తెలంగాణ సచివాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు..!
Publish Date:Sep 10, 2026
Advertisement
సీఎం రిలీఫ్ ఫండ్.. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే పథకం. అలాంటి సాయం ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన వ్యవహారం సాక్షాత్తు తెలంగాణ సచివాలయంలో కలకలం రేపింది. రూ.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తామంటూ అందుకు బదులుగా రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. సచివాలయ ఆవరణలోని టెంపుల్ వద్ద డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అక్కడితో ఆగలేదు.. ఈ లంచం వ్యవహారంలో సచివాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వినోద్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఏసిబి అధికారులు సచివాలయంలో సోదాలు నిర్వహించారు... ఒక్కసారిగా సచివాలయ ఆవరణలో ఏసీబీ అధికారులు ప్రత్యక్షం కావడంతో అక్కడ కలకలం నెలకొంది. లంచం తీసుకుంటుండగా పట్టుబడిన రాఘవేంద్రతో పాటు వినోద్ను నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారంలో లంచం డిమాండ్ వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.2 లక్షల సాయం కోసం.. రూ.లక్ష లంచం డిమాండ్.. చివరకు ఏసీబీ ట్రాప్లో చిక్కిన ఇద్దరి ఉద్యోగుల వ్యవహారం ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్గా మారింది. (Two employees caught by ACB while taking bribe, CM Relief Fund, Telangana Secretariat, Raghavendra, CM Revanth reddy, Nampally)
http://www.teluguone.com/news/content/two-employees-caught-by-acb-while-taking-bribe-24-231167.html





