కాంగ్రెస్ భవిష్యత్తుకు సవాల్ గా మారిన కడప ఉన ఎన్నికలు?
Publish Date:May 16, 2012
Advertisement
మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు కడప ఉప ఎన్నికలు సవాల్ గా మారాయి. ఈ జిల్లాలోని రాజంపేట, రాయచోటి అసెంబ్లీస్థానాలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవకపోతే ఆ పార్టీ భవిష్యత్తు రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటిదాకా పెత్తనం చేసిన ప్రధాన నేతలు పదవులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ఇక్కడి కేడర్ ను ఉత్తేజపరిచే విషయంలో శ్రద్ధచూపుతున్నారు. వై.ఎస్.ఆర్. సొంత జిల్లా అయినందున ఇక్కడ కనుక కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, జగన్ లపై దాని ప్రభావముంటుంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జగన్ సరైన వ్యూహం రచించారని అభినందనలు అందుకున్నారు. ఈ అభినందనలు కాంగ్రెస్ లో ప్రకంపనాలు సృష్టించింది. ఇటీవల జరిగిన సర్వేలు కూడా జగన్ కు అనుకూలంగా రావటంతో ఈ జిల్లా పరిస్థితిపై ఎఐసిసి తన గూఢచారులను పెట్టుకుంది. తమ పార్టీ రాష్ట్రనేతలు చేసే ప్రసంగాలు ఏమైనా ఓట్లగా మలచుకోవటానికి ఉపయోగపడతాయా? లేదా? అన్న కోణం లో ఎఐసిసి పరిశీలిస్తోంది. దీంతో రాష్ట్ర నేతలు కూడా కడపజిల్లా ఎన్నికల్లో విజయం కోసం చేయాల్సిన పని ఏమిటని ప్రశ్నించి కార్యకర్తలకు వరాలను ఇస్తున్నారు. ఈ వరాలు కూడా తమకు ఓట్లను తెచ్చిపెడతాయని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అలానే మంత్రి సి. రామచంద్రయ్య మాట్లాడుతూ జూన్ 15 తరువాత అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. సిఎం పర్యటనకు ముందుగానే ఈ జిల్లాకు వచ్చిన పీసీసీ చీఫ్ బొత్సా సత్యన్నారాయణ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. జగన్ వక్రీకరించినా రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని సిఎం కిరణ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇలా కడపజిల్లాలో ఓటర్లను ఆకర్షించి తమ హోదాలను కొనసాగించేందుకు వారు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో భవిష్యత్తులోనే తేలుతుంది.
http://www.teluguone.com/news/content/prestegious-issue-for-congress-party-in-cuddapah-24-14080.html





