కొండా సురేఖ విషయం అధిష్ఠానానికే వదిలేసిన రేవంత్.!
Publish Date:Aug 25, 2026
Advertisement
తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సారి స్పందించారు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ లో కలకలం రేపింది. సుస్మిత రేవంత్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, తిరిగి వచ్చిన తరువాత ఈ విషయంపై స్పందిస్తూ.. ఈ వివాదాన్ని తాను స్వయంగా పరిష్కరించబోనని, పార్టీ అధిష్టానం, క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుంటుందనీ స్పష్టం చేశారు. మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన కొండా సురేఖ, ఆమె కుమార్తె వ్యవహారంపై మాట దాటవేయలేదు. మీడియా ప్రశ్నలకు సూటిగానేరుగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ లో పార్టీ క్రమశిక్షణ కంటే ఎవరూ ఎక్కువ కాదని చెప్పిన సీఎం.. తానైనా, మంత్రి సురేఖ అయినా క్రమశిక్షణా సంఘం విధించే నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. పార్టీలో ఎవరి వ్యక్తిగత ప్రాధాన్యతలు లేదా రాజకీయ కోణాలు పనిచేయవని వ్యాఖ్యానించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉందని, అనుభవం ఉన్న సీనియర్ నాయకులు క్రమశిక్షణా సంఘంలో ఉన్నారని గుర్తుచేశారు. నేతలు ఎవరైనా గాడి తప్పుతున్నారని వార్తలు వచ్చినా లేదా ఫిర్యాదులు అందినా క్రమశిక్షణా సంఘమే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటుందన్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని విస్పష్టంగా చెప్పారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమె వివరణ కూడా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేసిన సురేఖ కుమార్తె సుస్మితను ఇకపై కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంచాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక పోతే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను జోక్యం చేసుకోకుండా విషయాన్ని అధిష్టానానికి వదిలేయడం ద్వారా ఈ వివాదానికి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Revanth Reddy leaves Konda Surekha issue to high command, Telangana Congress, Konda Susmitha, Revanth Reddy Press Meet, Congress High Command
http://www.teluguone.com/news/content/revanth-reddy-leaves-konda-surekha-issue-to-high-command-24-229811.html





