political-news-img

సీఎం భార్యకు మూడు పాస్‌పోర్ట్‌లు....పవన్ ఖేరా సంచలన వ్యాఖ్యలు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. శర్మ భార్య రినికి భుయాన్ శర్మకు మూడు వేర్వేరు దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని, అలాగే ఆమెకు విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలను ముఖ్యమంత్రి దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో పవన్ ఖేరా కొన్ని పత్రాలను ప్రదర్శించారు. రినికి భుయాన్ శర్మకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, అలాగే ఈజిప్ట్ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారత పౌరసత్వ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఇతర దేశాల పాస్‌పోర్ట్‌లు ఉండే అవకాశం లేదని, ఇది తీవ్రమైన నేరమని ఖేరా స్పష్టం చేశారు. కేవలం పాస్‌పోర్ట్‌లే కాకుండా, దుబాయ్‌లో రినికికి రెండు ఖరీదైన ఆస్తులు ఉన్నాయని, అమెరికాలోని వ్యోమింగ్‌లో ఒక కంపెనీని కూడా ఆమె నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని హిమంత బిశ్వ శర్మ తన ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఎక్కడా ప్రస్తావించలేదని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మరోవైపు, ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రదర్శించిన పత్రాలన్నీ నకిలీవని, ఫోటోషాప్ చేసిన ఆధారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఆ పాస్‌పోర్ట్ పత్రాల్లో స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయని, అవి చూస్తుంటేనే నకిలీవని అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వివాదంపై స్పందిస్తూ, తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్న పవన్ ఖేరాపై 48 గంటల్లోగా క్రిమినల్ డెఫమేషన్ (పరువు నష్టం) దావా వేయనున్నట్లు సీఎం ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రినికి భుయాన్ శర్మ కూడా స్పందిస్తూ.. ఒక జాతీయ పార్టీ ప్రతినిధి ఇంత దిగజారి వ్యవహరిస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఈ ఆరోపణలు రావడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అస్సాం అస్తిత్వం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి కుటుంబానికి విదేశీ పాస్‌పోర్ట్‌లు ఉండటం ఏంటని ప్రతిపక్ష నేత గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కాంగ్రెస్ ఇచ్చిన ఆధారాల ప్రామాణికతపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అలాగే హిమంత బిశ్వ శర్మ వేయబోయే పరువు నష్టం దావా పట్ల కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Publish Date: Apr 6, 2026 5:06PM

political-news-img

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. కొత్త పోకడలు, ఎన్నికల సమగ్రత, రాజకీయ దృక్పథం

పశ్చిమ బెంగాల్‌లో తదుపరి శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తీవ్రమైన పోటీ, మారుతున్న ఓటర్ల మనోభావాలు, మరియు ఎన్నికల ప్రక్రియలపై పెరిగిన నిశిత పరిశీలనతో రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. 1. ఎన్నికల వాతావరణం, ప్రజాభావన మార్పు కోసం పెరుగుతున్న ఆకాంక్ష. ఓటర్లలోని కొన్ని వర్గాలలో రాజకీయ మార్పు కోసం బలమైన ఆకాంక్ష ఉన్నట్లు కనిపిస్తోంది. టీఎంసీ తన బలమైన సంస్థాగత పునాదిని కొనసాగిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో ఓటర్ల మనోభావాలు ప్రత్యామ్నాయాల పట్ల పెరుగుతున్న సుముఖతను సూచిస్తున్నాయి. బీజేపీ సన్నాహాలు.. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మరింత వ్యవస్థీకృతమైన, వ్యూహాత్మకమైన విధానాన్ని చేపట్టింది. మెరుగైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు క్షేత్రస్థాయి సమీకరణను పెంపొందించడం బలమైన ప్రచార ప్రణాళిక మరియు ప్రచార సందేశం ఈ మెరుగుదలలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా సంస్థాగత బలం పరిమితంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలలో పార్టీ ఇప్పటికీ స్థానిక సవాళ్లను ఎదుర్కొంటోంది. 2. ఎన్నికల సంఘం పాత్ర ఎన్నికల సమగ్రతను బలోపేతం చేసే లక్ష్యంతో తీసుకున్న అనేక చర్యలతో, భారత ఎన్నికల సంఘం పాత్ర ప్రముఖంగా చర్చనీయమైంది: పరిపాలనాపరమైన చర్యలు: నిష్పక్షపాతాన్ని నిర్ధారించడానికి అధికారులను తొలగించడం లేదా వేరే విధులకు బదిలీ చేయడం పోస్టల్ బ్యాలెట్ సంస్కరణలు: అవకతవకలను తగ్గించడానికి కఠినమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టడం సాంకేతిక ఏకీకరణ: బూత్ క్యాప్చరింగ్ వంటి అవకతవకలను నిరోధించడానికి పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ మరియు సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేయడం ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను పెంచగల సానుకూల చర్యలుగా విస్తృతంగా పరిగణించబడుతున్నాయి. 3. ఎన్నికల సమాచారం మరియు అంచనాలు సుధాశీల్ ఘోష్ విశ్లేషణతో సహా, ఇటీవలి అభిప్రాయ సేకరణలు హోరాహోరీ ఎన్నికల వాతావరణాన్ని సూచిస్తున్నాయి: బీజేపీ అంచనా: సుమారు 157 సీట్లు టీఎంసీ అంచనా: సుమారు 119 సీట్లు ఇలాంటి అంచనాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉన్నప్పటికీ, గత ఎన్నికలతో పోలిస్తే మరింత సమతుల్యమైన పోటీ వైపు మార్పు వచ్చే అవకాశం ఉందని ఇవి సూచిస్తున్నాయి. 2021 నుండి పాఠాలు ఈ విశ్లేషణ 2021 ఎన్నికలను కూడా పునఃసమీక్షిస్తూ, ఈ క్రింది అంశాలను హైలైట్ చేస్తుంది: ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొన్న నిర్మాణాత్మక మరియు లాజిస్టికల్ సవాళ్లు ఆనాటి స్థానిక రాజకీయ పరిస్థితుల ప్రభావం ఓటర్ల జాబితా సమగ్రత రాబోయే ఎన్నికలలో ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడం ఒక కీలక అంశం, ముఖ్యంగా ఈ క్రింది వారిని తొలగించడం: గైర్హాజరు స్థానమార్పిడి మరణించిన వారి (ASD) వివరాలు ఈ ప్రక్రియ, ముఖ్యంగా హోరాహోరీగా పోటీ ఉన్న నియోజకవర్గాలలో, ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చు. 4. ప్రాంతాల వారీ రాజకీయ గతిశీలత ఉత్తర బెంగాల్ కూచ్ బెహార్ మరియు ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాలు స్థిరమైన ఓటర్ల మద్దతుతో బీజేపీకి కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. కేంద్ర మరియు పట్టణ ప్రాంతం కోల్‌కతాతో సహా పట్టణ కేంద్రాలు హోరాహోరీగా ఉన్నాయి, రెండు పార్టీలు తమ స్థావరాలను చురుకుగా పటిష్టం చేసుకుంటున్నాయి. దక్షిణ బెంగాల్ హుగ్లీ మరియు బీర్భూమ్ వంటి జిల్లాలలో ఈ క్రింది సూచనలు కనిపిస్తున్నాయి: టీఎంసీ సాంప్రదాయ ఆధిపత్యం క్షీణించడం బీజేపీకి ఎన్నికల పరంగా ఆదరణ పెరగడం ఈ ప్రాంతీయ వైవిధ్యాలు తుది సీట్ల పంపిణీని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 5. ముగింపు: ఎన్నికల సమగ్రతపై ఆధారపడిన పోటీ రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమైన మరియు హోరాహోరీగా సాగే రాజకీయ పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఫలితం కేవలం ప్రచార వ్యూహాలు, ఓటర్ల మనోభావాలపైనే కాకుండా, ఎన్నికల ప్రక్రియలోని నిష్పాక్షికత మరియు పారదర్శకతపై కూడా అత్యంత కీలకం. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా మరియు నిష్పాక్షికంగా జరిగితే, బీజేపీ 148 సీట్ల గడపను దాటి, అధికారానికి బలమైన పోటీదారుగా నిలవగలదని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో, టీఎంసీకి ఉన్న బలమైన సంస్థాగత బలం ఈ పోటీని అత్యంత ఉత్కంఠభరితంగా ఉంచుతుంది. దీంతో ఇది ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలలో ఒకటిగా నిలుస్తోంది. సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం

Publish Date: Apr 6, 2026 5:06PM

political-news-img

ఓ సీఎం సారో...నారా లోకేష్ సారో!

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంత‌టా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట‌ వినిపిస్తోన్న మాట‌. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య చదువుతున్న వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన- ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రైవేటు కాలేజీల యాజ‌మాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం, హాల్ టికెట్లు ఆపివేయడం వంటి చర్యలు వారి కెరీర్‌ను దెబ్బతీస్తున్నాయి. గత రెండు, మూడు అక‌డ‌మిక్ ఇయ‌ర్స్ కి సంబంధించి.. ప్రభుత్వం నుంచి కాలేజీల‌కు అందాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆర్థిక లోటును భరించలేకపోతున్నామని చెబుతున్న యాజమాన్యాలు, ఆ భారాన్ని విద్యార్థులపైకి నెట్టేస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని కాలేజీలు అంటుండ‌టంతో ఇబ్బంది ప‌డుతున్నారు విద్యార్ధులు. చదువు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, పెండింగ్ ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల బడ్జెట్ విడుదల సమయంలో ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్లు రీయింబర్స్‌మెంట్ కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఇంకా రూ.7,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల అసోసియేషన్లు-PAAP ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు చదువుకు పేదరికం అడ్డుకాకూడదు అని చెబుతూనే, మరోవైపు ఫీజుల పేరుతో విద్యార్థులు పరీక్షలకు దూరం కావడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇందుకు రాజాంలోని జీఎంఆర్ ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్ధుల ఉదంతమే ఉదాహరణ. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులను.. ఎగ్జామ్స్ రాయనివ్వకుండా అడ్డుకుంది జీఎంఆర్ ఐటీ యాజమాన్యం. తమకు ఫీజు రీఎంబర్స్ మెంట్ వస్తుందని.. తాము ఫీజులు కట్టలేమనీ.. యాజమాన్యానినికి వీరు ఎంతగానో ప్రాధేయపడ్డారు. అయినా సరే... కనికరం లేకుండా మూడు వందల మంది విద్యార్ధులను పరీక్షలు రాయకుండా అడ్డుకుంది యాజమాన్యం. యాజమాన్యం వేధింపులతో ప్రభుత్వానికి లేఖలు రాశారు విద్యార్ధులు. మంత్రి నారా లోకేష్ తమను ఆదుకోవాలని.. జీఎంఆర్ ఐటీ సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలనీ.. ట్విట్టర్, మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. జీఎంఆర్ కఠిన నిర్ణయంతో.. తమ భవిష్యత్ దెబ్బ తింటుందని ఆవేదన చెందుతున్నారు వీరంతా. జీఎంఆర్ తాము ఖర్చు చేసే సేవాకార్యక్రమాల్లో ఇదో పెద్ద విషయమే కాదు. అలాంటిది పేద, మధ్యతరగతి విద్యార్ధులపై ఆ మాత్రం కనికరం లేకుంటే ఎలా? అని వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాములుగా పరీక్షలు రాసిన తర్వాత ఫీజు చెల్లించని విద్యార్ధులకు సర్టిఫికేట్లు ఇవ్వరు. ఇక్కడి పరిస్థితి ఎలా ఉందంటే.. అసలు పరీక్షే రాయనివ్వక పోవడం.. అమానవీయంగా కనిపిస్తోంది. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ పరీక్షలకు అనుమతించేలా ఉన్నత విద్యామండలి కఠిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధులు. పెండింగ్‌లో ఉన్న పూర్తి నిధులను కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలని కోరుతున్నారు వీరంతా. ప్రభుత్వ నిధుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న కాలేజీల‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల‌న్న డిమాండ్లు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఒక విద్యార్థి చదువు ఆగిపోతే అది ఒక కుటుంబం ఆశలు ఆవిరైపోవడమే అంటున్నారు త‌ల్లిదండ్రులు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురికాకుండా చూడాలని యావత్ విద్యార్థి లోకం కోరుకుంటోంది. ఏపీ సీఎం చంద్రబాబు- @AndhraPradeshCMO, ఏపీ విద్యా మంత్రి నారా లోకేష్ ని @naralokesh ట్యాగ్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో ఈ క‌థ‌నాల‌ను ట్రోల్ చేస్తూ తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేస్తున్నారు ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ బాధిత విద్యార్ధులు. మ‌రి చూడాలి ప్రభుత్వ స్పంద‌న ఎలా ఉంటుందో.

Publish Date: Apr 6, 2026 4:47PM

political-news-img

వైసీపీలో అంబటి వర్సెస్ ముద్రగడ.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు ఓటు బ్యాంకుకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడమే లక్ష్యంగా వైసీపీ చాలా సీరియస్ గా పావులు కదుపుతోంది. కాపు ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు అంబటి తనదైన స్టైల్ లో చేయగలిగినన్న ప్రయత్నాలూ చేస్తున్నారు. కాపులలో సానుభూతి పొందేందుకూ, వారికి దగ్గరయ్యేందుకు ఆయన ఏకంగా జైలుకు వెళ్లి వచ్చారు. ఇలా ఆయన జైలుకు వెళ్లారో లేదో.. అలా వైసీపీయులు ఆయనను కాపు నేత అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అక్కడితో ఆగకుండా ఏకంగా దివంగత వంగవీటి రంగాతో సమానమైన నాయకుడంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు. ఇటీవల అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన , అంబటిని ముద్రగడ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. కాపు నాయకుడిగా అంబటి తన తరువాతే అని చాటేందుకే ముద్రగడ అంబటి నివాసానికి వెళ్లి పరామర్శ పేరుతో తనను తాను కాపు లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. కాపు సామాజిక వర్గంలో ఎవరైనా సరే తనతో సమానంగా కానీ, తనను మించి గానీ పేరు తెచ్చుకోవడాన్ని ముద్రగడ జీర్ణించుకోలేరని ఆ సమాజికవర్గంలోనే టాక్ ఉంది. ముద్రగడ జనసేనాని పవన్ కల్యాణ్ ను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అదేనని కూడా అంటారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. కాపు నేతలను ఏకం చేస్తాననీ, వారిని వైసీపీ వైపు తీసుకువస్తానని ఇటీవలి కాలంలో ముద్రగడ అడిగిన వారీకి అడగని వారికీ కూడా అదే పనిగా చెబుతున్నారట. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం, జనసేప పార్టీలలో ఉంటూ.. సరైన గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఉన్న నాయకుల కోసం గాలిస్తున్నారట. అటువంటి నాయకులతో సమావేశాలు నిర్వహించి, వారిని వైసీపీలోకి ఆహ్వానించాలన్నదే ఆయన వ్యూహంగా చెబుతున్నారు. అయితే ఇక్కడ ముద్రగడకు ఎదురైన చిక్కు ఏమిటంటే.. ఆయన ప్రయత్నాలకు వైసీపీయుల నంచే వ్యతిరేకత వస్తున్నది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల కాపు కోఆర్డినేటర్లు ఈ విషయంలో ముద్రగడను బలంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు కూటమిలోని కాపు నేతలన పార్టీలోకి ఆహ్వానించి తన పదవులకు, ఉనికికి ముద్రగడ ఎసరుపెట్టేలా ఉన్నారన్నదే వారి వ్యతిరేకతకు కారణమంటున్నారు. ఇక్కడే వారు ముద్రగడ తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతిని గుర్తు చేస్తూ.. తగుదునమ్మా అని ఇప్పుడు కాపులను ఏకం చేస్తాననడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు పార్టీకి చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, కాపు సామాజికవర్గాన్ని వైసీపీకి దూరం చేస్తాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో కాపు సామాజికవర్గానికి లీడర్ ఎవరు అన్న విషయంలో అంబటి వర్సెస్ ముద్రగడగా సీన్ మారిందని వైసీపీలోనే గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఈ రేస్ లో ఎవరు గెలుస్తారో?

Publish Date: Apr 6, 2026 4:42PM

political-news-img

యుద్ధ విరమణకు రంగంలోకి అంతర్జాతీయ మధ్యవర్తులు

యుద్దం ముంగిపునకు ఇరాన్‌పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది. మంగళవారం (7-4-26) రాత్రి వరకు ఉన్న గడువు దగ్గర పడుతున్నా ఇరాన్ రియాక్ట్ అవ్వడం లేదు. దాంతో ట్రంప్ పరుషపదజాలంతో ఇరాన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ క్రమంలో గడువు ముగియడానికి ముందు, ఇరాన్ - అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ యాక్సియాస్ నివేదించింది. ప్రస్తుత సంక్షోభాన్ని తాత్కాలికంగా ఆపి, చర్చలకు మార్గం సుగమం చేయడం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. ఇరు దేశాలు ఎటువంటి దాడులకు పాల్పడకుండా 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలి. ఈ సమయంలో వివాదాస్పద అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి. ఈ చర్చల్లో ఖతార్, ఒమన్ వంటి దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇవి అటు అమెరికాతో, ఇటు ఇరాన్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ గడువు లోపు ఇరాన్ ఒక నిర్ణయానికి రావాలని ఆయన హెచ్చరించారు. ఈ లోపే మధ్యవర్తులు ఈ 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు.

Publish Date: Apr 6, 2026 4:27PM

political-news-img

రాష్ట్రపతికి చేరిన అమరావతి బిల్లు

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక ఆ బిల్లు చట్టరూపం దాల్చే దిశగా తుది అడుగుకు చేరింది. ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు. అమరావతి బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరిగింద. ఉభయ సభలూ ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. వైసీపీ వినా దాదాపు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అమరావతికి సై అన్నాయి. వైసీపీ ఓ వైపు అమరావతికి వ్యతిరేకం కాదంటూనే ఈ బిల్లుపై జరిగిన చర్చను మాత్రం బాయ్ కాట్ చేసి ఓటింగ్ కు దూరంగా ఉన్నది. పార్లమెంట్‌లో ఉభయ సభలలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రపతి ఆమోదం అనేది కేవలం లాంఛనప్రాయమే. రాష్ట్రపతి సంతకం చేయడంతోనే అమరావతి రాజధాని చట్టం అమలులోకి వస్తుంది. గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడుతుంది.

Publish Date: Apr 6, 2026 4:16PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img