అవమానాన్ని కూడా ఆనందంగా అక్కున చేర్చుకున్న అక్కినేని!
పలు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారంతా ఒకప్ప్పుడు ఎన్నో కష్టాలకోర్చినవారు, మరెన్నో అవమానాలను ఎదుర్కొన్నవారే. ముఖ్యంగా సినిమా రంగంలో ఈ తరహా కష్టాలు, అవమానాలు ఎక్కువగా ఉంటాయని ప్రముఖుల జీవితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్, ఎఎన్నార్.. తెలుగు సినిమాకి రెండు కళ్లులాంటివారు అని చెబుతారు. ఎందుకంటే వారు చేసిన సినిమాల ద్వారా తెలుగు సినిమాను ఒక స్థాయికి తీసుకొచ్చారు. నటుడిగా ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ చాలా సీనియర్. 1944లో వచ్చిన ‘సీతారామ జననం’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యారు ఎఎన్నార్. 1949లో వచ్చిన ‘మనదేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఒక విధంగా చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ ఎక్కువ స్ట్రగుల్ అయ్యారని చెప్పొచ్చు. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎన్నో అవమానాలను భరించారు. అలాంటి ఓ ఘటన 1946లో వచ్చిన ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రం చేస్తున్న సమయంలో జరిగింది. ఎఎన్నార్ను ఆ సినిమా మేనేజర్ సూర్యనారాయణ తీవ్రంగా అవమానించాడు. ఆ తర్వాత అక్కినేని హీరోగా ఎలా ఎదిగారో, ఎలాంటి మరపురాని సినిమాలు చేశారో మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే 1967లో పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘ప్రాణమిత్రులు’ చిత్రంలో నటిస్తున్నారు అక్కినేని. అప్పటికి ఎఎన్నార్ స్టార్ హీరో. ఈ సినిమాకి కూడా సూర్యనారాయణే మేనేజర్. ఒకరోజు అక్కినేని చెయ్యాల్సిన సీన్కు అంతా సిద్ధం కావడంతో షాట్ రెడీ చెప్పి రమ్మని సూర్యనారాయణకు చెప్పారు పుల్లయ్య. మేకప్ రూమ్ దగ్గరకు వెళ్లిన ఆయన ఎఎన్నార్ను చూస్తూ వినయంగా నిలబడ్డారు. అది గమనించిన అక్కినేని.. ‘సూర్యనారాయణగారు.. చెప్పండి’ అన్నారు. ‘డైరెక్టర్గారు షాట్ రెడీ అని మీకు చెప్పమన్నారు’ అన్నాడు. ‘ఓకే. వస్తాను’ అని అంటూ ‘సూర్యనారాయణగారూ.. మీరు ముగ్గురు మరాఠీలు సినిమాకి పనిచేశారు కదూ. 20 సంవత్సరాలు దాటిపోయినా నేను మిమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకున్నానో తెలుసా.. మీ వల్ల నాకు జరిగిన అవమానం అలాంటిది. కన్నాంబగారు, సుబ్బారావుగారు మేకప్ రూమ్లో భోజనం చేస్తున్నారు. వారితోపాటు ఇంకా ఎవరెవరో భోజనాలు చేస్తున్నారు. నేను కూడా అక్కడికి వచ్చాను. నన్ను చూసి మీరు కసురుకున్నారు. ‘ఇక్కడ పెద్దవాళ్లంతా భోజనం చేస్తున్నారు. నీకు ఇక్కడేం పని. క్యాంటిన్కి వెళ్లు’ అన్నారు మీరు. నేను బాధపడుతూనే క్యాంటిన్కి వెళ్లిపోయాను’ అంటూ పాత విషయాన్ని గుర్తు చేశారు అక్కినేని. అది విని ఆ మేనేజర్ కంగారుపడిపోయాడు. ‘పొరపాటు జరిగిపోయింది సార్’ అన్నాడు. ‘ఇప్ప్పుడు మిమ్మల్ని తిట్టాలని ఆ విషయం గుర్తు చెయ్యలేదు. ఆరోజు మీరు చేసింది కరెక్టే. అప్ప్పుడు నేను సాధారణ నటుడ్ని. వాళ్లు పెద్ద నటులు. కాబట్టే మీరు అలా ప్రవర్తించారు. ఆరోజు నేను దాన్ని అవమానంగా భావించాను. ఎంతో బాధపడ్డాను కూడా. అది మీకు తెలియాలని ఇప్ప్పుడు గుర్తు చేశాను తప్ప మిమ్మల్ని బాధపెట్టాలని కాదు’ అంటూ సూర్యనారాయణ భుజం తట్టి సెట్ వైపు అడుగులు వేశారు అక్కినేని. ప్రారంభదశలో జరిగిన ఇలాంటి అవమానాలకు కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగారు కాబట్టే అక్కినేని నాగేశ్వరరావు మహానటుడుగా ఎదిగారు. జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని తనను అవమానించిన వ్యక్తిపై పగ సాధించకుండా ప్రేమతోనే అతని మనసును గెలుచుకున్నారు. ఇలాంటి ఎన్నో అవమానాలను అక్కున చేర్చుకొని తన విజయ సోపానానికి మెట్లుగా మార్చుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు.
Feb 27, 2026
శోభన్బాబు, జయలలిత కలిసి ఒకే ఒక్క సినిమా చేశారు.. మరి ఆ రూమర్స్ ఎలా వచ్చాయి?
(ఫిబ్రవరి 24 జయలలిత జయంతి సందర్భంగా..) శోభన్బాబు, జయలలిత ప్రేమకథ నిజమేనా? జయలలిత ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? సినిమా ఇండస్ట్రీలో రూమర్స్కి కొదవే ఉండదు. ఇప్ప్పుడు సోషల్ మీడియా బాగా విస్తరించింది కాబట్టి చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతుంది. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ప్రింట్ మీడియా తప్ప మరో ప్రచార సాధనం లేదు. ఆ సమయంలో కూడా రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉండేవి. కేవలం ఇలాంటి వార్తలు మాత్రమే ప్రచురించే కొన్ని పత్రికలు కూడా అప్పట్లో ఉండేవి. ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నంత ఫాస్ట్గా కాకపోయినా వార్త మాత్రం అందరికీ చేరేది. శోభన్బాబు(Sobhan Babu), జయలలిత(Jayalalitha) గురించి అలాంటి రూమర్స్ బాగా ప్రచారమయ్యాయి. శోభన్బాబు ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకునే సమయానికే జయలలిత బిజీ హీరోయిన్. ఒక నిర్మాత శోభన్బాబు, జయలలిత కాంబినేషన్లో సినిమా చెయ్యాలనుకున్నారు. ఇదే విషయం శోభన్బాబుకి చెబితే ఆయన ఎంతో సంతోషించారు. ఎందుకంటే అలాంటి టాప్ హీరోయిన్తో సినిమా చేస్తే తన కెరీర్కి బాగా ఉపయోగపడుతుందనుకున్నారు. అంతా ఓకే అనుకునే సమయానికి జయలలిత తల్లి సంధ్య చిన్న హీరోతో సినిమా ఎందుకు అని ఒప్ప్పుకోలేదు. అలా ఆ ప్రాజెక్ట్ నుంచి శోభన్ను తప్పించారు. చెల్లెలి కాపురం, జీవనతరంగాలు, శారద, తాసిల్దారుగారి అమ్మాయి, కాలం మారింది వంటి సినిమాలతో శోభన్బాబు హీరోగా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి ‘డాక్టర్బాబు’ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఆ చిత్రానికి ఆయన కుమారుడు లెనిన్బాబు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకి శోభన్బాబు, జయలలితలను హీరోహీరోయిన్లుగా ఎంపిక చేశారు. అలా మొదటిసారి ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ఇదొక్కటే. ఈ సినిమా చేసే సమయానికి జయలలిత తల్లి సంధ్య మరణించారు. తల్లి మరణంతో కుంగిపోయిన జయలలిత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. సినిమాలు తగ్గించుకున్నారు. ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆమెకు ధైర్యం చెప్పి సినిమాలు కొనసాగించమని చెప్పారు. కొంతకాలం తర్వాత తిరిగి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన సినిమాయే ‘డాక్టర్ బాబు’. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభన్, జయలలిత మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనపై శోభన్ చూపిస్తున్న ఆప్యాయత, అభిమానం జయలలితను బాగా ఆకట్టుకున్నాయి. తల్లి లేదనే బాధను శోభన్ మరిపించారు. అలా జరుగుతున్న సమయంలో వీరిద్దరి సాన్నిహిత్యంపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయితే అందులో రకరకాల వెర్షన్లు మనకు కనిపిస్తాయి. అందులో ఏది నిజం అనేది మాత్రం ఎవరికీ తెలీదు. చేసింది ఒక్క సినిమా అయినా ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చివరి క్షణంలో శోభన్బాబు అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే అప్పటికే ఆయనకు పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకోలేనని జయలలితకు చెప్పారు శోభన్. ఈ విషయం తమిళ స్టార్ హీరో ఎం.జి.ఆర్.కి తెలిసింది. శోభన్బాబుని పిలిపించారు. జయలలితను ఎందుకు పెళ్లి చేసుకోనని చెప్పావు అని అడిగారు. ఆమెకు చెప్పిన సమాధానమే ఎంజిఆర్కి కూడా చెప్పారు శోభన్. అక్కడితో వారి పెళ్లి ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పడింది. ఇది ఒక వెర్షన్ అయితే మరో వెర్షన్ పూర్తి భిన్నంగా ఉంటుంది. డాక్టర్బాబు సినిమా చేసిన తర్వాత ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారని, ఇద్దరూ ఒకే గదిలో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయంటారు. ఈ విషయాలన్నీ ఇండస్ట్రీలో ఉన్నవారికి బాగా తెలుసు. శోభన్, జయలలిత సహజీవనం చేయడం వల్ల వారికి ఒక కుమార్తె కూడా కలిగిందనే ప్రచారం ఉంది. అయితే ఆ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. శోభన్బాబుతో పెళ్లి విఫలమైన తర్వాత ఇక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిన జయలలిత చనిపోయే వరకు అవివాహితగానే ఉండిపోయారు.
Feb 23, 2026ఏ హీరోయిన్కీ లేని రికార్డ్స్ విజయనిర్మల సొంతం.. అవేమిటంటే?
(ఫిబ్రవరి 20 విజయనిర్మల జయంతి సందర్భంగా..) - నటిగా 100 సినిమాలు పూర్యయ్యాకే డైరెక్షన్ చెయ్యమని కష్ణ చెప్పారు.. ఎందుకో తెలుసా? - ముగ్గురు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన విజయనిర్మల - హీరోయిన్గా విజయనిర్మల క్రియేట్ చేసిన రికార్డ్ ఏమిటో తెలుసా? చిత్ర పరిశ్రమలో నటీనటులుగా రాణించడం అంత సులువు కాదని పాతతరం వారిని చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా నటీమణులు ఈ విషయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అయితే కొందరి అదృష్టం వల్ల వారి కెరీర్ ఉజ్వలంగా సాగుతుంది. అలాంటి వారిలో నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల ఒకరు. చిన్నతనంలోనే నటనకు శ్రీకారం చుట్టిన ఆమె.. ప్రపంచంలో ఏ మహిళా సాధించని ఘనత సాధించి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. 65 ఏళ్ళ విజయనిర్మల కెరీర్లో చేసిన సినిమాలు, నటిగా.. దర్శకురాలిగా సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం. విజయనిర్మల(Vijayanirmala) అసలు పేరు నీరజ. 1950లో తమిళ చిత్రం ‘మచ్చరేఖ’ ద్వారా బాలనటిగా రంగ ప్రవేశం చేశారు. 1957లో నటరత్న ఎన్.టి.రామారావు(N.T.Rama Rao) నిర్మించిన ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రంలో బాలకష్ణుడుగా నటించారు. ఈ చిత్రంలోని ‘జయ కష్ణా ముకుందా మురారి’ పాటలో ఆమె అభినయం అందర్నీ ఆకట్టుకుంది. 1966లో వచ్చిన ‘రంగుల రాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమాతో తన పేరును నిర్మలగా మార్చుకున్నారు. అప్పటికే నిర్మల పేరుతో మరో నటి ఉన్నారు. విజయ అనుబంధ సంస్థ ద్వారా నటిగా పరిచయం కావడంతో అప్పటి నుంచి తన పేరుకు ముందు విజయ చేర్చి విజయనిర్మలగా మారారు. ఆ మరుసటి సంవత్సరం బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ చిత్రంతో విజయనిర్మల జీవితం కొత్త మలుపు తిరిగింది. ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణతో సాన్నిహిత్యం పెరగడంతో 1969లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో లెక్కకు మించిన సినిమాలు వచ్చాయి. రికార్డు స్థాయిలో కష్ణతో కలిసి 50 సినిమాల్లో నటించారు విజయనిర్మల. అంతకుముందు రెండు సినిమాల్లో కష్ణ(Krishna), విజయనిర్మల అన్నాచెల్లెళ్లుగా నటించడం విశేషం. పెళ్లి తర్వాత కూడా వరసగా సినిమాలు చేస్తూ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు విజయనిర్మల. ఆ సమయంలోనే ఆమె దృష్టి దర్శకత్వం వైపు మళ్లింది. అయితే నటిగా 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాత డైరెక్షన్ వైపు వెళ్ళమని భర్త కృష్ణ సలహా ఇచ్చారు. నటిగా పరిచయమైన ఏడేళ్ళలోనే 100 సినిమాలు పూర్తి చేసి 1973లో ‘కవిత’ చిత్రంతో మలయాళంలో, ‘మీనా’ చిత్రంతో తెలుగులో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ‘మీనా’ చిత్రం ఘనవిజయం సాధించి ఆమెకు డైరెక్టర్గా మంచి పేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao), శివాజీ గణేశన్, రజినీకాంత్(Rajinikanth) వంటి స్టార్స్ని కూడా డైరెక్ట్ చేసిన ఘనత విజయనిర్మల సొంతం. తన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. 42 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళగా 2002లో గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందారు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు డైరెక్ట్ చేశారు. తన సొంత బేనర్లో 16 సినిమాలు నిర్మించారు విజయనిర్మల. తన డైరెక్షన్లోనే ‘ప్రేమ సంకెళ్లు’ చిత్రం ద్వారా తనయుడు నరేష్ను హీరోగా పరిచయం చేశారు.
Feb 19, 2026అలాంటి అరుదైన సంఘటన కళాతపస్వి విషయంలోనే జరిగింది!
(ఫిబ్రవరి 19 కె.విశ్వనాథ్ జయంతి సందర్భంగా..) - సినిమాలంటే ఆసక్తిలేని విశ్వనాథ్.. కళాతపస్వి ఎలా అయ్యారు? - విశ్వనాథ్ జీవితంలో ఏం జరగబోతోందో తండ్రికి ముందే తెలుసా? - ‘శంకరాభరణం’ చిత్రానికి ముందు కళాతపస్వి ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారంటే..? కళాతపస్వి కె.విశ్వనాథ్(K.Viswanath).. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’(Shankarabharanam). అదే ఆయన తొలి సినిమా అని చాలా మంది అనుకుంటారు. కానీ, అంతకుముందే చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద, జీవనజ్యోతి, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి వంటి పాతిక సినిమాలకు దర్శకత్వం వహించారు విశ్వనాథ్. శంకరాభరణం తర్వాత కూడా ఎన్నో కళాఖండాలను ఆయన రూపొందించారు. అయితే ఆయన జీవితంలో గొప్ప మైలురాయిగా శంకరాభరణం చిత్రాన్నే చెబుతారు. భారతదేశం గర్వించదగిన దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న విశ్వనాథ్కి సినిమాల్లోకి రావాలని డైరెక్టర్(Director) అయిపోవాలనే కోరిక లేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకునేవారు. విశ్వనాథ్ తండ్రి వాహిని స్టూడియోలో పనిచేసేవారు. ఆ సమయంలో స్టూడియోను విస్తరిస్తున్నారు. విశ్వనాథ్కి అందులో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని తండ్రి ప్రయత్నించారు. అలా వాహిని స్టూడియో(Vauhini Studio)లో సౌండ్ అసిస్టెంట్గా జాయిన్ చేశారు. అక్కడ పని నేర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్గా ఎన్నో సినిమాలకు పనిచేశారు. విశ్వనాథ్లోని ప్రతిభను మొదట గుర్తించిన వారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు(Adurthi Subba Rao). సినిమాలపై విశ్వనాథ్ చేస్తున్న విశ్లేషణ నచ్చడంతో తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకున్నారు. ఆయన దగ్గర ఎన్నో సినిమాలకు అసోసియేట్గా పనిచేశారు విశ్వనాథ్. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో రూపొందిన మొదటి సినిమా ఆత్మగౌరవం. ఈ సినిమా తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. వాటిలో సుడిగుండాలు, ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవనజ్యోతి వంటి సినిమాలు ఉన్నాయి. 1976లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రంతో తన పంథా మార్చుకున్నారు విశ్వనాథ్. కళలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటి పట్ల వారికి ఆసక్తిని కలిగించాలని అనుకున్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన సిరిసిరిమువ్వ చిత్రాన్ని హిందీలో సర్గమ్ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విశ్వనాథ్ రూపొందించిన మరో మంచి సినిమా సీతామాలక్ష్మి. 1980 కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. శంకరాభరణం వంటి కళాఖండం విడుదలై ఆయన కీర్తి విశ్వవ్యాప్తం కావడానికి కారణమైన సంవత్సరం. ఆ సినిమాకి లభించిన ఆదరణ అసామాన్యమని చెప్పాలి. ఆ తర్వాత సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి అద్భుతమైన సినిమాలను తీర్చిదిద్దారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా శుభప్రదం. కె.విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యంకి జోతిష్యం హాబీగా ఉండేది. కుటుంబ సభ్యులకు తప్ప బయటి వారికి చెప్పేవారు కాదు. కానీ, విశ్వనాథ్ మాత్రం ఏనాడూ జోతిష్యం, జాతకాల జోలికి వెళ్లలేదు. వాటిని మూఢంగా నమ్మేవారు కాదు. కాకపోతే మంచిరోజులు కాదు అని చెప్ప్పుకునే అష్టమి, నవమి రోజుల్లో మంచికార్యాలు మొదలు పెట్టేవారు కాదు. మంచి రోజులు, మంచి ఘడియలు కాని సమయంలో కూడా రైళ్లు, విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. అయితే అందరికీ చెడు జరగాలని లేదు. కాకపోతే మనకు జరిగే చెడుని తప్పించే వీలు వున్నప్ప్పుడు మంచి రోజుల్లోనే కొన్ని పనులు మొదలు పెట్టాలని మాత్రం అనుకునేవారు. ఆయన ఎదుగుదలను చూసి తండ్రి సుబ్రహ్మణ్యం లోలోపలే సంతోషించేవారు తప్ప ఏనాడూ విశ్వనాథ్ని పొగడలేదు. అంతేకాదు, ఆయన చేసే సినిమాలకు సంబంధించి ఎప్ప్పుడూ జోక్యం చేసుకోలేదు. ముఖ్యంగా సినిమాలకు ముహూర్తాలు పెట్టడం కానీ, వాటి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలు కానీ విశ్వనాథ్తో చర్చించేవారు కాదు. తండ్రి చనిపోయిన తర్వాత ఒకరోజు ఆయన రాసుకున్న డైరీలను పరిశీలించారు విశ్వనాథ్. తనతో ఏనాడూ చెప్పని విషయాలు ఆయన అందులో రాసుకున్నారు. తన కెరీర్లో సాధించిన విజయాలకు సంబంధించి కొన్ని లెక్కలు కనిపించాయి. సరిగ్గా ఆయన రాసినట్టే జరిగిందని విశ్వనాథ్ తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆయన డైరీలో శంకరాభరణం చిత్రాన్ని ప్రస్తావించారు. ఆ సినిమా కొన్నేళ్ళపాటు తెలుగువారు గుర్తు పెట్టుకుంటారు. చలనచిత్ర సీమలో శంకరాభరణం చరిత్ర సృష్టిస్తుందని రాసుకున్నారు. అలాగే ఆ సినిమా ప్రభావం విశ్వనాథ్పై బలంగా ఉంటుందని కూడా అందులో ఉంది. ఆ తర్వాత చేయబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని కూడా ఆయన అందులో రాశారు. విశ్వనాథ్ సినీ జీవితానికి సంబంధించి తండ్రి రాసిన విషయాలన్నీ అక్షర సత్యాలుగా కళ్ళముందు కనిపించడంతో విస్తుపోయారు విశ్వనాథ్. అందుకే తనకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కీర్తి ప్రతిష్టలన్నీ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లే వచ్చాయని కళాతపస్వి కె.విశ్వనాథ్ చెప్పేవారు. తండ్రి అనుకున్నట్టుగానే శంకరాభరణం చిత్రం విశ్వనాథ్కి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయిన సరిగ్గా 43 సంవత్సరాల తర్వాత 2023 ఫిబ్రవరి 2న ఆయన శివైక్యం అయిపోయారు. ఏ సినిమా పేరు చెబితే కె.విశ్వనాథ్ అనే పేరు వినిపిస్తుందో.. అదే సినిమా రిలీజ్ అయిన తేదీకే ఆయన స్వర్గస్తులు కావడం నిజంగా విధిలిఖితమనే చెప్పాలి. ఎవరి జీవితాల్లోనైనా ఇలాంటి సంఘటన జరగడం చాలా అరుదనే చెప్పాలి.
Feb 19, 2026ఆ అవమానంతో సూపర్స్టార్ అయ్యేవరకు ఎ.వి.ఎం. స్టూడియోలో అడుగుపెట్టని రజినీకాంత్!
సూపర్స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వెళుతున్న సమయంలో ఒక నిర్మాత ఆయన్ని అవమానించారు. దాన్ని పాజిటివ్గా తీసుకొని పట్టుదలతో నటుడిగా తనను తాను తీర్చి దిద్దుకొని సూపర్స్టార్గా ఎదిగారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్న తర్వాత కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ’ చిత్రంలో చిన్న క్యారెక్టర్ చెయ్యడం ద్వారా నటుడిగా తన కెరీర్ను ప్రారంభించారు. రెండో సినిమాగా పుట్టన్న కణగల్ దర్శకత్వంలో ‘కథా సంగమ’ చిత్రంతో కన్నడలో పరిచయమయ్యారు. ఈ రెండు సినిమాý వరకు రజినీకాంత్ పేరు శివాజీరావుగానే ఉంది. 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు శివాజీరావు. అప్పటికే శివాజీ గణేశన్ హీరోగా ఉండడంతో ఒకే పేరుతో ఇద్దరు నటులు ఉండకూడదని, అతన్ని పేరు మార్చుకోమని చెప్పి మూడు ఆప్షన్స్ ఇచ్చారు బాలచందర్. చంద్రకాంత్, రవికాంత్, రజినీకాంత్.. ఈ మూడు పేర్లలో ఒకటి సెలక్ట్ చేసుకోమని చెప్పారు. అప్ప్పుడు రజినీకాంత్ పేరును సెలక్ట్ చేసుకున్నారు శివాజీరావు. అలా ‘అంతులేని కథ’ చిత్రం నుంచి రజినీకాంత్గా చలామణి అవుతున్నారు. ఈ సినిమాలో రజినీ చేసిన క్యారెక్టర్కి విపరీతమైన పేరు వచ్చింది. అంతేకాదు, ఆయనపై చిత్రీకరించిన ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి..’ అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటలో సిగరెట్ని ఎగరేసి పట్టుకునే విధానం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సహనటుడిగా చేస్తూ వస్తున్న రజినీకి ఒక సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చారు ఓ నిర్మాత. ఆ సినిమాకి 6 వేలు రెమ్యునరేషన్గా ఫిక్స్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అయిన రోజు ఆ మొత్తం ఇస్తానని చెప్పారు. ఒకరోజు రజినీకాంత్ని ఎ.వి.ఎం. స్టూడియోకి తీసుకెళ్లేందుకు కారు వచ్చింది. స్టూడియోకి వెళ్లిన తర్వాత తన రెమ్యునరేషన్ గురించి అడిగారు రజినీ. ముందు షూటింగ్లో పాల్గొనమని చెప్పారు నిర్మాత. కానీ, రెమ్యునరేషన్ ఇస్తేనే నటిస్తానని చెప్పారు రజినీ. దానికి సీరియస్ అయిన ఆ నిర్మాత ‘నువ్వేమైనా సూపర్స్టార్వా.. డబ్బు ఇస్తేనేగానీ చెయ్యవా?’ అన్నారు. ‘చెయ్యను’ అన్నారు రజినీ. ‘అయితే వెళ్లిపో’ అంటూ కసురుకున్నాడు. తనను ఇంటి దగ్గర నుంచి ఎలా తీసుకొచ్చారో అలాగే తీసుకెళ్లమని అడిగారు రజినీ. దానికా నిర్మాత ఒప్ప్పుకోలేదు. కారు ఇవ్వనని, వెళ్లిపొమ్మని చెప్పారు. చేసేదిలేక వెనక్కి వచ్చేశారు. తను సూపర్స్టార్ అయ్యేవరకు మళ్ళీ ఎ.వి.ఎం. స్టూడియోలో అడుగుపెట్టకూడదని ఆరోజే నిర్ణయించుకున్నారు రజినీకాంత్. ఇక అప్పటి నుంచి ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. 1977లో 15 సినిమాల్లో నటించారు రజినీ. వాటిలో తమిళ్, తెలుగు, కన్నడ సినిమాలు ఉన్నాయి. 1978లో 22 సినిమాలు చేశారు. వాటిలో సోలో హీరోగా నటించిన తమిళ సినిమా ‘భైరవి’ కమర్షియల్గా పెద్ద హిట్ అవ్వడంతో రజినీకాంత్ స్టార్ హీరో అయిపోయారు. తనకు ఎదురైన అవమానాలను ఛాలెంజ్గా తీసుకొని నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్స్టార్ అయ్యారు రజినీకాంత్.
Feb 17, 2026‘గుండమ్మ కథ’ సినిమాకి అక్కినేని ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఎందుకో తెలుసా?
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో మరపురాని సినిమాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ సినిమాలుగానే ఉండిపోతాయి. అలాంటి వాటిలో ‘గుండమ్మ కథ’ ఒకటి. 63 సంవత్సరాల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పటికీ చూస్తున్నారు. అలాంటి అద్భుతమైన సినిమా నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి, మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అప్పటికి ఎన్టీఆర్, ఎఎన్నార్ ఇద్దరూ స్టార్ హీరోలే. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇద్దరూ కలిసి నటించారు. వీరి కెరీర్లో దాదాపు 15 సినిమాల్లో కలిసి నటించడం విశేషం. ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న ఈ సినిమాకి గుండమ్మ కథ అని టైటిల్ పెట్టడం సాహసమనే చెప్పాలి. ఆరోజుల్లో బౌండెడ్ స్క్రిప్ట్తో షూటింగ్కి వెళ్లేవారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. కానీ, ఈ సినిమా షూటింగ్ అలా జరగలేదు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల డేట్స్ ఎప్ప్పుడు దొరికితే అప్ప్పుడు దఫదఫాలుగా షూటింగ్ చేశారు. ఇదిలా ఉంటే.. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో నటించినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం విశేషం. దీని వెనుక ఒక కథ ఉంది. 1944లో సీతారామ జననంతో కెరీర్ ప్రారంభించిన అక్కినేని.. 1957 నాటికి 60 సినిమాలు పూర్తి చేశారు. పి.చంగయ్య దర్శకత్వంలో డి.ఎల్.నారాయణ నిర్మించిన దొంగల్లో దొర అక్కినేని నటించిన 60వ సినిమా. ఈ సందర్భంగా తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన నిర్మాతలను సత్కరించుకోవాలి అనుకున్నారు అక్కినేని. అదే విషయాన్ని నిర్మాత నాగిరెడ్డికి చెప్పారు. అలా చేస్తే చాలా బాగుంటుందని ఆయన కూడా ప్రోత్సహించారు. అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవం పేరుతో ఈ వేడుకను నిర్వహించాలనుకున్నారు. అయితే దానికి విశాలమైన వేదిక అవసరం ఉంటుంది. ఎక్కడ చెయ్యాలి అని అక్కినేని ఆలోచించారు. ఆ సమయంలో నాగిరెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారు. వాహిని స్టూడియో ఎదురుగా ఉన్న 24 ఎకరాల అడవిలాంటి ప్రదేశాన్ని ఇస్తానని, కార్యక్రమం అక్కడ చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు, ఆ ప్రాంతాన్ని చదును చేయించి చక్కని గార్డెన్గా తీర్చిదిద్దారు నాగిరెడ్డి. వేడుక జరపడానికి అవసరమైన అన్న ఏర్పాటు ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అధ్యక్షత వహించారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్, చిత్తూరు నాగయ్య, ఎన్.టి.రామారావు, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే వేడుకలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 25 వేల రూపాయల విరాళం అందించారు అక్కినేని. ఎంతో ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవం జరిగింది. అనంతరం కార్యక్రమానికి హాజరైన 4,000 మందికి చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుక నిర్వహణకు ఆరోజుల్లోనే 30,000 రూపాయలు ఖర్చయింది. అదంతా నాగిరెడ్డి భరించారు. వేడుకకు నాగిరెడ్డి ఖర్చుపెట్టిన 30 వేలు తిరిగి ఇవ్వబోయారు అక్కినేని. కానీ, నాగిరెడ్డి తీసుకోలేదు. ఆయనకు రుణం ఉండకూడదు అని భావించిన అక్కినేని ఆ తర్వాత విజయ సంస్థ నిర్మించిన ‘గుండమ్మకథ’ చిత్రంలో పారితోషికం తీసుకోకుండా నటించారు. 1962లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి కాసుల వర్షం కురిపించింది. అప్ప్పుడైనా రెమ్యునరేషన్ తీసుకోమని అక్కినేనిని అడిగారు నాగిరెడ్డి. కానీ, అక్కినేని మాత్రం సున్నితంగా తిరస్కరించారు. అలా గుండమ్మకథ చిత్రానికి అక్కినేని ఎలాంటి పారితోషికం తీసుకోలేదు.
Feb 14, 2026సినిమా చూడాలంటే బ్రహ్మానందం ఇప్పటికీ వణికిపోతారు.. ఎందుకో తెలుసా?
(ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా..) - తను చేసిన 1250 సినిమాల్లో బ్రహ్మానందం చూసినవి 20 మాత్రమే - చిరంజీవిని చూస్తే బ్రహ్మానందం భయపడతారు.. ఎందుకంటే? - చిన్నతనంలో బ్రహ్మానందంని తండ్రి ఎందుకు కొట్టేవారు? నీ ఎంకమ్మా.. తీస్కో.. పండగ చేసుకో.. రకరకాలుగా ఉంది మాస్టారూ.. ఖాన్తో గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్.. జఫ్ఫా.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా?.. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్.ఎం.ఎస్. చేయండి.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు.. ఈ పాపులర్ డైలాగులు వింటే చాలు.. అవి చెప్పి మనల్ని నవ్వించిన కమెడియన్ ఎవరో గుర్తొస్తారు. నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని, తీరికలేని కమెడియన్గా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హాస్యనటులు వచ్చారు. తమ నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. పాతతరంలో రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటులు కొన్ని దశాబ్దాలు హాస్యనట చక్రవర్తులుగా ఇండస్ట్రీని ఏలారు. ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందం తనదైన మార్క్ కామెడీతో, డైలాగులతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ ఎంటర్టైన్ చేశారు. 1980వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన బ్రహానందం.. కొన్ని దశాబ్దాలపాటు తన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఒక దశలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీగా భావించేవారు. ఒకప్ప్పుడు రాజబాబు, రమాప్రభ కాంబినేషన్కి ఈ క్రేజ్ ఉండేది. నలభై ఏళ్ళ తన సినీ కెరీర్లో 1250కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా కనిపించిన బ్రహ్మానందంకి సినిమాలంటే ఎంతో భయమట. అందుకే తను చేసిన వందల సినిమాల్లో కేవలం 20 మాత్రమే చూశారు. సినిమా నటుడై ఉండి, తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందంకి సినిమాలంటే ఎందుకు విరక్తి కలిగింది? సినిమాల విషయంలో అతన్ని భయపెట్టింది ఎవరు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం, చాగంటివారిపాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో ఒకరుగా జన్మించారు కన్నెగంటి బ్రహ్మానందం. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్ వరకు చదువుకున్నారు. పై చదువులకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రికి సన్నిహితుడైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇం{ర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. ఆ తర్వాత 9 సంవత్సరాలపాటు అత్తిలిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు బ్రహ్మానందం. చిన్నతనంలో సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. కానీ, తండ్రి సినిమాలకు పంపేవారు కాదు. సంవత్సరానికి ఒక సినిమా చూస్తే గగనం అన్నట్టుగా ఉండేది. అయితే తండ్రికి తెలియకుండా సోదరులతో కలిసి సెకండ్ షోలకు వెళ్లేవారు. అలా వెళ్లినప్ప్పుడల్లా తండ్రి వారిని చితకబాదేవారు. తన్నులు తిన్నా సినిమాలు చూడడం మానేవారు కాదు. ఆ తర్వాతి కాలంలో సినిమా చూడాలంటే తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొచ్చేవి. ఇక సినిమాల్లోకి వచ్చి గ్రేట్ కమెడియన్ అనిపించుకున్న తర్వాత కూడా సినిమాలంటే భయం పోలేదు. సినిమాల విషయంలో తండ్రి అతన్ని శిక్షించిన తీరు అలా ఉండేది. తను చేసే సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని నవ్విస్తున్నప్పటికీ తను మాత్రం సినిమాలకు దూరంగానే ఉంటారు. అందుకే ఆయన చూసిన సినిమాలు చాలా తక్కువ. సినిమా అనగానే ఇప్పటికీ చిన్నతనంలో తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొస్తాయని అంటారు. అలాగే చిరంజీవిని చూసినా బ్రహ్మానందం భయపడతారు. దానికి కారణం.. తను సినిమాల్లోకి రాకముందు చిరంజీవి వంటి స్టార్ హీరోని కలిసినపుడు మాట్లాడేందుకు ఎంత భయపడ్డారో ఇప్ప్పుడు కూడా ఆయన కలిసినపుడు పైకి బాగానే మాట్లాడినా మనసులో మాత్రం వణుకు పుడుతుందంటారు బ్రహ్మానందం.
Jan 31, 2026జాతీయ అవార్డును తిరస్కరించిన వేటూరి సుందరరామ్మూర్తి.. ఎందుకంటే?
(జనవరి 29 వేటూరి సుందరరామ్మూర్తి జయంతి సందర్భంగా..) మన సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. పాతతరం నుంచి ఇప్పటివరకు ఎందరో రచయితలు అందమైన పాటల్ని అందించారు. వారు అందించిన పాటలు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఒక దశలో శ్రీశ్రీ, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర వంటి రచయితలు తమదైన శైలిలో పాటలు రాస్తూ వున్న సమయంలో ఒక మెరుపులా ఇండస్ట్రీకి వచ్చారు వేటూరి సుందరరామ్మూర్తి. దాదాపు 40 సంవత్సరాలపాలు తెలుగు పాటను పరవళ్లు తొక్కించిన వేటూరి 5,000కి పైగా పాటలు రాశారు. ఆ సమయంలో ఉన్న అందరు రచయితల శైలి తన పాటల్లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు వేటూరి. చాలా ఆలస్యంగా పరిశ్రమకు వచ్చిన వేటూరి.. చాలా తక్కువ సమయంలోనే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అగ్రరచయిత అనిపించుకున్నారు. రచయితగా మారడానికి ముందు ఆయన ఎలాంటి సాహిత్యాన్ని చదవలేదు. కేవలం రేడియోలో వస్తున్న పాటల్ని వింటూ పాటల రచనపై ఆసక్తిని పెంచుకున్నారు. 1936 జనవరి 29న కష్ణాజిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో వేటూరి చంద్రశేఖరశాస్త్రి, కమలాంబ దంపతులకు జన్మించారు వేటూరి సుందరరామ్మూర్తి. తండ్రి నేత్ర వైద్యులుగా ఉండేవారు. తల్లి కమలాంబకు సాహిత్యంలోనూ, సంగీతంలోనూ ప్రవేశం ఉంది. వత్తి రీత్యా వీరి కుటుంబం విజయవాడ వచ్చింది. అక్కడ 5వ తరగతి వరకు చదువుకున్నారు వేటూరి. ఆ తర్వాత జగ్గయ్యపేటలో 9వ తరగతి వరకు, గుంటూరు జిల్లాలోని కొల్లూరులో ఎస్ ఎస్ ఎల్ సి వరకు చదువుకున్నారు. మద్రాస్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి బి.ఎ. ఎకనమిక్స్ చేశారు. అటు పిమ్మట లా చేసేందుకు మద్రాస్ వెళ్లారు. చదువుతున్న రోజుల్లోనే రచనల పట్ల ఆసక్తి బాగా పెరిగింది. లా రెండో సంవత్సరంలో ఉండగానే జర్నలిజంలో చేరితే బాగుంటుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆంధ్రప్రభ పత్రికలో విలేకరిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్ర సచిత్ర వార పత్రికలో శీర్షికలు రాసేందుకు చేరారు. 1956 నుంచి 16 ఏళ్ళపాటు జర్నలిస్ట్గా పనిచేశారు. ఆంధప్రత్రికలో పనిచేస్తున్న సమయంలోనే వేటూరి రచనలు నటరత్న ఎన్.టి.రామారావును బాగా ఆకట్టుకున్నాయి. సినిమాల్లో పాటలు రాస్తే బాగా రాణిస్తారని ఆనాడే ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ సీత కథ’ చిత్రంలోని ‘భారతనారి చరితము’ అనే హరికథతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. 1974లో ఈ చిత్రం విడుదలైంది. అయితే మూడేళ్లు గడిచినా వేటూరికి మరో అవకాశం రాలేదు. ఎన్టీఆర్ దృష్టిలో వేటూరి ఉండడంతో కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఆయన చేస్తున్న ‘అడవిరాముడు’ చిత్రంలోని అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి చరిత్ర సష్టించింది. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అవ్వడంతో రచయితగా వేటూరి పాపులర్ అయిపోయారు. ఆ క్రమంలోనే పంతులమ్మ, సిరిసిరిమువ్వ చిత్రాల్లోని అన్ని పాటలు రాశారు వేటూరి. సిరిసిరిమువ్వ చిత్రానికి జంధ్యాలతో కలిసి మాటలు కూడా రాశారు. 1979లో పాటల రచయితగా వేటూరి జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం.. ఇలా ఎన్నో సినిమాల్లో తరాల తరబడి గుర్తుపెట్టుకునే పాటలు రాశారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు వేటూరి. ఇది కాక ఆయనకు ఎన్నో నంది అవార్డులు, ఇతర పురస్కారాలు లభించాయి. ఒక తరహా పాటలు కాకుండా ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల ప్రతిభ కలిగిన వేటూరి రచించిన కొన్ని గీతాల గురించి చెప్పాలంటే.. కృషి వుంటే మనుషులు రుషులౌతారు, మానసవీణా మధుగీతం, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, ఝుమ్మంది నాదం.. సై అంది పాదం, కొమ్మ కొమ్మకో సన్నాయి.., శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు, రాగాల పల్లకిలో కోయిలమ్మా, ఆకాశ దేశాన.. ఆషాఢ మాసానా.., కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, వెన్నెల్లో గోదారి అందం, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, గీతాంజలి చిత్రంలోని అన్ని పాటలు, జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అన్ని పాటలు, పావురానికి పంజరానికి, ఎన్నెన్నో అందాలు, ఓ ప్రేమా నా ప్రేమా, జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే, ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకు, సఖియా చెలియా.. ఇలా వేటూరి కలం నుండి జాలువారిన మధురగీతాల్లో ఇవి మచ్చు తునకలు మాత్రమే. తెలుగు సినిమాకి వేటూరి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్, వి.వి.వినాయక్ కాంబినేషన్లో 2011లో వచ్చిన బద్రినాథ్ చిత్రంలో ఓంకారేశ్వరి.. వేటూరి రాసిన చివరి పాట. ఈ సినిమా విడుదల కావడానికి సంవత్సరం ముందు 2010 మే 22న 75 ఏళ్ళ వయసులో గుండెపోటుతో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు వేటూరి సుందరరామ్మూర్తి.
Jan 29, 2026నటుడిగా గుమ్మడిని ఎంతో ప్రోత్సహించిన ఎన్టీఆర్.. ఐదేళ్లు ఎందుకు దూరం పెట్టారు?
(జనవరి 27 గుమ్మడి వెంకటేశ్వరరావు వర్థంతి సందర్భంగా..) సినిమా రంగంపై వున్న ఆసక్తితో నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీకి వచ్చిన గుమ్మడి వెంకటేశ్వరరావు.. తొలిసారి నటించిన సినిమా 1950లో వచ్చిన అదష్టదీపుడు. ఈ సినిమా తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మరో సినిమా రాలేదు. విసిగిపోయిన గుమ్మడి మద్రాస్ వదిలి ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్తో గుమ్మడికి మంచి స్నేహం ఉంది. దాంతో తను వెళ్లిపోతున్న విషయం చెప్పడానికి ఆయన్ని కలిశారు. అయితే ఎన్టీఆర్ దానికి ఒప్ప్పుకోలేదు. త్వరలోనే తను సొంత నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నానని, తమ సినిమాల్లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు ఎన్టీఆర్. ఎన్.త్రివిక్రమరావు నిర్మాతగా నేషనల్ ఆర్ట్ థియేటర్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా ‘పిచ్చి పుల్లయ్య’ చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్. మాట ఇచ్చినట్టుగానే ఈ సినిమాలో గుమ్మడికి ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చారు. ఆ మరుసటి సంవత్సరం ‘తోడు దొంగలు’ చిత్రాన్ని నిర్మించారు. అందులో ఎన్టీఆర్కు సమానమైన పాత్ర ఇచ్చి గుమ్మడిని ప్రోత్సహించారు ఎన్టీఆర్. ఎన్.ఎ.టి. సంస్థకు ఎంతో పేరు, డబ్బు తెచ్చి పెట్టిన ‘జయసింహ’ చిత్రంలోనూ గుమ్మడికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత గుమ్మడి కెరీర్ ఊపందుకుంది. వరసగా సినిమాలు చేస్తూ గుమ్మడి బిజీ అయిపోయారు. అదే సమయంలో బయటి సంస్థ నిర్మిస్తున్న ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలో టైటిల్ పాత్ర చేసే అవకాశం కల్పించారు ఎన్టీఆర్. అలా తమ సంస్థలోనే కాకుండా బయటి సంస్థలో కూడా సినిమాలు ఇప్పించేవారు. అంతటి అనుబంధం ఉన్న గుమ్మడిని ఒక దశలో ఐదేళ్ళపాటు దూరం పెట్టారు. ఇద్దరికీ మాటలు లేవు. ఎన్టీఆర్ను కలవాలని గుమ్మడి ప్రయత్నించినా ఆ అవకాశం ఇవ్వలేదు ఎన్టీఆర్. ఇద్దరి మధ్య అంత దూరం పెరగడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. అప్పటికి టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఎఎన్నార్ సొంత అన్నదమ్ముల్లా ఉండేవారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఏ విషయం అయినా ఇద్దరూ చర్చించుకునేవారు. అదే సమయంలో ఎఎన్నార్ మద్రాస్ వదిలి హైదరాబాద్ వచ్చేశారు. తనతో సినిమాలు చెయ్యాలనుకునేవారు హైదరాబాద్ రావాలని చెప్పారు. ఎన్టీఆర్ చేసే సినిమాలు అందులోని క్యారెక్టర్స్ దష్ట్యా ఆయనతో ఎక్కువగా ఎస్వీఆర్ నటించేవారు. అక్కినేని సినిమాల్లో ఎక్కువగా గుమ్మడి కనిపించేవారు. దాంతో నెలలో 20 రోజులు హైదరాబాద్లోనే ఉండేవారు గుమ్మడి. చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడం ఎన్టీఆర్కు ఇష్టం లేదు అనే ప్రచారం జోరందుకుంది. ఎన్టీఆర్, ఎఎన్నార్ మధ్య దూరం పెంచేందుకు కొంతమంది కావాలని ఉన్నవి, లేనివి వారికి చెప్పేవారు. ఆ విధంగా ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు కూడా జరిగేవి. తను విన్నదాన్ని బట్టి తనపై హైదరాబాద్లో కుట్ర జరుగుతోందని భావించారు ఎన్టీఆర్. తనకు ఎంతో ఆప్తుడు అనుకున్న గుమ్మడి నెలలో 20 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్నప్పటికీ ఆ విషయాలు తనకు చెప్పకపోవడం ఎన్టీఆర్కు ఆగ్రహం తెప్పించింది. దాంతో గుమ్మడిని దూరం పెట్టడం ప్రారంభించారు. ఆయనతో మాట్లాడడం కూడా మానేశారు. అంతేకాదు, గుమ్మడి ఇంట్లో జరిగిన శుభకార్యాలకు కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు. తనకు సంబంధం లేని విషయంలో ఎన్టీఆర్ తనను దోషిగా చూస్తున్నారని, వారిద్దరి మధ్య తను నలిగిపోతున్నానని గ్రహించిన గుమ్మడి.. ఎన్టీఆర్ను కలిసి అన్ని విషయాలు వివరించే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన ఆ అవకాశం ఇవ్వలేదు. అలా ఐదేళ్లపాటు వారి మధ్య దూరం అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు నిజం తెలుసుకున్న ఎన్టీఆర్.. మళ్ళీ గుమ్మడిని చేరదీశారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’.
Jan 27, 2026బిబి జోడిలో పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి జోకర్స్ అయ్యాం..
బిబి జోడి సీజన్ 2 ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఈ వారం ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్ ఉందంటూ జడ్జెస్ చెప్పారు. అలాగే రెండు రోజుల షోలో ఉన్న కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళ స్కోరింగ్ తెలుసుకున్నాక ఫేస్ ఆఫ్ కి వస్తున్న జోడీస్ గా డీమన్ పవన్ - రీతూ చౌదరి, ఆర్జే చైతు - కీర్తి భట్ అని అనౌన్స్ చేసాడు హోస్ట్. ఐతే ఈ రెండు జోడీలు కూడా పటాకా జోడీలు. వీళ్ళ మధ్య 90 సెకెన్ల డాన్స్ పోటీ పెట్టారు. ఐతే ఆర్జే చైతు జోడి కీర్తి భట్ రాలేదు. "ఆమె అసలు నడవలేకపోతోంది. అందుకే మా దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని వాడుకోవాలనుకుంటున్నాం" అన్నాడు చైతు. ఈ పవర్ అస్త్రాకి ఉన్న పవర్ ఏంటి అంటే "స్వాప్ ది పొజిషన్" వేరే వాళ్ళ పొజిషన్ లోకి వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వీళ్ళ పొజిషన్ కి అంటే ఫేస్-ఆఫ్ లోకి వస్తారన్న మాట. చైతు ఈ అస్త్రాన్ని ధన్రాజ్ - భానుశ్రీతో స్వాప్ చేసుకోవాలని అనుకున్నాడు. దాంతో ధన్రాజ్ - భానుశ్రీ, డీమన్ పవన్ - రీతూ చౌదరి మధ్య పోటీ జరిగింది. చైతు జోడి సేఫ్ జోన్ లో వెళ్ళింది. ఐతే ఫైనల్ లో ధన్రాజ్-భానుశ్రీ ఎలిమినేట్ అయ్యారని జడ్జెస్ అనౌన్స్ చేసి తూచ్ మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం నెక్స్ట్ ఎపిసోడ్ కి అందరికీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది మీకు మైనస్ పై నుంచి స్టార్ట్ అవుతుంది అంటూ శేఖర్ మాష్టర్ చెప్పారు. ఇక వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఐతే ఇక్కడ ఆర్జే చైతు ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో రీసెంట్ గా పెట్టాడు. "జడ్జెస్ ఎలిమినేషన్ లేదని డిసైడ్ అయ్యాక ఇంకా పవర్ అస్త్ర వలన ఉపయోగం ఏంటి ? ఆ పవర్ కి వేల్యూ ఏముంది ? జోకర్లు అయ్యాము ఆ పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి" అంటూ పోస్ట్ పెట్టాడు.
Jan 26, 2026సినీ రంగంలోనే కాదు, వ్యాపార రంగంలోనూ అద్వితీయ విజయాలు అందుకున్న అజాత శత్రువు!
సినీ పరిశ్రమకు రావాలనే ఆలోచన కూడా లేని కొందరు ఆ తర్వాతి కాలంలో నటులుగా, సాంకేతిక నిపుణులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మురళీమోహన్ ఒకరు. మంచి వ్యాపారవేత్త అవ్వాలన్నది ఆయన లక్ష్యం. ఆయన ప్రయాణం కూడా ఆ దిశగానే సాగింది. 23 ఏళ్ళ వయసులోనే విజయవాడలో బంధువులతో కలిసి ఎలక్ట్రికల్ మోటార్స్ వ్యాపారం మొదలుపెట్టారు. అందులో బాగా రాణించి వ్యాపారాన్ని బాగా వద్దిలోకి తీసుకొచ్చారు. ఖాళీ సమయాల్లో మిత్రులతో కలిసి నాటకాలు వేసేవారు. అయితే సినిమాల్లోకి వెళ్లాలి అనే ఆలోచన లేదు. వ్యాపారంలోనే ముందుకు వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. మురళీమోహన్ మిత్రులు మాత్రం సినిమాల్లోకి వెళ్ళమని పదే పదే చెప్పేవారు. అలా ఒకసారి బలవంతంగా ఫోటో సెషన్ చేయించారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 31 ఏళ్ళ వయసులో 1973లో విడుదలైన ‘జగమేమాయ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు మురళీమోహన్. ఇక అక్కడి నుంచి అవకాశాలు రావడం మొదలైంది. హీరోగానే కాకుండా సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘తిరుపతి’, ‘భారతంలో ఒక అమ్మాయి’, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమరదీపం’, ‘జ్యోతి’, ‘కల్పన’, ‘ఆమె కథ’, ‘ప్రేమలేఖలు’ తదితర చిత్రాలతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. హీరోగా నటిస్తూనే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్బాబు, కృష్ణ వంటి హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 53 ఏళ్ల కెరీర్లో 350కి పైగా సినిమాలు చేశారు. ‘ఓ తండ్రి తీర్పు’ సినిమాకిగానూ ఉత్తమ నటుడిగా, ‘ప్రేమించు’, ‘వేగు చుక్కలు’ సినిమాలకిగానూ ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాల్ని అందుకున్నారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ 25కిపైగా సినిమాలు చేశారు మురళీమోహన్. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన దష్టి వ్యాపారం పైనే ఉండేది. హీరో శోభన్బాబు ఇచ్చిన సలహా మేరకు భూమిపై పెట్టుబడి పెట్టారు. జయభేరి గ్రూప్ని ప్రారంభించి రియల్ ఎస్టేట్ రంగంలో జయభేరి మోగించారు. సినిమాలు, వ్యాపారమే కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించారు. 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, 2014లో తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు. ఎక్కువగా జయభేరి గ్రూప్పైనే దష్టి పెట్టారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో విశేషంగా రాణించి సేవలందించిన మురళీమోహన్కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Jan 26, 2026సామాన్యుడి నుంచి ప్రధాన మంత్రి వరకు ఈ నవ్వుల రారాజు అభిమానులే!
నటకిరీటి రాజేంద్రప్రసాద్.. ఆరోగ్యకరమైన హాస్యానికి ఆయన చిరునామా. తెరపై ఆయన కనిపిస్తే చాలు నవ్వులు మొదలవుతాయి. హాస్యాన్ని స్టార్ హీరోలకు సమానంగా తీసుకెళ్లిన ఘనత రాజేంద్రప్రసాద్కి దక్కుతుంది. దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఓ సందర్భంలో తను రాజేంద్రప్రసాద్ అభిమానినని, ఆయన సినిమాలు తరచూ చూస్తుంటానని ప్రత్యేకంగా చెప్పడం రాజేంద్రుడి ప్రతిభకు నిదర్శనంగా చెప్ప్పుకోవచ్చు. కేవలం హాస్య ప్రధాన పాత్రలకే పరిమితం కాకుండా ఎమోషనల్ సీన్స్లోనూ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించగల సమర్థుడు ఈ రాజేంద్రుడు. నవ్వు ఎంత ఆరోగ్యమో అందరికీ తెలిసిందే. అలాంటి ఆరోగ్య మంత్రాన్ని ప్రేక్షకులకు ఉపదేశించి వారికి మానసిక ప్రశాంతత కలిగించడంలో రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్ర అద్వితీయమని చెప్పాలి. 49 ఏళ్ల తన సినీ ప్రయాణంలో 300కిపైగా సినిమాల్లో అన్నిరకాల పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అంతేకాదు, 2009లో ‘క్విక్గన్ మురుగన’ అనే ఇంగ్లీషు చిత్రంతో అంతర్జాతీయంగా కూడా పరిచయమయ్యారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా నటనపై ఉన్న ఆసక్తితో మద్రాస్లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనకు సాన పెట్టారు. ముఖ్యంగా మైమ్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వంటి నటులకు ఇన్స్టిట్యూట్లో క్లాసులు తీసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు సంపాదించేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. పస్తులతో కాలం వెళ్లదీసిన రోజులున్నాయి. నిరాశ, నిస్పహలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తరుణంలో డబ్బింగ్ చెప్పే అవకాశం రావడంతో మొదటి అడుగు అక్కడ వేశారు రాజేంద్రప్రసాద్. డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి దాదాపు 200 సినిమాలకు తన గాత్రాన్ని అందించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘స్నేహం’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించిన ‘ప్రేమించు పెళ్లాడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రాజేంద్రప్రసాద్. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వంశీతో మంచి అనుబంధం ఏర్పడడంతో లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల వంటి బ్లాక్బస్టర్స్లో నటించారు. దాంతో తిరుగులేని కామెడీ హీరోగా స్థిరపడిపోయారు. ఆ తర్వాత జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఇ.వి.వి.సత్యనారాయణ, ఎస్.వి.కష్ణారెడ్డి వంటి దర్శకుల సినిమాల్లో నటించి కామెడీ హీరోగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. హాస్య పాత్రýతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఎర్రమందారం, పుణ్యస్త్రీ, ముత్యమంత ముద్దు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లోనూ రాణించారు. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి సినిమాల్లో బరువైన పాత్రలు పోషించి ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన రాజేంద్రప్రసాద్.. ఎర్రమందారం, ఆ నలుగురు చిత్రాలకిగాను ఉత్తమ నటుడిగా, మేడమ్ చిత్రానికి స్పెషల్ జ్యూరీ, టామీ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం రాజేంద్రప్రసాద్కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
Jan 26, 2026చిరంజీవి సినిమా వల్ల మోసపోయిన కృష్ణంరాజు.. ఏం జరిగింది?
(జనవరి 20 కృష్ణంరాజు జయంతి సందర్భంగా..) 1989 ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. రెబల్స్టార్గా ఎన్నో యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన కృష్ణంరాజుకి ఆ సమయంలో సినిమాలు తగ్గుముఖం పట్టాయి. సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు. అప్పటికి కామెడీ సినిమాల దర్శకుడిగా రేలంగి నరసింహారావుకు మంచి పేరు ఉంది. ఒకరోజు కృష్ణంరాజు నుంచి రేలంగి నరసింహారావుకు పిలుపొచ్చింది. ఓ హోటల్లో ఆయన్ని కలుసుకున్నారు. తమ బేనర్లో ఒక సినిమా చెయ్యాలని రేలంగిని అడిగారు కృష్ణంరాజు. తను కామెడీ సినిమాలు చేసే డైరెక్టర్నని, యాక్షన్ సినిమాలపై తనకు అంత పట్టులేదని చెప్పారు రేలంగి. అయినా సరే ఒక సినిమా చెయ్యమన్నారు. రేలంగి ఓకే చెప్పారు. ఒక రైటర్ చెప్పిన కథను విన్నారు కృష్ణంరాజు, రేలంగి, సూర్యనారాయణరాజు. కథ ముగ్గురికీ బాగా నచ్చింది. సినిమా స్టార్ట్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పాటల రికార్డింగ్కి ముహూర్తం పెట్టారు. మరో వారం రోజుల్లో పాటల రికార్డింగ్. అదే సమయంలో రాజేంద్రప్రసాద్ హీరోగా చిక్కడు దొరకడు సినిమా చేస్తున్నారు రేలంగి. ఆ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్కి సిద్ధమైంది. దాంతో ఆ చిత్ర నిర్మాతలు రేలంగిని పిలిచారు. కృష్ణంరాజు దగ్గర రెండు రోజులు పర్మిషన్ తీసుకొని చిక్కడు దొరకడు సినిమా రిలీజ్ కోసం వెళ్లారు రేలంగి. సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత రేలంగి, ఆ చిత్ర నిర్మాత వెంకన్నబాబు, కెమెరామెన్ శరత్ హోటల్ రూమ్లో రిలాక్స్ అవుతున్నారు. ఆ సమయంలోనే కృష్ణంరాజుతో చేస్తున్న సినిమా గురించి అడిగారు వెంకన్నబాబు. ఆ కథను చెప్పడం మొదలుపెట్టారు రేలంగి. సడన్గా కెమెరామెన్ శరత్ అడ్డు తగిలి ఈ కథ తనకు తెలుసు అన్నారు. దానికి రేలంగి ఆశ్చర్యపోయి ‘ఎలా తెలుసు?’ అని అడిగారు. ‘ఆ సినిమాకి నేను పనిచేశాను’ అని బాంబు పేల్చాడు శరత్. చిరంజీవి, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిరాతకుడు’ సినిమా కథ అది. రేలంగి మొదట నమ్మలేదు. మద్రాస్ వెళ్లిన తర్వాత ఆ సినిమా క్యాసెట్ తెప్పించుకొని చూసి షాక్ అయ్యారు. ‘కిరాతకుడు’ సినిమా కథనే కృష్ణంరాజు సినిమా కోసం చెప్పాడు ఆ రైటర్. అదే విషయాన్ని కృష్ణంరాజు చెప్పారు రేలంగి. మొదట నమ్మలేదుగానీ ఆయన కూడా సినిమా చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు తాను మోసపోయానని. అయితే మరుసటి రోజే పాటల రికార్డింగ్ పెట్టుకున్నారు. మొదట ఆ ప్రాజెక్ట్ ఆపేద్దామని అనుకున్నప్పటికీ అన్ని సినిమాల్లో డూయెట్లు తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి.. రికార్డింగ్ ఆపొద్దని చెప్పారు కృష్ణంరాజు. మరో కథ కోసం వెతుకులాట మొదలుపెట్టారు రేలంగి. అదే సమయంలో ఓంకార్ దగ్గర ఒక కథ ఉందని తెలిసి దాన్ని వినిపించమన్నారు. అది అందరికీ బాగా నచ్చింది. ఆ కథతోనే కృష్ణంరాజు, రేలంగి నరసింహారావు కాంబినేషన్లో సినిమా మొదలైంది. ఆ సినిమా పేరు ‘యమధర్మరాజు’. అయితే ఈ సినిమా కమర్షియల్గా వర్కవుట్ అవ్వలేదు. కానీ, చిరంజీవి సినిమా వల్ల జరిగిన మోసాన్ని మాత్రం అంత త్వరగా మర్చిపోలేకపోయారు కృష్ణంరాజు, రేలంగి నరసింహారావు.
Jan 19, 202672 ఏళ్ల క్రితమే తొలి పాన్ ఇండియా హీరోగా చరిత్ర సృష్టించిన నటరత్న ఎన్.టి.ఆర్.!
(జనవరి 18 నటరత్న ఎన్.టి.రామారావు వర్థంతి సందర్భంగా..) - తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ - తెలుగులో తొలి ద్విపాత్రాభినయ సినిమా - భానుమతి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో పాన్ ఇండియా మూవీస్ రాజ్యమేలుతున్నాయి. టాప్ హీరోలందరూ తాము చేసే సినిమాలు పాన్ ఇండియా లెవల్లో ఉండాలని కోరుకుంటున్నారు. చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా రేంజ్లోనే తమ సినిమా కూడా రిలీజ్ అవ్వాలని ఆశిస్తున్నారు. పలు భాషల్లో రిలీజ్ అయిన ప్రతి సినిమాను పాన్ ఇండియా మూవీగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియ కొత్తదేం కాదు. దాదాపు 72 ఏళ్ళ క్రితమే ఎన్టీఆర్ హీరోగా తొలి పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. ఆ సినిమాకి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం. 1949లో ‘మనదేశం’ చిత్రంతో ఎన్టీఆర్ నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 1951లో ‘పాతాళభైరవి’ చిత్రంతో మాస్ హీరోగా తనేమిటో ప్రూవ్ చేసుకున్నారు. ఇక భానుమతి విషయానికి వస్తే.. 1939లోనే నటిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ విధంగా ఎన్టీఆర్ కంటే భానుమతి చాలా సీనియర్. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘మల్లీశ్వరి’. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి భర్త రామకృష్ణ దర్శకత్వంలో ‘ప్రేమ’ చిత్రంలో నటించారు భానుమతి. ఆ సినిమా జరుగుతున్న సమయంలోనే ‘చండీరాణి’ కథ గురించి చెప్పారు రామకృష్ణారావు. అప్పటికే భానుమతి, రామకృష్ణారావుల సొంత నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు నిర్మిస్తోంది. భర్త చెప్పిన చండీరాణి పాయింట్తో సినిమా చేస్తే బాగుంటుందని భావించారు భానుమతి. అయితే ఈ సినిమాను ఆమెనే డైరెక్ట్ చెయ్యమని చెప్పారు రామకృష్ణారావు. మొదట డైరెక్ట్ చేసేందుకు ఆలోచించినా భర్త దర్శకత్వ పర్యవేక్షణ చేస్తానని చెప్పడంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు భానుమతి. అలా తెలుగు, తమిళ భాషల్లో ‘చండీరాణి’ ప్రారంభమైంది. అయితే రామకృష్ణారావు బయటి సంస్థ నిర్మిస్తున్న ‘బ్రతుకు తెరువు’ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల ‘చండీరాణి’ చిత్రం గురించి పట్టించుకోవడం ఆయనకు కుదరలేదు. దాంతో దర్శకత్వ బాధ్యతలను పూర్తిగా భానుమతే తీసుకున్నారు. తెలుగు, తమిళ్లో ఎన్టీఆర్ను హీరోగా అనుకున్నారు. హిందీలో కూడా చేస్తే ఖర్చు కలిసి వస్తుందని భావించారు భానుమతి. హిందీ వెర్షన్ కోసం దిలీప్కుమార్ను అనుకున్నారు. అయితే ఈ సినిమా కోసం మద్రాస్ వచ్చి వెళ్ళడం కష్టంగా భావించిన దిలీప్ కుమార్.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అప్పుడు హిందీ వెర్షన్కి కూడా ఎన్టీఆర్నే తీసుకున్నారు. అలా మూడు భాషల్లో భరణి పిక్చర్స్ పతాకంపై ‘చండీరాణి’ చిత్రం తెరకెక్కింది. ఇందులో కిశోర్ పాత్రలో ఎన్టీఆర్ నటించగా, చండీగా.. రాణిగా భానుమతి ద్విపాత్రాభినయం చేశారు. 1953 ఆగస్ట్ 28న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ‘చండీరాణి’ ఘనవిజయం సాధించి భరణి సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 1953లోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా మూవీగా ‘చండీరాణి’ చరిత్ర సృష్టించింది. అలా తొలి పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు, తెలుగులో తొలి ద్విపాత్రాభినయ చిత్రం కూడా ఇదే కావడం విశేషం.
Jan 17, 2026అభిమానుల్ని ఏ విధంగానూ బాధపెట్టని ఏకైక హీరో ఎం.జి.ఆర్.!
(జనవరి 17 ఎం.జి.ఆర్. జయంతి సందర్భంగా..) సినిమా తారలకు ప్రజల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హీరోలకు అభిమానులు, అభిమాన సంఘాలు ఉండడం అనేది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. హీరోలు కూడా దానికి తగ్గట్టుగానే అభిమానులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ విషయంలో కొందరు హీరోలు ఒక అడుగు ముందుకు వేసి అభిమానుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు కూడా హాజరవుతుంటారు. తమిళ స్టార్ హీరో ఎం.జి.ఆర్. విషయానికి వస్తే.. అభిమానుల గురించి, ప్రజల గురించి అందరు హీరోల కంటే కాస్త ఎక్కువగానే ఆలోచించేవారు. తన గురించి ఎవరూ తప్పుగా అనుకోకూడదు, తన వల్ల అభిమానులకు, ప్రజలకు ఎలాంటి బాధ కలగకకూడదు అనుకునేవారు. అభిమానుల గురించి అంతగా ఆలోచించే హీరో సినిమా ఇండస్ట్రీలో మరొకరు కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. నటరత్న ఎన్.టి.రామారావు తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రాముడు భీముడు’. 1964లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా డూయల్ రోల్ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్గా మారింది. ఈ సినిమా స్ఫూర్తితో ఇప్పటివరకు వివిధ భాషల్లో 18 సినిమాలు రూపొందాయి. ఎం.జి.ఆర్. హీరోగా ‘ఎంగ వీట్టు పిళ్లై’ పేరుతో తమిళ్లో రీమేక్ చేశారు. ‘రాముడు భీముడు’ చిత్రాన్ని డి.రామానాయుడు నిర్మించగా, ‘ఎంగవీట్టు పిళ్లై’ చిత్రాన్ని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించడం విశేషం. అభిమానుల గురించి ఎంజీఆర్ ఎంత ఆలోచిస్తారు అనే దానికి ఉదాహరణగా ‘ఎంగవీట్టు పిళ్లై’ చిత్రంలోని ఒక సీన్ గురించి చెప్పొచ్చు. సాధారణంగా డూయల్ రోల్ సినిమాలో ఒక హీరో అమాయకంగా ఉంటే, మరో హీరో గడుసుగా ఉంటాడు. ఈ సినిమాలోని ఒక సీన్లో గడుసుగా ఉండే హీరో హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతాడు. ఆ తర్వాత అమాయకంగా ఉండే హీరో దగ్గర డబ్బు వసూలు చేస్తాడు ఆ హోటల్ యజమాని. సినిమాలో ఈ సీన్ ఎంతో కీలకమైంది. మంచి ఫన్ కూడా ఉంటుంది. ఇదే సీన్ తమిళ్లో చేయడానికి ఎంజీఆర్ అభ్యంతరం చెప్పారు. రైటర్ని పిలిచి ‘నేను హోటల్లో టిఫిన్ చేసి డబ్బు కట్టకుండా వెళ్లిపోతే.. ఎంజీఆర్ అలా చేస్తాడా అని నా అభిమానులు ఫీల్ అవుతారు. దాన్ని మార్చండి’ అని చెప్పారు. ‘సినిమాలో అదే ముఖ్యమైన సీన్. దాన్ని మారిస్తే చాలా తేడా వస్తుంది’ అన్నారు రైటర్. ‘అయితే హోటల్లో టిఫిన్ చేసి డబ్బు కట్టకుండా వచ్చినపుడు నేను ఒక డైలాగ్ చెబుతాను. మీకు ఓకేనా’ అని అడిగారు ఎంజీఆర్. దానికి రైటర్, డైరెక్టర్ తాపీ చాణక్య కూడా ఓకే చెప్పారు. ‘నేను టిఫిన్ చేసి డబ్బు ఇవ్వలేదు. కష్టపడి డబ్బు సంపాదించి ఎప్పటికైనా ఆ బిల్ కట్టేస్తాను’ అనే డైలాగ్ చెప్పారు ఎంజీఆర్. అభిమానుల గురించి అంతగా ఆలోచించే ఏకైక హీరో ఎంజీఆర్. అభిమానుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. 1971లో ‘రిక్షాకారన్’ అనే సినిమా చేశారు ఎంజీఆర్. ఆ సినిమా విజయం సాధించిన సందర్భంగా మద్రాస్లో ఉన్న రిక్షా కార్మికులందరికీ స్వెట్టర్లు అందజేశారు. సాధారణంగా ఒక హీరోని అభిమాని కలవడం అంత సులభం కాదు. కానీ, అభిమానులెవరైనా, ఎప్పుడైనా తనను కలవొచ్చు అని చెప్పేవారు ఎంజీఆర్. ఆయన చెప్పినట్టుగానే ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా అభిమానుల్ని కలిసేవారు. ప్రజల గురించి, అభిమానుల గురించి అంతగా ఆలోచించేవారు కాబట్టే ఎంజీఆర్ ప్రజలు మెచ్చిన నాయకుడయ్యారు.
Jan 16, 2026చిన్నతనంలోనే ఎల్.వి.ప్రసాద్ చేసిన సాహసం.. అందుకున్న సాయం!
(జనవరి 17 ఎల్.వి.ప్రసాద్ జయంతి సందర్భంగా..) ఒక సాధారణ వ్యక్తి నుంచి చిత్ర పరిశ్రమలో ఒక మహాశక్తిగా ఎదిగిన అతి కొద్దిమందిలో ఎల్.వి.ప్రసాద్ ఒకరు. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదలతో ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న నిత్యకృషీవలుడు ఎల్.వి.ప్రసాద్. అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో చిన్నతనంలోనే ఒక సాహసం చేశారు. ఆ తర్వాత ఒక మామూలు వ్యక్తి సాయంతో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్నారు ప్రసాద్. ఆయన జీవితంలో విశేషాలు చెప్పుకోదగ్గ ఈ రెండు అంశాల గురించి తెలుసుకుందాం. రైతు కుటుంబంలో జన్మించిన ప్రసాద్.. చిన్నతనం నుంచే చురుకుగా ఉండేవారు. ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా పరిశీలించేవారు. అయితే ఆయనకు చదువు మాత్రం అబ్బలేదు. ఆయన చూపు ఎప్పుడూ ఆ ఊరికి, ఆ చట్టుపక్క ఊళ్ళకు వచ్చే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపులపైనే ఉండేది. అలాగే గుడారాల్లో పాత రీళ్ళతో ప్రదర్శించే సినిమాలను చూసేవారు. అంతేకాదు, నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు. చదువును పక్కన పెట్టి తనకిష్టమైన వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ జీవితాన్ని గడిపేవారు. అప్పటికి ప్రసాద్ వయసు 17 సంవత్సరాలు. ఆరోజుల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. ప్రసాద్కి పెళ్లి చేస్తే జీవితంలో స్థిరపడతాడని తల్లిదండ్రులు భావించారు. అప్పటికే తన మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను ప్రేమించారు ప్రసాద్. ఈ విషయం పెద్ద వారితో చెబితే వాళ్లు ఒప్పుకోలేదు. అతను ఉన్న పరిస్థితి చూసి మేనమామ కూడా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యనన్నారు. దాంతో ఎవరికీ చెప్పకుండా తన మరదల్ని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకున్నారు ప్రసాద్. అప్పుడున్న సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లను బట్టి ప్రసాద్ చేసింది సాహసమనే చెప్పాలి. అలా ఓ ఇంటివాడయ్యారు. పెళ్లయిన తర్వాత కూడా నాటకాలతోనే కాలక్షేపం చేసేవారు. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత తండ్రి ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఆయన అప్పుల బాధలు చూడలేక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 100 రూపాయలు తీసుకొని బొంబాయి వెళ్లిపోయారు ప్రసాద్. అక్కడ అతనికి ఎవరూ తెలీదు. భాష రాదు. తనకిష్టమైన సినిమాలపైనే ఆయన దృష్టి మళ్లింది. ఒక స్టూడియో బయట నిలబడి వచ్చేపోయేవారిని గమనిస్తూ ఉండేవారు. అలా చాలా రోజులు గడిపారు. రోజూ స్టూడియో బయట కనిపిస్తున్న ప్రసాద్ను చూశారు ఒక కాస్ట్యూమర్. ఆ స్టూడియోలో నిర్మాణమయ్యే సినిమాలకు ఆయనే బట్టలు కుట్టేవారు. అక్కడికి దగ్గరలోనే ఆయనకు ఒక టైలరింగ్ షాప్ ఉంది. ఒకరోజు ప్రసాద్ని పలకరించి అన్ని విషయాలు తెలుసుకొని తన షాప్లో ఆశ్రయం ఇచ్చాడు. వీనస్ ఫిలిం కంపెనీలో నెలకు 15 రూపాయల జీతానికి ప్రసాద్ని పనిలో పెట్టాడు ఆ కాస్ట్యూమర్. ప్రసాద్ ఒక మహోన్నత వ్యక్తిగా ఎదగడానికి మొదట చేయూతనిచ్చింది ఆ కాస్ట్యూమరే. ఆ సమయంలోనే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ చిత్రంలో చిన్న పాత్ర పోషించారు ప్రసాద్. ఆ తర్వాత 1931లో ఇంపీరియల్ ఫిలింస్ నిర్మించిన భారతదేశపు మొదటి టాకీ ఆలం ఆరా చిత్రంలో నాలుగు చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఆ తర్వాత హెచ్.ఎం.రెడ్డితో ప్రసాద్కి పరిచయం ఏర్పడిరది. ఆయన తమిళ్లో నిర్మిస్తున్న మొదటి టాకీ కాళిదాసులో నటించే అవకాశం ప్రసాద్కి దక్కింది. ఆ తర్వాత ఆయనే తెలుగులో మొదటి టాకీ భక్త ప్రహ్లాద రూపొందించారు. అందులో కూడా ప్రసాద్ నటించారు. అలా భారతదేశంలో మూడు భాషల్లో నిర్మించిన తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఘనత ఎల్.వి.ప్రసాద్కి దక్కింది. 1930లో బొంబాయి వెళ్లిన నాటినుంచి 15 సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు అనుభవించారు ప్రసాద్. ఆ 15 సంవత్సరాల్లో ఫిలిం రిప్రజెంటేటివ్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ కెమెరామెన్గా, థియేటర్ గేట్మెన్గా, స్క్రీన్ప్లే రైటర్గా.. ఇలా అన్ని శాఖల్లో మంచి అనుభవం సంపాదించుకున్నారు. 1946లో విడుదలైన గృహప్రవేశం చిత్రంలో హీరోగా నటించడమే కాదు, దర్శకుడిగా కూడా పరిచయమయ్యారు. ఆ సినిమాలో భానుమతి హీరోయిన్గా నటించారు. గృహప్రవేశం విజయం సాధించడంతో దర్శకుడిగా ఎల్.వి.ప్రసాద్ ప్రయాణం మొదలైంది.
Jan 16, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com









