ఇరాన్ సంచలన నిర్ణయం...హార్ముజ్ జలసంధిపై గుడ్ న్యూస్!
Publish Date:May 27, 2026
Advertisement
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తున్న సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం దాదాపు ఖరారైంది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు రాబోయే 30 రోజుల్లోగా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ఇరాన్ అధికారికంగా సంచలన ప్రకటన చేసింది. ఈ కీలక పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ కొరత తీరడమే కాకుండా, పెరిగిపోతున్న ఇంధన ధరల నుండి ప్రపంచ దేశాలకు భారీ ఉపశమనం లభించనుంది. గత ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రనేతలు హతమయ్యారు. ఈ ఆకస్మిక పరిణామంతో ఆగ్రహించిన ఇరాన్, ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధించింది. దీంతో గత రెండు నెలలుగా ఈ వ్యూహాత్మక సముద్ర మార్గంలో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అమెరికా కూడా రంగంలోకి దిగి ఏకంగా 3 క్యారియర్ స్ట్రైక్ గ్రూపులతో భారీ నౌకాదళాన్ని మోహరించింది. ఇది 2003 నాటి ఇరాక్ యుద్ధం తర్వాత అమెరికా చేసిన అతిపెద్ద సైనిక మోహరింపు కావడం గమనార్హం. కేవలం మొదటి వారంలోనే అమెరికా సెంట్రల్ కమాండ్ 33 వాణిజ్య నౌకలను వెనక్కి పంపివేసింది. హార్ముజ్ జలసంధి మూతపడటంతో చమురు, ఎల్ఎన్జీ గ్యాస్ ట్యాంకర్లు సముద్రంలోనే నిలిచిపోయి భారత్ వంటి ప్రధాన దిగుమతి దేశాలు ప్రత్యామ్నాయాల కోసం రష్యా, అంగోలా వైపు చూడాల్సి వచ్చింది. ఈ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి తెరవెనుక విస్తృత దౌత్య చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ పరిశీలించినట్లు సమాచారం. ఈ శాంతి చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య ఒక పేజీ ప్రాథమిక ఒప్పందం కుదిరింది. అమెరికా తాత్కాలికంగా 30 రోజుల పాటు ఇరాన్ చమురు ఆంక్షలను సడలించడానికి, అలాగే అంతర్జాతీయ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్కు చెందిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయడానికి అంగీకరించింది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు ఇంధన సంపత్తి (న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్) పై తాత్కాలిక నిషేధాన్ని అంగీకరిస్తూ, హార్ముజ్ జలసంధిని దశలవారీగా తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 30 రోజుల్లో యుద్ధానికి ముందు ఈ మార్గంలో ఏ స్థాయిలో అంతర్జాతీయ రవాణా సాగిందో.. మళ్లీ అదే యథాతథ స్థితిని పునరుద్ధరించనున్నారు. ఈ ఒప్పందం ఖరారైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, చర్చలు అత్యంత సానుకూలంగా సాగాయని, త్వరలోనే పశ్చిమాసియాలో యుద్ధం పూర్తిగా ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని గంటల్లోనే సముద్రంలో నిలిచిపోయిన వందలాది చమురు నౌకల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ అంతర్జాతీయ శాంతి చర్చల పురోగతి మరియు హార్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/strait-of-hormuz-36-221079.html





