విశాఖ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో విభేదాలు
Publish Date:Apr 23, 2012
Advertisement
విశాఖజిల్లా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు నానాటికీ ముదిరిపోతున్నాయి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో ఇంకా చేరకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నా పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి వైఖరిపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్బం హరి పార్టీలో చేరకపోయినా పెత్తనం మాత్రం చెలాయిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అనకాపల్లిలో ఇటీవల పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ, సబ్బం హరి వర్గీయుల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకోవటంతో విభేదాలు రోడ్డున పడ్డట్టు అయ్యింది. అనకాపల్లికి జగన్ వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలుకుతూ కొణతాల రామకృష్ణ, సబ్బం హరి వర్గీయులు ఫ్లెక్సీ బ్యానర్లు కట్టారు. అయితే ఈ రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఒకరు ఏర్పాటు చేసిన బ్యానర్లను మరొకరు చించివేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాల వారు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాల వారినీ చెదరగొట్టాల్సి వచ్చింది. సబ్బం హరి అసలు ఏ పార్టీలో ఉన్నాడో ముందు తేల్చాలని కొణతాల రామకృష్ణ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య తగాదాలు పార్టీ అధినేత జగన్ కు తలనొప్పిగా మారాయి.
http://www.teluguone.com/news/content/differences-in-vishakapatnam-district-ysr-congress-leaders-24-13558.html





