ట్రబుల్ షూటర్ నుంచి సీఎం వరకూ.. డీకే ప్రస్థానం
Publish Date:May 28, 2026
Advertisement
కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. కాంగ్రెస్ విశ్వాసపాత్రుడు, ఆపద్బాంధవుడుగా నిలిచిన డీకే శివకుమార్ రాష్ట్ర అత్యున్నత పీఠాన్ని అందుకోనున్నారు. ప్రత్యర్థులకు కనకపుర బండ, సొంత పార్టీకి ట్రబుల్ షూటర్’గా గుర్తింపు తెచ్చుకున్న డీకే శివకుమార్ కర్నాటక సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. ఇక డీకే ప్రస్థానం ఎలా సాగిందన్నది చూస్తే.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో డీకే శివకుమార్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 80వ దశకంలో ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా ప్రారంభించిన ఆయన.. 1989లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, రాజకీయాల్లో అపజయం ఎరుగని నేత తిరుగులేని పట్టు సాధించారు. ఒక్క కర్నాటక అనే కాదు.. దేశంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. ఆ కష్టం తీర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడూ డీకే శివకుమార్ వైపే చూసేది. రిసార్ట్ రాజకీయాలైనా, ఎమ్మెల్యేలను కాపాడుకోవడమైనా ఆయన వ్యూహాలకు తిరుగుండేది కాదు. అందుకే ఆయనను పార్టీ ట్రబుల్ షూటర్ గా భావించేది. డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్ట్ చేసి 50 రోజుల పాటు తిహార్ జైలులో ఉంచింది. ఆ అరెస్టుపై డీకే శివకుమార్ పలు సందర్భాలలో తనకు రెండు దారులు చూపారనీ, వాటిలో ఒకటి బీజేపీలో చేరడం రెండో ది జైలుకు వెళ్లడం. అయితే తాను రెండో దారినే ఎంచుకున్నాననే ఆయన.. , జైలుకే వెళ్లాను కానీ పార్టీ మారలేదుచెప్పుకొచ్చారు. ఆయన జైలులో ఉన్న సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా తిహార్ జైలుకు వెళ్లి ఆయనను పరామర్శించడం అప్పట్లో దేశ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మరింత పట్టుదలగా పనిచేసిన శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీల అమలులో అత్యంత కీలకంగా వ్యవహరించారు. గతంలో ఆయన ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద పావగడ సోలార్ పార్క్' రూపుదిద్దుకుంది. ఇది ఆయన పాలనా దక్షతకు నిదర్శనంగా చెబుతారు పరిశీలకులు. ఈడీ కేసులు, జైలు జీవితం, రాజకీయ వ్యూహాలు, సుదీర్ఘ నిరీక్షణల తర్వాత డీకే శివకుమార్ ఎట్టకేలకు నాలుగు దశాబ్దాల తరువాత కర్నాటక సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తన కలల పీఠాన్ని అధిరోహిస్తున్నారు. హైకమాండ్ ఆశీస్సులు, కార్యకర్తల అండతో రానున్న రోజులలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే కాకుండా వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో మరో సారి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని డీకే శివకుమార్ చెబుతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
http://www.teluguone.com/news/content/from-troubleshooter-to-cm-39-221183.html





