రెండు దశాబ్దాల పోరాటంలో ఉండవల్లి సాధించింది ఇదా?
Published on: Sat Aug 22, 2026 3:00PM

మార్గదర్శి ఫిన్ క్యాప్ కేసు వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో సుప్రీం కోర్టు ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ, ఈ కేసుతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధం ఏమిటని నిలదీసింది.
2008 నుంచి ప్రారంభమైన ఈ మార్గదర్శి కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. గతంలో హైకోర్టు ఈ కేసును కొట్టివేసినప్పటికీ, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఊరూరా సభలు నిర్వహించి మరీ మార్గదర్శి సంస్థలు ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించాయని, ప్రజలను మోసం చేశాయని ఆరోపణలు గుప్పించారు. అయితే ఆయన వాదనలు, ప్రచారాలు, ఆరోపణలూ అన్నీ అసత్యాలని సుప్రీం తీర్పుతో తేలిపోయింది. దీనిపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు.. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసారావు తెలుగువన్ చానల్ కు ఇచ్చినఇంటర్వ్యూలో ఉండవల్లి మార్గదర్శిపై కేసు, న్యాయపోరాటం అంతా కేవలం ఈర్ష్యతోనే అన్నారు. అయితే దోమ ఏనుగుని చూసి ఈర్ష్యపడితే ఏమౌతుందో.. ఇప్పుడు ఉండవల్లి పరిస్థితి కూడా అంతేనన్నారు.
మార్గదర్శి డిపాజిటర్ల పరంగా ఇప్పటివరకూ ఒక్క బాధితుడు కూడా ఫిర్యాదు చేయకపోవడం, సంస్థ ఇప్పటికే రూ.2,600 కోట్లకు పైగా ఎస్క్రో అకౌంట్లో జమ చేయడం వంటి అంశాలను గుర్తు చేసిన అడుసుమిల్లి.. రామోజీరావు నిర్మించిన పత్రికా, వ్యాపార సామ్రాజ్యంపై కేవలం ఈర్ష్యా ద్వేషాలతోనే ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రామోజీరావును విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదన్నారు.
ఈ తీర్పు రామోజీరావు ప్రతిష్టను ఇనుమడింపచేసిందనీ, ఆయనపై కక్షసాధింపు చర్యలకు చెక్ పడిందని అడుసుమిల్లి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ అజెండాతో చేసిన పోరాటాలు చివరికి న్యాయస్థానాల ముందు నిలబడవని ఈ కేసు మరోసారి స్పష్టం చేసిందన్న ఆయన. సుప్రీం కోర్టు నిర్ణయంతో మార్గదర్శి వివాదానికి ముగింపు పడినట్లేనన్నారు. ఇప్పటికైనా విమర్శకులు తమ వైఖరిని మార్చుకోవాలని అడుసుమిల్లి హితవు పలికారు.
Supreme Court, Margadarsi Judgement, Vundavalli Aruna Kumar, Margadarsi Case, Court Verdict Telugu, TeluguOne


