పాక్ మళ్ళీ మాట మార్చింది
Publish Date:Jul 13, 2015
Advertisement
రెండు రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు రష్యాలో సమావేశమయినప్పుడు, పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతున్నముంబై ప్రేలుళ్ళ సూత్రధారి జాకి ఉర్ రెహమాన్ న్ని శిక్షించేందుకు సహకరించాలని ప్రధాని మోడీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కోరినప్పుడు అందుకు ఆయన అంగీకరించారు. ఆ తరువాత ఇరు దేశాల విదేశీ కార్యదర్శులు కలిసి ఇదే విషయం దృవీకరిస్తూ ఒక ప్రకటన కూడా చేసారు. కానీ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ చేరుకోగానే షరా మామూలుగానే మాట మార్చారు. ముంబై ప్రేలుళ్ళ కేసును విచారిస్తున్న రావాల్పిండి కోర్టు నిందితుని గొంతును గుర్తించేందుకు వాయిస్-సాంపిల్స్ సేకరించే చట్టం ఏదీ పాకిస్తాన్ రాజ్యాంగంలో లేదని నాలుగేళ్ల క్రితమే తేల్చి చెప్పిందని, కనుక మళ్ళీ దాని కోసం కోర్టులో కొత్తగా మరో పిటిషన్ వేసే ఆలోచన తమకు లేదని ప్రభుత్వ ప్రాసిక్యూషన్ ప్రధాన న్యాయవాది చౌదరి అజహర్ తేల్చి చెప్పారు. నిందితుడు తనంతట తానుగా వాయిస్-సాంపిల్స్ ఇచ్చేందుకు అంగీకరిస్తే తప్ప భారత ప్రభుత్వం కోరినట్లు లక్వీ వాయిస్-సాంపిల్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశం గురించి చర్చల్లో ఎక్కడా ప్రస్తావించకుండా, మోడీ కోరినట్లు లక్వీకి శిక్ష పడేందుకు సహకరిస్తామని చెప్పడం, అదే విషయాన్ని భారత్, పాక్ విదేశంగా కార్యదర్శులు మీడియాముందు ప్రకటించడంతో పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు, ప్రభుత్వం మీద పెత్తనం చేస్తున్న కొందరు సైన్యాధికారులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ విధంగా చేయడం ద్వారా ముంబై ప్రేలుళ్ళకు పాల్పడిన ఉగ్రవాదిని పాక్ ప్రభుత్వమే రక్షిస్తోందని, అతనికి శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉందని యావత్ ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒప్పుకొన్నట్లయిందని పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు పాక్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉగ్రవాదం గురించి కూడా పాకిస్తాన్ విదేశంగా కార్యదర్శితో ప్రకటన చేయించడంలో మోడీ కృతకృత్యుడయ్యారు. కానీ పాక్ ప్రధాని కాశ్మీర్ అంశం గురించి భారత విదేశంగా కార్యదర్శితో ప్రకటన చేయించలేకపోయారని పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ మాయలో పడి నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ దేశాన్ని యావత్ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారని అందరూ నవాజ్ షరీఫ్ పై విరుచుకుపడుతున్నారు. నేరకపోయి లక్వీకి శిక్ష పడేందుకు సహకరిస్తామని ప్రకటించినందుకు ఇప్పుడు పాక్ ప్రభుత్వం లెంపలు వేసుకొంటూ రావల్పిండి కోర్టు వ్యాఖ్యలు, పాకిస్తాన్ చట్టాలని అడ్డుపెట్టుకొని మాట మార్చింది. కానీ ఇరు దేశాల విదేశంగా కార్యదర్శుల ప్రకటనతోనే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అయినా ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దం ఎందుకన్నట్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులని పెంచి పోషిస్తోందని నొక్కి చెప్పడానికి ఇటువంటి ప్రకటనలు అవసరమా?పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర భూతానికి ఆ దేశ ప్రజలు చిన్నారులే బలయిపోతున్న సంగతి లోకానికి తెలుసు. కానీ పాక్ ప్రభుత్వంపై సైమ్యం కర్ర పెత్తనం చేస్తునంత కాలం పాక్ తీరు మారదు.
http://www.teluguone.com/news/content/india-45-48279.html