మూసీ ప్రాజెక్టు తొలి దశకు ఏడు వేల కోట్ల రూపాయలు!
Publish Date:May 9, 2026
Advertisement
భాగ్యనగరానికి మణిహారంగా నిలిచే మూసీ నది పునరుద్ధరణ, సుందరీకరణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తొలి దశ పనులను ఏడువేల 55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొదటి విడత పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా గడువును నిర్దేశించుకుంది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం (మే 8) జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు. మొదటి దశ నిధుల కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అధికారులు కమిటీకి వివరించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే క్షేత్రస్థాయిలో నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలగని విధంగా మొదటి 5 కిలోమీటర్ల మేర (హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపు ఘాట్ వరకు) పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కేవలం నది ప్రక్షాళన మాత్రమే కాదనీ.. నగర వాసుల జీవన ప్రమాణాలను పెంచే సామాజిక బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ సందర్భంగా అన్నారు. ప్రాజెక్టులో భాగంగా నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తారు. అలాగే.. నదిలో నీటి మట్టాన్ని క్రమబద్ధీకరించడానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి అత్యాధునిక రబ్బర్ డ్యామ్ లను ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. నాసిక్, ముంబై నగరాల్లో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని మంత్రులు చెప్పారు. ఎలైన్మెంట్లో మార్పులు చేయడం ద్వారా వీలైనంత వరకు ప్రస్తుత కట్టడాలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. భూసేకరణ మరియు పునరావాస ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హోర్డింగ్లు, ప్రచార చిత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/seven-thousand-crore-rupees-for-the-first-phase-of-the-musi-project-36-219285.html





