TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

హంస వాహనంపై జ్ఞానస్వరూపుడిగా శ్రీ మలయప్పస్వామి..!

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం రాత్రి హంస వాహనసేవ వైభవంగా జరిగింది. శ్రీ మలయప్పస్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో, చేతిలో వీణను ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంస వాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వాహనసేవ సందర్భంగా తిరుమాడ వీధులు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. మంగళవాయిద్యాలు, వేదఘోషలు, భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు వాహనసేవకు మరింత శోభను తీసుకొచ్చాయి. కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి. జ్ఞానానికి ప్రతీక హంస వాహనం..! హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానస్వరూపుడిగా దర్శనమిస్తారని పురాణాలు, ఐతిహ్యాలు చెబుతున్నాయి. హంస బ్రహ్మదేవుని వాహనంగా, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. పాలు–నీళ్లను వేరు చేయగల హంస స్వభావం వివేకానికి, ఆత్మ–అనాత్మ విచక్షణకు సంకేతంగా పేర్కొంటారు. పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయులను ఉపనిషత్తులు ‘పరమహంసలు’గా అభివర్ణిస్తాయి. ఈ నేపథ్యంలో హంస వాహనసేవ భక్తుల్లోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వివేకజ్ఞానాన్ని ప్రసాదించి, ఆధ్యాత్మిక ఉన్నతికి చేర్చే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమలలో హంస వాహనంపై జ్ఞానస్వరూపుడిగా వెలసిన శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచింది. ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. [ Tirumala, Tirupati, Lord Malayappa Swamy, Hamsa Vahanam, Hamsa Vahana Seva, Tirumala Brahmotsavam, TTD, Saraswati Alankaram, Lord Venkateswara, Tirumala Temple, Brahmotsavam 2026, Devotees, Govinda Namam, Tirumala Utsavam ]

Published on: Wed Sep 16, 2026 8:30PM

political-news-img

ఆధ్యాత్మికతకు ప్రపంచ స్థాయి నమూనాగా తిరుమల..!

5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం లక్ష్యం : సీఎం చంద్రబాబు తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా, ఆధ్యాత్మికతకు ప్రపంచ స్థాయి నమూనాగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో భక్తులకు మెరుగైన అనుభూతిని అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మికత, సేవాభావం, ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తామని చెప్పారు. తిరుమల కొండల్లో 89.5 శాతం గ్రీన్‌ కవర్‌ ఉందని, దీన్ని మరింత పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వద్ద ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌, ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం, రిలయన్స్‌ ఫౌండేషన్‌, భారత్ బయోటెక్ సంస్థలు అందించిన 32 ఎలక్ట్రిక్‌ బస్సులను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు, తిరుమలలోని వివిధ ప్రాంతాలను త్రీడీ సాంకేతికత ద్వారా భక్తులు వీక్షించే అవకాశం కల్పించారు. 6 డీవీఆర్ వర్చువల్‌ రియాలిటీ ద్వారా తిరుమల దర్శన అనుభూతిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. గతంలో ఉన్న ఎస్వీ మ్యూజియాన్ని ఆధునీకరించి పునః ప్రారంభించారు. శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం తదితర అంశాలను భక్తులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించేలా టీటీడీ ఈ మ్యూజియాన్ని సిద్ధం చేసింది. టీసీఎస్ ట్రస్ట్ రూ.104 కోట్లతో మ్యూజియాన్ని అభివృద్ధి చేసింది. శ్రీకృష్ణదేవరాయలు సహా వివిధ రాజులు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలు, వివిధ కాలాలకు చెందిన చారిత్రక వస్తువులు, స్వామివారికి అలంకరించే కిరీటాలు, ఆభరణాల త్రీడీ నమూనాలను మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పానోరమిక్‌ స్క్రీన్‌పై ఏఐ వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాలను ముఖ్యమంత్రి తిలకించారు. శ్రీవారి సేవకోసం, స్వామి వారిని కీర్తించేందుకు ఆనాటి సంగీత కారులు వినియోగించిన వాయిద్య పరికరాలను కూడా మ్యూజియంలో సీఎం ఆసక్తిగా పరిశీలించారు. తిరుమలలో భక్తుల కోసం 32 ఎలక్ట్రిక్ బస్సులు..! తిరుమలలో భక్తుల రాకపోకలకు వీలుగా రిలయన్స్‌ ఫౌండేషన్‌, భారత్ బయోటెక్ సంస్థలు అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రిలయన్స్ ఈ-మోబిలిటీ సీఈఓ నితిన్ సేత్, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా టీటీడీ సభ్యులతో కలిసి నారాయణ గిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకూ ఎలక్ట్రిక్ బస్సులో సీఎం ప్రయాణించారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికీ బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఎల్‌ఐసీతో కలిసి ఆధార్‌ ఆధారిత ఆన్‌లైన్‌ బీమా అమలు చేయనున్నట్లు చెప్పారు. దురదృష్టవశాత్తూ తిరుమలలో భక్తుడు మరణిస్తే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందేలా ఈ బీమా వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 5 వేల దేవాలయాలను శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మాణం చేపడతామన్నారు. మారిషస్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలని కోరుతున్నారని, దీనిపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. శ్రీవారి సేవకులను విద్య, వైద్య రంగాల్లోనూ వినియోగించుకునేలా కార్యాచరణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరు అంశాల్లో తిరుమల తిరుపతి దేవస్థాన కార్యకలాపాలను పునర్వవస్థీకరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. [ SV Museum, Tirumala, Chandrababu Naidu, TTD, AI Technology, 3D Museum, Pilgrims Experience Centre, Tirumala Development, Lord Venkateswara, Tirupati, Spiritual Tourism, Net Zero Tirumala,TTD, BR Naidu, Anam Rama Narayana Reddy ]

Published on: Wed Sep 16, 2026 5:11PM

political-news-img

పోలీసు శాఖలో రిక్రూట్ మెంట్.. మొత్తం 2050 పోస్టులకు నోటిఫికేషన్.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కీలక అడుగులు పడుతున్న తరుణంలో, పోలీసు శాఖతో పాటు అనుబంధ విభాగాలలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటంతో నిరుద్యోగ వర్గాల్లో నూతనోత్సాహం సంతరించుకుంది. ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల అయ్యాయి. విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం, రాష్ట్రంలోని వివిధ భద్రతా, అనుబంధ శాఖలలోని ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. కేవలం సాధారణ పోలీసు విభాగమే కాకుండా, అగ్నిమాపక శాఖ, జైళ్లు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ వంటి కీలక విభాగానికి చెందిన పోస్టులను ఈ జాబితాలో చేర్చారు. అభ్యర్థుల అంచనాలకు తగ్గట్టుగా విభిన్న కేటగిరీలలో ఈ పోస్టుల విభజన జరగడం విశేషం. సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్, సాంకేతిక నిపుణుల పోస్టుల వరకు అన్నీ ఈ నోటిఫికేషన్ల పరిధిలోకి రావడం వల్ల అర్హత కలిగిన వారికి అవకాశం లభించనుంది. ఈ మొత్తం నియామక ప్రక్రియలో భాగంగా సబ్ ఇన్‌స్పెక్టర్ కేటగిరీలో వివిధ విభాగాల కింద పోస్టులను కేటాయించారు. ప్రాథమికంగా సివిల్ ఎస్ఐ విభాగంలో 253 పోస్టులు ఉండగా, ఆర్మ్‌డ్ రిజర్వ్ ( విభాగంలో 116 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పరిధిలో 9 పోస్టులు, కమ్యూనికేషన్స్ విభాగంలో 50 పోస్టులు, అలాగే పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగంలో మరో 10 ఎస్ఐ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు కానిస్టేబుల్, ఇతర అనుబంధ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా చేపట్టడం జరిగింది. మొత్తం కానిస్టేబుల్ కేటగిరీలో 1,156 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 542 ఉండగా, ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు 285 వరకు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన , అగ్నిమాపక సేవల శాఖలో 158 ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జైళ్లు, సంస్కరణ సేవల శాఖలో పురుష, మహిళా వార్డర్ పోస్టులు కలుపుకుని మొత్తం 171 పోస్టులను కేటాయించారు. అలాగే కమ్యూనికేషన్స్ విభాగంలో 200 కానిస్టేబుల్ పోస్టులు, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ కింద 198, డ్రైవర్ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టంచేశారు. ఇక సాంకేతిక, శాస్త్రీయ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పరిధిలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్‌లో చేర్చింది. వీటిలో ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, అలాగే బయాలజీ, సెరాలజీ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నింటికీ సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, అర్హతలు, వయోపరిమితి సడలింపులు, రిజర్వేషన్ల వివరాలు మరియు రాత పరీక్షల తేదీలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా త్వరలోనే ప్రకటించనున్నారు. గతంలో విడుదలైన వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి నియామక ప్రక్రియను మరింత పకడ్బందీగా, వేగవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. [AP Police Recruitment 2026, AP Police Jobs, SI and Constable Vacancies, APSLPRB Notifications, Andhra Pradesh Government Jobs]

Published on: Wed Sep 16, 2026 3:55PM

political-news-img

తిరుమలలో కొత్త అనుభూతి.. AI, 3D టెక్నాలజీతో ఎస్వీ మ్యూజియం ప్రారంభం..!

శ్రీవారి వైభవానికి టెక్నాలజీ టచ్.. తిరుమలలో అదిరిపోయే మ్యూజియం..! తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోలతో కలిసి మ్యూజియంలోని విశేషాలను సీఎం పరిశీలించారు. శ్రీవారి మహత్యం, తిరుమల విశిష్టతలను భక్తులకు తెలియజేసేలా మ్యూజియంలో అనేక ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు సహా పలువురు రాజులు, భక్తులు వివిధ సందర్భాల్లో శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలతో పాటు చారిత్రక అంశాలను తెలిపే వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. శ్రీవారికి అలంకరించే వివిధ రకాల కిరీటాలు, ఆభరణాలను త్రీడీ మోడళ్ల రూపంలో అందుబాటులో ఉంచారు. పానోరమిక్ స్క్రీన్‌పై ఏఐ సాంకేతికతతో రూపొందించిన వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాలను ప్రదర్శిస్తున్నారు. తిరుమల కొండపై ఉన్న వివిధ ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి, భౌగోళిక విశిష్టతలను వివరించేలా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తిరుమల ఏడు కొండల త్రీడీ మోడల్‌ను కూడా సందర్శకులకు అందుబాటులో ఉంచారు. తిరుమలకు వచ్చి ఆయుధాలను త్యజించి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించిన వివిధ రాజ్యాల రాజులకు సంబంధించిన ఆయుధాలను కూడా మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. శ్రీవారిని కీర్తించిన అన్నమాచార్యులు సహా పలువురు భక్తులు ఉపయోగించిన సంగీత వాయిద్యాలను కూడా ఏర్పాటు చేశారు. చరిత్ర, ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికతను మేళవిస్తూ రూపొందించిన ఈ మ్యూజియం.. భక్తులకు తిరుమల వైభవాన్ని మరింత దగ్గరగా పరిచయం చేసేలా తీర్చిదిద్దారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..! శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం తన అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. తనకు ప్రాణభిక్ష పెట్టిన వెంకటేశ్వరస్వామికి ఎప్పుడూ కృతజ్ఞుడినని చెప్పారు. 1999లో తాను ప్రారంభించిన మ్యూజియంను సుందరీకరించి మళ్లీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హోలోగ్రాఫిక్ డిజైన్లతో మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఒక ట్రస్ట్ ద్వారా మ్యూజియాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రమాదవశాత్తు భక్తులు మరణిస్తే రూ.2 లక్షల పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదనే నిబంధనను కఠినతరం చేశామని వెల్లడించారు. వైకుంఠంలో పిల్గ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, క్యూ కాంప్లెక్స్‌లో లైవ్ మెడిటేషన్‌తో పాటు శ్రీవారి వైభవాన్ని తెలుసుకునే ఏర్పాట్లు చేశామని తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతోందని.. పూజా విధానాలు, ఆధ్యాత్మికతను పాటించడం ద్వారా మానసికంగా దృఢంగా ఉండొచ్చని అన్నారు. ఆలయాలు, శ్రీవారి సేవ..! శ్రీవారి దేవాలయం పేరుతో దేశవ్యాప్తంగా 5 వేల ఆలయాలను నిర్మించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. చిన్న దేవాలయాలను పెద్ద దేవాలయాలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. అవసరాన్ని బట్టి ఒక్కో ఆలయానికి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.టీటీడీ పరిధిలో 165 దేవాలయాలు ఉన్నాయని, వాటిలో 64 ఆలయాలు తిరుమల వెలుపల ఉన్నాయని తెలిపారు. ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్నప్రసాదానికి భారీగా విరాళాలు వస్తున్నాయని, అన్నప్రసాదంలో మజ్జిగ స్థానంలో పెరుగు అందించాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. వైద్య సేవలకు ప్రాధాన్యం..! స్విమ్స్, రుయా, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తామని సీఎం తెలిపారు. శ్రీవారి వైద్య సేవ కార్యక్రమం ద్వారా 800 మంది వైద్యులు ముందుకొచ్చారని చెప్పారు. టాటా క్యాన్సర్ ఆసుపత్రి, అరవింద్ ఆసుపత్రి వంటి సంస్థలను అనుసంధానం చేస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే 12 లక్షల మంది శ్రీవారి సేవకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. వైద్యులు, విద్యా రంగానికి చెందిన వారు కూడా శ్రీవారి సేవకులుగా ముందుకొస్తున్నారని చెప్పారు. సేవకులకు తగిన శిక్షణ ఇచ్చి మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా చేస్తామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ..! తిరుమలలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు 32 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. వాటిని మరింత ఎక్కువ ట్రిప్పులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమలను నెట్‌జీరోగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వ్యర్థాలను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా తిరుమలకు విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తిరుమలలో ఇకపై అవసరం లేని నిర్మాణాలకు అవకాశం లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. 'వృక్ష గోవిందం' కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని తెలిపారు. తిరుపతి పరిసరాలను మరింత పచ్చదనంతో తీర్చిదిద్దుతామని చెప్పారు. కొండల్లోని నీటిని తిరుపతి పరిసరాల్లో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..! తిరుపతిలో స్కైవాక్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్‌కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గరుడ వారధిని కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు సుమారు రూ.230 కోట్లతో ఇంటి స్థలాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రభుత్వం, టీటీడీ భాగస్వామ్యంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలకు సులభంగా చేరుకునే ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి మొత్తం పండుగ వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలను వెడ్డింగ్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నీటి కొరత లేకుండా చర్యలు..! తిరుమలలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. సోమశిల, కండలేరు నుంచి తిరుపతికి నీటిని తీసుకొస్తున్నామని చెప్పారు. గతంలో నీటి కొరత కారణంగా ఆలయాన్ని మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని చర్చ జరిగినప్పుడు.. కళ్యాణి డ్యామ్ నుంచి నీటిని పంపింగ్ చేసి సమస్యను పరిష్కరించామని గుర్తు చేశారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం, టీటీడీ కలిసి పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. [ SV Museum, Tirumala, Chandrababu Naidu, TTD, AI Technology, 3D Museum, Pilgrims Experience Centre, Tirumala Development, Lord Venkateswara, Tirupati, Spiritual Tourism, Net Zero Tirumala,TTD, BR Naidu, Anam Rama Narayana Reddy ]

Published on: Wed Sep 16, 2026 2:43PM

political-news-img

వివేకా హత్య కేసులో కీలక ట్విస్ట్.. డిశ్చార్జ్ పిటిషన్లు రిటర్న్!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి తమను కేసు నుంచి డిశ్చార్జ్ చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను పరిశీలించిన నాంపల్లి కోర్టు వాటిని రిటర్న్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్జ్‌షీట్ దాఖలైన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసేందుకు నిర్ణీత గడువు ఉంటుందని కోర్టు పేర్కొన్నది. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం చార్జ్‌షీట్ దాఖలైన 40 రోజుల్లోపే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.అయితే నిందితులు నిర్ణీత సమయంలో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయలేదని పేర్కొన్న కోర్టు.. గడువు తర్వాత దాఖలైన పిటిషన్లను స్వీకరించకుండా రిటర్న్ చేసింది. ఈ పిటిషన్లను కేసు మెరిట్‌పై కొట్టివేయడం కాకుండా నిర్ణీత సమయంలో దాఖలు చేయలేదనే కారణంతో రిటర్న్ చేసింది. దీంతో నిందితులు తదుపరి ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, నిందితుల అరెస్టులు, కోర్టు విచారణ వంటి అంశాలు పలు దశల్లో కొనసాగుతున్నాయి. తాజా డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం కేసులో మరో కీలక న్యాయపరమైన పరిణామంగా మారింది. [YS Viveka Murder Case, Discharge Petitions, Retun, Nampalle, CBI Court]

Published on: Wed Sep 16, 2026 2:31PM

political-news-img

ఎస్వీ మ్యూజియంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.!

తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత ఇనుమడింపజేసేలా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎస్వీ మ్యూజియంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (సెప్టెంబర్ 16) ప్రారంభించారు. శ్రీవారి సార్వభౌమత్వాన్ని, తిరుమల చరిత్రను, అరుదైన సాంస్కృతిక విశేషాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ మ్యూజియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ముస్తాబు చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు అనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ్యూజియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ గ్యాలరీలను చంద్రబాబు పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఆధారిత శ్రీవారి దర్శన అనుభూతిని ముఖ్యమంత్రి స్వయంగా వీక్షించి, మ్యూజియం పనితీరును అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ జోడించినట్లు అధికారులు వెల్లడించారు.జీ ప్లస్ 3 అంతస్తుల విశాలమైన భవనంలో రూపుదిద్దుకున్న ఈ ఎస్వీ మ్యూజియంలో మొత్తం 19 ప్రత్యేక గ్యాలరీలు, సుమారు 14 వేలకు పైగా అరుదైన కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా బాపు, కృష్మారావు వంటి ప్రసిద్ధ కళాకారులు తీర్చిదిద్దిన అద్భుతమైన వర్ణచిత్రాలు, దశావతారాల ఘట్టాలు, విరాట్ పురుషుని రూపాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే, తాళ్లపాక అన్నమాచార్యులు రాగి రేకులపై నిక్షిప్తం చేసిన పవిత్ర భక్తి గీతాలు, చరిత్రకు సాక్ష్యంగా నిలిచే పురాతన నాణేలు, తిరుమల గత వైభవానికి సంబంధించిన అరుదైన ఛాయాచిత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సందర్శకుల సౌకర్యార్థం ఈ మ్యూజియంలో మోషన్ సెన్సార్ లైటింగ్ వ్యవస్థను అమర్చారు. దీనివల్ల మ్యూజియంలో ఎక్కడైతే సందర్శకులు ఉంటారో అక్కడ మాత్రమే లైట్లు వెలిగేలా అత్యాధునిక ఆటోమేటెడ్ సాంకేతికతను వాడారు. భక్తుల రాకపోకల కోసం హైస్పీడ్ ఎలివేటర్లు, విశాలమైన ఏసీ గ్యాలరీలు, అత్యాధునిక విశ్రాంతి గదులు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా మ్యూజియం లోపలికి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, పాదరక్షలను అనుమతించబోమని, వాటిని భద్రపరుచుకోవడానికి ప్రత్యేకంగా లాకర్ సౌకర్యం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల వేళ ఈ మ్యూజియం ప్రారంభంకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలకు విచ్చేసే భక్తులు కేవలం స్వామివారి దర్శనంతో సరిపెట్టుకోకుండా, ఇక్కడి చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక సంపదను కళ్లకు కట్టినట్లు తెలుసుకునేలా ఈ ప్రాజెక్ట్‌ రూపకల్పన చేశారు. ఇదే పర్యటనలో భాగంగా రిలయన్స్, భారత్ సంస్థలు విరాళంగా అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సుల జెండా ఊపి ప్రారంభించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు ఈ ఈవీ బస్సుల ప్రయాణం ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.భవిష్యత్తులో తిరుమలకు వచ్చే పర్యాటకులు, భక్తుల సంఖ్య మరింత పెరగనున్న నేపథ్యంలో, వారికి మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా పాలకమండలి ముందుకు వెళ్తోంది. డిజిటల్ మరియు వర్చువల్ అనుభవాలను జోడించడం ద్వారా యువతను, ఆధ్యాత్మిక ప్రియులను ఈ మ్యూజియం విశేషంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. [Tirumala SV Museum, Chief Minister Chandrababu Naidu, Tirumala Brahmotsavam, TTD Museum inaugurated Tirumala, Telugu One]

Published on: Wed Sep 16, 2026 2:22PM

political-news-img

పెద్దశేష వాహనంపై శ్రీవారు.. తిలకించి పులకించిన భక్తకోటి.!

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో మంగళవారం (సెప్టెంబర్ 15) వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాత్రి జరిగిన పెద్దశేష వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు ఆదిశేషుని ప్రతిరూపమైన పెద్దశేషునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.శ్రీవారి పెద్ద శేష వాహన సేవ తిలకించి భక్త కోటి పులకించింది. శ్రీవారి పెద్దశేష వాహనసేవను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశంలోని భిన్న ప్రాంతాల కళా, సాంస్కృతిక వైభవాన్ని తిరుమలలో ఆవిష్కరిస్తూ 9 రాష్ట్రాల నుంచి 19 కళాబృందాలకు చెందిన 549 మంది కళాకారులు నృత్యాలు, జానపద కళలు, సంగీత ప్రదర్శనలతో తిరుమలను కళా వైభవానికి వేదికగా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు తమ ప్రాంతాల సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి. వివిధ రాష్ట్రాల జానపద, శాస్త్రీయ కళల సమ్మేళనం భక్తులకు కనువిందు చేసింది. తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ కుట్రాల కురవంజి తొలిరోజు కళా ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాసుడు, పద్మావతి పరిణయాన్ని ప్రతిబింబించే కథాంశాన్ని నృత్యం, సంగీతం, అభినయంతో కళాకారులు హృద్యంగా ఆవిష్కరించారు. రంగురంగుల సంప్రదాయ ఆహార్యంతో కళాకారుల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. అస్సాం రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక బిహూ నృత్యం భక్తులను అలరించింది. సంప్రదాయ వస్త్రధారణలో యువతీ యువకులు జంటలుగా ఉత్సాహభరితంగా చేసిన వేగవంతమైన చేతులు, నడుము, పాదాల కదలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బిహూ గీతాల లయకు అనుగుణంగా సాగిన ఈ ప్రదర్శన ద్వారా అస్సాం సంస్కృతి వైభవం ప్రతిబింబించింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన సంప్రదాయ జానపద కళారూపం ఒయ్యాలట్టం భక్తులను ఆకట్టుకుంది. డప్పు, తాళాల లయకు అనుగుణంగా కళాకారులు బృందంగా ప్రదర్శించిన నృత్యం, రంగురంగుల రుమాళ్లతో చేసిన లయబద్ధమైన విన్యాసాలు చూపరులను అలరించాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన శ్రీమద్రామాయణ రూపకం భక్తులను భక్తిభావంలో ముంచెత్తింది. రామాయణంలోని ఘట్టాలను నృత్య, సంగీత, అభినయ రూపాల్లో ప్రదర్శించి శ్రీరాముని మహిమను చాటిచెప్పారు. వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన కోలాటాలు, డప్పు, డ్రమ్ము విన్యాసాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్దశేష వాహనసేవ సందర్భంగా తిరుమలలో మార్మోగిన భిన్న రాష్ట్రాల జానపద సంగీతం, నృత్యాలు భారతీయ సంస్కృతిలోని భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప సందేశాన్ని చాటిచెప్పాయి. [Srivari Brahmotsavalu, Pedda Sehavahanaseva, Cultural, Programmes, TTD]

Published on: Wed Sep 16, 2026 11:50AM

political-news-img

ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..!

విద్యార్థులను ఆందోళనలకు ఉసిగొల్పుతు.. రెచ్చగొడుతున్నా..కోచింగ్ కేంద్రాలు.!. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వేదిక కాకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఈ ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఒత్తిడి తెస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దురుద్దేశ పూర్వకంగా కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్టు అధికారులు వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేయాల్సిన అభ్యర్ధులను రాజకీయ ప్రేరేపిత నిరసనలు, ఆందోళనలకు వినియోగిస్తున్నట్టు తెలిపారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే కొన్ని ప్రైవేటు కోచింగ్ సంస్థల యజమానులు దురుద్దేశంతో అభ్యర్ధులను నిరసనలకు, ఆందోళనల కోసం ప్రోత్సహించినట్టు తేలిందన్నారు. ఈ అంశాలపై దృష్టి సారించిన సీఎం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్ధులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ పోటీ పరీక్షలకు అభ్యర్ధులను సిద్ధం చేయాల్సిన ఈ కోచింగ్ కేంద్రాలు కొందరు అభ్యర్ధులను రాజకీయ పరమైన ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణా నిబంధనలు 2026 ప్రకారం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలకు అనుగుణంగా నడచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా వ్యవహరించిన ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అటు అభ్యర్ధులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకూ లోను కాకుండా తమ భవిష్యత్తుపై, పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని సూచనలు జారీ చేసింది. [ CM Chandrababu, Private Coaching Centers, AP Government, Student Protests, Coaching Center Regulations, Competitive Exam Aspirants, AP Goverment, YS Jagan, Telugu news, Telugu One ]

Published on: Tue Sep 15, 2026 6:25PM

political-news-img

ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి..!

అత్తగారింటికి పండుగకు వచ్చిన ఆళ్ల నాని హఠాన్మరణం..! ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఆళ్ల నాని మృతిపై సంతాపం తెలియజేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని(కాళీ కృష్ణ శ్రీనివాస్) హఠాన్మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 56 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో దూరమవ్వడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆళ్ల నాని ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, ఆళ్ల నాని మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే నాని స్మృతిలో నివాళులర్పిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజలతో మమేకమైన నేతగా పేరుపొందిన ఆళ్ల నాని మరణం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పూడ్చలేని లోటుగా భావిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ నేత ఆళ్ల నాని మంగళవారం ఉదయం గుండెపోటుతో విశాఖపట్నంలో మృతి చెందారు. అత్తగారింటికి పండగకు వచ్చిన ఆయనకు ఊహించని విధంగా గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన నగరంలోని సీతమ్మధారలో గల కిమ్స్ ఐకాన్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ మృతి చెందారు. రాజకీయ నాయకునిగా కాకుండా, ఉత్తమ కార్య నిర్వహణ అధికారిగా ఆళ్ల నాని పేరు తెచ్చుకున్నట్లుగా చెప్పొచ్చు. వర్గ రాజకీయాలకు, గ్రూపు కోటరీలకు తావివ్వకుండా కల్మషం లేని నాయకునిగా కొనసాగుతూ వచ్చారు. రాజకీయ రంగంలో అజాతశత్రువుగా పేరుపొందిన ఆళ్ల నాని హఠాన్మరణం అన్ని రాజకీయ పార్టీల నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సంఘటన గురించి తెలిసిన వెంటనే అన్ని పార్టీలకు చెందిన నేతలు తొలుత కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయనను డిశ్చార్జ్ చేసి కుటుంబ సభ్యులు మురళీనగర్‌లో గల తమ ఇంటికి తీసుకువెళ్లగా నాయకులందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే ఆళ్ల నానికి వచ్చిన గుండెపోటు ఇదే మొదటిసారా? గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఆయన మరణానికి గల కారణాలు ఏమిటి? అన్న విషయమై వైద్యులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆళ్ల నాని మరణం రాజకీయ వర్గాలను తీవ్ర విషాదానికి గురిచేసింది. [ Alla Nani, Alla Kali Krishna Srinivas, Alla Nani Death, Alla Nani Passed Away, Former AP Deputy CM, AP Former Minister, Andhra Pradesh Politics, Eluru Politics, YSRCP, TDP, Chandrababu Naidu, Nara Lokesh, YS Jagan, KIMS Icon Hospital, Visakhapatnam, Heart Attack, Former Deputy Chief Minister, Eluru MLA, Andhra Pradesh News, AP Political News]

Published on: Tue Sep 15, 2026 4:01PM

political-news-img

ఆళ్ల నాని అస్తమయం..రాజకీయ వర్గాల్లో విషాదం..!

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ల నాని (57) కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఒకరిగా పనిచేసిన ఆళ్ల నాని.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌గా రాజకీయాల్లోకి వచ్చిన ఆళ్ల నాని.. 1969 డిసెంబరు 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల సూర్యచంద్రరావు, నాగమణి దంపతులకు జన్మించారు. ఏలూరులోని కేపీ హైస్కూల్‌లో 1985లో పదో తరగతి, సర్‌ సీఆర్‌ఆర్‌ కళాశాలలో 1988లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ చదువుతూ మధ్యలోనే విద్యాభ్యాసాన్ని నిలిపివేశారు. రాజకీయ ప్రస్థానం..! కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆళ్ల నాని.. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై 33,053 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లోనూ ఏలూరు నుంచి గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగారు. 2013లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన నిర్వహించిన బాధ్యతలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ (బడేటి చంటి) చేతిలో ఆళ్ల నాని ఓటమి పాలయ్యారు. అనంతరం 2025లో తెలుగుదేశం పార్టీలో చేరారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏలూరు రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగిన ఆళ్ల నాని మృతితో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. [ Alla Nani, Alla Kali Krishna Srinivas, Alla Nani Death, Former AP Deputy CM, Former Minister Alla Nani, Eluru Politics, YSRCP, TDP, YS Jagan, AP Politics, Andhra Pradesh Politics, Health Minister, COVID 19, Eluru MLA, Alla Nani News ]

Published on: Tue Sep 15, 2026 2:40PM