కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్ర వల్లే రైతులు కన్నీరు : ఎంపీ ఈటల
Publish Date:May 27, 2026
Advertisement
బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన బీజేపీ బృందం చేపట్టిన ‘రైతు గోస - బీజేపీ భరోసా’ యాత్ర మూడవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని రూరల్ పరిధిలోని గుంజపడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. గత మూడు రోజులుగా తాము వికారాబాద్ జిల్లా కులకచర్ల నుండి ప్రారంభించి వందల కిలోమీటర్ల మేర క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన వరి, మక్కజొన్న, సన్ఫ్లవర్ కుప్పలే దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే పంట చేతికి వచ్చినా, గత 30 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్లే ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ధాన్యం కొండల్లా పేరుకుపోయిందని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో గోనె సంచులు, అమాలీలు, తూకం కాంటాలు, క్లీనింగ్ మిషన్లు లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఈటల తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ సభల కోసం హైదరాబాద్ డిపోల నుండి వందలాది బస్సులను పంపించగలరు కానీ, అన్నదాతల ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీలను సమకూర్చలేకపోతున్నారని ఈటల విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఇసుక రవాణా చేసే వేలాది లారీలను కనీసం మూడు నాలుగు రోజుల పాటు నిలిపివేసి, ధాన్యం తరలింపునకు ఉపయోగిస్తే పంట కళ్ల ముందే నానిపోకుండా, మొలకలు రాకుండా కాపాడుకునే వాళ్ళమని రైతులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఎండ దెబ్బకు, కొనుగోళ్లు జరగని ఆవేదనతో కొందరు రైతులు గుండె పగిలి చనిపోతుంటే, మరికొందరు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారని, మహిళా రైతులు చిన్న పిల్లలను వేసుకొని వరికుప్పల మీదనే రాత్రింబవళ్లు పడుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మద్దతు ధర అడిగిన రైతులపై సంకెళ్లు వేస్తే, ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కాటారంలో ధర్నా చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించిందని మండిపడ్డారు. ఆనాటి బీఆర్ఎస్ అయినా, ఈనాటి కాంగ్రెస్ అయినా రైతుల బతుకుల్లో మట్టి కొడుతున్నాయే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. రైతులకు అండగా నిలబడటానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికే బీజేపీ నాయకుల బృందం క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల సందర్శనకు వచ్చి రైతుల పక్షాన నిలిచేందుకు వచ్చామని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీస్తూ రైస్ మిల్లర్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలని, రైతులను బానిసల్లాగా చూసే పిచ్చి వేషాలు మానుకొని మిల్లులకు సరుకు రాగానే గౌరవప్రదంగా దించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/rythu-gosa--bjp-bharosa-yatra-36-221084.html





