మేకపాటితో పోటీపడేదెవరో?
Publish Date:Apr 6, 2012
Advertisement
నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డిని సమర్థవంతంగా ఢీకొనే అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ ఇంకా అన్వేషిస్తూనే ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ తరపున బొల్లినేని వెంకటరామారావు పేరు ఖరారైంది. ఒకవైపు బొల్లినేని, మరోవైపు మేకపాటి ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉండగా మరోవైపు కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక తలలు పట్టుకుని కూర్చున్నారు. ఉదయగిరి నియోజకవర్గం బాధ్యతలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అధిష్టానం అప్పగించింది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని తన సత్తా చాటుకోవాలన్న కృతనిశ్చయంతో రామనారాయణ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గ అభ్యర్థికోసం ఎడతెగ ని చర్చలు జరుపుతున్నారు. మాజీ మంత్రి మాదాల జానకీ రామ్, జడ్ పి మాజీ చైర్మన్ చంచలబాబు యాదవ్, జలదంకి మాజీ ఎంపిపి కావేరి కృష్ణారెడ్డి, పుటం బ్రహ్మానందరెడ్డి, సీతారాంపురం మాజీ జడ్ పి టి సి సభ్యుడు గురువారెడ్డి, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కమ్మంపాటి తదితరులు టిక్కెట్లను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశిస్తున్న పుటం బ్రహ్మానందరెడ్డి, మేకపాటి సమీప బంధువు. అంతేకాకుండా ఆయనకు నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం పరంగా గట్టి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. గతంలో మేకపాటి కుటుంబంతో కలిసి ఎన్నికల్లో పనిచేసిన అనుభవం కూడా బ్రహ్మానందరెడ్డికి ఉంది. అందువల్ల మేకపాటి ఎత్తులకు పై ఎత్తులు వేసి ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా బ్రహ్మానందరెడ్డికి ఉందని కాంగ్రెస్ పార్టీ అధిస్థానం అంచనావేస్తోంది. ఫలితంగా టిక్కెట్లు ఆశిస్తున్నవారి జాబితాలో బ్రహ్మానందరెడ్డి పేరు అగ్రస్థానాన నిలిచింది. ఏది ఏమైనప్పటికీ అభ్యర్థి ఎవరన్నది సందిగ్థంలో పడటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటూ పాలుపోక కొట్టుమిట్టాడుతున్నారు.
http://www.teluguone.com/news/content/udayagiri-assembly-constituency-of-nellore-dist-24-13219.html





