రేవంత్, కేసీఆర్ పాలనకు తేడా లేదు.. ఈటల రాజేందర్ ఆగ్రహం..!
Publish Date:Aug 28, 2026
Advertisement
కేంద్రం బియ్యమిస్తే మీ ఫొటోలేంటి.. ధ్వజమెత్తిన ఈటల..! తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు ఎలాంటి తేడా లేదని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా ఉందంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఐదు కిలోల సన్న బియ్యం పథకంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఎక్కడా ప్రదర్శించడం లేదని, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరి జాగీరని వారి ఫొటోలు వేసుకుంటున్నారని ఈటల ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం భాగస్వామ్యం స్పష్టంగా ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినప్పుడు మోదీ ఆశీస్సులు కోరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి తిరిగి వచ్చాక విమర్శలు గుప్పించడం ఆయన ద్వంద్వ విధానానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. కేంద్రం ఇస్తున్న భారీ నిధుల వల్లే రాష్ట్రంలో రహదారులు, రైల్వే వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారత్ గురించి ప్రతికూల ప్రచారం చేయడంపై ఈటల అసహనం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే లుంబిని పార్క్, గోకుల్ చాట్ వంటి ఘోర బాంబు పేలుళ్లు జరిగాయని, దేశభద్రత విషయంలో కాంగ్రెస్కు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ స్థలాలను, లబ్ధిదారుల కోటాను తమ వర్గానికే కేటాయించుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆధిపత్య ధోరణిని ఎండగడుతూ, "ఇది ఎవరి తాత జాగీరు కాదు" అంటూ ఈటల నిప్పులు చెరిగారు. మెట్రో విస్తరణ, ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. మల్కాజ్గిరి, మేడ్చల్ ప్రాంతాల్లో రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీ (ROB), ఆర్యూబీ (RUB) పనుల ఆలస్యం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈటల ప్రస్తావించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని కలిసి చర్చించినట్లు తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద మేడ్చల్, మల్కాజ్గిరి స్టేషన్ల ఆధునీకరణకు కేంద్రం రూ.22 కోట్లు కేటాయించిందని వివరించారు. రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్ వైఫల్యాలను, కాంగ్రెస్ నేతల అక్రమాలను ప్రజాక్షేత్రంలో గట్టిగా ఎండగడతామని ఈటల స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి రాజకీయ ప్రచారాలకే పరిమితమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Etala Rajender, Revanth Reddy, Telangana Congress, BJP Telangana, Telangana Politics,
Eetala Rajender raises flag against Revanth government
http://www.teluguone.com/news/content/etala-rajender-24-230145.html





