ఇద్దరు మహేశ్లు.. ఎవరు బావున్నారు?
on Mar 25, 2019
మహేశ్బాబు పక్కనే మహేశ్బాబు నిలబడితే ఎలా ఉంటుంది? సోమవారం హైదరాబాద్లోని ఏఎంబీ మల్టీప్లెక్స్లో ఈ దృశ్యం కనిపించింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం సింగపూర్ రూపొందించిన మహేశ్బాబు మైనపు ప్రతిమ (వాక్స్ స్టాట్యూ)ను మహేశ్బాబు ఆవిష్కరించారు. త్వరలో ఈ ప్రతిమను సింగపూర్ తరలిస్తారు. అక్కడ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్ బచ్చన్, షారూఖ్ఖాన్, అనుష్కాశర్మ తదితర స్టార్స్ స్టాట్యూల సరసన మహేశ్ స్టాట్యూ కూడా కొలువు దీరుతుంది. సింగపూర్ వెలుపల టుస్సాడ్స్ మ్యూజియంకు చెందిన ఓ మైనపు ప్రతిమను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. మహేశ్బాబు మాట్లాడుతూ ‘‘నా స్టాట్యూను నేనే చూసుకుంటుంటే ఆనందంగా, అద్వితీయంగా, గొప్పగా, ఉత్కంఠగా, ఒకింత భయంగా ఉందని మహేశ్బాబు అన్నారు. ఒకసారి టుస్సాడ్స్ వాళ్లు ఫొటోలు పంపారు. స్నేహితుల్లో కొందరికి పంపగా... నేనే అనుకున్నారు. ఏదో ఫొటోషూట్ చేశానని అనుకున్నారు. ఇంత రియల్గా స్టాట్యూ చేసినవాళ్ళకు థ్యాంక్స్’’ అన్నారు. మహేశ్ సతీమణి నమ్రత మాట్లాడుతూ ‘‘ఇద్దరు మహేశ్లను చూసినట్టుంది’’ అన్నారు. ఇద్దరిలో ఎవరు బావున్నారని ఆమెను మీడియా ప్రశ్నించగా ‘‘రియల్ మహేశ్ అందంగా ఉన్నారు. ఆయనంత అందంగా స్టాట్యూలో వ్యక్తి ఉన్నారు’’ అని సమాధానం ఇచ్చారు.