అత్యంత రహస్యంగా ఇరాన్ అణ్వాయుధ పరీక్ష.. పశ్చిమాసియాలో శాంతి ఎండమావేనా?
Publish Date:Apr 10, 2026
Advertisement
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలూ, మరో వైపు దాడుల హెచ్చరికల మధ్య ఉద్రిక్తతలు సునామీ కెరటాల్లా ఎగసిపడుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే ఇరాన్ అత్యంత రహస్యంగా అణ్వాయుధ పరీక్షను విజయవంతంగా నిర్వహించిందన్న వార్త ప్రపంచాన్ని వణికించేస్తున్నది. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, ఆ దేశ మాజీ ప్రధాని దిమిత్రీ మెద్వెదేవ్ ఇరాన్ అణు పరీక్ష నిర్వహించిందన్న సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ఆయన వెల్లడించిన ఈ రహస్య వాస్తవమే.. ప్రపంచాన్ని నిలువెల్లా ఆందోళేనలో ముంచేసింది. అంతర్జాతీయ దౌత్యవర్గాలలో కలకలం రేపుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సన్నిహితుడిగా పేరున్న మెద్వెదేవ్, సోషల్ మీడియా వేదికగా ఇరాణ్ అణ్వస్త్ర ఆయుధ సామర్ధ్యాన్ని పరీక్షించుకొందనీ, ఇందుకోసం ఆ దేశం చేసిన రహస్య ప్రయోగం సక్సెస్ అయ్యిందనీ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత గంటల వ్యవధిలో రష్యా మాజీ ప్రధాని మెద్వెదేవ్ ఇరాన్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిందన్న బాంబు లాంటి వార్తను వెల్లడించారు. ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ అణ్వాయుధ పరీక్ష నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొంతకాలంగా ఇరాన్ తన యురేనియం శుద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెబుతూనే ఉంది. అదే సమయంలో ఇరాన్ కూడా యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతోందని చెబుతూనే.. తమ అణు కార్యక్రమం కేవలం శాంతియుత అవసరాల కోసమేనని నమ్మబలుకుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మెద్వెదేవ్ వ్యాఖ్యలు వాస్తవమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రష్యాకు ఇరాన్తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా.. మెద్వెదేవ్ వ్యాఖ్యలు విశ్వసించాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు. ఇరాన్ అణు సామర్థ్యం నిస్సందేహంగా ఇజ్రాయెల్ వంటి దేశాలకు పెను ముప్పు. అయితే మొద్వదేవ్ వ్యాఖ్యలను అమెరికా కానీ, ఇరాన్ కానీ ఇప్పటి వరకూ ఖండించలేదు. సమర్ధించలేదు. కానీ మెద్వెదేవ్ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో శాంతి ఎండమావేనా అన్న సందేహాలను కలిగిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/iran-conducts-secret-nuclear-test-36-217064.html





