నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు
Publish Date:May 27, 2026
Advertisement
హైదరాబాద్ సెంట్రల్ పరిధిలోని నాగోల్లో ఉన్న జగ్జీవన్రామ్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర ఆర్టీఏ సేవలు కొందరు ఏజెంట్ల ద్వారా అక్రమ మార్గాల్లో జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో పలువురు ఏసీబీ అధికారులు ఉదయం నుంచే కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు. కార్యాలయంలో ఉన్న పలు విభాగాల రికార్డులు, ఫైళ్లు, కంప్యూటర్ డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్ల మంజూరు ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సోదాల సందర్భంగా కార్యాలయం బయట సంచరిస్తున్న ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సేవల కోసం వచ్చే ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అధికారులతో కుమ్మక్కై పనులు చక్కబెట్టారనే ఆరోపణలపై వారిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కార్యాలయంలో పనిచేస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు), అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఏఎంవీఐలు)ను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. కొంతమంది సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారా? అక్రమ లావాదేవీలకు సహకరించారా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దాడుల సమయంలో ఏజెంట్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిలోని కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లు, ఆన్లైన్ లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. అధికారులతో జరిగిన సంభాషణలు, డబ్బుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం సాంకేతిక విశ్లేషణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ ఆకస్మిక దాడులతో నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాధారణంగా పనుల కోసం వచ్చిన ప్రజలు కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనించారు. ఏసీబీ అధికారులు సేకరిస్తున్న ఆధారాల ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని సమాచారం.
http://www.teluguone.com/news/content/acb-conducts-surprise-raids-at-nagole-rta-office-36-221031.html





