జీరో షాడో డే.. హైదరాబాద్ లో నీడలు మాయం!
Publish Date:May 9, 2026
Advertisement
హైదరాబాద్ వాసులుశనివారం, (మే 9) ఒక అద్భుత, అరుదైన ఖగోళ వింతను వీక్షించనున్నారు. అదే జీరో షాడో డే. మధ్యాహ్నం కొన్ని నిమిషాల పాటు నీడలు పూర్తిగా కనిపించకుండా మాయమవుతాయి. ఏటా రెండుసార్లు ఈ అద్భుతం జరుగుతుంది. శనివారం (మే9) మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిముషాలకు సూర్యుడు సరిగ్గా నడి నెత్తిన ఉంటాడు. అంటే సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడతాయి. ఫలితంగా మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది. దీని గురించి వివరించేందుకు హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ప్లానిటోరియం ఆవరణలో ఇందుకు సంబంధించి ప్రదర్శన నిర్వహించనుంది. సాధారణంగా కర్కాటక రేఖ మరియు మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ జీరో షాడో డే ఏర్పడుతుంది. భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల సూర్యుని గమనం ఉత్తరాయణం, దక్షిణాయనంగా మారుతుంటుంది. ఈ క్రమంలో సూర్యుడు నిర్దిష్ట అక్షాంశాల మీదుగా వెళ్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో నీడలు మాయమవుతాయి.
http://www.teluguone.com/news/content/zero-shadow-day-36-219277.html





