కాలానికి అనుగుణంగా తయారీ రంగంలో ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టాలని, స్మార్ట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు తగిన ప్రమాణాలు విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. ఐదవ చివరి అంశంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చైనా తరఫున 'బ్రిక్స్ యూత్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్'ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు తగినట్లుగా బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని జిన్‌పింగ్ చేసిన ఈ ప్రతిపాదనలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. [ BRICS summit, Xi Jinping, Global South, China president, AI open source, smart factories, BRICS nations, global conflicts, disaster warning system, international news, BRICS summit updates, Global Peace, United Nations, Gaza Ceasefire, Vladimir Putin ]

Published on: Sun Sep 13, 2026 4:33PM

political-news-img

60 ఏళ్ల తర్వాత జీవితాన్ని ఇలా మార్చుకోండి.. అసలైన సంతోషం మీ సొంతం..!

రిటైర్మెంట్ తర్వాత ఒంటరిగా ఉన్నారా..? ఈ చిన్న మార్పులతో లైఫ్ ఎంజాయ్ చేయండి..! జీవితంలో ప్రతి దశకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. చిన్ననాటి అల్లరి, యవ్వనంలో బాధ్యతల హోరు, ఆ తర్వాత ఉద్యోగ జీవితం, పిల్లల పెంపకం, వారి చదువులు మరియు పెళ్లిళ్లు అంటూ కాలం గడిచిపోతుంది. ఒకరోజు ఉదయం నిద్రలేచి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆఫీసు హడావుడి లేదు, పిల్లలు తమ సొంత ప్రపంచాల్లో బిజీగా ఉన్నారు, ఇంట్లో ఒంటరితనం చుట్టుముడుతుంది. అప్పుడే చాలా మంది సీనియర్ సిటిజన్ల మదిలో 'ఇక నా కోసం జీవితంలో ఏముంది?' అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ, అరవై ఏళ్లు దాటినంత మాత్రాన జీవితం నెమ్మదించాల్సిన అవసరం లేదని, అసలు సిసలైన ఆనందాన్ని వెతుక్కునే సమయం ఇప్పుడే మొదలవుతుందని నిరూపిస్తున్నారు ఎంతోమంది. ఉదయం కాఫీ కప్పుతో మొదలయ్యే రోజును కేవలం గడపడమే కాకుండా, మనసుకు నచ్చిన కొత్త స్నేహాలు చేసుకుంటూ, ఇష్టమైన ఆటలు ఆడుతూ, ప్రయాణాలు చేస్తూ, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఇల్లు ఒక ప్రపంచం అయితే, ఉద్యోగం మరో ప్రపంచం. ఈ రెండింటికీ భిన్నంగా మనసుకు నచ్చిన వారితో కాలం గడపడానికి ఏర్పడే సరికొత్త వేదికే 'థర్డ్ స్పేస్'. నేడు సీనియర్ల కోసం ప్రత్యేకంగా సప్పర్ క్లబ్స్, బాల్‌రూమ్ డ్యాన్స్ గ్రూపులు, పికిల్‌బాల్ కోర్టులు, గేమ్ నైట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ట్రావెల్ కమ్యూనిటీలు ఎన్నో ఏర్పాటవుతున్నాయి. ఈ వేదికలపై 'మీ వయసెంత?' అనేదానికంటే 'మీకు ఏది ఇష్టం?' అనేదే ప్రధానంగా మారుతుంది. ఒకేలాంటి అభిరుచులు, ఒకే ఆసక్తి ఉన్న ఇద్దరు వ్యక్తులు కలవడం ద్వారా కొత్త స్నేహాలు చిగురిస్తాయి. ఒక చిన్న ట్రిప్ లేదా సరదా ప్రయాణం అపరిచితులను కూడా ప్రాణ స్నేహితులుగా మార్చేస్తుంది. పిల్లలు మెరుగైన భవిష్యత్తు కోసం వేరే నగరాలకు లేదా విదేశాలకు వెళ్లడం ఈ కాలంలో సహజమే అయినప్పటికీ, ఆ దూరం వల్ల తల్లిదండ్రుల మనసులో ఏర్పడే ఖాళీని సరైన సామాజిక జీవనంతో పూడ్చుకోవచ్చు. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత ఎంత ముఖ్యమో, 'నన్ను పలకరించే మనుషులు నా చుట్టూ ఉన్నారు' అనే భరోసా కూడా అంతే అవసరం. రానున్న దశాబ్దాల్లో భారతదేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో, వృద్ధాప్యాన్ని కేవలం ఒక ఆరోగ్య సమస్యగా కాకుండా అత్యంత ఉత్సాహభరితమైన సామాజిక జీవితంగా చూడాలి. అరవై ఏళ్ల తర్వాత జీవితం ముగిసిపోదని, పిల్లల కోసం, కుటుంబం కోసం పరిగెత్తిన సంవత్సరాల తర్వాత మనకోసం మనం జీవించడానికి దొరికిన ఒక అద్భుతమైన కొత్త పేజీ ఇది. ఎవరితో నవ్వాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలి, ఏ ఆట ఆడాలి, ఏ కొత్త విద్యను నేర్చుకోవాలి అనే పూర్తి స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ మనుషుల దూరం పెరగాల్సిన అవసరం లేదు, మనసుకు దగ్గరైన ఆత్మీయుల సంఖ్య మరింత పెరగవచ్చు. రక్తసంబంధాలతో పాటు మనసుతో ఎంచుకునే ఈ సరికొత్త బంధాలే జీవితానికి నిజమైన అర్ధాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. [ life after 60 years, senior citizen lifestyle, happy retirement tips, elderly social life, third space for seniors, overcoming loneliness in old age ]

Published on: Sun Sep 13, 2026 1:13PM

political-news-img

మానవాళి వికాసమే బ్రిక్స్ దేశాల అసలు లక్ష్యం : ప్రధాని మోదీ!

ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడుతూ, మానవాళి సమగ్ర వికాసం కోసం బ్రిక్స్ (BRICS) దేశాలు నిరంతరం శ్రమిస్తున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే బ్రిక్స్ దేశాల అసలైన బలమని ఆయన అభివర్ణించారు. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్య దేశాలన్నింటి మధ్య పరస్పర సహకారం మరింత బలపడాలని, సమిష్టి కృషితోనే సమిష్టి ప్రయోజనాలు నెరవేరుతాయని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు పెరుగుతుండటం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాలు మరియు అంతర్గత ఘర్షణల వల్ల అమాయక సామాన్యుల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా, ఈ ఘర్షణల ప్రభావం అంతర్జాతీయంగా ఉంటోందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మహమ్మారులు, ప్రకృతి విపత్తులు మరియు గ్లోబల్ సప్లై చైన్ లో ఏర్పడుతున్న అంతరాయాలను అన్ని దేశాలు కలిసికట్టుగా అధిగమించాలని సూచించారు. కొత్త తరహా సాంకేతిక ఆవిష్కరణలను సకాలంలో అందిపుచ్చుకోవడం ఎంతైనా అవసరమని, భవిష్యత్ సవాళ్లను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారానే ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని మోడీ పేర్కొన్నారు. ముఖ్యంగా విపత్తులను ముందస్తుగా అంచనా వేసేందుకు వీలుగా 'బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్' ఏర్పాటు చేయడంపై పూర్తి ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దీనికి సంబంధించి విపత్తు హెచ్చరికల జారీ కోసం ప్రత్యేక మార్గదర్శకాలను కూడా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో ఆపదలను ముందే పసిగట్టి కోట్లాది ప్రాణాలను, ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. [ BRICS Summit, PM Narendra Modi, BRICS nations, global conflicts, disaster warning system, international news, BRICS summit updates, Global Peace, United Nations, Gaza Ceasefire, Vladimir Putin ]

Published on: Sun Sep 13, 2026 12:59PM

political-news-img

నా తప్పునకు నేనే మూల్యం చెల్లిస్తున్నా.. నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

నాటి ఫ్లైఓవర్ల నిర్మాణమే నేటి ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం..! ముంబై మహానగరంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎదుర్కొన్న ట్రాఫిక్ ఇబ్బందిని ఉదాహరణగా చూపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, అధికారిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో గడ్కరీ తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. వర్లి నుంచి తాను బయలుదేరిన ప్రాంతానికి చేరుకోవడానికి సుమారు గంట సమయం అదనంగా పట్టిందని, దీనివల్ల కార్యక్రమానికి ఆలస్యంగా హాజరయ్యానని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తూ, తాను పడిన ఇబ్బందిపై ఆయన ఒక చమత్కారమైన రీతిలో స్పందించారు. "నేను ఆలస్యంగా రావడానికి కారణం దారిలో ఎదురైన భారీ ట్రాఫిక్ జామ్. అయితే, నాటి నా తప్పునకు నేనే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాను" అని ఆయన పేర్కొనడంతో సభలోని వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. గడిచిన కాలంలో తాను చేపట్టిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, 1992 నుంచి 2000 మధ్యకాలంలో ముంబై నగరంలో 55 ఫ్లైఓవర్లు, బాంద్రా-వర్లి సీ లింక్, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే వంటి కీలకమైన నిర్మాణాలకు తాను శ్రీకారం చుట్టినట్లు గడ్కరీ గుర్తుచేశారు. ఆ కాలపు పరిస్థితులకు అనుగుణంగా ఆ మౌలిక వసతులు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. అయితే కాలం మారుతున్న కొద్దీ నగరాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని, అప్పట్లో అందుబాటులో లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. పాతకాలపు వంతెనలు ఫ్లైఓవర్లు నేటి ఆధునిక రద్దీని తట్టుకోవడంలో విఫలమవుతున్నాయని, అందుకే అవి ఇప్పుడు కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు ఆటంకంగా మారుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆధునిక సాంకేతికతను జోడించి మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని గడ్కరీ సూచించారు. ఒకే పిల్లర్‌పై పలు అంచెలుగా రోడ్లు నిర్మించి, దానిపై మెట్రో మార్గాలను ఏర్పాటు చేసే సరికొత్త మలేషియా టెక్నాలజీని భారత్‌లో అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో దేశంలోని ప్రధాన నగరాల్లో రద్దీని నివారించడానికి సాంకేతికత ఆధారిత మౌలిక సదుపాయాల కల్పనే ఏకైక మార్గమని నితిన్ గడ్కరీ పునరుద్ఘాటించారు. నగరవాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని వినూత్న ప్రణాళికలతో ముందుకు వస్తుందనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. [ Nitin Gadkari, Mumbai Traffic Jam, Gadkari on Mumbai Roads, Union Minister Nitin Gadkari, Multi-level Flyovers India, Telugu One, Telugu News ]

Published on: Sun Sep 13, 2026 12:38PM

political-news-img

రేసింగ్ ట్రాక్‌పై సీఎం విజయ్, అజిత్ అరుదైన కలయిక.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..!

కోలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద పోటీదారులుగా ఉన్న అగ్రనాయకులు విజయ్, అజిత్ తాజాగా రేసింగ్ ట్రాక్ వేదికగా ఒక్కటయ్యారు. బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ మోటార్ రేసింగ్ సర్క్యూట్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే చోట కనిపించి అభిమానులకు అనూహ్యమైన ఆశ్చర్యాన్ని కలిగించారు. ప్రముఖ కార్ రేసింగ్ ఈవెంట్ అయిన 'లీ మాన్స్ కప్' పోటీల్లో పాల్గొనేందుకు అజిత్ కుమార్ ఆ రేసింగ్ ట్రాక్‌కు వచ్చారు. మరోవైపు, అధికారిక పర్యటన నిమిత్తం యూకే వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రత్యేక అతిథిగా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు స్టార్లు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సినిమా రంగంలో వీరుద్దరి మధ్య ఎంతటి పోటీ వాతావరణం ఉంటుందో తెలిసిందే. అయితే తెరవెనుక మాత్రం వీరిద్దరూ మంచి స్నేహితులుగా మెలుగుతారనే దానికి ఈ ఘటనే నిదర్శనమని అభిమానులు భావిస్తున్నారు. ఈ రేసింగ్ ఈవెంట్‌లో భాగంగా విజయ్ తన చేతుల మీదుగా గ్రీన్ ఫ్లాగ్ ఊపి రేస్‌ను ప్రారంభించడం విశేషం. ఈ అనూహ్య కలయికకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దశాబ్ద కాలంగా సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్‌కు ఈ ఒక్క కలయికతో తెరపడినట్లయింది. తారల మధ్య ఉన్న సత్సంబంధాలు చూసైనా అభిమానులు సంయమనం పాటించాలని కోలీవుడ్ వర్గాలు కోరుతున్నాయి. మరోవైపు తమిళనాడులో మోటార్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికల్లో భాగంగా విజయ్ ఈ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌ను సందర్శించినట్లు సమాచారం. రేసింగ్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, మౌలిక వసతులపై ఆయన అధికారులతో చర్చించారు. ఇదే సమయంలో అజిత్ తన రేసింగ్ టీమ్‌తో కలిసి ఈ పోటీల్లో పాల్గొనడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యతను సంతరిపెట్టింది. చిత్ర పరిశ్రమలో వేర్వేరు మార్గాలను ఎంచుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో వీరు పరస్పరం చూపించుకునే గౌరవం అందరినీ ఆకట్టుకుంటోంది. రాజకీయంగా, సినీపరంగా బిజీగా ఉన్నప్పటికీ ఇద్దరు దిగ్గజాలు ఇలా ఒకే వేదికపై కలుసుకోవడం చారిత్రాత్మక క్షణంగా అభిమానులు అభివర్ణిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సానుకూల పరిణామాలు సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అరుదైన కలయిక ఇటు సినిమా ప్రేక్షకుల్లోనూ, అటు మోటార్ స్పోర్ట్స్ ప్రియుల్లోనూ పండుగ వాతావరణాన్ని సృష్టించింది. [ Vijay and Ajith, Le Mans Cup Silverstone, Tamil cinema news, Vijay Ajith friendship, Tamil Nadu politics and cinema ]

Published on: Sun Sep 13, 2026 11:35AM

political-news-img

ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా గ్లోబల్ సౌత్ ఎదగాలి : ప్రధాని మోదీ

ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం..! అంతర్జాతీయ నిర్ణయాలు విధాన రూపకల్పనలో వర్ధమాన దేశాల ప్రాతినిధ్యం మరింత బలోపేతం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేవలం నిబంధనలను పాటించే దేశాలుగా మిగిలిపోకుండా, ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాత్మక శక్తిగా గ్లోబల్ సౌత్ ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన రెండు రోజుల వార్షిక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రారంభోపసన్యాసం చేశారు. ఈ కీలక సదస్సుకు రష్యా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో వర్ధమాన దేశాలు వెనుకడుగున ఉంటున్నాయని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్ మాదిరిగా తయారైందని, కేవలం ఉన్నత స్థాయిలో ఉన్న కొద్దిమంది చేతుల్లోనే అధికార కేంద్రీకరణ జరిగిందని ఆయన విమర్శించారు. కిందిస్థాయిలో ఉన్న దేశాలు మాత్రం కేవలం పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితి మాత్రమే ఉందని, దీన్ని మార్చి సమన్యాయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణ కోసం పలు నూతన ప్రతిపాదనలను ప్రధాని తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తక్షణమే చేపట్టాలని, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు ఇకపై ఆలస్యం చేయరాదని ఆయన తేల్చిచెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో వర్ధమాన దేశాలకు తగిన ఓటింగ్ హక్కులు, ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కృత్రిమ మేధస్సు (AI), సైబర్ స్పార్క్, అంతరిక్షం, బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో మారుతున్న నిబంధనలకు అనుగుణంగా గ్లోబల్ సౌత్ దేశాలు సన్నద్ధం కావాలని మోదీ సూచించారు. వర్ధమాన దేశాల యువ డిప్లొమాట్లు, నిపుణులకు ప్రత్యేక శిక్షణ మరియు చట్టపరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా అంతర్జాతీయ చర్చల్లో వారు ప్రభావవంతంగా రాణించవచ్చని తెలిపారు. సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం నిర్వహించే నావికులు మరియు సముద్ర సిబ్బంది భద్రత కోసం 'సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్‌వర్క్' ఏర్పాటు చేయాలని సదస్సులో ఆయన ప్రతిపాదించారు. కష్టకాలంలో ఉన్న నావికులకు వైద్య సహాయం, సంక్షేమ సేవలు అందించడంలో ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. భారత అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై వర్ధమాన దేశాలకు మరింత గౌరవప్రదమైన స్థానం దక్కేలా ఈ సదస్సు ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని సర్వత్రా అంచనా వేస్తున్నారు. [ PM Modi, BRICS Summit, Global South, Rule Shaper, UN Security Council Reforms, Xi Jinping, Narendra Modi, BRICS Summit 2026, India China relations, Delhi news, India visit, Global South, Border Dispute Resolution, India China Relations, Telugu One, Telugu News ]

Published on: Sat Sep 12, 2026 5:37PM