Top Stories

కారు స్టీరింగ్ చేతులు మారుతుందా?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరో మూడు రోజుల్లో ( ఏప్రిల్ 27) ఇరవై నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ  సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భం.  అవును పాతికేళ్ళ క్రితం, 2001 ఏప్రిల్‌ 2న జలదృశ్యం (కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం) లో పురుడు పోసుకున్నటీఆర్ఎస్ ఇంత కాలం బతికి బట్టకడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ముఖ్యంగా అప్పటికే  ప్రత్యేక  తెలంగాణ నినాదంతో పుట్టి గిట్టిన పార్టీలు అనేకం ఉన్న నేపధ్యంలో టీఆర్ఎస్ కూడా అంతే  అనుకున్నవారు, అన్నవారు కూడా ఉన్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన టీఆర్ఎస్  విజయవంతంగా, రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా.. పాతికేళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకుంది. రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించింది.  ప్రతిపక్ష అనుభవాన్నీ రుచి చూసింది.    నిజానికి, తెలుగు నాట  అనేక పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో పోయాయి. అప్పుడే కాదు.. ఇప్పటికి కూడా, పాతికేళ్ళు బతికి బట్ట కట్టిన పార్టీలు రెండే రెండున్నాయి. 1982 లో  నందమూరి తారక రామ రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తర్వాత రజతోత్సవం జరుపుకుంటున్న పార్టీ, టీఆర్ఎస్ మాత్రమే బతికి బట్ట కట్టిన పార్టీగా చరిత్ర  పుటల్లో నిలిచింది.  ఈ పాతికేళ్ళలో పార్టీలో చాలా మార్పులు జరిగాయి. 2001లో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్, 2014లో ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 2022లో  భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) గా  పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టింది. అయితే  ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా, ప్రాతీయ పార్టీ, జాతీయ పార్టీగా  రూపాంతరం చెందినా, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్నా  పార్టీ పగ్గాలు మాత్రం చేతులు మారలేదు. వ్యవస్థాపక అధ్యక్షుడు, కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) సారథ్యకలోనే ఇప్పటికీ పార్టీ నడుస్తోంది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. రెండు పదవుల్లో కొనసాగుతున్నారు. నిజానికి,ముందు ముందు కూడా ఆయనే కొనసాగుతారు.  అందులో అనుమానం లేదు.  అయితే పదవి ఆయనదే అయినా..  పెత్తనం అయన చేతుల్లో ఎంతవరకూ ఉంటుంది అనేది అనుమానమే అంటున్నారు. ఇప్పటికే చాలావరకు ఫార్మ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ తిరిగి క్రియాశీల నేతగా జనంలోకి వస్తారా? ముందుండి పార్టీని నడిపిస్తారా? తెర వెనక నుంచి మార్గ ‘దర్శకత్వం’ మాత్రమే చేస్తారా? అంటే.. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా  పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలను జాగ్రత్తగా గమినిస్తే..  ఏదో ఇలాంటి, ఉత్సవాల్లో దర్శనం ఇవ్వడం వరకే కేసీఆర్ పాత్ర పరిమితం కాబోతోందననే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి.. కారాణాలు ఏమైనా ఇప్పటికే పార్టీలో కేసీఆర్ పాత్ర చాలా వరకూ కుదించుకు పోయింది. ఇందులో దాపరికం లేదని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. మరోవంక కేటీఆర్  అప్రకటిత ఉత్తరాధికారిగా సర్వం తానై చక్రం తిప్పుతున్నారనేది  కళ్ళ ముందున్న సత్యం. అదలా ఉంటే గడచిన రెండుమూడు రోజుల్లో కేటీఆర్  వేర్వేరు టీవీ చాన్నాళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో  కేసీఆర్ ఫ్యూచర్ రోల్ పై మరింత క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. కానీ, పార్టీ రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో కనిపించరు. వినిపించరు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు. తెర వెనక నుంచి మార్గ దర్శకత్వం  మాత్రమే చేస్తారు. తెరపై కనిపించే రోజువారీ రాజకీయ  కార్యకలాపాలన్నీ కేటీఆర్ చూసుకుంటారు.  అలాగే, ప్రతిపక్ష నేతగానూ కేసీఆర్  కొనసాగుతారు, కానీ, అసెంబ్లీకి మాత్రం రారని, కేటీఆర్  ఒకటి రెండు ఇంటర్వ్యూలలో స్పష్టంగానే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రస్ మంత్రులు చేసే అవమానాలను భరించవసిన అవసరం కేసీఆర్ కు లేదని, అందుకే ఆయన, అసెంబ్లీకి రారని స్పష్టం చేశారు. అంతేకాదు.. గతంలో తమిళనాడులో జయలలిత, ఏపీలో చంద్రబాబు నాయుడు, అధికార పక్షం అవమానాలను భరించలేక సంవత్సరాల తరబడి అసెంబ్లీకి  రాలేదని, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్  కూడా అసెంబ్లీ ముఖం చూడరని కేటీఆర్ స్పష్టం చేశారు.  సో.. ఇక గులాబే బాస్  ఎవరంటే.. తెర వెంక కేసీఆర్,  తెరపై కేటీఆర్ ఆర్  అంటున్నారు.
కారు స్టీరింగ్  చేతులు మారుతుందా? Publish Date: Apr 24, 2025 7:02AM

ఉగ్రదాడి.. ఏపీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు ఖండించారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత, భద్రత విషయంలో  అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.   అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లిన ఆయన చంద్రమౌళి భౌతికకాయంపైపై జాతీయ జెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.  జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే విహారయాత్రకు వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడులు జరిపారన్నారు. మన రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ బి ఐ ఉద్యోగి చంద్రమౌళి, ఐటీ ఉద్యోగి మధుసూధన్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు తెలుగువారి   కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.  ఉగ్రవాదులు భారత్ ను ఏం చేయలేరు.. మన దేశంలో  సమర్థనాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉందన్నారు.  అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారత పర్యటనలో ఉండటం, దేశ ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.   దేశ సమగ్రత, భద్రతను దెబ్బతీయాలని చూసే వారి ఆటలు సాగవు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.  జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో విశాలమైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్ర భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపిస్తాం. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తామని చెప్పారు. 
ఉగ్రదాడి.. ఏపీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా Publish Date: Apr 24, 2025 6:46AM

ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం..ఇక వారికి నో ఎంట్రీ

  జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు తక్షణమే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది.  పాక్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే పాక్ హైకమీషనర్ దేశాన్ని వీడాలని సూచించింది. అటారి చెక్ పోస్టును వెంటనే మూసి వేస్తున్నట్టు తెలిపింది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కేబినెట్‌ భద్రతా కమిటీ భేటీలో చర్చించిన అంశాల్ని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాకు వెల్లడించారు.  సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించిందన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు  
ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం..ఇక వారికి నో ఎంట్రీ Publish Date: Apr 23, 2025 10:06PM

జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూతురు ఎంగేజ్మెంట్‌కు హారయ్యేందుకు ఆయన సంగారెడ్డి వెళ్తున్నట్టు సమాచారం. వారం రోజులు జపాన్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. అక్కడ పలు పారిశ్రామిక సంస్థలతో రూ.12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఈనెల 25, 26న హైదరాబాద్ వేదికగా జరగనున్న 'భారత్ సమ్మిట్ ఏర్పాట్లపై రేపు మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ Publish Date: Apr 23, 2025 9:35PM

బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కేటీఆర్

    ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని సందర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్నికేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ హిమాలయాల స్థాయికి తీసుకెళ్లారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారు గులాబీ జెండా వైపే చూస్తున్నారని, బీఆర్ఎస్ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని కేటీఆర్ అన్నారు. వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ గతంలో అనేక విజయవంతమైన సభలు నిర్వహించిందని, ఇప్పుడు పార్టీ వార్షికోత్సవ సభకు కూడా ఇదే వేదిక కావడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నామని, సుమారు 40 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. వేసవి దృష్ట్యా 10 లక్షల మంచి నీటి బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని, వైద్య సేవలకు గాను 100 వైద్య బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కేటీఆర్ Publish Date: Apr 23, 2025 8:57PM

ప్రశాంతంగా ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్

  హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది అఫిషియో సభ్యులలో 21 మంది ఓటు వేశారు. ఓటింగ్ లో బీఆర్ఎస్  మినహా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ఓటర్లు తమ ఓటు బక్కు వినియోగించుకున్నారు.  ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో నిలిచారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే బీఆర్ఎస్ పోలింగ్ గు దూరంగా ఉండటం, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్ లో పాల్గొనడంతో ఫలితంపై ఉత్కకంఠ నెలకొంది. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరుగనుంది. గత 22 ఏళ్లుగా హైదరాబాద్‌ లోకల్ బాడీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వస్తోంది. అయితే 22ఏళ్ల తర్వాత తొలిసారిగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది
ప్రశాంతంగా ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ  పోలింగ్ Publish Date: Apr 23, 2025 8:32PM

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ ఎందుకంటే?

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు, కేసు విచారణ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా బీజేపీ నేత కాసం కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ  రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ ఎందుకంటే? Publish Date: Apr 23, 2025 8:10PM

వీరయ్య కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ..హంతకులను వదిలే ప్రసక్తే లేదు

  నిన్న ఒంగోలులో  హత్య గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలులో టీడీపీ కార్యకర్త  వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి.. వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. బాధ్యులను పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు.   హత్య జరిగిన నాటి నుంచే ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. “ఈ కేసు దర్యాప్తుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ అన్నింటినీ పరిశీలిస్తున్నామన్నారు. 53 కత్తిపోట్లు ఉన్నట్టు నివేదికల్లో ఉంది. ఇది కరుడు కట్టిన నేరగాళ్ల పన్నుగట్టిన కుట్ర,” అని చెప్పారు. ప్రజల్లో ఎవరికైనా ఈ హత్యకు సంబంధించి సమాచారం ఉంటే, టోల్ ఫ్రీ నంబర్ 9121104784 కు ఫోన్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హత్య చేసిన నేరగాళ్లు భూమిపై ఎక్కడ దాక్కున్నా వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు చివరకు కాలగర్భంలో కలిసిపోతారు. నేర రాజకీయాలను తుదముట్టించే వరకు పోరాటం చేస్తాం. రాష్ట్రం నేరస్థుల అడ్డాగా మారకూడదు అని చంద్రబాబు అన్నారు.
వీరయ్య కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ..హంతకులను వదిలే ప్రసక్తే లేదు Publish Date: Apr 23, 2025 7:32PM

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

  తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ ఇంటర్‌, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇదే టైం టేబుల్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. జూన్‌ 9న ప్రథమ ఇంటర్‌, 10న ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్‌ 30 తుది గడువు అని పేర్కొన్నారు. కాగా నిన్ననే ఇంటర్ రిజల్ట్స్  విడుదల అయిన సంగతి తెలిసిందే
ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల Publish Date: Apr 23, 2025 7:12PM

అఘోరీకి లింగ నిర్థారణ పరీక్ష.. కోర్టు ఆదేశం!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి చేవెళ్ల కోర్టు బుధవారం (ఏప్రిల్ 23) 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఘోరీ తరఫు లాయర్ చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీది చీటింగ్ కేసు కావడంతో.. కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చెప్పలేమన్నారు. బెయిల్ ఎప్పుడు వస్తుందో  కూడా చెప్పలే మన్నారు. చీటింగ్ కేసు రుజువైతే అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీ తరఫున వాదించిన న్యాయవాదే అహోరికి శిక్షపడే అవకాశం ఉందనడం ఆసక్తిగా మారింది.    ఇలా ఉండగా కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి పోలీసులు బుధవారం (ఏప్రిల్ 23) లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.  అఘోరీకి పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించారు. కానీ జైలు అధికారులు లింగ నిర్ధారణ కాకుండా జైలులో ఉంచుకోలేమని తేల్చి చెప్పడంతో పోలీసులు అఘోరీని తిరిగి కోర్టుకు తీసుకువెళ్లారు. దీంతో కోర్టు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్షకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్స చేయించారు.   
అఘోరీకి  లింగ నిర్థారణ పరీక్ష.. కోర్టు ఆదేశం! Publish Date: Apr 23, 2025 5:48PM

అజ్ణానం.. అజ్ణాతం.. మళ్లీ ప్రత్యక్షం.. అనిల్ కుమార్ యాదవ్ తీరు అయోమయం!

అనీల్ కుమార్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడి, తొడకొట్టి సవాళ్లు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరెట్టుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్లుగా అప్పట్లో ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారనీ చెబుతుంటారు. సరే అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తరువాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మౌనంగా మాయమైపోయారు.   వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.  ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని చెప్పారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ముఖం చూపలేక చాటేశారు.  విపక్షంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధకారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనీల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కొన్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తనను తాను కాపాడుకోవడం ఎలాగో తెలియక అనిల్ కుమార్ యాదవ్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో స్థాయి మరిచి.. ఇష్టారీతిగా తెలుగుదేశం, జనసేన అధినాయకులపై అనిల్ కుమార్ చేసిన అనుచిత విమర్శలు, వ్యాఖ్యల కారణంగా ఆ రెండు పార్టీలలోనూ అవకాశం లేకపోయింది. దీంతో అనివార్యంగా ఆయన ఇటు వైసీపీకి దూరమై, అటు మరో పార్టీ అండ లేకుంటే కేసులను తట్టుకోవడం సాధ్యం కాదని భావించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ జగన్ పంచన చేరి పబ్బం గడుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా నిన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడాన్ని చూపుతున్నారు. మొత్తం మీద అజ్ణానం నుంచి అజ్ణాతంలోకి అక్కడ నుంచి మళ్లీ జగన్ పంచకు చేరిన అనిల్ కుమార్ ప్రస్తతం తన భవిష్యత్ ఏమిటన్న అయోమయంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. 
అజ్ణానం.. అజ్ణాతం.. మళ్లీ ప్రత్యక్షం.. అనిల్ కుమార్ యాదవ్ తీరు అయోమయం! Publish Date: Apr 23, 2025 4:56PM

జగన్ మీడియా అసత్య కథనాలపై చింతమనేని నిరసన

  జగన్ మీడియా అసత్య కథనాలపై దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఏలూరు జిల్లా మీడియా కార్యాలయంలో వద్ద  నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి  ఆఫీస్‌ ముందు టెంట్ వేసుకోని నిరసన వ్యక్తం చేశారు.  రక్త తర్పణం’ అంటూ బ్లూ మీడియా ప్రచురించింది.  వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా రాస్తారంటూ  రిపోర్టర్‌పై చింతమనేని ఫైర్‌య్యారు. సదరు వ్యక్తి  బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.   తనపై తప్పుడు వార్తలు రాసినందుకు నిలదీయడానికి మాత్రమే వచ్చానని చింతమనేని వివరణ ఇచ్చారు. వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాశారని, తనకి సంబంధం లేకపోయినా తన పేరుని అందులో చేర్చారని చింతమనేని వాపోయారు. ఈ  విషయం తెలుసుకోవటాని తాను  ఆఫీస్ కి వచ్చాని ఆయన అన్నారు. అంతేకానీ తాను అక్కడ ఎలాంటి గొడవ చేయలేదని చింతమనేని క్లారీటీ ఇచ్చారు  
జగన్ మీడియా అసత్య కథనాలపై  చింతమనేని నిరసన Publish Date: Apr 23, 2025 4:43PM

30 వరకూ అనంతపురం జిల్లా జైల్లోనే బోరగడ్డ.. ఎందుకంటే?

బోరుగడ్డ అనిల్   అనంతపురం జైలులోనే ఈ నెల 30 వరకూ ఉంచాలని  మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకూ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైలులోనే రిటైన్ చేయాలని ఆదేశించారు.  ఇంతకూ ఏం జరిగిందంటే.. బూరగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకు వచ్చారు. చర్చి స్థలం విషయంలో అనంతపురం మూడో పట్టణ సీఐను బెదరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను అనంతపురం తీసుకువచ్చారు. ఈ కేసు విచారించిన మొబైల్ కోర్టు న్యాయమూర్తి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. తదుపరి విచారణకు సమయం పెద్దగా లేకపోవడంతో ఆయన తిరిగి రాజమహేంద్రవరం తరలించకుండా అనంతపురంలోనే రిటైన్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. బూరగడ్డ అనిల్   ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసినలో రాజమహేందరవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే 2018లో బోరుగడ్డ సీఐని బెదరించిన కేసులో అరెస్టై బెయిలు పొంది విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచీ విచారణకు డుమ్మా కొట్టడంతో అనంతపుం మొబైల్ కోర్టు బోరుగడ్డ అనిల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకువచ్చారు.  ఈ కేసు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా పడటంతో అంతవరకూ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా జైలులో రిటైన్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో బోరుగడ్డ అనిల్ అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.  ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ తనను తాను సమర్ధించుకుంటూ తాను బెయిలు కోసం ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు సమర్పించలేదని చెప్పుకున్నారు.  
30 వరకూ అనంతపురం జిల్లా జైల్లోనే బోరగడ్డ.. ఎందుకంటే? Publish Date: Apr 23, 2025 4:25PM

ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద బీజేపీ నేతల నిరసన

  జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ మృతులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.  ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ అమరులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టీబీజేపీ చీఫ్  కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు.  పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని, ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాక్ నిప్పులు పోస్తోందని మండిపడ్డారు. భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనన్నారు.ఉగ్రదాడి బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటామన్నారు. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. అన్ని మండలాల్లో బస్తిల్లో ప్రజలు నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కె.లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి పాల్గోన్నారు.  
ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద బీజేపీ నేతల నిరసన Publish Date: Apr 23, 2025 4:10PM

గుంటూరుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరలింపు

  వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు  అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న గోరంట్లను ఇవాళ, రేపు గుంటూరు పోలీసులు కస్టడీ తీసుకున్నారు. ‘ఒక యూట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో వైఎస్‌ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ అనే నిందితుడిని  ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడనుంచి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్‌ వాహనాన్ని అనుసరిస్తూ, వారి కస్టడీలో ఉన్న నిందితుడిపై మాజీ ఎంపీ మాధవ్‌ దాడి చేశారు.  పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో గోరంట్ల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ఈనెల 10వ తేదీ నుండి గోరంట్ల మాధవ్‌తో పాటు మరో ఐదుగురు రిమాండ్‌లో ఉన్నారు. వీరందరికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించి.. గుంటూరు పోలీసులకు అప్పగించారు. తిరిగి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. నగరంపాలెం పోలీసు స్టేషన్‌కు పోలీసులు తీసుకుని వెళ్లనున్నారు. రెండు రోజుల కస్టడీ అనంతరం గురువారం సాయంత్రం గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుండి తిరిగి గురువారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు గుంటూరు పోలీసులు తరలించనున్నారు.  
గుంటూరుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరలింపు Publish Date: Apr 23, 2025 3:19PM

ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన హోం మంత్రి అమిత్‌షా

    జమ్మూ కశ్మీర్‌  పహల్‌గామ్ ఉగ్ర దాడి బాధితులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. తమ ఆప్తులను కోల్పోయిన వారు ఆ ఘటలను అమిత్‌షాతో పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్రకు వస్తే తమ వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు రోదించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితులను ఓదార్చలేక అమిత్‌షా సైతం మౌనంగా ఉండిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కాల్పుల ఘటన జరిగిన తీరును అమిత్ షా వారిని అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వారికి హోం శాఖ మంత్రి  భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టుదని వారికి ఆయన స్పష్టం చేశారు.   కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, తిరుగు పయనంలో ఆయన విమానం పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించి భారత్ కు చేరుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో రూట్‌ మార్చినట్లు సమాచారం. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ ఎయిర్‌పోర్టులోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ లతో భేటీయై ఉగ్రదాడిపై చర్చించారు. భద్రతా చర్యలపై ఆరాతీశారు. మరోవైపు, ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ కూడా నేడు భేటీ కానుంది.ఈ దాడి వెనుక ఉన్న అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలతో పాటు వారి స్కెచ్‌లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్‌) సభ్యులే పహల్గామ్‌లోని బైసారన్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన‌ట్లు పేర్కొన్నాయి. కనీసం 5 నుంచి ఆరుగురు ఉగ్రవాదులు కుర్తా-పైజామాలు ధరించి, లోయ చుట్టూ ఉన్న దట్టమైన పైన్ అడవి నుంచి బైసరన్ గడ్డి మైదానానికి వచ్చి ఏకే-47 లతో కాల్పులు జరిపిన‌ట్లు నిర్ధారించాయి. పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది జమ్మూ సర్కార్.
ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన హోం మంత్రి అమిత్‌షా Publish Date: Apr 23, 2025 2:48PM

ఏ దేశ మేగినా ఎందు కాలిడినా..

రాహుల్ అమెరికా పర్యటన పై  దుమారం  ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, అన్నారు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. కానీ, దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన, నెహ్రూ గాంధీల కుటుంబం నాలుగో తరం నేత రాహుల్ గాంధీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఏదేశం వెళ్ళినా, భారత దేశాన్ని అవమానించడం, అవహేళన చేయడం అలవాటుగా చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.  ఇప్పడు దేశంలో ఆహుల్ గాంధీ అమెరిక పర్యటనలో చేసిన ఆరోపణలు  వివాదాస్పదంగా మారాయి. వివరాల లోకి వెళితే .. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ ఎప్పుడు ఏ దేశం వెళ్ళినా.. భారత దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారా? అసలు అందుకోసమే ఆయన తరచూ విదేశాల్లో పర్యటిస్తారా?  అంటే  అవునని, అనుకోవాల్సిన విధంగానే ఆయన నడక, నడత, మాటా ఉంటున్నాయని  విశ్లేషకులు అంటున్నారు. నిజానికి రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్యు లలోనూ ఇదే  అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఇదనే కాదు.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు సంబంధించి చాల చాలా సందేహాలున్న మాట నిజం. గతంలో ఆయన చివరకు  కాంగ్రెస్ పార్టీకి అయినా  సరైన  సమాచారం లేకుండా సాగించిన విదేశీ పర్యటనలు వివాదాస్పదం అయ్యాయి. అలాగే, రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా.. ఇక్కడ మన దేశంలో ఎక్కడో అక్కడ  నిన్నటి ‘పహల్గాం’ ఉగ్రదాడి,వంటి అవాంఛిత సంఘటనలు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు  పహల్గాం  ఉగ్రదాడి, వంటి సంఘటనలు సంబంధం వుందో లేదో కానీ, అనుమానాలు అయితే ఉన్నాయి.  ఇతర ఆరోపణలు  ఎలా ఉన్న.. రాహుల్ గాంధీ విదేశాల్లో చేస్తున్న, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శల పట్ల రాజకీయ ప్రత్యర్దులే కాదు, స్వపక్షీయులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ..  ముఖ్యంగా నెహ్రూ గాంధీ కుటుంబ అభిమాన పాత్రికేయులు, సైతం రాహుల్ గాంధీ  విదేశాల్లో భారత దేశంపై విమర్శలు చేయడం మంచిది కాదని హిత బోధ చేశారు. అంటే.. రాహుల్ ప్రవర్త దేశానికే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబానికి కూడా తలవంపులు తెచ్చేలా ఉందని  అంటున్నారు.  అవును  గతంలో రాహుల్ గాంధీ ఇంగ్లాండ్ లో పర్యటించిన సందర్భంలో, బారతీయ ములాలున్న సీనియర్ జర్నలిస్ట్  ఒకరు, నెహ్రూ,ఇందిరా గాంధీలు విదేశీ గడ్డపై ఏనాడూ భారత దేశానికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడ లేదని విలేకరుల సమావేశంలోనే గుర్తు చేశారు. ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరా గాంధీని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో, ఇంగ్లాండ్ లో పర్యటించిన   ఇందిరాగాంధీని పాత్రికేయులు ఆమెను  జైలు  జీవితం గురించి ప్రశ్నించారు. అయితే, ఆమె, ‘నాదేశం గురించి నేను పరాయి దేశంలో తప్పుగా మాట్లాడను. అది నా సంస్కారం కాదు  అని జవాబిచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి మరీ రాహుల్ గాంధీకి, ఇది పద్దతి కాదని హిత బోధ చేశారు. అయినా  ఆయన మారలేదు.  నిజానికి  ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ  చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు దేశంలో దుమారం రేపుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భాగంగా బోస్టన్‌ లో జరిగినన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎప్పుడో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తన బాధ్యతల నిర్వహణలో రాజీ పడిందని ఆరోపించారు. నిజానికి ఇది ఇప్పడు కొత్తగా చేసిన ఆరోపణ కాదు. గతంలోనూ. ముంబైలో ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియ సూలే, శివసేన(యుబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తో కలిసి ఇవే ఆరోపణలు చేశారు. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వివిరణ ఇచ్చింది. నిజానికి  రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని, అప్పట్లోనే మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  సవాల్ విసిరారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం కోర్టులో కేసు వేసే సాహసం చేయలేదు.  నిజానికి, రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శించడం తప్పు కాదు, కానీ, విదేశాలకు వెళ్లి.. అక్కడ భారత రాజ్యాంగ వ్యవస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం తప్పు మాత్రమే కాదు నేరం కూడా అవుతుందని అంటున్నారు. అయితే.. రాహుల్ గాంధీ, దేశంలో అయినా విదేశాల్లో అయినా ఆరోపణలు చేయడమే కానీ వాటిని నిరూపించే ప్రయత్నం ఏనాడు చేయలేదు.  నిజానికి.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  భారత ఎన్నికల వ్యవస్థను ఎంతగానో మెచ్చుకున్నారు. గోల్డ్ స్టాండర్డ్,    సర్వోత్తమం అని అభివర్ణించారు. డోనాల్డ్ ట్రంప్ మాటల్లోనే చెప్పుకోవాలంటే,’ Indian election system is most transparent, secure and most efficient system in the world, it is time we learn from it’ అన్నారు. అయితే.. అదే అమెరికాలో, ప్రతిపక్ష నేత హోదాలో ఆ దేశంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ భారత ఎన్నికల వ్యవస్థపై చాల తీవ్రమైన ఆరోపణలు చేశారు, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఓటు వేసే వయసున్న మొత్తం వ్యక్తుల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు.  పోలింగ్ రోజు చివరి రెండు గంటల్లో 65 లక్షల మంది ఓటు వేసారని..  అది అసాధ్యమని.. గంటలు,  నిముషాల లెక్కలు చెప్పారు. ఎన్నికల సంఘం తన బాధ్యతల  నిర్వహణలో రాజీ పడిపోయిందని, అంతే కాక వ్యవస్థలోనే ఏదో లోపముందని కూడా తెలుస్తోందని అమెరికాలో ఆరోపించారు. నిజానికి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల  పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు 6.40 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే సగటున గంటకు 58 లక్షల మంది ఓటు వేశారు. ఈ సరళి ప్రకారం చూస్తే చివరి రెండు గంటలల్లో సుమారుగా 1.16 కోట్ల మంది ఓటు వేసి ఉండాలి. కానీ ఈ  రెండు గంటల్లో, రాహుల్ గాంధీనే  65 లక్షల మంది  ఓటు హక్కు వినియోగించుకున్నారని, అంటే సగటు ఓటింగ్ సరళి కంటే చివరి రెండు గంటల్లో పోలింగ్ తగ్గిందని  ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.   అయినా సరే.. రాహుల్ గాంధీకి ఎన్నిక సంఘం పై విశ్వాసం లేక పొతే, దేశంలో కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. ఆయన నిత్యం చేతిలో పట్టుకు తిరగే రాజ్యాంగం వుంది. కానీ, ఇవేవీ కాదని అమెరికాలో భారత రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు చేయడం ఏమిటి? ఎవరి కోసం.. బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా, మన దేశానికీ వ్యతిరేకంగా. అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న అంతర్జాతీయ కుట్ర దారు జార్జ్ సోరోస్  కోసమా ?  లేక మెడకు చుట్టుకుంటున్ననేషనల్ హెరాల్డ్ ఉచ్చు నుంచి దృష్టి మరల్చేందు కోసమా ? ఎందుకు?
ఏ దేశ మేగినా ఎందు కాలిడినా.. Publish Date: Apr 23, 2025 2:47PM

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. బీజేపీ తమిళ రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించబోయే రాజ్యసభ స్థానం నుంచి.. పార్లమెంటులో అడుగుపెట్టబోయే అదృష్టవంతుడెవరో దాదాపుగా తేలిపోయిందంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనా మాతో ఖాళీ అయిన ఎంపీ సీటుని.. బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న ప్రచా రం జరుగుతోంది. దాంతో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో అనూహ్యంగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మొత్తం లెక్కే మారిపోయిందంటున్నారు. తాజాగా ఏపీలో మరో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే.. మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీతో పాటు తమ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దాంతో.. ఖాళీ అయిన 3 స్థానాల్లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావుకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. మోపిదేవి స్థానాన్ని సానా సతీశ్‌తో భర్తీ చేయగా, ఆర్.కృష్ణయ్యను బీజేపీ తరఫున రాజ్యసభకు పంపారు. ఇప్పుడు.. విజయసాయిరెడ్డి రాజీనామాతో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న ప్రచారంతో.. ఏపీ నుంచి ఎవరిని రాజ్యసభకు ఎంపిక చేస్తారనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటు ఏపీ బీజేపీలోనూ రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే అదృష్టవంతుడు ఎవరనే దానిపై హాట్ డిబేట్ మొదలైంది. రాజ్యసభలో అడుగుపెట్టేందుకు.. ఏపీ బీజేపీ నేతలు పలువురు తహతహలాడుతున్నారట. ముఖ్యంగా.. మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు రాజ్యసభ మాజీ  ఎంపీ జీవీఎల్ నరసింహరావు లాంటి వారితో పాటు కొందరి పేర్లు వినపడుతున్నాయ్. కానీ.. అధిష్టానం ఆలోచన మాత్రం మరోలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయ్. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని.. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారంట. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే సంకేతాలను దృష్టిలో పెట్టుకొని.. ఈ రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేస్తారనే చర్చ నడుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో చేరే ఇతర రాష్ట్రాల నాయకులను ఏపీ నుంచి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని ఢిల్లీ నుంచి సిగ్నల్స్ అందుతు న్నాయట. 2014-19 మధ్యలో.. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు.. కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు ఏపీ నుంచి చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు,  తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు బలంగా వినిపిస్తోంది.  వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపే చాన్స్ ఉందట. అన్నామలైని పెద్దల సభకు పంపి.. కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- అన్నాడీఎంకే కూటమి బలం పెరుగు తుందనేది బీజేపీ నేతల అంచనా. అధ్యక్ష పదవి పూర్తయ్యాక అన్నామలైకి ఎంపీగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ కూడా ఇచ్చిందంట.  2024 లోక్‌సభ ఎన్నికల్లో, నారా లోకేశ్ కూడా కోయంబత్తూరులో అన్నామలై తరఫున ప్రచారం చేశారు. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో.. ఆంధ్రా నుంచి అన్నామలై రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటు న్నారు.  మరోవైపు, బీజేపీలో సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా వినిపి స్తోందనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఆమె.. అమేథీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడి పోయారు. స్మృతీ ఇరానీ లాంటి మహిళా నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటే.. పార్లమెంట్‌లో బీజేపీకి బలమైన వాయిస్ ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తోందట. దాంతో.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు.. ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా వెళతారని.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఏపీ  నుంచి రాజ్యసభకు అన్నామలై.. బీజేపీ తమిళ రాజకీయం Publish Date: Apr 23, 2025 2:24PM

బీఆర్ఎస్ గ్రేట్ ఎస్కేప్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు లైన్ క్లియర్!

మొన్నటిదాకా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అయిపోతారనుకున్నారు. అక్కడ వాళ్లకున్న బలం అలాంటిది. కానీ.. ఎప్పుడైతే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించిందో.. అప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో.. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తంగా 112 మంది ఓటర్లు ఉన్నారు. పార్టీల వారీగా చూసుకుంటే.. ఎంఐఎంకి ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ, ఏడుగురు ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వారితో పాటు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దాంతో.. ఎంఐఎం బలం 49కి చేరింది. ఎన్నిక ఏకగ్రీవం కాకుండా బరిలో దిగిన బీజేపీకి.. నలుగురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అలాగే.. బీజేపీలో గెలిచి పార్టీ మారిన కొందరు కార్పొరేటర్లని మినహాయిస్తే.. మరో 19 మంది కార్పొరేటర్లతో కలిపి 25 మంది ఓటర్లు ఉన్నారు. కానీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 57 ఓట్లు దక్కించుకోవాలి. కాబట్టి.. ఎంఐఎం అయినా, బీజేపీ అయినా.. ఇతర పార్టీల ఓటర్లపై ఆధారపడటం తప్ప మరో అవకాశం లేదు. ఎంఐఎంకు మిత్రపక్షంగా కొనసాగుతున్న అధికార కాంగ్రెస్ పార్టీలో.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కలిపి.. ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు, మరో ఏడుగురు కార్పొరేటర్లతో కలిపి.. మొత్తం 14 మంది ఓటర్లు ఉన్నారు. పోటీలో లేని బీఆర్ఎస్ దగ్గర పార్టీ ఫిరాయించిన వారు మినహా 9 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు, 15 మంది కార్పొరేటర్లతో కలిపి  24 మంది ఓటర్లు ఉన్నారు. అందువల్ల.. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఓటర్లను కలిసి వారి ఓట్లను దక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేసింది  బీజేపీ. అయితే అక్కడే బీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనొద్దని.. తమ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులను ఆదేశిస్తూ విప్ జారీ చేసింది. బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోఉన్న కార్పొరేటర్లను ఏదో రకంగా తమవైపు తిప్పుకోవాలనుకున్న బీజేపీ లెక్కలకు.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బేననే చర్చ జరుగుతోంది. మరోవైపు.. బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఎందుకంటే గులాబీపార్టీకి ఇప్పుడు ఎంఐఎంతో మిత్రుత్వం లేదు. బీజేపీతో తమకు అసలే పడదని బీఆర్ఎస్ నేతలు చెబుతుం టారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బీఆర్ఎస్ నేతలు పోలింగ్‌లో పాల్గొంటే అటు ఎంఐఎం గెలిచినా, ఇటు బీజేపీ గెలిచినా బద్నాం అయ్యేది మాత్రం బీఆర్ఎస్సే. మజ్లిస్ పార్టీ గెలిస్తే.. ఇంకా కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. అదే బీజేపీ గెలిస్తే కారు, కమలం ఒకటేనని కాంగ్రెస్ వాయించేస్తుంది.   అందుకే పోలింగ్‌కు దూరంగా ఉంటే.. రాజకీయంగా ఎలాంటి బాధ ఉండదనే ఆలోచ నతోనే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏదేమైనా.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఎంఐఎంని సునాయాసంగా గట్టెక్కేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
బీఆర్ఎస్ గ్రేట్ ఎస్కేప్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు లైన్ క్లియర్! Publish Date: Apr 23, 2025 12:43PM

పీఎస్సార్ ఆంజనేయులుకు మే 7వరకూ రిమాండ్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ   బేగంపేటలోని ఆయన నివాసంలో  అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే.   ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో  ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై పెట్టిన కేసు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికి   ముంబైకు చెందిన నటి కాదంబరి జత్వానీపై కేసు బనాయించి, అక్రమంగా ముంబై నుంచి విజయవాడకు తీసుకు వచ్చి నిర్బంధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు నటి జత్వానీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అప్పుడు విజయవాడ సీపీగా ఉన్న కాంతిరాణాతాతా, డీసీపీగా ఉన్న విశాల్ గున్నీపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.   ఇప్పుడు ఆ కేసులోనే పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో పీఎస్సార్ ఆంజనేయులును దాదాపు ఏడుగంటల పాటు విచారించిన అనంతరం ఆయనకు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు మే 7 వరకూ రిమాండ్ విధించింది. 
పీఎస్సార్ ఆంజనేయులుకు మే 7వరకూ రిమాండ్ Publish Date: Apr 23, 2025 12:25PM

పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు మృతి

జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో మంగళవారం (ఏప్రిల్ 22) జరిగిన దాడిలో ఇద్దరు తెలుగువారు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు  జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖ వాసి అయిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. వీరిలో మధుసూదన్ బెంటళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు.  ఆయన తల్లిదండ్రులు కావలిలో నివసిస్తున్నారు. మధుసూదన్ కుటుంబంతో సహా జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ మరణించారు. ఆయన శరీరంలోకి 42 తూటాలు దూసుకుపోయినట్లు చెబుతున్నారు. ఇక ఈ ఉగ్రదాడిలో  మరణించిన రెండో తెలుగు వ్యక్తి విశాఖ వాసి చంద్రమౌళి  రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి.. ఈయన కుటుంబంతో సహా పర్యటనకు వెళ్లారు. ఉగ్రమూకలు ఈయనను వెంటాడి వెంటాడి హతమార్చినట్లు చెబుతున్నారు. చంపవద్దంటూ బతిమాలినా క్రూరంగా కాల్చి చంపేశారని చెబుతున్నారు. 
పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు మృతి Publish Date: Apr 23, 2025 11:07AM

టీఆర్ఎఫ్ ఐఎస్ఐ సృష్టే.. భారత్ లో హింసే లక్ష్యం!

జమ్మూ కాశ్మీర్ లోని  అనంతనాగ్ జిల్లా పహల్గాంలో  ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ప్రకటించడం ద్వారా ది రెసిస్టెన్స్ ఫోర్స్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్   (టీఆర్ఎఫ్)  ప్రకటించడంతో ఆ సంస్థ మరో మారు వార్తలలోకి ఎక్కింది. పహల్గాం  ఉగ్ర దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  ఈ దారుణానికి పాల్పడినది తానేనని ప్రకటించుకోవండంలో  టీఆర్ఎఫ్ మరో సారి చర్చలోకి వచ్చింది. ఈ టీఆర్ఎఫ్ ఏమిటి? దీని వెనుక ఉన్నదెవరు ? అన్న ప్రశ్నలు వినిపి స్తున్నాయి.  కేంద్రంలోని మోడీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాక్ ప్రోద్బలం, ప్రోత్సాహంతో ఈ సంస్థ ఏర్పడింది.  ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఏల్ఈటీ)కు అనుబంధంగా టీఆర్ఎఫ్ పని చేస్తున్నది. టీఆర్ఎఫ్ ఆవిర్భావం తరువాత అతి తక్కువ సమయంలోనే తన ఉనికిని బలంగా చాటుకుంది.  హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు చెందిన వారిని కలుపుకుని టీఆర్ఎస్ భారత్ లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసింది.  టీఆర్ఎఫ్ ను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద 2023 జనవరిలో కేందం నిషేధించింది.  షేక్ సజ్జాద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, బాసిత్ అహ్మద్ దార్ ఆపరేషనల్ చీఫ్‌గా టీఆర్ఎఫ్ సామాజిక మాధ్యమం వేదికగా  భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. కాశ్మీరీ పండిట్లు, స్థానిక పోలీసులు, కార్మికులు, పర్యాటకులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఇప్పుడు పహల్గామ్‌లో జరిగిన దాడి కూడా అలాంటిదేనని చెప్పాలి.  లష్కరే తోయిబా తరఫున పాక్ గూఢచార సంస్థే  టీఆర్ఎఫ్‌ను సృష్టించిందని అంటారు.
టీఆర్ఎఫ్ ఐఎస్ఐ సృష్టే.. భారత్ లో హింసే లక్ష్యం! Publish Date: Apr 23, 2025 10:47AM

టీసీఎస్ కు భూములపై వైసీపీ గగ్గోలేంటి?

విశాఖ ఐటీ హిల్స్ లో  టీసీఎస్ కి ఎక‌రా 99 పైస‌ల‌కే రైటా- రాంగా...? బ్లూ ఇన్ ఫ్లూయెన్ష‌ర్లు చేస్తోన్న‌ ఈ దుష్ప్ర‌చారంలో నిజ‌మెంత, అబ‌ద్ధ‌మెంత‌?  విశాఖ ఐటీ హిల్ లో టీసీఎస్ కి ఎక‌రా 99 పైస‌ల‌కే ఇవ్వ‌డం క‌రెక్టేన‌ని.. క‌ళ్లు మూసుకుని చెప్పొచ్చు. కానీ కొంద‌రూ వైపీపీయులు దీన్నో భూత‌ద్దంలో పెట్టి చూపెడుతూ.. త‌ప్పు ప‌డుతున్నారు. ఇదే గ‌త ప్ర‌భుత్వాలు స్వామీజీల‌కు ఎక‌రా రూపాయ‌కు ఇస్తుంటే లేని త‌ప్పు.. ఇప్పుడు ఉద్యోగ‌దాయిని అయిన‌ ఐటీ రంగానికి సంబంధించి 99 పైస‌లకే భూమి ఇవ్వ‌డం ఎందుకు త‌ప్పు? టీసీఎస్ ఏమైనా స‌మాన్య‌మైన సంస్థా.. ఇండియ‌న్ ఐటీ ఇండ‌స్ట్రీలోనే టాప్ త్రీలో ఒక‌టి. అలాంటి సంస్థ‌ను ద‌గ్గ‌ర‌కు చేర్చుకోవ‌డంలో భాగంగా వారికిలాంటి అవ‌కాశం ఇవ్వ‌డం సంజ‌స‌మే. ఇలాంటి సంస్థ‌లు  రాష్ట్రానికి రావాలంటే ఆ మాత్రం త్యాగం అవ‌స‌ర‌మే అన్న‌ది నిరుద్యోగుల వాద‌న‌. ఇలాంటి ఎన్నో నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికేగా ప్ర‌భుత్వాన్ని ఎంపిక చేసుకుంటున్న‌ది? ఇదే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇక్క‌డ ఉన్న అమ‌రా రాజా వంటి సంస్థ‌ల‌కు తెలంగాణాకు వెళ్లి పోయాయ్. అదే ఇప్పుడు ఆయా సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయ్.  ఇప్ప‌టికే ఏఐ హ‌బ్ గా ఏపీని ఎంపిక చేసుకునే దిశ‌గా.. బిల్ గేట్స్ తో బాబు చేస్తున్న చ‌ర్చ‌లు ఒక కొలిక్కి వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ఇలాంటి ఆక‌ర్ష‌ణీయ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెడితేనే క‌దా.. రాష్ట్రం మున్ముందుకు వెళ్లేది? అన్న మాట వినిపిస్తోంది.  బేసిగ్గా ఏపీ పెద్ద పెద్ద డాటా సెంట‌ర్లు పెట్ట‌డానికి త‌గిన వెస‌లు బాటు లేద‌న్న మాట ఐటీ రంగంలో వినిపిస్తూ ఉంటుంది. అది త‌ప్ప‌ని నిరూపించాలంటే టీసీఎస్ వంటి సంస్థ‌లు ఒక అడుగు ముందుకు వేయాల్సి  ఉంటుంది. అందులో భాగంగా వారికిలాంటి ఆక‌ర్ష‌ణీయ‌మైన ప‌థ‌కాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.   సినిమా రంగానికి ఆనాడు హైద‌రాబాద్ లో భారీ ఎత్తున ఉచిత భూముల‌ను ఇవ్వ‌డం వ‌ల్లే క‌దా సినీ ప‌రిశ్ర‌మ‌ అక్కడ నుంచి వ‌దిలి ఇక్క‌డికి రానంటోంది. వారు రావాలంటే ఇక్క‌డ కూడా త‌గిన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేస్తేనే క‌దా.. అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.  ఇదే వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో కోలీవుడ్ కి ఏపీ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన త‌డ వంటి చోట్ల భూములు ఇవ్వాల‌న్న ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. మ‌రి అప్పుడు లేవని నోరు ఇప్పుడే ఎందుకు లేస్తోంది. మ‌ద‌న‌ప‌ల్లెలోనూ ఎక‌రాల కొద్దీ స్టూడియోల నిర్మాణాల‌కు ఇచ్చేందుకు నాటి ప్ర‌భుత్వం పావులు క‌దిపింది.  ఇద‌లా ఉంచండి.. భీమిలి స‌ముద్ర తీర ప్రాంతాన్ని విజ‌య‌సాయిరెడ్డి భారీ ఎత్తున విస్త‌రించి సామ్రాజ్య స్థాప‌న చేసే య‌త్నం చేశారు. ఏకంగా సెవెన్ స్టార్ హోట‌ల్ నిర్మాణం చేయ‌డానికి పెద్ద ఎత్తున పునాదులు వేశారు. ఆనాడు అధికారం త‌మ చేతుల్లో ఉంద‌న్న కోణంలో ఆర్మీ త‌ర‌హా బంక‌ర్ల నిర్మాణం సైతం చేప‌ట్టారు. జ‌న‌సేన కార్పొరేట‌ర్ మూర్తి ఇది గుర్తించ‌డం వ‌ల్ల.. కేసులు వేయ‌డం వ‌ల్ల.. ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు వాటిని, కూట‌మి ప్ర‌భుత్వం కూక‌టి వేళ్ల‌తో స‌హా పెక‌లిస్తోంది. మ‌రి  ఇదే బ్లూ ఇన్ ఫ్లూయెన్ష‌ర్లు.. ఈ విష‌యాల‌ను ఎందుకు గుర్తించ‌రు. మ‌రో ఉదాహ‌ర‌ణ తీసుకుందాం.. గ‌త ప్ర‌భుత్వ కాలంలో ఇటు తిరుమ‌ల‌లో కావ‌చ్చు అటు బ‌య‌ట కావ‌చ్చు కొంద‌రు స్వామీజీల‌కు అప్ప‌నంగా స్థ‌లాలు, పొలాలు.. త‌మ‌ సొంత ఆస్తిలా  రాసిచ్చేశారు. మ‌రి అప్పుడు ఇదే బ్లూ ఇన్ ఫ్లూయెన్ష‌ర్ల వాద‌న‌ ఏమై పోయింది? వారిక‌పుడు క‌ళ్లు క‌నిపించ‌లేదా? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది.  ఏది ఏమైనా ఇదంతా ప్రాజెక్టుల‌కు గండి కొట్టే ఎత్తుగ‌డ‌..  బ్రాహ్మ‌డి  చేతిలో మేక పిల్ల‌ను కుక్క పిల్ల‌ను చేసేలాంటి కుట్ర‌. వీటిని భ‌గ్నం చేసి.. ఇలాంటి వారిప‌ట్ల‌ వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి.   ప్ర‌భుత్వం అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగానే ఐటీ సంస్థ‌ల‌ను ఏదో ఒక ఆక‌ర్షణీయ  మంత్రం వేసి ఆక‌ట్టుకోవ‌ల్సిందే. లేకుంటే త‌మ బ‌తుకులు శాశ్వ‌తంగా పొరుగురాష్ట్రాల పాలే అంటోంది నిరుద్యోగ యువ‌త‌.
టీసీఎస్ కు భూములపై వైసీపీ గగ్గోలేంటి? Publish Date: Apr 23, 2025 10:19AM

ఉగ్రదాడికి నిరసనగా జమ్మకాశ్మీర్ వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు

 జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 27 మంది ఉసురు తీసిన సంఘటనకు నిరసనగా ఉవ్వెత్తున ఆందోళనలు చెలరేగాయి. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రమూకలు జరిపిన దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 27 మంది మరణించిన ఘటనను నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.   పహల్గాంలో  స్థానికులు, పౌర సంఘాలు ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధించారు. సంపూర్ణ బంద్ కు పిలుపునిచ్చారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే తరహా ఆందోళనలు జమ్మూ కార్మీర్ వ్యాప్తంగా జరుగుతున్నాయి.  జమ్ము సహా రాష్ట్ర మంతటా ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అన్ని రాజకీయ పార్టలూ కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి.  
ఉగ్రదాడికి నిరసనగా జమ్మకాశ్మీర్ వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు Publish Date: Apr 23, 2025 9:47AM

మరో మారు ఉగ్రదాడి

జమ్మూ కశ్మీర్ పై ఉగ్రవాదం మరో మారు పంజా విసిరింది. పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్ర మూకలు మరో మారు తెగబడ్డాయి.అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో  ఇద్దరు విదేశీయులు సహా మొత్తం  27 మంది టూరిస్టులు మరణించారు.  పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిని హెలికాప్టర్ ద్వారా పహల్గాం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ కాల్పులకు తామే బాధ్యులమని పాకిస్థాన్ టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తొయిబాకు అనుబంధంగా ఉన్న స్థానిక సంస్థ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి స్థావరంగా మారిన జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటోంది.  2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370 ని నిర్వీర్యం చేసిన నేపథ్యంలో  క్రమక్రమంగా  ప్రశాంత వాతావరణం  నెలకొంది. మరోవంక పరిపాలనా పరమైన మార్పులలో భాగంగా  జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.ఆ తర్వాత కశ్మీరీ పండిట్లు క్రమంగా తమ స్వస్థలాలకు రావడం ప్రారంభించారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తై.. మళ్లీ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటై, ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడితో మరోమారు కలకలం రేగుతోంది. కాగా  పహల్గాం ఉగ్రదాడి విషాదాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత  రాహుల్‌ గాంధీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తీవ్రంగా ఖంచారు. అమెరికా, రష్యా సహా పలు దేశాలు పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండిచారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో భారత దేశానికి అండగా నిలుస్తామని ప్రకటించారు.  పహల్గాం ఉగ్రదాడి దిగ్ర్భాంతికరం. ఇదొక క్రూరమైన, అమానవీయ చర్య. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం. ఇది క్షమించరానిది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. అత్యంత హేయమైన ఉగ్రదాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందుకు తీసుకొస్తామనీ, వారిని వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రమూకల దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని, ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం మరింతగా బలపడుతుందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనకు సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని.. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పర్యటనను కుదించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు.  అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వానికి మచ్చ అనీ, ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ఇక నైనా ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ డొల్ల ప్రకటనలను కట్టిపెట్టి..  బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సూచించారు. ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పహల్గాం ఉగ్రదాడి వార్త కలచివేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్‌, అర్జెంటినా దేశాలు కూడా తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు. ఇలాంటి దొంగదెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రదాడి పాశవిక చర్య అని, దోషులను వదలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, దాడికి పాల్పడినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపడం అమానవీయ చర్య అని మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌, కె.లక్ష్మణ్‌, బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీశ్‌రావు ఉగ్రదాడిని ఖండించారు.
మరో మారు ఉగ్రదాడి Publish Date: Apr 23, 2025 9:36AM

పండ్లను చూడగానే తియ్యగా ఉన్నాయని ఇలా కనిపెట్టవచ్చు..!

  ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను అందరూ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వేసవి కాలంలో  తేలికైన ఆహారం తినడానికి ఇష్టపడతారు. పైగా పండ్లలో నీటి శాతం ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు అనేది ముఖ్యమైన విషయం.  అందువల్ల పండ్లు, పెరుగు, లస్సీ వంటి చల్లని పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే పండ్లైన పుచ్చకాయ,  కర్భూజ వంటి పండ్లకు చాలా  డిమాండ్ ఉంటుంది ఈ కాలంలో. కానీ కొంతమంది పండ్లు కొనేటప్పుడు తరచుగా తప్పులు చేస్తారు. ఇంటికి వచ్చి పండు కోసిన తర్వాత, అది పచ్చిగా ఉందని,  రుచి తక్కువగా ఉందని,  తియ్యగా లేదని  నిరాశ పడుతుంటారు.  అయితే ఇలా జరగకుండా  కొనుగోలు చేసేటప్పుడే పండ్లు తియ్యగా ఉన్నాయని కేవలం చూడటంతోనే తెలుసుకునే టిప్స్ ఉన్నాయి.  దీనివల్ల తియ్యని పండ్లను కొని ఆస్వాదించవచ్చు.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. దానిమ్మ.. దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  పండ్లలో దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది.  దానిమ్మపండు కొంటుంటే మొదట దాని నోరు(దానిమ్మ పైన పువ్వు లాంటి ఆకారం) చూడాలి. అది తెరిచి ఉంటే దానిమ్మపండు తియ్యగా ఉంటుందని అర్థం. కానీ దాని నోరు మూసుకుని ఉంటే  అది తక్కువ తీపిగా ఉంటుందని అర్థం. పుచ్చకాయ.. కర్భూజ  లాగే, పుచ్చకాయ కూడా వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీరంలోని నీటి లోపాన్ని భర్తీ చేస్తుంది. కానీ పుచ్చకాయ కొనేటప్పుడు పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి . పుచ్చకాయకు చారలు ఉండి, అది పొడవుగా ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం. ఇది చారలు లేకుంటే  కొద్దిగా పచ్చిగా ఉండవచ్చు. నారింజ.. తీపి,  పుల్లని నారింజను కొనాలంటే దానిమ్మపండులా దాని ముఖాన్ని చూడాలి. దాన్ని లోపలికి నొక్కితే దాని రంగు ముదురు రంగులో ఉంటే అది తీపిగా, పుల్లగా ఉంటుందని అర్థం. అయితే లేత రంగు,  పెద్ద నోరు కలిగిన నారింజలు తక్కువ రుచిని కలిగి ఉంటుందట. డ్రాగన్ ఫ్రూట్.. మార్కెట్లో అధిక ధరకు అమ్ముడవుతున్న డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . కానీ  ఖరీదైన ఖరీదైన డ్రాగన్ ఫ్రూట్  కొనడంలో తప్పు చేస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు దాని ముఖాన్ని చూడండి. అది తాజాగా,  ఆకుపచ్చ ఆకులతో ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం. కానీ అది వాడిపోతే రుచి తక్కువగా ఉంటుందని అర్థం. బొప్పాయి.. చాలా మంది  తెలియకుండానే ఇంటికి పచ్చి బొప్పాయిని తెస్తారు. ఇది పండటానికి చాలా సమయం పడుతుంది.  వెంటనే దీన్ని  తినలేము.  తియ్యటి బొప్పాయి కొనాలనుకుంటే దాని రంగు చూడాలి. పూర్తిగా పసుపు రంగులో ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం . అయితే పచ్చి బొప్పాయి పచ్చిగా ఉంటుంది.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
పండ్లను చూడగానే తియ్యగా ఉన్నాయని ఇలా కనిపెట్టవచ్చు..! Publish Date: Apr 23, 2025 9:30AM

ఈ 5 మందిని జీవితంలో ఎప్పటికీ నమ్మకూడదట..!

ప్రాచీన భారతీయ పండితుడు చాణక్యుడు రాసిన చాణక్య నీతి జీవితంలోని ప్రతి అంశాన్ని సరైన దృక్కోణం నుండి చూడటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. జీవితంలోని వివిధ అంశాలను వివరించడానికి ఇది అనేక ముఖ్యమైన,  ఉపయోగకరమైన విషయాలను కలిగి ఉంది. జీవితంలో కొంతమంది నమ్మదగినవారు కారు.  ఇలాంటి వారితో స్నేహం చేయకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతారు.  చాణక్యుడి ప్రకారం కొందరు  వ్యక్తులు మోసం చేయడానికి మాత్రమే చూస్తుంటారు.   అలాంటి  వారితో స్నేహం చేయడం వల్ల మానసిక,  భావోద్వేగ హాని  కలుగుతుంది.  కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ స్నేహానికి విలువైనవారు కారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఆ 5 రకాల వ్యక్తులు ఎవరో తెలుసకుంటే.. అబద్ధం చెప్పే వారు.. చాణక్యుడి ప్రకారం ఎప్పుడూ అబద్ధం చెప్పే వారితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. అబద్ధం చెప్పే వ్యక్తితో ఏ సంబంధంలోనూ స్థిరత్వం ఉండదు. అలాంటి వారు తమ స్వలాభం కోసమే అబద్ధాలు చెబుతారు.  సమయం వచ్చినప్పుడు మోసం కూడా చేయగలరు. మాట మీద నిలబడని వారు..   ఎటువంటి స్థిరమైన ఆలోచనలు లేనివారు,  తమ మాటల మీద నిలబడని వారు ఎప్పటికీ నమ్మదగినవారు కారు. ఒక వ్యక్తి  మాటలు చెప్పి  పదే పదే వెనక్కి తగ్గినప్పుడు,  ఆ మాటలకు తగినట్టు ఉండనప్పుడు  అతని ఉద్దేశాలు ప్రశ్నార్థకంగా మారతాయి. చాణక్యుడి ప్రకారం అలాంటి వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ సంబంధాన్ని అయినా మార్చుకోవచ్చు,  వారి సహవాసం ఎప్పుడైనా ఏ  వ్యక్తికి ద్రోహం చేయవచ్చు. స్వార్థపరులు.. స్వార్థపరులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు . అలాంటి వ్యక్తులు తమ సొంత శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచిస్తారు.  ఇతరుల భావాలను గౌరవించరు. వారు సంబంధాలలో తమ సొంత ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు,  వారి పని పూర్తయిన తర్వాత వారు ఇతరులను వదిలివేస్తారు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా ఉండలేరు. వీరు మోసం చేయడంలో నిపుణులు. అలాంటి వారితో స్నేహం చేయడం మానుకోవాలి. అసూయపడేవారు.. మీ విజయాన్ని చూడలేని కొంతమంది మిమ్మల్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. చాణక్యుడి ప్రకారం అలాంటి వ్యక్తులు ఎప్పటికీ మీకు మంచి స్నేహితులు కాలేరు. ఈ వ్యక్తులు మీ విజయం చూసి అసూయపడతారు,  వారికి అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని కిందకు దించడానికి ప్రయత్నిస్తారు. వారితో స్నేహం చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం బలహీనపడి, మీ విజయ మార్గంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాంటి వ్యక్తులు మీ వైఫల్యాన్ని మాత్రమే కోరుకుంటారు. కాబట్టి వారికి దూరంగా ఉండటం మంచిది. ప్రాముఖ్యత ఇవ్వని వారు.. మిమ్మల్ని అభినందించని,  ఎల్లప్పుడూ మిమ్మల్ని విస్మరించే వారు ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండలేరు. చాణక్యుడి ప్రకారం జీవితంలో మీ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, మీ సహకారాన్ని అంచనా వేసే వ్యక్తులతో మీరు స్నేహం చేయాలి. మీరు ఎల్లప్పుడూ మీ కృషి, ప్రేమ,  అంకితభావాన్ని చూపించే వ్యక్తులు కానీ వారు మిమ్మల్ని ఎప్పుడూ విలువైనదిగా భావించరు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడమే కాకుండా మీ సమయాన్ని, శక్తిని కూడా వృధా చేయగలరు.                               *రూపశ్రీ.
ఈ 5 మందిని జీవితంలో ఎప్పటికీ నమ్మకూడదట..! Publish Date: Apr 23, 2025 9:30AM

పుస్తకమే పరిణితి చెందిన వ్యక్తిత్వానికి మూలం.. 

  పిల్లలకు ఒక వయసు రాగానే పుస్తకాలతో సావాసం మొదలవుతుంది. చాలా వరకు పిల్లల జీవితంలో పుస్తకాలు అంటే అవి పాఠ్యపుస్తకాలే ఎక్కువగా ఉంటాయి.  పిల్లలు ఎంత ఎక్కువ తరగతి పుస్తకాలు చదువుతూ ఉంటే తల్లిదండ్రులకు అంత తృప్తి.  వారు చదువులో బాగా రాణిస్తారని తల్లిదండ్రుల ఆశ.  అయితే పిల్లల జీవితం చదువులోనే కాకుండా విలువలు, వ్యక్తిత్వం,  మంచి అలవాట్లు,  గొప్ప గుణాలు వంటివి మాత్రం  పుస్తక పఠనం ద్వారానే సాధ్యమవుతుంది.  పుస్తక పఠనం అంటే పాఠ్య పుస్తకాలు చదవడం కాదు.  పిల్లలలో ఆలోచనలు కలిగించే, స్పూర్తిని కలిగించే,  ప్రేరణ కలిగించే విషయాలు కలిగిన పుస్తకాలు చదవడం.  గొప్ప వ్యక్తుల చరిత్రలు కావచ్చు, నీతి కథలు కావచ్చు, సామాజిక విషయాలకు సంబంధించినవి కావచ్చు.  ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ సందర్భంగా పుస్తక పఠనం గురించి,  ఈ పుస్తక దినోత్సవం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే.. ఏప్రిల్ 23న  విలియం షేక్స్పియర్,  మిగ్యుల్ డి సెర్వంటెస్ వంటి గొప్ప సాహిత్యవేత్తలు మరణించారు. ఈ సాహిత్యవేత్తలకు  నివాళిగా ఈ తేదీని ప్రపంచవ్యాప్తంగా పుస్తక దినోత్సవంగా జరుపుకుంటారు. పుస్తకాలను చదవడం, ప్రచురించడం,  మేధో సంపత్తి రక్షణను ప్రోత్సహించడానికి యునెస్కో దీనిని వార్షిక వేడుకగా ప్రకటించింది. థీమ్.. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది పుస్తక దినోత్సవం సందర్భంగా థీమ్ ఏర్పాటయింది. "మీ మార్గాన్ని చదవండి: ప్రతి మనసుకు విభిన్న పుస్తకాలు" అనే థీమ్ ఈ ఏడాది ప్రవేశపెట్టారు.  ఈ థీమ్ చదవడాన్ని మొదలుపెట్టడాన్ని,  చదవడంలో వైవిధ్య ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది పాఠకులను సాహిత్యం ద్వారా విభిన్న విషయాలు, దృక్పథాలు,  సంస్కృతులను అన్వేషించడానికి ప్రోత్సహిస్తుంది, సహానుభూతి,  ప్రపంచ అవగాహనను ప్రోత్సహిస్తుంది. చరిత్ర.. ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని UNESCO 1995లో స్థాపించింది. ఈ ఆలోచన స్పానిష్ రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రెస్ నుండి వచ్చింది. ఆయన రచయిత మిగ్యుల్ డి సెర్వంటెస్‌ను సత్కరించాలని కోరుకున్నారు. 1995 నుండి ప్రపంచ పుస్తక దినోత్సవం పాఠశాలలు, గ్రంథాలయాలు, రచయితలు,  ప్రచురణకర్తలు పాల్గొనే ఒక ప్రధాన ప్రపంచ కార్యక్రమంగా పరిణామం చెందింది. ఇది చదవడంలో ఆనందాన్ని వ్యాప్తి చేస్తుంది. UK,  ఐర్లాండ్ వంటి కొన్ని దేశాలలో, దీనిని మార్చిలో జరుపుకుంటారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23 న జరుపుకుంటారు. పుస్తకాలు చదివితే.. అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది..  పిల్లలు,  పెద్దలు పుస్తకాలు చదివితే అక్షరాస్యత స్థాయిలను పెంచేలా ప్రోత్సహిస్తుంది. ప్రచురణకు మద్దతు ఇస్తుంది..  ప్రపంచవ్యాప్తంగా రచయితలు, చిత్రకారులు,  ప్రచురణకర్తలు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. వారిని ప్రోత్సహిస్తుంది. ఊహాశక్తిని పెంపొందిస్తుంది..   చదవడం సృజనాత్మకత, పదజాలం,  విమర్శనాత్మక ఆలోచనను పెంచుతుంది. సంస్కృతులకు వారధిగా నిలుస్తాయి.. పుస్తకాలు విభిన్న నేపథ్యాలు,  అనుభవాల నుండి వచ్చిన వ్యక్తులను కలుపుతాయి. మార్పును ప్రేరేపిస్తుంది.. సాహిత్యం వ్యక్తిగత,  సామాజిక పరివర్తనను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుంది.                                         *రూపశ్రీ.
పుస్తకమే పరిణితి చెందిన వ్యక్తిత్వానికి మూలం..  Publish Date: Apr 23, 2025 9:30AM

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య పట్ల నారా లోకేష్ దిగ్భ్రాంతి

టీడీపీ అధికార ప్రతినిధి నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి వార్త నన్ను షాక్ కు గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణమని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు. లిక్కర్ బిజినేస్‌లో కూడా వీరయ్య చౌదరి ఉన్నారు. జిల్లాలో పలు చోట్ల మద్యం దుకాణాలు నిర్వహణలో సిండికేట్‌గా ఈయన వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది.ఈ మద్యం సిండికేట్‌ వ్యవహారాలతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారల ఆర్ధికంగా వివాదాలు కారణంగా ఆయనపై హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఎస్పీ దామోదర్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అపార్టుమెంట్​లో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్‌ హటాహుటిన వెళ్లి వీరయ్య చౌదరి మృతదేహాన్ని సందర్శించి, శ్రధ్ధాంజలి ఘటించారు. ఒంగోలు నగరం నడిబొడ్డులో హత్య సంఘటన పట్టణవాసులకు దిగ్భ్రాంతిని కలిగించింది.  
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య పట్ల నారా లోకేష్ దిగ్భ్రాంతి Publish Date: Apr 22, 2025 10:30PM