కిరణ్ కొత్తపథకం‘ఇందిరమ్మ విసనకర్రలు’
Publish Date:Aug 27, 2012
Advertisement
రాష్ట్రంలో ఇప్పుడంతా ఇందిరమ్మ భజన జరుగుతోంది. కాంగ్రెస్ నేతలంతా నెహ్రూకుటుంబాన్ని, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని పొగుడుతూ కాలం నెట్టుకొస్తున్నారు. సోనియా ముందు భజన చేయనివాళ్లగతి అధోగతే అవుతోంది. వై.ఎస్ హయాంలో మొదలైన ఈ భజన ఇప్పుడు తారాస్థాయికి చేరింది. భజన చేస్తేనే అమ్మ వరాలిస్తుందన్న విషయం సాధారణ కార్యకర్తలకుకూడా తెలిసిపోయింది. వై.ఎస్ బతికున్నన్నాళ్లూ ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు తగిలించేశారు. వై.ఎస్ హఠాన్మరణం తర్వాత అధికారపీఠమెక్కిన రోశయ్యకూడా ఆ పద్ధతినే కొనసాగించారు. అధిష్ఠానం భజన చేయడంలో దిట్ట అయిన రోశయ్య మెల్లగా గవర్నర్ గిరీని చేజిక్కించుకుని ఒత్తిడినుంచి తప్పించుకున్నారు. తర్వాత వంతు కిరణ్ కుమార్ రెడ్డిది. కిరణ్ కుమారెరెడ్డికూడా లౌక్యంగా సోనియా భజన చేసుకుంటూ కాలం గడుపుకొస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆయన ప్రారంభించిన మొదటి కార్యక్రమంపేరు ఇందిరమ్మ బాట.. ప్రభుత్వానికి ముందస్తు చూపులేని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదికూడా అధిష్ఠానం చలవేనంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ కోత అనే పవర్ కట్ పథకాన్ని ప్రకటించారని ప్రతిపక్షాల నేతలు ఛలోక్తులు విసురుతున్నారు. త్వరలోనే సీఎం ఇందిరమ్మ విసనకర్రలు పేరుతో కొత్త పథకాన్నికూడా ప్రారంభించబోతున్నారని అంతా చెవులుకొరుక్కుంటున్నారు. గాలికోసం విసనకర్రలతో విసురుకునేటప్పుడు వాటిమీదున్న ఇందిరమ్మ ఫోటోని చూసి జనమంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారతారని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం సొంతమౌతుందని కిరణ్ గట్టిగా భావిస్తున్నారని విపక్షాల నేతలు అనుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/కిరణ్-కొత్తపథకం‘ఇందిరమ్మ-విసనకర్రలు’--24-16918.html





