హీరోలందరినీ కవర్ చేసిన అల్లు అర్జున్
on Jan 13, 2020
'వచ్చాడయ్యో సామి... నింగి సుక్కలతో గొడుగు ఎత్తింది భూమి' - ఇది మహేష్ సినిమా 'భరత్ అనే నేను'లో పాట. సంక్రాంతి హిట్ 'అల... వైకుంఠపురములో' సినిమాకు వెళితే... అందులో ప్రేక్షకులకు ఈ పాట వినిపిస్తుంది. వినిపించడమే కాదు... ఈ పాటకు మహేష్ బాబులా అల్లు అర్జున్ స్టెప్పులు వేసే దృశ్యం కనిపిస్తుంది కూడా! అది అయిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో హిట్ సాంగ్ 'ఐ వాన్నా ఫాలో ఫాలో యు' పాట... తర్వాత 'హుషారు'లో 'ఉండిపోరాదే' పాట వచ్చింది. 'గబ్బర్ సింగ్'లో 'అంత్యాక్షరి' తరహాలో 'అల... వైకుంఠపురములో' ఒక సందర్భానికి తగ్గట్టు పాటలతో దర్శకుడు త్రివిక్రమ్ ఒక సీక్వెన్స్ డిజైన్ చేశారు. అందులో ముందుగా బయట హీరోలను కవర్ చేశాడు అల్లు అర్జున్. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ పాటలకు స్టెప్పులు వేశాడు. తర్వాత మొదలైంది అసలు పాట.
'ఏవండీ అందరి హీరోల పాటలు వేశారు. మా పవన్ కళ్యాణ్ పాట వేయరా?' అని సునీల్ అడుగుతాడు. అందుకు బదులుగా 'సిట్యువేషన్ డిమాండ్ చేయడం లేదు' అని అల్లు అర్జున్ చెప్తాడు. 'పవన్ పాటకు సిట్యువేషన్ తో సంబంధం ఏంటి?' అని సునీల్ చెప్పగా.... 'ఫాన్స్ డిమాండ్ మేరకు' అని 'గబ్బర్ సింగ్'లో 'పిల్లా నువ్వులేని జీవితం' పాటకు టేబుల్ ఎక్కిమరీ అల్లు అర్జున్ స్టెప్పులు వేశాడు. అతడితో సునీల్ కూడా స్టెప్పులు వేశాడు. 'చెప్పను బ్రదర్' అని ఒక పబ్లిక్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ అనడంతో అతడిపై పవన్ అభిమానులు కత్తి కట్టారు. తరవాత కూల్ అయ్యారు. రీసెంట్ గా 'అల వైకుంఠపురములో' ఫంక్షన్ లో 'పవర్ స్టార్' అనడంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు సినిమాలో పవన్ పాటకు అల్లు అర్జున్ స్టెప్పులు వేయడంతో మరింత ఖుషి అయి ఉంటారు. చివరలో చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి'లో 'అమ్మనీ తియ్యనీ దెబ్బ'కు స్టెప్పులు వేశాడు. మొత్తం మీద హీరోలు అందరినీ కవర్ చేశాడు అల్లు అర్జున్. అందరి హీరోల అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.