కొండా సురేఖపై వేటే.!
Publish Date:Aug 25, 2026
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గత కొన్ని రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల పై వేటు తప్పదని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. వీరిద్దరి వ్యాఖ్యలు, వైఖరిపై విచారణ జరిపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్కుమార్ గౌడ్కు అందజేసింది. ఆ నివేదికలో కొండా, చిన్నారెడ్డిలపై వేటుకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ తమ నివేదికను పీసీసీ అధ్యక్షుడికి సీల్డ్ కవర్ లో సమర్పించారు. పార్టీ నియమావళి, క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలకు స్పష్టమైన, గట్టి హెచ్చరిక పంపాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో వారు పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ పార్టీ పార్టీ నియమాలు, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడటం ఇది మూడోసారి కావడంతో ఆ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ నివేదికలో ప్రస్తావించి.. ఇక ఉపేక్షించడం కరెక్ట్ కాదని పేర్కొన్నట్లు చెబుతున్నారు. తాజా వ్యవహారంలో కూడా కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను వెంటనే ఖండించలేదని పేర్కొంటూ.. ఆమె తీరును చూసీ చూడనట్లు వదిలేస్తే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెడతాయని నివేదిక విస్పష్టంగా పేర్కొన్నట్ల కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇక చిన్నారెడ్డి విషయంలో కూడా కమిటీ చర్యలకు సిపారసు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో చాలా కాలంగా ఉంటూ, కీలక పదవులు, బాధ్యతలు నిర్వహించిన చిన్నారెడ్డి, ఇప్పుడు కేబినెట్ హోదా ర్యాంకులో ఉండి కూడా పార్టీ అంతర్గత విషయాలను పార్టీ వేదికలపై కాకుండా బహిరంగంగా మాట్లాడటం సరికాదని క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. అదలా ఉంటే నివేదిక సమర్పించిన అనంతరం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి కొండా సురేఖ, చిన్నారెడ్డి అందించిన వివరణ లేఖల ఆధారంగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. ఆ ఇద్దరు నేతలూ కూడా క్రమశిక్షణ కమిటీని వ్యక్తిగతంగా కలవలేదనీ, తమ ఎక్స్ ప్లనేషన్ ను గాంధీభవన్లో సమర్పించారని చెప్పారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీకి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండాలంటే క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉండక తప్పదని మల్లు ఈ సందర్భంగా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. Konda Surekha, Chinna Reddy, TPCC Disciplinary Committee, Mallu Ravi, Mahesh Kumar Goud, Telangana Congress, eluguOne
http://www.teluguone.com/news/content/konda-surekha-24-229861.html





