ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి పరీక్షగా మారిన పరకాల
Publish Date:May 15, 2012
Advertisement
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ ఉప ఎన్నిక మొత్తం ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి పరీక్షగా మారినట్లు కనిపిస్తోంది. పరకాల స్థానం విషయంలో బిజెపి, తెలంగాణా రాష్ట్ర సమితి నేతలు పోటీ పడటం, తెలంగాణా పొలిటికల్ జెఎసి ఈ విషయంలో ఎవరికీ నచ్చచెప్పలేకపోవడంతో పరకాలలో అంతా గందరగోళ పరిస్థితి నెలకొని వుంది. దాంతో ప్రత్యేక తెలంగాణా నినాదంతో అటు బిజెపి, ఇటు తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థులు ఎన్నికల బరిలో వుంటారనిపిస్తోంది. వీరితోపాటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో వుంటూనే ప్రత్యేక తెలంగాణాకు జైకొడుతున్న తాజా మాజీ సభ్యురాలు కొండా సురేఖ పోటీలో వుంటారు. ఈ స్థితిలో తెలంగాణా ఓటు చీలిపోతుందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా తెలంగాణా నినాదంతో పాటే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కాకపోవడానికి టి.ఆర్.ఎస్. నేత చంద్రశేఖర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మధ్య కుదిరిన ఒప్పందమే కారణమని, అదే విధంగా జగన్ తో కూడా కేసీఆర్ రహస్య ఒప్పందం వుందనే ప్రచార నేపథ్యంలో అనూహ్యంగా తెలుగుదేశంపార్టీ విజయం సాధించినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించకపోయినా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచే కొండ సురేఖకు పరిస్థితి అనుకూలంగా మారే అవకాశం వుంటుంది. తెలంగాణా టి.ఆర్.ఎస్. అభ్యర్థి విజయం సాధించకుండా సురేఖ విజయం సాధించే పక్షంలో అందరూ అనుకుంటున్నట్టుగా జగన్, టి.ఆర్.ఎస్. నేత కెసిఆర్ మధ్య ఒప్పందం వున్నట్లు ప్రజలు విశ్వసించే అవకాశం వుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి పార్టీలకు అనేక సిద్ధాంతాలు, లక్ష్యాలు వున్నాయి. కాని ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అనే ఏకైక లక్ష్యంతో ఏర్పడిన పార్టీ టి.ఆర్.ఎస్. అందువల్ల ఆ పార్టీ కాకుండా ఇతరులు ఎవరు గెలిచినా ప్రత్యేక ఉద్యమం ప్రాధాన్యత తగ్గినట్టుగానే భావించాల్సి వస్తుంది.
http://www.teluguone.com/news/content/warangal-district-24-14042.html





