అడిగి మరీ పాట పెట్టించుకున్న అక్కినేని
Published on: Mon Nov 28, 2011 11:56AM
మన సినిమాల్లో శృంగార, ప్రేమ పాటలకు పెట్టిన పేరు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. 86 యేళ్ళ ఈ లేటు వయసులో ఆయనకు నటనమీద ఉన్న శ్రద్ధ ఎలాంటిదో తెలిపే సంఘటన ఇది. ఆయన్ని తమ "శ్రీ రామరాజ్యం"చిత్రంలో వాల్మీకి వేషం వేయమని అడిగినప్పుడు అక్కినేని వారు "నేనా పాత్రలో నటించటం సమంజసంగా ఉంటుందా...?" అని ముళ్ళపూడి వెంకట రమణ గారిని ప్రశ్నించారట. దానికాయన "మీరే ఆ పాత్రలో నటించాలి.ఇంకెవరు నటించినా ఆ పాత్రకు న్యాయం జరగదు" అని అన్నారట.
ఆ తర్వాత ఆ పాత్రకు ఒక పాట కూడా ఉంటే బాగుంటుందనీ, అందుకని ఒక పాటను పెట్టవలసిందిగా ఆయన దర్శకులు బాపుగారిని కోరారట. అప్పుడు పుట్టిందే "ఎవడున్నాడీ లోకంలో" అనే పాట. "శ్రీరామరాజ్యం" అనే ఈ రోజుల్లో పౌరాణికి చిత్రం తీయటం సాహసం. అదీ నాటికీ నేటికీ ఏనాటికీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ , పౌరాణికి కళాఖండం "లవకుశ" వంటి చిత్రాన్ని రీమేక్ చేయాలనుకోవటం నిజంగా దుస్సాహసమనే చెప్పాలి. కానీ ఆ చిత్రాన్ని ప్రేక్షకజనరంజకంగా తీసినందుకు బాపు గారిని, ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత యలమంచిలి సాయిబాబు గారినీ తెలుగువన్ ప్రత్యేకంగా అభినందిస్తోంది.


