Top Stories

political-news-img

భోగాపురంలో భారీ భద్రతా వలయం...ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు..!

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు 1న విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బహుళస్థాయి భద్రతా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను తనిఖీ చేసిన ఆయన.. అక్కడి నుంచి భద్రతా పర్యవేక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ నిర్వహణ, జనసందోహం కదలికలను పర్యవేక్షించే విధానాన్ని పరిశీలించారు. ప్రధాని పర్యటన సందర్భంగా సుమారు 3 వేల సీసీ కెమెరాలతో విస్తృత నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయ టెర్మినల్‌ భవనం, సభా ప్రాంగణం, పార్కింగ్‌ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలపై కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. క్రౌడ్‌, ట్రాఫిక్‌, పార్కింగ్‌ పరిస్థితులను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా టెర్మినల్‌ భవనంతో పాటు సభా ప్రాంగణం, థింసా నృత్య వేదిక, ఇతర కీలక ప్రాంతాలను పరిశీలించారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి వచ్చే ప్రతి సందర్శకుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సభా ప్రాంగణంలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని కార్యక్రమం ముగిసిన అనంతరం పెద్ద సంఖ్యలో ప్రజలు, వాహనాలు ఒకేసారి బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డీజీపీ సూచించారు. జాతీయ రహదారిపై వాహనదారులకు ముందుగానే మార్గదర్శనం అందేలా పెద్ద సైజు సైనేజీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రతా విధుల్లో పాల్గొనే సీనియర్‌ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలని డీజీపీ స్పష్టం చేశారు. ఎక్కడా సమన్వయ లోపం లేకుండా ప్రతి విభాగం తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు, భద్రతా విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. PM Narendra Modi, Bhogapuram Airport Inauguration, Alluri Sitarama Raju International Airport, AP Development Projects, Visakhapatnam Semiconductor Plant, PM Modi AP Visit Schedule, CM Chandrababau

Publish Date: Jul 31, 2026 9:23PM

political-news-img

కార్యకర్తల త్యాగాలే మా ఊపిరి..యువగళం జ్ఞాపకాలపై లోకేష్ భావోద్వేగం..!

రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక.. నిలబడి పోరాడే క్షేత్రస్థాయి కార్యకర్తల స్వార్థరహిత త్యాగాల పునాదులపైనే మార్పు రూపుదిద్దుకుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించిన నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ వ్యక్తపరిచిన భావోద్వేగం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తీవ్ర ఆంక్షలు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పసుపు సైన్యం ప్రదర్శించిన తెగువ, చూపించిన ఆత్మీయతను ఆయన గుర్తు చేసుకున్న తీరు సభలోని ప్రతి ఒక్కరి గుండెలను తాకింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో సుదీర్ఘంగా 45 రోజుల పాటు సాగిన 'యువగళం' పాదయాత్ర రోజుల నాటి పరిస్థితులను లోకేష్ భావోద్వేగంతో వివరించారు. ఆ రోజుల్లో అడుగడుగునా ఎదురైన తీవ్ర ప్రతిబంధకాలు, భయానక రాజకీయ వాతావరణం, సరైన పోలీసు భద్రత లేకపోవడం వంటి సవాళ్లను సభ ముందుకు తెచ్చారు. తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికార యంత్రాంగం వైపు నుంచి తగినంత రక్షణ లభించకపోయినా, రోప్ పార్టీ సరిగా లేని సమయంలో కూడా సామాన్య పసుపు సైనికులు స్వయంగా రక్షణ కవచంగా నిలిచారని పేర్కొన్నారు. "నడువు అన్న.. ఎవరు వస్తారో తోలు తీద్దాం" అంటూ సామాన్య గ్రామీణ యువకులు, పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి అండగా నిలబడడం కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు; అది ఒక లోతైన భావోద్వేగ బంధానికి నిదర్శనం. ఈ పోరాట ప్రయాణంలో కేసులు, వేధింపులు, ఆర్థిక నష్టాలను తట్టుకుని నిలబడిన కార్యకర్తల త్యాగమే నేడు పార్టీకి మళ్లీ ఊపిరి పోసిందని లోకేష్ ఆవేదనతో, కృతజ్ఞతతో వ్యాఖ్యానించారు. "ఈ రోజు మేమందరం వేదికపై గౌరవప్రదంగా కూర్చున్నామంటే, దానికి వెనుక ఉంది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అపారమైన త్యాగం" అని విస్పష్టంగా ప్రకారించారు. తమ నాయకుడికి ఆపద వస్తుందేమోనన్న భయంతో స్వయంగా వీధుల్లోకి వచ్చి, కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ దృశ్యాలు తన గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని చెప్పారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన వారిని అధికారంలోకి వచ్చాక కూడా గుర్తుపెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యం. భయం నీడలో జీవించిన ప్రజలకు, కార్యకర్తలకు ఆనాడు లభించిన ధైర్యమే నేటి మార్పుకు బీజం వేసింది. ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా వేదికగా సాగిన ఈ సమావేశం, కేవలం ఒక సాధారణ రాజకీయ ఉపన్యాసంగా కాకుండా, క్షేత్రస్థాయిలో రక్తం చిందించిన సామాన్య కార్యకర్తలకు నాయకుడు అర్పించిన భావోద్వేగ కృతజ్ఞతా నీరాజనంగా నిలిచింది. Nara Lokesh Speech, Nara Lokesh Kurnool Visit, Yuva Galam Padayatra Kurnool, TDP Cadre Sacrifice, Nara Lokesh Emotional Speech, Kurnool TDP Meeting, Lokesh Kurnool Padayatra 45 Days,Telugu Desam Party Activists https://youtube.com/shorts/Q-CVoV6OKuo?si=3ri-MoSdU9wLQZsG

Publish Date: Jul 31, 2026 9:13PM

political-news-img

దేవినేని ఉమాతో విభేదాలున్నాయా?.. ఎమ్మెల్యే వసంత కృష్ణ క్లారిటీ..!

మైలవరం రాజకీయాలు, వీటీపీఎస్ ఫ్లై యాష్ రవాణా వివాదం, పార్టీ అంతర్గత అంశాలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్థానిక సమస్యల పరిష్కారం నుంచి సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుతో కలిసి పనిచేసే అంశం వరకు పలు విషయాలపై స్పందించారు. స్థానిక లారీ యజమానుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు వారి తరఫున తాను చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రిఫెక్స్ సంస్థ ప్రతినిధులు, లారీ అసోసియేషన్‌ల మధ్య అవగాహన కుదిరేలా కృషి చేశామని చెప్పారు. ఒప్పందం ప్రకారం ప్రతి నెల 12 నుంచి 15 లారీల ఫ్లై యాష్‌ను స్థానికులకు ఉచితంగా కేటాయించేలా, అదనంగా అవసరమైతే నిర్ణీత రుసుము చెల్లించి తీసుకెళ్లేలా పరిష్కారం లభించిందని వివరించారు.పార్టీ అంతర్గత అంశాలపై కూడా ఎమ్మెల్యే స్పందించారు. సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుతో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి మహానాడు నిర్వహణలో పార్టీ ప్రోటోకాల్ ప్రకారమే వ్యవహరించానని, తాను జూనియర్ నాయకుడిగా తన బాధ్యతల మేరకే పనిచేస్తానని చెప్పారు.గత ఎన్నికల్లో 43 వేల ఓట్ల భారీ మెజారిటీ టీడీపీ కార్యకర్తలు, కూటమి భాగస్వామ్య పార్టీల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో చర్చలకే ప్రాధాన్యం ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. MLA Vasantha Venkata Krishna Prasadm, Mylavaram MLA, VTPS Fly Ash Issue, Fly Ash Controversy, Refex Company, Lorry Owners Protest,Tender Dispute

Publish Date: Jul 31, 2026 8:21PM

political-news-img

తెలంగాణ ఓటర్ల సవరణ ‘సర్’ గడువు మరోసారి పొడిగింపు..!

తెలంగాణరాష్ట్రంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సమయాన్ని పొడిగిస్తూ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఓటరు నమోదు, సవరణ ఫారాలను సమర్పించేందుకు వీలుగా గడువు తేదీని విస్తరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం, ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించడానికి కొత్తగా ఆగస్టు 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దీంతో గతంలో నిర్దేశించిన ముగింపు తేదీ సవరణకు గురైంది. క్షేత్రస్థాయిలో ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ తొలి విడత గడువు జులై 24 నాటికే ముగియాల్సి ఉంది. అయితే అర్హులైన ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో అధికారులు మొదట దానిని ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. తాజాగా మరోసారి సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ గడువును ఆగస్టు 10కి విస్తరించింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల దిద్దుబాట్లు, చిరునామాల మార్పులతో పాటు నకిలీ ఓట్ల తొలగింపు లక్ష్యంగా అధికారులు ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నారు. అర్హులైన యువ ఓటర్లు జాబితాలో చేరేందుకు బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వర్షాలు, సాంకేతిక సమస్యల కారణంగా కొందరు ఫారాలు అందజేయలేకపోయారని అందిన విజ్ఞప్తుల మేరకు ఈ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు పెంపు నిర్ణయం పట్ల సామాన్య ప్రజల నుంచే కాకుండా పలు రాజకీయ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి ఇది గొప్ప అవకాశమని, తగిన సమయం లభించడం వల్ల ఓటరు నమోదు శాతం మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటరు జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నవారు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సకాలంలో దరఖాస్తులు పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేస్తే, రాబోయే సవరించిన తుది ఓటర్ల జాబితాలో తమ పేరు పొరపాట్లు లేకుండా ఉండేలా చూసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

Publish Date: Jul 31, 2026 7:37PM

political-news-img

సమాజంలో మహిళలు తలెత్తుకుని జీవించాలి : నారా భువనేశ్వరి

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నాలుగు గోడల మధ్యే తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, ఇంటి పనుల ఒత్తిడిలో తమలోని నైపుణ్యాలను, కలలను తొక్కిపెట్టేస్తున్నారు. ఆర్ధికంగా భర్తపైనో లేక తండ్రిపైనో ఆధారపడటంతో, అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైపుణ్యం ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం, అవకాశాలు లేక ఎంతోమంది గృహిణులు నిరాశలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చి, ప్రతి మహిళ సొంత కాళ్లపై నిలబడేలా ఆత్మవిశ్వాసం నింపడమే లక్ష్యంగా కుప్పంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మహిళలతో నేరుగా ముచ్చటించి, వారిలో సరికొత్త ఆశలను, నమ్మకాన్ని చిగురింపజేశారు. ఈ సందర్బంగా భువనేశ్వరి మాట్లాడుతు.. "నేను చేయలేను, నాకు తెలియదు అని ఏ మహిళా అనుకోకూడదు. దేవుడు మనకు అవకాశాలను ట్రస్ట్ రూపంలో పంపాడు. ఆ అవకాశలను అందుకొని మన జీవితాల్లో స్థిరపడాలి" అని ఆమె ఇచ్చిన పిలుపు అక్కడ చేరిన ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది. గృహిణిగా ఉంటూనే కుటుంబ బారాన్ని మోస్తున్న మహిళల శ్రమను, వారిలోని అపారమైన శక్తిని గుర్తుచేస్తూ భువనేశ్వరి మాట్లాడిన మాటలు ఎంతో భావోద్వేగానికి గురిచేశాయి. ఇంటిని సర్ది, పిల్లలకు చదువు చెప్పి, భర్తను ఆప్యాయంగా పంపించి, ఒకే రోజు పది పనులు చేసే సత్తా కేవలం మహిళలకే ఉందన్నారు. అంతటి ఓర్పు, సహనం, శ్రమించే తత్వం ఉన్న స్త్రీలు, ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగులు వేస్తే వారి కుటుంబాల రూపురేఖలే మారిపోతాయని వివరించారు. ట్రస్ట్ ద్వారా మూడు నెలల పాటు మగ్గం వర్క్, చిక్కన్‌కారీ, జూట్ బ్యాగుల తయారీ, బ్యూటీ పార్లర్ వంటి కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా, తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా హైదరాబాద్‌లో 'స్త్రీ హస్తకళా స్టోర్'ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంత మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను నగరాల్లో విక్రయించి, ఆ లాభాలను నేరుగా వారికి అందించే విధానం మహిళల జీవితాల్లో గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బ్యూటీ పార్లర్ కోర్సు పూర్తి చేసి సొంతంగా షాప్ ప్రారంభించిన మహిళల విజయం ఇతరులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. కేవలం కుప్పం మహిళలే కాకుండా, చల్లపల్లి పాఠశాలలో అనాథ, పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు పునాది వేస్తున్న తీరు సభలో హాజరైన వారిని కంటతడి పెట్టించింది. "మన తల్లిదండ్రులు మనల్ని చదివించారు, ఆ తర్వాత మన కాళ్లపై మనం నిలబడి వారిని చూసుకోవాలి. సమాజంలో ప్రతి మహిళ తలెత్తుకొని తిరగాలి" అని ఆమె ఆకాంక్షించారు. ట్రస్ట్ పారదర్శకత, దాతల నమ్మకం గురించి ఆమె వెల్లడించిన విషయాలు సంస్థ పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని మరింత పెంచాయి. ఈ కార్యక్రమం కేవలం ఒక సమావేశంలా కాకుండా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వందలాది మంది గ్రామీణ మహిళల జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏదీ లేదని, మహిళా సాధికారతతోనే ప్రగతి సాధ్యమని ఈ మైదాన నివేదిక స్పష్టం చేస్తోంది. Nara Bhuvaneswari, NTR Memorial Trust, Women Empowerment Telugu, Nara Bhuvaneswari Speech Kuppam, Stree Hastakala Store,Telugu News Ground Report, Skill Development for Women, Kuppam NTR Trust Initiatives

Publish Date: Jul 31, 2026 7:26PM

political-news-img

ఐబీ అధికారి హత్య కేసు... ఆప్ నేతకు జీవిత ఖైదు..!

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 2020 ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల కేసులో న్యాయస్థానం అత్యంత సంచలనాత్మక తుది తీర్పును వెలువరించింది. ఈ ఘర్షణల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) యువ అధికారి అంకిత్ శర్మ అత్యంత దారుణంగా హత్యకు గురైన ఉదంతంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు ఇతర దోషులకు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ఒక ప్రభుత్వ బాధ్యతాయుత అధికారిని దారుణంగా బలితీసుకున్న ఈ నేరం అత్యంత తీవ్రమైనదని, ఇటువంటి చర్యలు సమాజంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో గత నాలుగేళ్లుగా న్యాయం కోసం వేచి చూస్తున్న అంకిత్ శర్మ కుటుంబ సభ్యులకు మరియు దేశ ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించినట్లయింది. 2020 ఫిబ్రవరి నెలలో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో చెలరేగిన హింసాత్మక మత ఘర్షణలు దేశ రాజధానిని తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. అదే సమయంలో ఐబీలో యంగ్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్న అంకిత్ శర్మ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు తీవ్రంగా గాలించగా, చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఒక మురికి కాల్వలో ఆయన మృతదేహం లభ్యమవడం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన శరీరంపై అనేక తీవ్రమైన గాయాలు ఉండటం, పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టారని స్పష్టం చేసింది. ఈ ఘటన అప్పట్లో పార్లమెంట్ సహా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఒక నిఘా విభాగానికి చెందిన అధికారిపైనే ఈ స్థాయిలో దాడి జరగడం భద్రతా వర్గాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలు లోతైన విచారణ చేపట్టాయి. ఈ విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాటి స్థానిక కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ నివాసమే అల్లర్లకు, దాడులకు కేంద్రబిందువుగా మారినట్లు ఆధారాలు లభించాయి. తాహిర్ హుస్సేన్ భవనం పైకప్పు నుంచి పెట్రోల్ బాంబులు, రాళ్లు, యాసిడ్ సీసాలు విసిరినట్లు ప్రత్యక్ష సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలు లభించాయి. అంకిత్ శర్మపై దాడి చేసి, హత్య చేసి మురికి కాల్వలో పడేయడంలో తాహిర్ హుస్సేన్ మరియు అతని అనుచరుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో కోర్టు ముందు నిరూపించాయి. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఏఏపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. న్యాయస్థానంలో సాగిన సుదీర్ఘ విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన ప్రత్యక్ష సాక్ష్యాలు, వైజ్ఞానిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు మరియు కాల్ డేటా రికార్డులను పరిశీలించిన కోర్టు, తాహిర్ హుస్సేన్ మరియు ఇతర నిందితులను దోషులుగా నిర్ధారించింది. ప్రజాప్రతినిధిగా ఉండి సమాజంలో శాంతిని కాపాడాల్సిన వ్యక్తే అల్లర్లకు పురికొల్పడం మరియు హత్యకు కుట్ర పన్నడం క్షమించరాని నేరమని కోర్టు అభిప్రాయపడింది. దోషులందరికీ జీవిత ఖైదుతో పాటు భారీ జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ తీర్పు భవిష్యత్తులో అల్లర్లకు పాల్పడే వారికి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారికి ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సంచలన తీర్పుపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ఒక యువ ఐబీ అధికారి విధి నిర్వహణలో చూపిన ధైర్యం, ఆ తర్వాత జరిగిన దారుణ హత్య సమాజాన్ని ఎంతగానో కలచివేశాయి. నాలుగేళ్ల చట్టపరమైన పోరాటం తర్వాత లభించిన ఈ తీర్పు న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచింది. అంకిత్ శర్మ త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన కుటుంబానికి లభించిన ఈ చట్టపరమైన విజయం దేశ రక్షణ మరియు నిఘా వర్గాలకు పెద్ద ఊరటగా నిలిచింది. Ankit Sharma murder case, Tahir Hussain life imprisonment, Delhi riots 2020 verdict, IB officer Ankit Sharma, Delhi court judgment, AAP ex councillor Tahir Hussain

Publish Date: Jul 31, 2026 7:04PM

MOVIE NEWS