ఓడిపొతే కిరణ్, చిరంజీవికి 'తిరు'క్షవరమే
Publish Date:Apr 24, 2012
Advertisement
ఎంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్లు ... తిరుపతి ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ముప్పుగా మారాయి. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాలని, లేకపోతే పార్టీ పరువు పోతుందని ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఎఐసిసి పరిశీలకులు వాయలార్ రవి చెప్పటంతో ఈ ఇద్దరు నాయకుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కిరణ్ స్వయానా చిత్తూరు జిల్లా వాసి. చిరంజీవి గత ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎన్నికయ్యారు. దీంతో ఈ ఉప ఎన్నిక ఇద్దరికీ సవాల్ గా మారింది. అంతేకాక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్ఠ మసకబారి ఆయన పదవికి గండం తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి కేంద్రమంత్రి పదవిని ఆశిస్తున్నారు. తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం లేకుండా పోతుంది. ఇద్దరు నాయకులకు పదవీగండాన్ని తెచ్చిపెట్టబోతున్న తిరుపతి ఉప ఎన్నికలు హఠాత్తుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అందుకే ఇద్దరు నాయకులు ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందునుంచే ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
http://www.teluguone.com/news/content/tirupathi-bypolls-24-13573.html





