నెల్లూరులో పోటీ వెనుక సుబ్బిరామిరెడ్డి వ్యూయం ఏమిటి?
Publish Date:Apr 24, 2012
Advertisement
నెల్లూరు లోక్ సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి పోటీ చేయబోతున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో తాజా మాజీ మేకపాటి రాజమోహన రెడ్డి తట్టుకుని గెలవటం కష్టమైనప్పటికీ సుబ్బిరామిరెడ్డి రిస్కు తీసుకుని పోటీ చేస్తున్నారు. ఏ విషయాన్నైనా ప్రతిష్ఠ, డబ్బుతో ముడిపెట్టి ఆలోచించే తిక్కవరపు ఈ ఎన్నికల్లో పోటీ చేయటం వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అన్న తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఆయన కనీసం పది నుంచి 15 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు చేసినా ఒకవేళ ఓడిపోతే పరువు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం తెలిసినా తిక్కవరపు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సుబ్బిరామిరెడ్డి అధిష్టానం ఇచ్చిన హామీతోనే రంగంలోకి దిగారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినందుకు ప్రతిఫలంగా ఆయన గెలిచినా గెలవకపోయినా తరువాత కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిందని అందుకే ఆయన నెల్లూరు బరిలో దిగారని వారు అంటున్నారు. నిజానికి సుబ్బిరామి రెడ్డి కేంద్రమంత్రి పదవితో పాటు సుస్థిరమైన లోక్ సభ స్థానంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి పోటీ చేయాలన్న తన వాంఛను కూడా ఆయన బయటపెట్టుకునారు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతుండటంతో నెల్లూరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/nellore-loksabha-bypolls-24-13571.html





