ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి...మహానాడులో చారిత్రక తీర్మానం!
Publish Date:May 28, 2026
Advertisement
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు దేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న'ను ప్రకటించాలంటూ తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ 'మహానాడు' వేదికగా ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన అన్నగారికి ఈ గౌరవం దక్కడం ప్రతి తెలుగువాడి ఆకాంక్ష అని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో చాటాయి. మహానాడు ప్రతినిధుల సభలో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, వాటిని భావితరాలకు అందించడం మనందరి ప్రాథమిక బాధ్యతని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్ చూపిన ప్రజాసేవ మార్గంలోనే ప్రస్తుత ప్రభుత్వం పయనిస్తోందని, అందులో భాగంగానే నారా లోకేష్ మహిళలకు రాజకీయాల్లో 33 శాతం సీట్ల కేటాయింపు ప్రకటన చేశారని గుర్తుచేశారు. తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు.. ఆయన సృష్టించిన చరిత్ర కాలగర్భంలో కలిసిపోయేది కాదన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన కేవలం తొమ్మిది నెలల స్వల్ప వ్యవధిలోనే అధికారాన్ని కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారని, దేశ రాజకీయ చరిత్రలోనే ఇదొక అద్భుతమని శ్లాఘించారు. వెండితెరపై ఆయన పోషించిన పౌరాణిక, చారిత్రక పాత్రలను తిరిగి పోషించడం ఎవరికైనా అసాధ్యమని స్పష్టం చేశారు. పార్టీ స్థాపన సమయం నుంచి ఎన్టీఆర్ నమ్మిన సిద్ధాంతం 'సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు' అని, ఈ నినాదమే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ దిక్సూచిగా ఉంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. దేశానికి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ప్రగతికి ఆయన చేసిన అమోఘమైన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి భారతరత్న అవార్డును ప్రకటించాలని మహానాడు సభ ద్వారా డిమాండ్ చేశారు. ఈ చారిత్రాత్మక తీర్మానానికి మహానాడుకు విచ్చేసిన ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ పరిణామం పట్ల అటు నందమూరి అభిమానులు, ఇటు తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సానుకూల పరిస్థితుల నేపథ్యంలో, ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం దక్కేలా ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోట్లాది మంది తెలుగువారి దశాబ్దాల కల అయిన ఈ డిమాండ్ త్వరలోనే సాకారమవుతుందని తెలుగుదేశం శ్రేణులు బలంగా ఆశిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/tdp-mahanadu-36-221126.html





