కిరణ్ సర్కార్ పై ఐఎఎస్ ల తిరుగుబాటు తప్పదా?
Publish Date:May 21, 2012
Advertisement
కిరణ్ సర్కారుపై రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు గరంగరంగా ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం మరో ఏడుగురు ఐఎఎస్ ల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చి ఉండటంతో ప్రభుత్వంతో అమీతుమీకి వారు సిద్ధపడుతున్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారులైన బిపి ఆచార్య, శ్రీలక్ష్మి ఇప్పటికే జైలులో ఉన్నారు. మరో ఐఎఎస్ అధికారి ఎల్.వి. సుభ్రహ్మణ్యం నేదో రేపో అరెస్టుకాబోతున్నారు. ఈయనతో పాటు మరో ఏడుగురు ఐఎఎస్ లకు కూడా ఇదే దుస్థితి తప్పదని తెలిసినప్పటి నుంచి ఐఎఎస్ అధికారుల్లో కలకలం ప్రారంభమైంది. వై.ఎస్. ప్రభుత్వ హయాం నాటి మంత్రుల ఆదేశాల మేరకే తాము జి.వో.లు జారీ చేశామనీ, ఈ విషయంలో తామేక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని ఐఎఎస్ లు అంటున్నారు. క్యాబినెట్ సమిష్టి నిర్ణయాల మేరకే తాము జి.వో.లు జారీ చేస్తామని, వారు తీసుకున్న నిర్ణయాలకు తమను బలిచేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా తప్పుచేసిన మంత్రులను వదిలేసి తమను వెంటాడటం ద్వారా రాజకీయలబ్ధి పొందాలను కుంటున్నదని వారు ఆరోపిస్తున్నారు. ఐఎఎస్ ల ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే కిరణ్ సర్కార్ పై తిరుగుబాటు చేయాలని వారు యోచిస్తున్నట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/do-ias-officers-revolt-against-kirankumar-govt-24-14172.html





