Top Stories

dummy

political-news-img

ట్రంప్ లక్ష్యంగా కాల్పులు.. స్టేజి డ్రామా అంటూ నెటిజనుల డౌట్లు!

అమెరికాలో పెనుసంచలనం సృష్టించిన కాల్పుల ఘటనపై నెటిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌లు పాల్గొన్న ఒక అధికారిక విందు కార్యక్రమంలో అకస్మాత్తుగా కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఒక్కసారిగా అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి అయితే ఇప్పుడు ఈ కాల్పుల ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు. అధ్యక్షుడి భద్రత పట్ల భద్రతా సిబ్బందికి పెద్ద ఆందోళన లేనట్లు కనిపించిందనీ, దీనిని బట్టి ఈ కాల్పుల ఘటన అంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందనిపిస్తోందని నెటిజనులు అంటున్నారు. ఇరాన్ యుద్ధం, దేశీయ రాజకీయాల్లో ట్రంప్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే వ్యూహాత్మకంగా ఈ షూట్ ఔట్ డ్రామాను తెరమీదకి తీసుకువచ్చారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ కాల్పుల ఘటన ఒక రెజ్లింగ్ మ్యాచ్‌లోని డ్రామా తరహాలో సాగిందన్న విమర్శలు నెట్టింట వెల్లువెత్తుతున్నాయి. ఈ విందు కార్యక్రమానికి ముందే షూటౌట్ జరుగుతుందనే సంకేతాలు వెలువడ్డాయని, ఇది పూర్తిగా ప్లాన్ చేసిన వ్యవహారమనీ కొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. నిందితుడి నేపథ్యం? అతనికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? వ్యక్తిగత కారణాలతో చేసిన దాడా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అది పక్కన పెడితే.. సామాజిక మాధ్యమంలో వస్తున్న ఈ స్టేజ్డ్ డ్రామా ఆరోపణలు ట్రంప్ రాజకీయ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది. మొత్తం మీద ఈ కాల్పుల ఘటన ట్రంప్ కు ఇసుమంతైనా సానుభూతి సాధించి పెట్టలేదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.

Publish Date: Apr 27, 2026 12:17PM

political-news-img

డాలర్ ఆధిపత్యానికి గండి!.. అమెరికా బాండ్లకు తగ్గిన గిరాకీ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అమెరికా డాలర్ నేడు సందిగ్ధంలో పడింది. గ్లోబల్ మార్కెట్‌లో డీ-డాలరైజేషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చైనా, జపాన్ వంటి అగ్రశ్రేణి దేశాలు అమెరికా ట్రెజరీ బాండ్ల నుంచి క్రమంగా తప్పుకుంటుండటం అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇది ఏదో హఠాత్తుగా జరిగిన పరిణామంగా కాకుండా.. చాలా కాలంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న మార్పు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం. అమెరికా విధిస్తున్న ఆంక్షల భయం, ఆ దేశ అప్పుల భారం వంటి కారణాలతో చైనా తన పెట్టుబడులను డాలర్ల నుంచి బంగారంలోకి మార్చుకుంటోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, చైనా వద్ద ఉన్న బంగారు నిల్వలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు, అమెరికాకు అతిపెద్ద రుణదాతగా ఉన్న జపాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్వదేశీ మార్కెట్లకు తరలిస్తున్నారు. ఒకప్పుడు జపాన్‌లో వడ్డీ రేట్లు సున్నా శాతం ఉండటంతో, ఇన్వెస్టర్లు అక్కడ తక్కువ వడ్డీకి రుణం తీసుకుని అమెరికాలో పెట్టుబడి పెట్టేవారు దీన్నే యెన్ క్యారీ ట్రేడ్ అంటారు. కానీ ఇప్పుడు జపాన్ ప్రభుత్వ బాండ్ల రాబడి పెరుగుతుండటంతో.. తమ దేశంలోనే పెట్టుబడి పెట్టడం వారికి లాభదాయకంగా మారింది. కరెన్సీ విలువను కాపాడుకోవడానికి జపాన్ తీసుకుంటున్న ఈ చర్యలు అమెరికా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తన భారీ బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి నిరంతరం కొత్త బాండ్లను జారీ చేస్తూనే ఉంది. గతంలో వీటిని కొనుగోలు చేయడానికి చైనా, జపాన్ వంటి దేశాలు పోటీ పడేవి. కానీ ఇప్పుడు ఆ దేశాలు వెనక్కి తగ్గుతుండటంతో.. అమెరికాలోని కొన్ని పెద్ద బ్యాంకులు ప్రైమరీ డీలర్లుగా వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తన బ్యాంకులకే వడ్డీ చెల్లిస్తూ ఈ రుణ చక్రాన్ని నడుపుకునే దుస్థితిలో పడింది. ఇది మార్కెట్ స్థిరత్వానికి తాత్కాలికంగా తోడ్పడినా.. దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సాంకేతికంగా చూస్తే, అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5 శాతం దాటిన ప్రతిసారీ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అస్థిరత పెరుగుతోంది. అధిక వడ్డీ రేట్లు కార్పొరేట్ సంస్థల లాభాలపై ప్రభావం చూపడమే కాకుండా, స్టాక్ వాల్యూయేషన్లను తగ్గిస్తాయి. అగ్రరాజ్యం తన జాతీయ రుణాన్ని 2025 నాటికి 35 ట్రిలియన్ డాలర్లకు పెంచుకుంది. ఈ భారీ అప్పులను ఫైనాన్స్ చేయడం రాబోయే కాలంలో అమెరికాకు పెను సవాలుగా మారనుందనడంలో సందేహం లేదు. ఇక డీ-డాలరైజేషన్ అంటే డాలర్ వ్యవస్థ పూర్తిగా అంతరించిపోతుందని కాదు కానీ బ్రిక్స్ దేశాలు, గల్ఫ్ దేశాలు తమ మధ్య జరిగే వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో నిర్వహించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇది డాలర్ తిరుగులేని ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించడం మాత్రం తధ్యం. ప్రస్తుతానికి డాలర్ ఇంకా ప్రధాన రిజర్వ్ కరెన్సీగా కొనసాగుతున్నప్పటికీ.. భవిష్యత్తులో మాత్రం ఇతర కరెన్సీలు, బంగారంతో తన స్థానాన్ని డాలర్ పంచుకోక తప్పని పరిస్థితి వస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక చారిత్రాత్మక మార్పు దిశగా పయనిస్తోంది. చైనా, జపాన్ దేశాల చర్యలు డాలర్ వ్యవస్థకు ఒక హెచ్చరిక వంటివి. అమెరికా తన ద్రవ్యోల్బణాన్ని ఎలా అదుపు చేస్తుంది? తన అప్పుల భారాన్ని ఎలా తగ్గిస్తుంది? అనే అంశాలపైనే డాలర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భారతీయ పెట్టుబడిదారులు కూడా అంతర్జాతీయ మార్కెట్లలోని ఈ మార్పులను గమనిస్తూ తమ పెట్టుబడి వ్యూహాలను రూపొందించుకునే మార్గంలో అడుగులు వేస్తున్నారు. -సీతారాం కంఠంనేని

Publish Date: Apr 27, 2026 11:46AM

political-news-img

మంటల్లో కాలి దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

మెదక్ జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సోమవారం (ఏప్రిల్ 27) తెల్లవారు జామున 44వ జాతీయ జాతీయ రహదారి 44పై మాసాయిపేట వద్ద ఈ ఘటన జరిగింది. కాగా ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్, క్లీనర్ ప్రమాదాన్ని గమనించి బస్సులోంచి బయటకు దూకేశారు. బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో మరమ్మతుల కోసం హైదరాబాద్ నుంచి మెదక్‌కు తీసుకొచ్చారు. మరమ్మతు పూర్తయ్యాక సోమవారం తెల్లవారుజామున డ్రైవర్, క్లీనర్‌ బస్సును తిరిగి హైదరాబాద్‌కు తీసుకువెడుతుండగా.. మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మరమ్మతుల సమయంలో జరిగిన లోపమా? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Publish Date: Apr 27, 2026 11:25AM

political-news-img

విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. రేపు చంద్రబాబు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ ను సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రపథాన నిలపాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా కీలకమైలు రాయిని చేరుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన ప్రతిష్టాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ మెగా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (ఏప్రిల్ 28) శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిణామంతో విశాఖ నగరం అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో అత్యంత కీలకమైన కేంద్రంగా నిలవనుంది. విశాఖ జిల్లా తర్లువాడ సమీపంలో ఈ భారీ డేటా సెంటర్ నిర్మాణం కానుంది. 15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి. ఒక గిగావాట్ సామర్థ్యంతో నిర్మితమయ్యే ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్, కేవలం ఒక కార్యాలయంలా కాకుండా ఆసియా ఖండానికే ఏఐ సేవలకు ప్రధాన ద్వారంగా అంటే గేట్ వేగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు విస్తరణ కోసం తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. గూగుల్ భాగస్వామ్యంతో పాటు అదానీ కనెక్ట్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్‌ను అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యం. ఈ దిశగా గూగుల్ రాక తొలి మెట్టుగా చెప్పవచ్చు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలు మార్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే తరహా ఐటీ విప్లవాన్ని విశాఖ వేదికగా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కారణంగానే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయనడంలో సందేహం లేదు. విశాఖ తీరంలో అందుబాటులోకి రానున్న సబ్-సీ కేబుల్ వ్యవస్థ ఈ డేటా సెంటర్ల నిర్వహణకు అత్యంత అనుకూలంగా మారనుంది. ఈ భారీ పరిశ్రమ ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో వేలాది నిపుణులకు ఉపాధి దొరుకుతుంది. నేరుగా లభించే ఉద్యోగాలతో పాటు అనుబంధ రంగాలైన సర్వర్ తయారీ, కూలింగ్ టెక్నాలజీ, నెట్‌వర్కింగ్ వంటి విభాగాల్లో కూడా పరోక్షంగా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం కేవలం పోర్టు సిటీగానే కాకుండా డేటా సిటీ గా గుర్తింపు పొందనుంది. గూగుల్ రాకతో ఇతర గ్లోబల్ స్టార్టప్‌లు, సెమీకండక్టర్ కంపెనీలు కూడా విశాఖ వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ సరఫరాకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే, అంతర్జాతీయ స్థాయిలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగై విశాఖ ఐటీ రంగం పరుగులు తీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Apr 27, 2026 11:10AM

political-news-img

శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి అతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం (ఏప్రిల్ 27) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీవకోన అటవీ రేంజ్ పరిధిలోని మొండోడికోన ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ప్రమాదంలో సుమారు 2 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతం దగ్ధమైంది. విలువైన వృక్ష సంపదతో పాటు అరుదైన వనమూలికలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మంటల తీవ్రతకు భయపడిన వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయి. అటవీ శాఖ అధికారులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఎర్రచందనం నిల్వ చేసే గిడ్డంగులు ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మంటలు ఆ గిడ్డంగుల వైపు మళ్లకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఎండిపోయిన గడ్డి మరియు ఆకులు ఘర్షణ వల్ల మంటలు పుట్టాయని భావిస్తున్నారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Publish Date: Apr 27, 2026 10:50AM

political-news-img

ఆయిల్ కంపెనీల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్.. సరఫరా పునరుద్ధరించకుంటే చర్యలు తప్పవంటూ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. ప్రజలకు అత్యవసరమైన ఇంధన సరఫరాలో అంతరాయం కలగడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఆయన సోమవారం (ఏప్రిల్ 27) నాటికి రాష్ట్రంలోని ఏ ఒక్క పెట్రోల్ బంకు వద్ద కూడా నో స్టాక్ అనే బోర్డు కనిపించడానికి వీల్లేదని చమురు కంపెనీల ప్రతినిధులకు అల్టిమేటం జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించి ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సదరు కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం (ఏప్రిల్ 26) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు. రిటైల్ అవుట్‌లెట్లకు ఇవ్వాల్సిన క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేసి.. సరఫరాను ఆపడం వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ధోరణిని సహించేది లేదన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా నయారా, రిలయన్స్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా నిలిపివేయడం వల్లే సమస్య జటిలమైందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోతల సీజన్ నడుస్తుండటం, వ్యవసాయ, ఆక్వా రంగాల నుండి డీజిల్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమైందన్నారు. మూడు రోజుల క్రితమే ఈ సమస్య వెలుగులోకి వచ్చినా, తక్షణమే ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను సీఎం నిలదీశారు. తనకు కేవలం నివేదికలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కావాలని స్పష్టం చేశారు. ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందన్న చంద్రబాబు. . ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన నిఘా ఉంచాలని పోలీసు, పౌర సరఫరాల శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం డీజిల్ అవసరమయ్యే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనీ.. అవసరమైతే కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో చమురు కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలనీ.. డిపోల నుండి బంకులకు ఇంధనాన్ని తరలించే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ సోమవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోంది. వేసవి, వ్యవసాయ పనుల నేపథ్యంలో ఇంధన అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించడం ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కృత్రిమ కొరతలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని సీఎం అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.

Publish Date: Apr 27, 2026 10:28AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img