చంద్రబాబుకు జయప్రద ప్రశంసల జల్లు
Publish Date:Apr 3, 2012
Advertisement
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద సోమవారం ప్రశంసలు కురిపించారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె సోమవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మంచి నాయకుడు అని కితాబు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని, కష్టపడి పని చేసే వ్యక్తిత్వమని అన్నారు.
ఆయనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. తన జన్మదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. రాజకీయాల్లో కొత్త జీవితం కొత్త ప్రణాళిక కోసం తాను స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. తాను మళ్లీ రాజకీయ జీవితం ప్రారంభిస్తున్నానని అన్నారు.
http://www.teluguone.com/news/content/chittooru-24-13119.html





