ఆయిల్ కంపెనీల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్.. సరఫరా పునరుద్ధరించకుంటే చర్యలు తప్పవంటూ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. ప్రజలకు అత్యవసరమైన ఇంధన సరఫరాలో అంతరాయం కలగడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఆయన సోమవారం (ఏప్రిల్ 27) నాటికి రాష్ట్రంలోని ఏ ఒక్క పెట్రోల్ బంకు వద్ద కూడా నో స్టాక్ అనే బోర్డు కనిపించడానికి వీల్లేదని చమురు కంపెనీల ప్రతినిధులకు అల్టిమేటం జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించి ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సదరు కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం (ఏప్రిల్ 26) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు. రిటైల్ అవుట్లెట్లకు ఇవ్వాల్సిన క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేసి.. సరఫరాను ఆపడం వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ధోరణిని సహించేది లేదన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా నయారా, రిలయన్స్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా నిలిపివేయడం వల్లే సమస్య జటిలమైందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోతల సీజన్ నడుస్తుండటం, వ్యవసాయ, ఆక్వా రంగాల నుండి డీజిల్కు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమైందన్నారు. మూడు రోజుల క్రితమే ఈ సమస్య వెలుగులోకి వచ్చినా, తక్షణమే ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను సీఎం నిలదీశారు. తనకు కేవలం నివేదికలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కావాలని స్పష్టం చేశారు. ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందన్న చంద్రబాబు. . ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్కు తరలకుండా కఠిన నిఘా ఉంచాలని పోలీసు, పౌర సరఫరాల శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం డీజిల్ అవసరమయ్యే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనీ.. అవసరమైతే కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో చమురు కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలనీ.. డిపోల నుండి బంకులకు ఇంధనాన్ని తరలించే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ సోమవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోంది. వేసవి, వ్యవసాయ పనుల నేపథ్యంలో ఇంధన అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించడం ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కృత్రిమ కొరతలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని సీఎం అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.
Publish Date: Apr 27, 2026 10:28AM