ట్రబుల్ షూటర్ నుంచి సీఎం కుర్చీ వరకు... డీకే శివకుమార్ ప్రస్థానం
Publish Date:May 29, 2026
Advertisement
దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్... డీకే శివకుమార్గా ఫ్యామస్.. కర్ణాటక సీఎంగా పదవి అధిరోహించబోతున్న కాంగ్రెస్ ట్రంప్ కార్డ్. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అపజయం ఎరుగని వ్యూహకర్తగా, కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడైన 'ట్రబుల్ షూటర్'గా పేరుగాంచారు . నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత స్థాయి పదవుల వరకు ఎదిగారు. కనకపుర ప్రాంతంలో ఆయనకున్న తిరుగులేని పట్టు కారణంగా ఆయనను 'కనకపుర బండ' అని కూడా పిలుస్తారు. 1980వ దశకంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ద్వారా డీకే శివకుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1984లో కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 1989లో తన 27వ ఏట సాథనూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. కర్ణాటక రాజకీయాల్లో ఎనిమిది సార్లు వరుసగా విజయం సాధించిన నేతగా రికార్డుల కెక్కారు. 1989 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ ఎన్నికల్లో సాథనూర్, కనకపుర నియోజకవర్గాల నుండి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారు. ఎస్.ఎం. కృష్ణ ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా, సిద్ధరామయ్య క్యాబినెట్లో ఇంధన శాఖ మంత్రిగా, ఆ తర్వాత భారీ నీటిపారుదల, వైద్య విద్యా శాఖల మంత్రిగా విజయవంతంగా పనిచేశారు. 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2023 మే నెలలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా, బెంగళూరు అభివృద్ధి, జలవనరుల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు సంక్షోభంలో పడినా డీకే శివకుమార్ ముందుండి పరిష్కరించేవారు. అందుకే ఆయనకు ట్రబుల్ షూటర్ అనే పేరు వచ్చింది. 2002లో మహారాష్ట్ర సీఎం విలాస్రావ్ దేశ్ముఖ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పుడు, అక్కడి ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్లో ఉంచి ప్రభుత్వాన్ని కాపాడారు. అహ్మద్ పటేల్ గెలుపు కోసం గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 2018లో కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అన్నీ తానే అయి నడిపించారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్లో ముందుగా కుదిరిన అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగా, 2026 మే 28న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దీనితో, సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం శ్రమించిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమమైంది. శివకుమార్ కర్నాటకలోని బెంగుళూరు సమీపంలోని కనకపురలో కెంపేగౌడ మరియు గౌర్ అమ్మ దంపతులకు జన్మించాడు . ఆయన వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు డీకే సురేష్ అనే తమ్ముడు ఉన్నారు. ఆయన కూడా రాజకీయ నాయకుడే. శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకున్నారు మరియు వారికి ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు మరియు ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకుంది . డీకే భారతదేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరవ్వడం విశేషం.
http://www.teluguone.com/news/content/dk-shivakumar-39-221269.html





