జడ్జీలపై దూషణలకు.. జగన్ సర్కారుకు లింకు!?
Publish Date:Feb 11, 2022
Advertisement
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందెవరు? వైసీపీ నేతలు, అభిమానులు, జగన్ వీరాభిమానులు మాత్రమేనా? వారంతట వారే జడ్జీలను దూషించారా? లేక.. జగన్ సర్కార్ స్వయంగా కొందరి చేత ఈ పని చేయించిందా? 'దూషణల' మూలాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 'డిజిటల్ కార్పొరేషన్'లోనూ ఉన్నాయా? సీబీఐ తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ ఔను' అనే సమాధానం వస్తోంది. వెరసి.. ఈ వివాదం జగన్ సర్కార్ మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదనిపిస్తోంది. జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అవుతు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిస అలియాస్ కిషోర్ రెడ్డి దరిస, సుద్దులూరి అజయ్ అమృత్లను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జడ్జిలపై కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాల ఆధారంగా వెతుకుతూ పోయినప్పుడు.. డిజిటల్ కార్పొరేషన్ లో డొంక కదిలినట్లు తెలుస్తోంది. జడ్జీలపై పోస్టులను అక్కడే తయారుచేయించి, అక్కడి నుంచే సోషల్ మీడియాలోకి వదిలినట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీనికి సంబంధించి డిజిటల్ మీడియాకు చెందిన ఏడుగురు ఉద్యోగులను ప్రశ్నించినట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో జడ్జీలపై పెట్టిన అనుచిత వ్యాఖ్యలు అప్ లోడ్ అయిన ఐపీ అడ్రస్ లను సీబీఐ గుర్తించిందని, వాటిలో ప్రభుత్వానికి చెందిన ఈ-ప్రగతి, డిజిటల్ కార్పొరేషన్లకు చెందిన ఐపీ అడ్రస్ లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 'డిజిటల్ కార్పొరేషన్’ అనే ప్రత్యేక సంస్థను జగన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. మంగళగిరిలో దీనికి ఒకపెద్ద కార్యాలయం ఉంది. డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. కానీ.. అంతకుముందు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన అనేకమందికి డిజిటల్ కార్పొరేషన్ ళక్షఉపాధి కల్పించారు. జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ కు చెందిన 'ఐ-ప్యాక్ బృందంలోని కొందరు కూడా ఇందులో పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.70 వేల దాకా జీతాలు అందుతున్నాయి. అంతకు ముందు వీరి జీతాలను వైసీపీయే చెల్లించేది. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఖాతా నుంచి చెల్లిస్తుండడం గమనార్హం. ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి వీరంతా ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ..వైసీపీ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జడ్జిలపై సోషల్ మీడియా పోస్టులకు మూలాలు 'డిజిటల్ కార్పొరేషన్ లో ఉన్నట్లు సీబీఐ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అది పూర్తిస్థాయిలో నిర్ధారణ అయితే.. సర్కార్ కు ఇక్కట్లు తప్పవని చెప్పొచ్చు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యల పోస్ట్ పెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ మారుతీ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయన ఎమ్మెల్సీ ఇక్బాల్ కు ముఖ్య అనుచరుడు. ఢిల్లీ, బెంగళూరుకు చెందిన ఒక డీఎస్పీ, ఇద్దరు ఇన్ స్పెక్టర్లు మారుతీ రెడ్డి ఇంటిలో 12 గంటల పాటు విచారణ కొనసాగించారు. మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీని సీజ్ చేసి మరీ విచారించడం విశేషం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారులు హిందూపురం వెళ్లడం గమనార్హం. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబర్ 11న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది సీబీఐ. ఇక.. ఇదే కేసులో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బుడ్డాయిపల్లికి చెందిన గంజికుంట మల్లికార్జున్ అనే వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ తతంగాన్ని చూస్తుంటే జగన్ సర్కార్ ఇరుకున పడే ఛాన్స్ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/is-jagan-government-link-with-comments-on-judges-39-131612.html





