యలమంచిలి రవి దారి ఎటు ...?
Publish Date:Apr 12, 2012
Advertisement
విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి రవి రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తనకు ప్రాధాన్యత లభించని కాంగ్రెస్ పార్టీలో కంటే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనలో ఆయన వున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో విజయవాడ నగరం పరిథిలోని మూడు అసెంబ్లీ స్థానాలకు గాను రెండు స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రవి ప్రజారాజ్యంపార్టీ తరపున కాంగ్రెస్ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), తెలుగుదేశంపార్తీ అభ్యర్థి గద్దె రామోహన్ లపై విజయం సాధించారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావులు, సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణులు విజయం సాధించారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ప్రజారాజ్యం పార్టీకి చెందిన యలమంచిలి రవి, వెల్లంపల్లి శ్రీనివాస్ లు కూడా కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులుగా మారిపోయారు. విలీనం తర్వాత వెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీతో మమేకం అయినా యలమంచిలి రవి కాలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకంటే తనపై ఓడిపోయినా మాజీ మంత్రి నెహ్రూకే ప్రాధాన్యత ఇవ్వడం, పార్టీపరమైన కార్యక్రమాల్లో కనీసం ఆహ్వానం కూడా లేకపోవడం రవికి అవమానకరంగా మారింది. నిజానికి రవికి ఎంతో గౌరవం లభించాల్సి వుంది. ఎందుకంటే కృష్ణాజిల్లా కమ్మ సామాజికవర్గం నుంచి వున్న ఏకైక శాసనసభ్యులు రవి. కృష్ణాజిల్లా గత చరిత్రను పరిశీలిస్తే ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకానీ కమ్మసామాజిక వర్గానికి చెందినవారిదే పైచేయిగా వుండేది. ఈ పార్టీ అధికారంలో వున్న ఈ సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రి పదవి పొందేవారు. కాని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఈ పార్టీ తరపున జిల్లాలో ఒక్క శాసనసభ్యుడు కూడా ఎన్నికకాలేదు. దాంతో ఈ సామాజికవర్గం నుంచి ఎవరూ మాత్రి కాలేదు. బి.సి. వర్గానికి చెందిన పార్థసారధిని మంత్రిపదవి వరించింది. ప్రజారాజ్యంపార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆ పార్టీకి చెందిన యలమంచిలి రవి కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా మారిపోయాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ లేనందున తనకు ఎంతో ప్రాధాన్యత లభిస్తుందని రవి భావించారు. కాని వాస్తవంలో అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా తనపై ఓడిపోయినా ప్రత్యర్థి నెహ్రూకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అవమానకరంగా భావిస్తున్నారు. 2014లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటు ఇస్తుందనే నమ్మకం కూడా లేదు. ఒకవేళ ఇచ్చినా ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించడం అంత తేలికైన అంశం కాదు. ఈ నేపథ్యంలోనే రవి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీవైపు తనచూపు మరల్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వంగవీటి రాధాకృష్ణ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నందున ఆయనతోపాటు యలమంచిలి రవిని కూడా తమ పార్టీవైపు తిప్పుకోనేందుకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు గౌతమ్ రెడ్డి, జలీల్ ఖాన్ లు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది.
http://www.teluguone.com/news/content/vijayawada-west-constituency-24-13324.html





